ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ
posted on Jul 18, 2020 @ 4:35PM
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని హింసించటం తగదంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వడ్డెల సందీప్ కుమార్, తోతపూడి చంద్రశేఖర్ ల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం తగదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని ఉల్లంఘించడమే అని తెలిపారు. 24 గంటల వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా వారిని శారీరకంగా హింసించటం దుర్మార్గమని.. సంబంధిత పోలీసు అధికారులపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి సంబంధించిన డబ్బు పట్టుపడిందని తమిళ మీడియాలో వచ్చిందని.. ఇదే విషయంపై ఏపీలో ఎందుకు తనిఖీలు చేయలేదని సందీప్, చంద్రశేఖర్ లు సోషల్ మీడియాలో ప్రశ్నించారన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడం ద్వారా వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని వ్యాఖ్యానించారు. జులై 16 నాడు మధ్యాహ్నం 1 గంటకు వారిని అరెస్టు చేశారని, జూలై 17 సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. ఈ అమానవీయ, అనాగరిక చర్యలను ఖండించాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.