గోదావరిలో వణికిస్తున్న వింత వ్యాధి! ప్రజారోగ్యం పడకేసిందన్న చంద్రబాబు
posted on Jan 22, 2021 @ 3:45PM
పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలను వణకిస్తున్న వింత వ్యాధిపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి జాతీయస్థాయిలో సంచలనం అయ్యేసరికి నాలుగు రోజులు హడావిడి చేసి ఆపై వదిలేశారని ఆరోపించారు. ఆ వింత వ్యాధి ఇప్పుడు దెందులూరు మండలం కొమిరేపల్లికి కూడా పాకిందని వెల్లడించారు. పాలకులు కుట్ర రాజకీయాలు, వ్యవస్థలను నాశనం చేసేవాటి మీద పెట్టే శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టాలని హితవు పలికారు.
కొమిరేపల్లిలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ప్రజలు అంటున్నారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు కనీసం సురక్షితమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోతోందని చంద్రబాబు విమర్శించారు. పాలన అంటే ప్రజల జీవితాలను మార్చగలగాలి కానీ, వైసీపీ పాలనలో తాము ప్రాణాలతో ఉంటే చాలనే పరిస్థితికి ప్రజలు వచ్చారని వ్యాఖ్యానించారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సంభవించిన వింత వ్యాధి జాతీయస్థాయిలో కలకలం రేపింది. వందలమంది ఆస్పత్రుల పాలయ్యారు. ఇప్పుడవే లక్షణాలతో భీమడోలు మండలం పూళ్ల, దెందులూరు మండలం కొమరెపల్లిలో
ప్రజలు ఆసుపత్రుల పాలవుతుండడం మరోసారి ఆందోళన కలిగిస్తోంది.