మధుసూదనాచారిని సీఎం పక్కన పెట్టేశారా? హుజురాబాద్ సభే కారణమా? 

తెలంగాణ తొలి సభాపతిగా శాసనసభ రికార్డులకెక్కిన సిరికొండ మధుసూదనాచారి తన పనితీరుతో అప్పట్లో ప్రజల్లో మంచి మార్కులే కొట్టేశారు. స్పీకర్ గా ఉన్నా కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడానికి, స్థానిక సమస్యల మీద ఎంతోకొంత శ్రద్ధ చూపించేవారని చెప్పుకుంటారు. అయితే స్పీకర్ కు ఉండే పరిమితుల కారణంగా రెగ్యులర్ పొలిటికల్ లీడర్ల మాదిరిగా గతంలోలాగా కలివిడిగా తిరిగే సౌలభ్యాన్ని ఆచారి కోల్పోయారు.  దీంతో ఆయన అనేక అంశాల మీద కొడుకుల మీదనే ఆధారపడాల్సి వచ్చింది. వారికే నియోజకవర్గ యోగ క్షేమాలు, ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యతలు అప్పగించారు. అయితే తండ్రి నుంచి బాధ్యతలు తీసుకున్న ఆచారి కొడుకులు మాత్రం బాధ్యతలకు బదులు "బరువు" పెంచుకునే కార్యక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల 2018 ఎన్నికల్లో తండ్రి ఓటమికి వారే పరోక్షంగా కారణమయ్యారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ క్రమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఓ వెలుగు వెలిగిన సిరికొండ... కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా తన సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా ఆడతారా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆయన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే పక్కన పెట్టేశారన్న వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీని గురించే ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో విపరీతమైన చర్చ నడుస్తోంది. 

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, ఉద్యమ సహచరుడు అయిన సిరికొండను కేసీఆర్ అకస్మాత్తుగా ఎందుకు పక్కన పెట్టేశారన్న చర్చ సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుకుంటున్న కేసీఆర్... తనకు ఎంతో పనికొచ్చే సిరికొండను ఈ టైమ్ లో ఎందుకని పక్కన పెట్టారో లోతుగా ఆరా తీస్తున్నారు. సిరికొండను  పక్కనపెట్టడానికి  పునాదులు ఎక్కడ పడ్డాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

బీసీ వర్గానికి చెందిన విశ్వబ్రాహ్మణులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1న దానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆ సభకు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, బీసీ మినిస్టర్ గంగుల కమలాకర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీ కవితను కూడా ఆహ్వానించారు. ఆ తేదీని కూడా ప్రభుత్వ పెద్దల అనుమతితోనే ఖరారు చేసుకున్నారు. అటు హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం కూడా విశ్వబ్రాహ్మల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించింది. అయితే 2వ తేదీనే ఢిల్లీ టూర్ ఉన్న కారణంగా ఆ తేదీని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ప్రభుత్వ పెద్దల సూచనతోనే మళ్లీ 5వ తేదీని ఖరారు చేశారు. అటు సభా ఏర్పాట్లు కూడా అదే ప్రకారం మొదలుపెట్టుకున్నారు. మరోవైపు విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి హైప్రొఫైల్ కలిగిన వ్యక్తి అయిన మధుసూదనాచారిని సభకు ఆహ్వానించాలని వెళ్లిన విశ్వబ్రాహ్మణ పెద్దలకు చేదు అనుభవం ఎదురైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ బహిరంగ సభ జరగడానికి వీల్లేదని, ఆ సభ జరిగితే తనకు రావాల్సిన క్రెడిట్ రాకుండా పోతుందని, కాబట్టి సభను తరువాత జరుపుకోవాలంటూ సిరికొండ విపరీతమైన అసహనానికి గురై మాట్లాడినట్లు సంఘ నాయకులు చెబుతున్నారు. గత మార్చిలో విశ్వబ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అలా ప్రజల చేత ఎన్నికైన సంఘంగా, ప్రజల చేత ఎన్నికైన అధ్యక్షునిగా ఎర్రోజు భిక్షపతికి ప్రభుత్వం దగ్గర గుర్తింపు లభించింది. కేటీఆర్, హరీశ్ రావు సూచనతోనే ఖరారైన 5వ తేదీ బహిరంగ సభకు హాజరయ్యేది లేదని సిరికొండ తేల్చేయడంతో పాటు అసలు సభ జరగకుండా వీలైనన్ని కుయుక్తులు పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అన్ని ఇతర బీసీ కులాల్లాగే విశ్వబ్రాహ్మణులకు కూడా ప్రత్యేకమైన ఆత్మగౌరవ భవనంతో పాటు దాని నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు విడుదల చేయడానికి సర్కారు నాలుగేళ్ల క్రితమే అంగీకరించింది. ఉప్పల్ భగాయత్ లో ఐదెకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ హామీని పూర్తి చేయాలన్న డిమాండ్ ను చాలా కాలంగా విశ్వబ్రాహ్మణులు వినిపిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల దరిమిలా టీఆర్ఎస్ పెద్దలు అన్ని సామాజికవర్గాల మద్దతూ కూడగడుతున్న సందర్భంలో సొంత కులస్తుల దగ్గరే ఆచారి పలుచనైపోయారని, కేవలం కొందరు వ్యక్తుల మెప్పు కోసం, దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత సంఘం నాయకత్వాన్ని ఏదో స్థాయిలో కొనసాగించడం కోసం వారితో కుమ్మక్కయి అసలు సొంత వర్గ ప్రజలకే దూరమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే 5వ తేదీన జరిగిన బహిరంగ సభకు ప్రభుత్వం తరఫున బీసీ మంత్రి గంగుల కమలాకర్ ను పంపించి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తాము శాయశక్తులా కృషి చేస్తామన్న మెస్సేజ్ ఇప్పించడం గమనార్హం. సభకు హాజరైన గంగుల... తాను మంత్రి హరీశ్ రావు చెబితే సభకు వచ్చానని, ఆయన చెప్పినట్లుగా విశ్వబ్రాహ్మణులకు ఐదెకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు పేర్కొందంటూ చెప్పి... ఆ ఉత్తర్వుల తాజా కాపీని భిక్షపతికి అప్పగించారు. కమలాకర్ మాటలతో సభికులంతా ఈలలు, కేరింతలతో భారీ స్థాయిలో రెస్పాండయ్యారు. 

తనకు దక్కని క్రెడిట్ మరొకరికి దక్కడం జీర్ణించుకోలేని కొందరు పెద్దలు... ఈ సభను వాయిదా వేయడానికి శతవిధాలా ప్రయత్నించారని, అలాంటి నాయకుల లోగుట్లేంటో ప్రజలంతా గ్రహించాలని, ప్రభుత్వం వెన్నుదన్నుతో ముందుముందు కూడా విశ్వబ్రాహ్మణుల మేలు కోసం పని చేస్తానని ఎర్రోజు భిక్షపతి ఇండైరెక్టుగా సిరికొండ మీద అస్త్రాలు సంధించారు. దీంతో విశ్వబ్రాహ్మణ ప్రజానీకంతో ఎక్కడా సంబంధం లేని పాత సంఘం నాయకుల కోసం... ఆ వర్గం యావత్ ప్రజానీకానికి దూరమైన వ్యక్తిగా సిరికొండను ప్రభుత్వం గుర్తించినట్లయింది. హుజూరాబాద్ లో ఈటల మీద గెలుపు కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్న సర్కారుకు చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన సమయంలో సొంత కులం ప్రజల ఓట్లను టీఆర్ఎస్ కు మళ్లించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి.. అసలు సొంత జాతి నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తాము మద్దతిస్తున్న సంకేతాలు వెళితే మొదటికే మోసం వస్తుందన్న అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పసిగట్టినట్లు పక్కా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా సేకరించిన కేటీఆర్ తదితరులు సిరికొండతో సంబంధం లేకుండా బహిరంగ సభకు ప్రభుత్వం తరఫున గంగుల కమలాకర్ ను పంపించడమే సిరికొండ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరి తన రాజకీయ భవితవ్యాన్ని తానే ప్రశ్నార్థకం చేసుకున్న మధుసూదనాచారి స్వయంకృతాపరాధాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

గోబెల్స్ ను మించి జగన్ అసత్య ప్రచారం!

క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను పులివెందులలో జరుపుకున్న తరువాత బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ ఆ తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మీడియా సమావేశం అనే లాంఛనం పూర్తి చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. అలా వచ్చిన ప్రతి సారీ మీడియా సమావేశం పెట్టి ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. తాజాగా కూడా ఆయన అదే పని చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో గురువారం (జనవరి 8) మీడియా సమావేశంలో జగన్  సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి  సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి, నిలిపివేయడం జరిగింది  జగన్ హయాంలోనే. ప్రాజెక్టును ప్రారంభించిన ఆరు నెలలలోనూ ఆ  ప్రాజెక్టు చేపట్టిన ఆరునెలలలోగానే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి భారీ చెల్లింపులు చేసి, పనులు నిలిపివేసింది జగన్ హయాంలోనే. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం మూడేళ్ల పాటు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఇప్పుడా ప్రాజెక్టును నిలిపివేసింది చంద్రబాబే అని విమర్శలు గుప్పించడం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   తన హయాంలో నిలిచిపోయిన సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్న జగన్.. చంద్రబాబు ఆలోచనతో ఆంకురార్పణ జరిగి, ఆయన హయాంలోనే పూర్తి అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి తహతహ లాడుతున్నారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  జగన్ తన వైఫల్యాలను చంద్రబాబు ఖాతాలోనూ, చంద్రబాబు విజయాలను తన ఖాతాలోనూ వేసుకోవడానికి తాపత్రేయపడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రెడిట్ కోసం జగన్ అవాస్తవాలు వల్లెవేస్తూ గోబెల్స్ ను మించిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ రెయిడ్స్.. మమత ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రగులు కుం టోంది.  తాజాగా  రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఎన్నికల లబ్ధి కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ గురువారం (జనవరి 8) ఉదయంఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.  కేంద్ర సాయుధ బలగాల   భద్రత నడుమ జరుగుతున్న దాడుల నేపథ్యంలో  మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి నేరుగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో మాట్లాడి, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారనీ, అయితే.. తాను వాటిని తిరిగి తీసుకువచ్చానని చెప్పిన మమతా బెనర్జీ,  హోంమంత్రి దేశాన్ని రక్షించలేరు, కానీ ఈడీ ద్వారా  తృణమూల్ ను ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అక్కడ నుంచి  సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా  ఆమె వెళ్లారు.  2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.   గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే సీఎం మమతా బెనర్జీకి ఎందుకంత ఆందోళన అని ప్రశ్నించారు.    మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హీట్ పీక్ స్టేజికి చేరిందని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 

డేంజర్ జగన్నాథం.. దొంగలే దోస్తులు.. క్రిమినల్సే కావాల్సినోళ్లు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేర చరిత్ర,  చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తారన్న గుర్తింపు ఉంది.  గత ఏడాది డిసెంబర్ లో జగన్ పుట్టిన రోజు సందర్భంగా  రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జంతు బలి నిర్వహించి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసిన సంఘటనలను ఆయన ఖండించకపోవడం, పైగా ఆయన పార్టీ నేతలు దానికి మద్దతుగా మాట్లాడటంతోనే ఇది రుజువైంది.  కాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా  పలువురు వైసీపీ కార్యకర్తలపై  జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే.   ఇప్పుడు జగన్ తాజాగా  ఈ  కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ఇలా జగన్ నుంచి హామీ పొందిన వారిలో అత్యధికులు గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తానేటి వనిత మద్దతుదారులని తెలుస్తోంది.   అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.  ఎందుకంటే ఇప్పటికే చట్టాన్నిచేతుల్లోకి తీసుకునే పార్టీ మద్దతుదారులను జగన్ ప్రోత్సహించడం తెలిసిందే. గంజాయి కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన వారిని పరామర్శించడం వంటి చర్యలతో ప్రజలలో ఇప్పటికే జగన్ ప్రతిష్ఠ, పార్టీ ప్రతిష్ఠ ప్రజలలో బాగా దిగజారింది. ఇప్పుడు తాజాగా జంతుబలుల వ్యవహారంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి పార్టీ మద్దతు అంటూ ప్రకటించడం ఆయన ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని అంటున్నారు. 

ఒకే విడతలో తెలంగాణ మునిసిపోల్స్!

తెలంగాణలో మునిసిపోల్స్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమౌతోంది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం, ఈ నెల 12న తుదిజాబితా ప్రకటించనుందని తెలుస్తోంది.   ఈ నేపథ్యంలోనే బుధవారం (జనవరి 7) జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రాణికుముదిని వారికి దిశా నిర్దేశం చేశారు.  ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 20న మునిసిపోల్స్ కు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అ య్యే అవకాశాలు ఉన్నాయి.  

దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్...కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేయాలని చాలెంజ్ విసిరారు. నిన్న ఖమ్మం వచ్చిన కేటీఆర్ ఏదేదో మాట్లాడారని ముందు తన ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకోవాలని పొంగులేటి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ అక్రమాలపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన  ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.  కేటీఆర్ మతి భ్రమించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యూడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నారన్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలకు పేటెంట్‍గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ గాంధీ కుటుంబం గురించా మాట్లాడేది అని మండిపడ్డారు. జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను జాతీయ నాయకుడిని అవుతానని తాపత్రయపడటం తప్పులేదు కానీ ఆశకు కూడా హద్దు ఉండాలన్నారు. జూబ్లీహిల్స్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు. దేనికి సెమి ఫైనల్? అని మంత్రి  పొంగులేటి ప్రశ్నించారు  

కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన.. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం (జనవరి 8) నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ నున్నారు.  అలాగే  ప్రజాసమస్యలపై  అధికారులతో చర్చిస్తారు.  క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  శుక్రవారం జరగనున్న  సంక్రాంతి సంబరాల్లో  పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.   అనంతరం  నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు.  ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష, రంగరాయ మెడికల్ కాలేజీలో పలు శంకుస్థాపనల కార్యక్రమంలో  కూడా పాల్గొంటారు. 

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 

జవాబుదారీతనం ఎవరికి ఉండాలి?

సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి. https://www.youtube.com/watch?v=dD8qZdp3WHU

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా  మీర్జాగూడ  సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత  చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.  మృతి చెందిన  విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొని, తిరిగి వెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   కారులో మొత్తం ఐదుగురు ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్ర తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.   

టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

  ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని వారి నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గాడు అప్పలనాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గాడు అప్పలనాయుడు సతీమణి, జీవీఎంసీ రెండో వార్డు కార్పోరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన  గాడు చిన్ని కుమారి లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్ లో కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.