జగన్ స్టేట్మెంటే యథాతథంగా రాజధాని కమిటీ నివేదికలో...
posted on Dec 21, 2019 @ 9:55AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే జీఎస్రావు కమిటీ తుది నివేదికను సమర్పించింది. అయితే, అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏదైతే చెప్పారో .... సేమ్ టు సేమ్... దాన్నే నిపుణుల కమిటీ కూడా సిఫార్సు చేసింది. అయితే, సీఎం జగన్.... సింపుల్ స్టేట్ మెంట్ ఇస్తే.... నిపుణుల కమిటీ మాత్రం డిటైల్ట్గా ప్రకటన చేసింది. అంటే... విశాఖలో ఏమేమీ ఉంటాయో... అమరావతిలో ఏముంటాయో... అలాగే, కర్నూలులో ఏమేమీ ఏర్పాటు చేయాలో క్లారిటీగా చెప్పింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పినట్లుగానే... కర్నూలులో హైకోర్టు... అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. సీఎం స్టేట్మెంట్కు అదనంగా కర్నూలులో అసెంబ్లీ వింటర్ సెషన్స్ను నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా అమరావతిలో.... అసెంబ్లీ, రాజ్భవన్తోపాటు మినిస్టర్స్ క్వార్టర్స్, వివిధ శాఖల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇక, విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటుతోపాటు అసెంబ్లీ సమ్మర్ సెషన్స్ నిర్వహించాలని సూచించింది.
రాజధానిపై గతంలో ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టును కూడా పరిశీలించామన్న జీఎస్రావు... ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని... మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు. పట్టణీకరణ అంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమై ఉందని... అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమలో పట్టణీకరణ చాలా తక్కువగా ఉందని... అందుకే తాము అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరి అంటూ సూచించామన్నారు. ముఖ్యంగా రాయలసీమలో నాలుగు జిల్లాలూ వెనుకబడే ఉన్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా విభజించి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. శ్రీకాకుళం, విజయనగరాన్ని ఒక మండలిగా.... కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు రెండో మండలిగా... ప్రకాశం, నెల్లూరును మూడో మండలిగా.... రాయలసీమను నాలుగో మండలిగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని చెప్పినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే, ఎలాంటి ముప్పులేని ప్రాంతాల్లోనే అభివృద్ధి జరగాలని సూచించినట్లు జీఎస్రావు తెలిపారు. మొత్తంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేశామని అన్నారు.
రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ తుది నివేదిక సమర్పించడంతో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్ 27న సమావేశంకానున్న మంత్రివర్గం.... జీఎస్రావు కమిటీ నివేదికపై చర్చించనుంది. అయితే, అసెంబ్లీ వేదికగా, ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ సీఎం జగన్ స్టేట్మెంట్కు దగ్గరగా... నిపుణుల కమిటీ తుది నివేదిక ఉండటంతో... ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.