వంద కోసం చంపేశారు..
posted on Apr 3, 2021 @ 10:38AM
కోట్లు కాదు. లక్షలు కాదు. వంద రూపాయలు ప్రాణం తీసింది. వినేవాడు చూపించే ఏమైనా చెప్తారు అనుకుంటున్నారా.. నిజంగానే.. మేడం.. సర్ అదేంటి నవ్వుతున్నారా.. నమ్ముతారా లేదా.. ఆ..బొక్కలే.. వంద రూపాయలు ప్రాణం తియ్యడం ఏంటి..? వీడి బోండా ..అనుకుంటున్నారా..? అయినా సరే.. మీరు నమ్మి తీరాల్సిందే.. ఎందుకంటే నేను చెప్పేది కథ కాదు.. కట్టు కథ అంతకన్నా కాదు.
కలిసి రోజు పనికి వెళ్లే వాళ్ళు. కలిసి మద్యం తాగేవాళ్ళు.. అప్పటి వరకు కలిసే ఉన్నారు.. ఇంతలో ఏమైందో తెలీదు.. తన తోటి స్నేహితుడ్ని కత్తితో పొడిచి చంపాడు.. ఈ ఘటన విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ మేస్త్రీ షేక్ రఫీ వద్ద అదే ప్రాంతానికి చెందిన యడ్లవల్లి నాగరాజు అలియాస్ పండు(27) సెంట్రింగ్ పనులకు వెళ్తుంటాడు. ఖర్చుల కోసం రూ.100 ఇవ్వాలని రఫీని పండు రెండు రోజులుగా అడుగుతున్నాడు. రెండు రోజులుగా అడుగుతున్న రూ. 100 ఇవ్వకపోవడంతో ఇదే విషయమై గురువారం సాయంత్రం రఫీ ఇంటి వద్ద వీరిద్దరూ గొడవపడటంతో పెద్దలు సర్దుబాటు చేసి పంపేశారు. శుక్రవారం ఉదయం 10గంటల రఫీ ఇంటికి వెళ్ళాడు. పండుని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు. రాజీవ్నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ షేక్ హుసేన్, మరో సెంట్రింగ్ కార్మికుడు కిశోర్ని కలిశారు.. అందరు కలసి పైపులరోడ్డు సెంటర్ సమీపంలోని దుర్గా బార్లో మద్యం తాగారు. అక్కడినుంచి వెళ్లిపోయిన గంట తర్వాత మళ్లీ కలిశారు. నున్న రూరల్ పోలీసు స్టేషన్ సరిహద్దు ప్రాంతంలో బైక్లు పెట్టారు. దుర్గాబార్ పక్క రోడ్డులో మళ్ళీ గొడవ పడ్డారు. పండును హుసేన్, కిశోర్ పట్టుకోగా రఫీ కత్తితో పొడిచి చంపాడు. ఈ కొట్లాటలో నిందితులు ముగ్గురికీ గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న సీఐ లక్ష్మీనారాయణ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న పండును, గాయాలపాలైన రఫీ, హుసేన్, కిశోర్ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పండు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ముగ్గురికీ చికిత్స అందిస్తున్నారు. పండును అంతమొందించే ఉద్దేశంతోనే రఫీ ఉదయం నుంచి వెంటబెట్టుకొని తిరుగుతూ స్నేహితుల సహాయంతో హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం.