ప్రధాని భారీ బహిరంగ సభకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు

 

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ధరల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. జీఎస్టీ సంస్కరణల నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని పండుగలా జరుపుతోంది. దసరా నుంచి దీపావళి వరకు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలపై సుమారు రూ. 8 వేల కోట్ల మేర భారం తగ్గుతుందని ఓ అంచనా. ఈ క్రమంలో ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. 

అలాగే సభకు వచ్చే ముందు శ్రీశైలం దివ్యక్షేత్రానికి వెళ్లి జ్యోతిర్లింగ మూర్తి శివుణ్ణి, శక్తిపీఠంలో కొలువైన భ్రమరాంబిక దేవిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. 2024 ఎన్నికల తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఏపీలో ప్రధాని విశాఖ, అమరావతి ప్రాంతాల్లో పర్యటించారు. గురువారం రాయలసీమ ప్రాంతంలో ప్రధాని పర్యటన జరగనుంది.

జీఎస్టీ సంస్కరణలపై భారీ ప్రచారం... సభకు భారీ ఏర్పాట్లు

జీఎస్టీ 2.0 నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ నుంచి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ప్రచారంలో భాగమైంది. మండల స్థాయి మొదలుకుని జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున జీఎస్టీ సంస్కరణలపై కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. అలాగే వివిధ విద్యా సంస్థల్లో కూడా జీఎస్టీ సంస్కరణలపై రకరకాల పోటీలు నిర్వహించారు. 


వినియోగదారులకు జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లబ్దిని ఇంటింటికి తిరిగి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా... కూటమికి చెందిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. యోగా డే సందర్భంగా ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రచారం చేపట్టిందో... ఇప్పుడు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 


మండలాల వారీగా, జిల్లాల వారీగా జరుగుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు.. మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని మరీ జీఎస్టీ సంస్కరణలపై ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమికి చెందిన మూడు పార్టీలు చేపట్టాయి. ప్రస్తుతానికి 90 వేలకు పైగా ఈవెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిన క్రమంలో కర్నూలులో ప్రధాని హజరు కానున్న భారీ బహిరంగ సభను అంతే సక్సెస్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 

వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. గత 15 రోజుల నుంచి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నిరంతరం కర్నూలు సభను మానిటర్ చేస్తున్నారు. 

సభకు వచ్చే వారికి భోజన సౌకర్యం మొదులుకుని... పార్కింగ్, సభలో సీటింగ్ ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా... అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా. లక్షలాది సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున దానికి తగ్గ ఏర్పాట్లు, బందోబస్తు చేపట్టారు. 

సభకు వచ్చే వారికి ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే భారీ బందోబస్తు చేశారు. సుమారు 1800 మంది బలగాలతో ప్రధాని సభకు బందోబస్తు పెడుతున్నారు. ఇక ట్రాఫిక్ జాంలు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టారు.

ముఖ్యమంత్రి మానిటరింగ్... మంత్రుల మకాం

ఇక ప్రధాని పర్యటనను సూపర్ సక్సెస్ చేసేందుకు సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అలాగే జీఎస్టీ సంస్కరణలపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. 

సభకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు శ్రీశైల క్షేత్రాన్ని ప్రధాని సందర్శిస్తుండటంతో ఆ దేవాలయంలో ఏర్పాట్లను.. ప్రధాని దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాలో మంత్రులు దాదాపు వారం రోజుల నుంచి మకాం వేశారు. సభ ఏర్పాట్లపై దగ్గరుండి పర్యవేక్షించారు. శాఖల వారీగా బాధ్యతలు పంచుకుంటూ.. సమిష్టిగా సభకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించుకుంటూ వారం రోజుల నుంచి కర్నూలులోనే ఉన్నారు మంత్రులు.

రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని

కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ. 13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు ఉండగా.. ఓ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు ప్రధాని. రూ. 9449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తుండగా... రూ. 1704 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. ఇక రూ. 2276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు.

అభివృద్ధి కార్యక్రమాల వివరాలివి:

విద్యుత్ ట్రాన్సమిషన్ వ్యవస్థకు – శంకుస్థాపన – రూ. 2886 కోట్లు
ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ – శంకుస్థాపన - రూ. 4922 కోట్లు
కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – శంకుస్థాపన - రూ. 493 కోట్లు
పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ – శంకుస్థాపన - రూ. 184 కోట్లు
సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి -శంకుస్థాపన - రూ. 964 కోట్లు
రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు ప్రారంభం - రూ. 82 కోట్లు
కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు ప్రారంభం – రూ. 286 కోట్లు
కనిగిరి బైపాస్ రోడ్ ప్రారంభం - రూ. 70 కోట్లు
గుడివాడ-నూజెండ్ల వద్ద 4-లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి ప్రారంభం – రూ. 98 కోట్లు
కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు ప్రారంభం – రూ. 13 కోట్లు
పీలేరు నుండి కలసూర్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల రోడ్ ప్రారంభం - రూ. 593 కోట్లు
నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రారంభం - రూ. 362 కోట్లు
చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం – రూ. 200 కోట్లు
కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులను జాతికి అంకితం – రూ. 546 కోట్లు
శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ జాతికి అంకితం - రూ. 1730 కోట్లు

ప్రధాని పర్యటన ఇలా...

ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు ఎయిర్ పోర్టుకు ప్రధాని చేరుకుని అక్కడి నుంచి శ్రీశైల దేవస్థానానికి చేరుకుంటారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధానమంత్రి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కర్నూలు సభకు చేరుకుని సభలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని హెలీకాప్టర్ ద్వారా కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.


 

ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుత రేవంత్ సర్కార్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్  సీఎంకు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందనీ, ఈ పద్థతి నెహ్రూ హయాం నుంచీ ఉన్నదేననీ అన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ లో నిఘా వ్యవస్థ లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అన్నారు. దీనిపై అధికారులు ఎందుకు మీడియా సమావేశాలు పెట్టడం లేదని నిలదీశారు. ప్రస్తుత డీజీపీ కూడా ఒకప్పుడు అధికారేనన్న కేటీఆర్ ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి అన్ని తెలుసన్నారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న విషయం అధికారులు ముఖ్యమంత్రికి చెప్పరన్న ఆయన  అలాగే నిబంధనల మేరకు, వారికి సమాచారం ఏలా వస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కూడా అడగరని అన్నారు.  ఫోన్ ట్యాపింగ్, సిట్ దర్యాప్తు వంటి డ్రామాలతో  ప్రజల దృష్టిని సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  

సైబర్ వలకు చిక్కిన పోలీసు అధికారులు

ప్రభుత్వం ఎంతగా అప్రమత్తం చేస్తున్నా.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సామాన్యులు మాత్రమే కాదు, విద్యావంతులు, సైబర్ నేరాలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారులు కూడా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారు. తాజాగా  హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సైబర్ మోసారికి గురై భారీగా నష్టపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో  పని చేసే ఒక ఇన్ స్పెక్టర్ ను సైబర్ నేరగాళ్లు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడ్డారు.   దర్శనం టికెట్లు, ప్రత్యేక అనుమతులు అంటూ ఆ ఇన్ స్పెక్టర్ నుంచి దశలవారీగా దాదాపు నాలుగు లక్షల రూపాయలు దోచుకున్నారు. అదే విధంగా అదే కమిషనరేట్ లో పని చేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ న స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు దాదాపు 39 లక్షల రూపాయల మేర మోసం చేశారు.   సోషల్ మీడియా ద్వారా స్టాక్ ట్రేడింగ్ గ్రూప్‌లో  తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట చిన్న మొత్తాలతో లాభాలు వచ్చినట్లు చూపించి నమ్మకం కలిగించిన మోసగాళ్లు, ఆపై పెద్ద మొత్తాల పెట్టుబడులకు ప్రోత్సహించారు. ఈ ప్రక్రియలో ఆ ఇన్స్పెక్టర్ నుంచి సుమారు రూ.39 లక్షలు వసూలు చేశారు.  అయితే ఆ తరువాత  అకస్మాత్తుగా గ్రూప్ అడ్మిన్లు కనిపించకుండా పోవడంతో జరిగిన మోసాన్ని గ్రహించిన సదరు పోలీస్ ఇన్ స్పెక్టర్ లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇ  సైబర్ మోసానికి గురైన ఈ ఇద్దరు ఇన్ స్పెక్టర్లూ కూడా సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తున్న వారు కావడమే ఇక్కడ విశేషం.  సైబర్ నేరాలపై అవగాహన ఉన్న అధికారులే ఇలా మోసపోవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. జరిగిన మోసంపై ఈ ఇరువురు పోలీసు అధికారులూ కూడా సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశారు.   ఈ కేసులపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు, ఐపీ అడ్రెసులు, సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా మోసగాళ్లను గుర్తించే ప్రయత్నాలు కొనసాగు తున్నాయి.  

ప్రధాని నోట నరసాపురం లేస్ క్రాఫ్ట్

ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మరో సారి ఆంధ్రప్రదేశ్ హస్తకళల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా నరసాపురంలోని లేస్ క్రాఫ్ట్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన నరసాపురం లేస్ క్రాఫ్ దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పారు.  2000లో నరసాపురం లేస్‌ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పిన ఆయన ఈ కళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందు చొరవ తీసుకున్న డీఆర్‌డీఏ  భారతదేశంలోనే తొలి లేస్‌ పార్క్‌ను నరసాపురంలో అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.  విశేషమేంటంటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో  ఏపీలోని నరసాపురంలో ఆదివారం పర్యటించిన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.  నరసాపురం మండలంలోని పేదవారి లంక గ్రామాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాను దత్తత తీసుకున్న గ్రామంలో  ఆమె ఆదివారం పర్యటించారు.  ఈ సందర్భంగా   మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె  రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి పాల్గొన్నారు. ఆ సందర్భంగా కేంద్రమంత్రి నరసాపురం లేస్ క్రాష్ట్ గురించి ప్రస్తావించి, ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  కాగా తాను దత్తత తీసుకున్న పేదవారి లంక గ్రామంలో పర్యటించిన నిర్మలాసీతారామన్ గ్రామస్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో.. తాను రాష్ట్రానికి కోడలినైనా.. పేదవారి లంక గ్రామానికి మాత్రం కూతురినని చెప్పారు.  ఒకప్పుడు  ఎలాంటి గుర్తింపూ లేని మారుమూల గ్రామమైన పేదవారి లంక ఈ రోజు  దేశంలోనే గ్లోబల్‌ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిందనీ, ముందు ముందు ఏఐ శిక్షణలో దేశంలోనే ఆగ్రగామిగా నిలవనుందని ఆమె అన్నారు.  మహిళ ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా గ్రామంలో నిర్మించిన చిన్న భవనం ఇప్పుడు  పీఎం విశ్వకర్మ యోజన కింద చేపట్టిన ఉపాధి శిక్షణలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు.  మహిళలు అన్ని రంగాల్లో  రాణించాలని పిలుపునిచ్చారు.  గ్రామంలో  13కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సముద్ర కోత అడ్డుకట్ట పనుల్ని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పరిశీలించారు.  

టాటా- ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో మంటలు..ఒకరు సజీవదహనం

టాటా- ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో ఆదివారం అర్ధరాత్రి అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనమయ్యారు. విశాఖ నుంచి ఎర్నాకుళం వెడుతున్న ఈ రైలులో ఎలమంచలి సమీపంలో మంటలు చెలరేగాయి.  వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు ఎలమంచిలి స్టేషన్‌లో రైలును నిలిపివేసే లోపే ఆ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు, దట్టమైన పొగతో బోగీలలోని ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.   అగ్నిమాపక యం త్రాలు వచ్చేసరికే రెండు బోగీలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. బీ1 బోగీలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయి మరణించాడు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ సుందర్‌గా గుర్తించారు.

న్యూ ఇయర్ వేడుకలు...పబ్‌లపై ఈగల్ టీమ్ దాడులు

  మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా, హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పార్టీ నిర్వాహకులు, పబ్బులు యువతను ఆకర్షించేలా ప్రత్యేక వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై ఈగల్ టీమ్ ప్రత్యేక నిఘా పెట్టింది. కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో దాడులు చేశారు.  14 మందికి  డ్రగ్ టెస్ట్ చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఐదుగురు యువకులు,  ముగ్గురు యువతులు ఉన్నారు. కాగా గత 10 రోజులుగా ఈగల్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 27 మంది కస్టమర్స్, ఐదుగురు నైజీరియన్స్ మహిళలను అరెస్ట్ చేశారు.న్యూ ఇయర్ వేడుకల వేళ ఈగల్ టీమ్ చేపడుతున్న తనిఖీలు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  

అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌‌ను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్

  తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద నూతన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. కాలినడకన వచ్చే భక్తులు ఆరోగ్య భద్రత కోసం, అత్యవసర సమయాల్లో త్వరితగతిన వైద్య సేవలు  అందించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మెట్లమార్గంలో అనారోగ్యానికి గురయ్యే భక్తులు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని బీఆర్ నాయుడు సూచించారు.  టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడికల్ బృందం సేవలందిస్తుందని బీఆర్‌ నాయుడు తెలిపారు. ఈసీజీ యంత్రం, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌, నెబ్యులైజర్‌తో పాటు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో వెంకయ్యచౌదరీ తదితరులు పాల్గొన్నారు.

అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు  అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం మొత్తం కలియతిరిటగి అక్కడ శిల్పకళను తిలకించారు. "ఈరోజు అయోధ్యలోని దివ్యమైన, అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునే భాగ్యం కలిగింది.  మరోసారి ఇక్కడికి రావడం ఎంతో శాంతియుతంగా, ఆధ్యాత్మికంగా అనిపించింది. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని చంద్రబాబు ఎక్స్ ద్వారా తెలిపారు. అంతకుముందు, బాలరాముడి దర్శనార్థం అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు దేవాలయ అధికారులు, యూపీ ఎన్డీఏ నాయకులు ఘన స్వాగతం పలికారు.

సర్పంచ్‌గా గెలిచాడు...హామీలు నెరవేర్చారు

  సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన హామీలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రామం లో ఆడ బిడ్డ జన్మిస్తే బంగారు తల్లి అనే పథకం కింద 5116/- ఇస్తానని, ఓ సర్పంచ్ అభ్యర్థి హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ను తుచా తప్పకుండ, హాస్పిటల్ కి వెళ్లి మరి హామీ నెరవేర్చిన సన్నివేశం మహబూబాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రి మిట్ట శివారు బందలగడ్డ కు చెందిన బానోతు గణేష్ భార్య సింధు ఆడ శిశువుకు జన్మనివ్వగా రూ. 5116 కానుక ఇచ్చి సర్పంచ్ పున్నమి చందర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆడబిడ్డ జన్మిస్తే రూ. 5116 ఇస్తానని హామీ ఇచ్చిన పున్నం చందర్ మర్రిమిట్ట గ్రామ పరిధిలోని బందల గడ్డ తండాకు చెందిన బానోతు సింధు బంగారు తల్లి జన్మించినట్లు తెలుసుకున్న సర్పంచ్ మానుకోటలోని ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి చిట్టి తల్లికి రూ. 5116 చేతికి అందించారు. గ్రామం లో ఎవరైనా చనిపోతే టెంట్, కుర్చీలు అంటూ ఖర్చు కాకుండా... వాటి ఖర్చు కూడా సర్పంచ్ గా గెలిచాక... తానే భరిస్తా అన్నారు. ఇటీవల గ్రామం లో ఒకరు మరణించగా... ఇచ్చిన హామీ ప్రకారం టెంట్, కుర్చీలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో లో 10 హామీలు... రెండు అమలు * ​గ్రామ పంచాయితీ పరిధిలోని ఏ కుటుంబంలోనైనా జరిగే (ఆడ, మగ) పెళ్ళికి డి.జె. ఉచితంగా పెడతాను...... * ​గ్రామ పంచాయితీ పరిధిలో ఏ కుటుంబంలోనైనా బంగారు తల్లి (ఆడపిల్ల) జన్మిస్తే 5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాను. * ​గ్రామ పంచాయితీ పరిధిలో ఏ కుటుంబంలోనైనా చావుకు కుర్చీలు మరియు టెంట్ ఉచితంగా పెడతాను. * ​గెలిచిన నెల లోపు గ్రామ పంచాయితీలో గ్రామానికి సంబంధించిన గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తాను. * ​గ్రామ పంచాయితీ పరిధిలో బస్తీ దవాఖానా మరియు గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తాను....... * ​గ్రామ పంచాయితీ పరిధిలో అండర్ డ్రైనేజీలతో కూడిన సి.సి రోడ్లు పూర్తి చేసి స్వచ్ఛ గ్రామంగా ఏర్పాటు చేస్తాను........ * ​గ్రామ పంచాయితీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తాను. * ​గ్రామ పంచాయితీ పరిధిలో ప్రతి ఒక్కరికి లేబర్ కార్డ్స్ చేపిస్తాను. * ​మన గ్రామపంచాయితీ (బందాలగడ్డ, మర్రిమిట్ట, దస్రుతండ) ఇంటిపన్ను బిల్లులను మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నాను. * ​మన మర్రిమిట్ట గ్రామపంచాయితీ శ్మశానవాటికకు కరెంటు మరియు నీళ్ళ సరఫరా చేయించగలనని హామీ ఇస్తున్నాను పున్నం చందర్ సర్పంచ్ మర్రిమిట్ట తెలిపారు.

సిగాచీ పరిశ్రమ సీఈఓ అరెస్ట్

  సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 58 మంది కార్మికులు మృతి చెందటంతో పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.సిగాచీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇటీవల నివేదికలో స్పష్టం చేసింది.  అయితే ఈ కేసులో ఇప్పటికీ బాధ్యులను గుర్తించకపోవడంపై గత నెలలో తెలంగాణ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులను ఎందుకు గుర్తించలేకపోయారని మండిపడిన కోర్టు, దీనిపై ఏఏజీ పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. మరోవైపు, న్యాయం కోసం బాధిత కుటుంబాలు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు తమకు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు పదోన్నతి

  ఏపీలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గెజిట్ విడుదల చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన అధికారుల్లో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో భాగంగా జరిగే సాధారణ ప్రక్రియలోనే ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పదోన్నతి పొందినప్పటికీ కొందరు అధికారులు తమ ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి, అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఆమ్రపాలి కాట తమ ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతారు.  డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌గా పునర్వ్యవస్థీకరించారు. గంధం చంద్రుడికి కార్మిక శాఖ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు అప్పగించగా, ఇప్పటివరకు ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించగా, ఆయనకు సంబంధించిన పోస్టింగ్‌పై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.