బిటెక్ రవి అరెస్ట్...14 రోజుల రిమాండ్
posted on Nov 15, 2023 @ 2:36PM
జగన్ ప్రభుత్వం ప్రతి పక్ష నేతలను టార్గెట్ చేసుకుని అరెస్ట్ ల పర్వం ప్రారంభించింది. ఇటీవల పులివెందులలో టిడిపి నేతలను అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా బీటెక్ రవిని అరెస్ట్ చేసింది ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో బీటెక్ రవి అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. బెయిలబుల్ సెక్షన్ లను నాన్ బెయిలబుల్ సెక్షన్ లు గా మార్చిన ఘనత ఎపి పోలీసులకు దక్కింది.
పది నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద పోలీసులతో వాగ్వాదం, ఆందోళన చేపట్టిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత బిటెక్ రవి కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైడ్రామా మధ్య మంగళవారం అర్ధరాత్రి ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వ్యక్తిగత పనిమీద మంగళవారం సాయంత్రం పులివెందుల నుంచి కడప వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వల్లూరు పోలీసుస్టేషన్కు తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించిన అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలావుండగా బిటెక్ రవి అరెస్టుపై కడప డీఎస్పీ షరీఫ్ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్ఐకి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశామని, బీటెక్ రవి అందుబాటులో లేకపోవడంతో అరెస్టు చేసినట్టు వివరించారు.
పులివెందులలో ‘యువగళం పాదయాత్ర’ ప్రారంభానికి 2 రోజుల ముందు జనవరి 25న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఆహ్వానం పలికేందుకు బిటెక్ రవి కడప విమానాశ్రయానికి వెళ్లారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, రవి అనుచరులు తరలి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి వీల్లేదని చెప్పిన పోలీసులతో బిటెక్ రవి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట, ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. పాత కేసులను తిరిగి తోడి టిడిపి నాయకులు, కార్యకర్తలను వేధించడం వైసీపీ ప్రభుత్వం ఆనవాయితీగా పెట్టుకుంది.