అమరావతిపై కేంద్రం యూ టర్న్.. చంద్రబాబు హర్షం
posted on Jul 15, 2021 @ 10:23AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోంది. గడియకో మాట మాట్లాడుతూ గందరగోళం స్పష్టిస్తోంది. ఇటీవల ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్రహోంశాఖకు దరఖాస్తు చేయగా.. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిదంటూ అమరావతి ప్రస్తానవ లేకుండా సమాధానం పంపింది. దీనిపై విమర్శలు రావడంతో మళ్లీ మరో సమాధానం పంపింది.
చైతన్యకుమార్రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేశారు.దీనిపై ఆ శాఖ సీపీఐఓ డైరెక్టర్ రేణు సరిన్ ఈ నెల 6న సమాధానం ఇస్తూ.. అమరావతి ప్రస్తావన తీసుకురాకుండా.. ‘ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020’ కింద వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు పరిపాలన కేంద్రాలు ఉంటాయని, వీటిని రాజధానులు అంటారని వివరించారు. రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుందని తెలిపారు.
కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానంపై అమరావతి జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమరావతి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి.. కేంద్ర హోంశాఖ అప్పిలేట్ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్కు ఈనెల 9న లేఖ రాశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని అందులో పేర్కొన్నారు. రేణు సరిన్ పేర్కొన్న చట్టం ఇంకా అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. శాస్త్రీ లేఖపై స్పందించిన సరిన్.. గతంలో తానిచ్చిన సమాధానాన్ని సవరించారు. ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర హోంశాఖ ఇటీవల ఇచ్చిన సమాధానాన్ని సరిచేసుకోవడం హర్షణీయమని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రం తప్పుగా ఇచ్చిన సమాధానాన్ని సరిచేసుకోవడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించి, వాస్తవాలను తారుమారు చేసినట్టు దీంతో స్పష్టమైందన్నారు. తప్పును సరిచేయించారంటూ జీవీఆర్ శాస్త్రిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.