లోకేష్ ధర్నాతో దిగొచ్చిన జగన్ సర్కార్.. హత్య కేసులో ఎమ్మెల్యేపై కేసు నమోదు
posted on Dec 31, 2020 @ 11:53AM
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య రెండు రోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే సుబ్బయ్య మరణానికి కొన్ని గంటల ముందు ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో సుబ్బయ్య హత్య జరగడంతో ఈ హత్య కేసులో ఎమ్మెల్యే, అయన బావమరిది, అధికారి పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని హతుడి భార్య అయిన అపరాజిత డిమాండ్ చేయగా పోలీసులు నిరాకరించారు.
ఈ నేపథ్యంలో సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రొద్దటూరు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తరువాత.. సుబ్బయ్య మృతదేహంతో ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే, ఆయన బంధువు, మున్సిపల్ అధికారి పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేసే వరకు ప్రొద్దుటూరు వీడేదిలేదని స్పష్టం చేసారు. దీంతో డీఎస్పీ వచ్చి ఆందోళన విరమించాలని లోకేశ్ను కోరారు. అయితే అందుకు లోకేష్ ససేమిరా అనడంతో 161 సెక్షన్ ప్రకారం ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను ఈ కేసులో చేర్చుతున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో సుబ్బయ్య భార్య అపరాజిత దగ్గర పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తరువాత ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు కోర్టుకు అందించనున్నారు. ఈ హత్య కేసుపై 15 రోజుల్లో త్వరిత గతిన విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ సమక్షంలో అపరాజితకు డీఎస్పీ హామీ ఇచ్చారు.