బాబు, షా భేటీ.. ఏం చర్చించారంటే..?
posted on Oct 1, 2025 9:27AM
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు ముప్పావుగంట సేపు సమావేశమైన చంద్ర బాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పురోగతి, రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అమిత్ షాకు వివరించారు.
అలాగే వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కేంద్రం అండతో గాడిలో పెట్టినట్లు చెప్పారు. అదే విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీకి కేంద్రం అండగా నిలుస్తున్నదని పేర్కొంటూ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ఈ భేటీకి ముందు చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తోనూ భేటీ అయ్యారు. ఆ భేటీలలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.