ఆ ఇద్దరితో న‌ష్ట‌మే.. వదిలించుకోకుంటే క‌ష్ట‌మే!

ఏ ఎన్నికైనా గెల‌వాలంటే ఏ పార్టీ అయినా కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక తప్పదు.  అందులోనూ పొత్తులు పెట్టుకున్న సందర్భాలలో కొన్ని త్యాగాలూ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ, పార్ల‌మెంట్ లాంటి ఎన్నిక‌ల్లో అయితే.. పార్టీ అధిష్టానాలు మొహ‌మాటాల‌కు పోకుండా గెలిచే అభ్య‌ర్థుల‌కు టికెట్లు కేటాయించాలి.  పార్టీ బ‌లోపేతం కోసం సుదీర్ఘ‌కాలంగా ప‌నిచేస్తున్న నేత‌లైనా స‌రే  ప్ర‌జాబ‌లం లేకుంటే ప‌క్క‌న పెట్టాల్సిందే.  ప్ర‌జాబ‌లం ఉన్న అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇస్తేనే పార్టీ బ‌లోపేతంతో పాటు,  అధికారంలోకి రావ‌టానికి అవ‌కాశం ఉంటుంది.

 ప్ర‌స్తుతం ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో  , తెలుగుదేశం, జ‌న‌సేన, బీజేపీ పార్టీలు కూట‌మిగా కలిసి పోటీ చేస్తున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు అభ్య‌ర్థుల ఎంపికలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. రెండుమూడు సార్లు స‌ర్వేలు చేసి గెలుపు గుర్రాలు అవుతార‌న్న న‌మ్మ‌కం వ‌చ్చిన త‌రువాతే అభ్య‌ర్థుల పేర్ల‌ు ప్ర‌క‌టించారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కొన్ని త్యాగాలు సైతం చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం అదే త‌ర‌హాలో అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. అయితే అలాంటి పొత్తు ధర్మం, మిత్ర ధర్మం బీజేపీ  వైపు నుంచి కనిపించడం లేదు. ఆ పార్టీ ఒ్తతిడులకు తలొగ్గో,  ఆధిపత్యం మాదే అని రుజువు చేసుకోవడానికో, మరో కారణంతోనో అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యంగా కొన్ని స్థానాల విషయంలో పొత్తు ధర్మానికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నది.

బీజేపీ ఇప్పటికే  ఏపీలో పార్ల‌మెంట్‌ స్థానాలకు  తమ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.  ఇక అసెంబ్లీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే,   ప్ర‌జాబ‌లం ఏ మాత్రం లేని పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.   బీజేపీ అధిష్టానంపై  ఒత్తిడి  పెంచు తున్నారు. వారి ఒత్తిడికి త‌లొగ్గి అసెంబ్లీ టికెట్లు ఇస్తే వైసీపీ నెత్తిన పాలుపోసిన‌ట్లే అవుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.  మే13న  రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు ఒకే విడతలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు పొత్తుపెట్టుకున్న విష‌యం  తెలిసిందే.  మూడు పార్టీల మ‌ధ్య‌ సీట్ల స‌ర్దుబాటు  పూర్త‌యింది. పొత్తులో భాగంగా తెలుగుదేశం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మూడు విడతల్లో 139 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 13 పార్ల‌మెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మూడు నాలుగు సార్లు స‌ర్వేలు నిర్వ‌హించి గెలుపు గుర్రాలు అవుతార‌నుకున్న వారికి టికెట్లు ఇచ్చారు. ఈ క్ర‌మంలో ప‌లువురు  సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేందుకు సైతం చంద్ర‌బాబు నాయుడు వెనుకాడ‌లేదు. టికెట్ రాని నేత‌లు సైతం చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని అర్థంచేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ, రెండు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు ద‌క్కాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 18 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. కాకినాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి కూడా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. వీరి ఎంపిక‌కోసం ప‌వ‌న్ మూడునాలుగు సార్లు స‌ర్వేలు నిర్వ‌హించి సీట్లు కేటాయించారు. ఈ క్ర‌మంలో సీట్లు ద‌క్క‌ని జ‌న‌సేన నేత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇస్తామ‌ని ప‌వ‌న్ క్లారిటీగా చెప్పేశాడు. తెలుగుదేశం, జనసేనలు అభ్యర్థుల ఎంపిక విషయంలో పక్కా క్లారటీతో ముందుకు సాగుతుంటే..  బీజేపీలో  మాత్రం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, ఆరు పార్ల‌మెంట్ సీట్లు ద‌క్కాయి.  ఇప్ప‌టికే ఆరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అధిష్టానం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో స‌ర్వేల‌ను ప్రామాణికంగా తీసుకున్న‌ట్లే చెబుతోంది. పార్ల‌మెంట్ స్థానాల్లో సీటు ఆశించిన బీజేపీ నేత‌లు సోమువీర్రాజు, జీవీఎల్ న‌ర్సింహారావులాంటి నేత‌ల‌ను బీజేపీ అధిష్టానం నిర్మొహమాటంగా పక్కన పెట్టేసింది. ఒక్క నరసాపురం లోక్ సభ స్థానం విషయంలోనే బీజేపీ గెలుపు అవకాశాలున్న రఘురామకృష్ణం రాజును పక్కన పెట్టి  అనామకుడి వంటి అభ్యర్థిని నిలబెట్టింది. అందుకు కారణాలపై ఇప్పటికే విస్తృత చర్చ జరిగింది. జరుగుతోంది.

అది పక్కన పెడితే.. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఇహనో ఆ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ నిజం చెప్పాలంటే ఆ పార్టీకి  పది అసెంబ్లీ నియోజకవర్గాలలో  గెలుపు గ్యారంటీ అభ్యర్థులు లేరు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం బీజేపీ నిస్సం దేహంగా తెలుగుదేశం, జనసేన పార్టీలపైనే ఆధారపడి ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని ఒక వర్గం మాత్రం  నేల విడిచి సాము చేస్తున్నది.  తమకు పార్టీ టికెట్ ఇచ్చి తీరాలని హఠం చేస్తున్నది. ఇందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నది. అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నది. ఆ వర్గంలో ముఖ్యంగా   సోము వీర్రాజు, జీవీఎల్ న‌ర్సింహారావు లాంటి నేత‌లు ఉన్నారు. వీరిరువురూ కూడా ఎంపీ టికెట్ కోసం బీజేపీ అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే ఎంపీ టికెట్ విషయంలో వీరి పప్పులు ఉడక లేదు. ఎంపీ టికెట్ల విషయంలో ఒక్క నరసాపురం సీటు మినహాయిస్తే బీజేపీ చాలా వరకూ హుతుబద్ధంగానే అడుగులు వేసింది. పొత్తు ధర్మాన్ని పాటించింది. తెలుగుదేశం, జనసేనల సూచనలమేరకే అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అసెంబ్లీ స్థానాల విషయంలో ఆ పార్టీ చేస్తున్న తాత్సారం ఇస్తున్న లీకులు మాత్రం ఒకింత అనుమానాస్పదంగా ఉన్నాయి. పార్లమెంటుకు పోటీ చేసేందుకు టికెట్లు దక్కించుకోవడంలో విఫలమైన సోము, జీవీఎల్లు ఇప్పుడు ఎలాగైనా అసెంబ్లీ టికెట్లైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. వారి ప్రయత్నాల విషయంలో బీజేపీ అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తోందన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి  బీజేపీ అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగితే తమకు డిపాజిట్లు కూడా రావ‌ని స్వయంగా సోము వీర్రాజు, జీవీఎల్ కు కూడా తెలుసు. వారి పట్ల ఏపీ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ శ్రేణులు కూడా వారింత కాలం  రాష్ట్రంలో అధికార వైసీపీకి కోవర్టులుగా పని చేశారని బాహాటంగానే చెబుతున్నాయి.  

బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఆ పార్టీ అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది. అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా స‌ర్వేలు నిర్వ‌హించింది. సోమువీర్రాజు, జీవీఎల్ న‌ర్సింహారావుల పేర్లతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధిష్టానం నిర్వ‌హించిన స‌ర్వేల్లో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ట్లు బీజేపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్నది. సోము వీర్రాజు, జీవీఎల్ పై ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. వీరు వైసీపీ కోవ‌ర్టుల‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతో ప్ర‌స్తుతం వారికి టికెట్లు ఇచ్చినా టీడీపీ, జ‌న‌సేన ఓట‌ర్లు స‌హ‌క‌రించ‌డం అనుమాన‌మే. టీడీపీ, జ‌న‌సేన స‌హ‌క‌రించ‌కుంటే వారికి డిపాజిట్లు కూడా రావు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ అధిష్టానం వారి ఒత్తిడికి త‌లొగ్గి అసెంబ్లీ టికెట్లు ఇస్తే.. ముందుగానే రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి ఓట‌మిని ఒప్పుకున్న‌ ట్ల‌వుతుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. బీజేపీ అధిష్టానం వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రి స్తున్నద‌న్న ప్ర‌చారం రఘురామకృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఏపీలో విస్తృతంగా జ‌రుగుతోంది.  ఇలాంటి ప‌రిస్థితుల్లో సోము వీర్రాజు, జీవీఎల్ న‌ర్సింహారావుల‌కు టికెట్లు కేటాయిస్తే ఆ ప్రచారం నిజమని జనం నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అదే   జ‌రిగితే ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల ఐక్య‌త‌కు భంగం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవ‌లం ఇద్ద‌రి టికెట్ల కోసం కూట‌మి ఐక్య‌త‌ను దెబ్బ‌తీసేలా బీజేపీ అధిష్టానం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అనుకోవ‌టం లేద‌ని అంటున్నారు. ఒక వేళ అలా వ్యవహరిస్తే.. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు వెనుక జగన్ ను గెలిపించాలన్న రహస్య అజెండా ఉందని జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని నిర్ధారణ అవుతుందని అంటున్నారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.  

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో  తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.   ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి  గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.   స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే.  భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది.  కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో  పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.  

కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.  కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం   2006 లో  సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు.  అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత..  తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె,  మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో  సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.  మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.  ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?

జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.  

గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రేహాన్ వాధ్రా గాంధీయేనా?

రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు.  కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుత‌ం పెద్ద దిక్కు. ద‌శా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు   రేహాన్ వాద్రానే వార‌సుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.   అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయ‌న త‌న‌యులే త‌ర్వాతి  త‌రం వార‌సులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు.  అప్ప‌ట్లో సోనియా గాంధీ ప్ర‌ధాని  కావ‌ల్సిన  వారు.. ఆమె ప్ర‌ధాని కాలేక పోవ‌డానికి, త‌ర్వాత రాహుల్ పెళ్లాడ‌క పోవ‌డానికి కూడా అదే కారణంగా చెబుతారు.  అప్ప‌ట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. సోనియా ప్ర‌ధాని కాకుండా హెచ్చ‌రిక‌లు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేప‌థ్యంలో రాహుల్ తన త‌ద‌నంత‌ర వార‌సుల‌కు ఈ ప్రాణ‌హాని  సైతం అనువంశికంగా  క‌ల్పించ‌డం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. త‌న పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్ల‌కు ఒక శుభ‌కార్యం జ‌రుగుతుండ‌టంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు కాంగ్రెస్ కార్య‌ర్త‌లు.

తిరుమలలో రోజా రాజకీయ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు?

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు.   టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని  స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది.  తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.  అయితే మాజీ మంత్రి   రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.  జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

కేసీఆర్ ఆస్త్రసన్యాసమేనా?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.  అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియామకం

  అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.  విప్ బాధ్యతలు సభలో సభ్యుల హాజరు, అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలను సమీక్షించడం, పార్టీ విధానాలను అమలు చేయడం వంటి కీలక అంశాలను కవర్ చేయనున్నారు. కేసీఆర్ తన అసెంబ్లీ నాయకత్వానికి మద్దతుగా మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. శాసన పభ సమావేశాల్లో పార్టీ తొలి ప్రతినిధిగా మధుసూదనాచారీని కొనసాగించడం ద్వారా పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల అమల్లో కీలకంగా మారనుంది.  

తెలంగాణ మునిసి‘పోల్స్’ షెడ్యూల్ ఎప్పుడో తెలుసా?

తెలంగాణలో మునిసిల్  ఎన్నికలకు రేవంత్ సర్కార్ దాదాపుగా ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇప్పట్ల కాదని విస్పష్టంగా చెప్పేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల తరువాత జడ్పీఎన్నికలు ఉంటాయని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.  పరిషత్ ఎన్నికల కంటే ముందే ముమునిసిపోల్స్ పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్లను కూడా వేగవంవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే  రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల తయారీ , ప్రచురణకు సంబంధించి  షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్తగా ఖరారు చేసిన వార్డుల ప్రకారం ఓటర్ల జాబితాలను జనవరి పదో తేదీలోపు ఖరారు చేసి ప్రకటించేదిశగా అడుగులు వేస్తున్నది.  పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో  వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఈ విభజన ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ,తుది జాబితా ప్రచురణ జనవరి పదో తేదీకి పూర్తి  కానున్నది.  ముందుగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి, స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు ,అభ్యంతరాలను స్వీకరిచిన తరువాత,  మార్పులు చేర్పులు చేసి నిర్దేశిత   గడువులోగా తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రదర్శిస్తారు. వార్డుల విభజన , రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా దీనికి సమాంతరంగా సాగుతోంది. ముఖ్యంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేపట్టి, ఆ తర్వాతే ఓటర్లను ఆయా వార్డులకు కేటాయించనున్నారు. ఇక పాత విధానంలోనే రిజర్వేషన్ల అమలు ఉండనుంది.    

జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు

రప్పారప్పా అన్న వారిని రఫ్పాడిస్తున్న పోలీసులు వైసీపీ కార్యకర్తల మెడకు రప్పారప్పా కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఇష్టారీతిగా రప్పరప్పా అంటూ దౌర్జన్యాలకు పాల్పడతామంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా, రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీలకు మూగజీవాలను బలి ఇచ్చి రక్తాభిషేకాలు రెచ్చిపోయిన కార్యకర్తలు, జగన్ అభిమానులు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు.   ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు  సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు. ఇప్పుడు ఆ విషయంలోనే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఔను ఎక్కడెక్కడ ఎక్క‌డ ర‌ప్పా ర‌ప్పా అంటూ  ఈ జంతు బ‌లులు ఇచ్చారో అక్కడక్కడ అలా రక్తతర్పణాలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యర్తలపై కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ కార‌ణంగా జైళ్ల‌కు పోయి వ‌చ్చిన లీడ‌ర్ల‌ సంఖ్య విప‌రీతంగా ఉంటే ఇప్పుడది కార్యకర్తల వరకూ పాకింది.  అంటే జ‌గ‌న్ ప్రాపకం కోసం కార్యకర్తలు చేసిన అతి వారిని కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. అయినా రప్పారప్పా పోస్టర్లను, జంతు బలులను, రక్తాభిషూకాలు, రక్తతర్పణాలను అడ్డుకుని, అందుకు పాల్పడిన వారిని మందలించాల్సింది పోయి, జగన్ వారిని ప్రోత్సహించడం వల్లే పరిస్థితి ఇంత వరకూ వచ్చిందని ఇప్పుడు వైసీపీ క్యాడరే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. జగన్ తన కార్యకర్తలను కూడా క్రిమినల్స్ గానే తీర్చిదిద్దాలన్న భావనలో ఉన్నారు కనుకనే  ఎంతగా రెచ్చిపోతే అంతగా ప్రోత్సాహం అన్నట్లుగా వారిని రెచ్చగొడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జ‌గ‌న్  పై కేసులు ఉన్నాయి.. అయితే ఆయన లీగల్ టీమ్ ను కోట్లు చెల్లించి మరీ పోషిస్తున్నారు. అయితే.. సామాన్య కార్యకర్తకు ఆ వెసులుబాటు ఉండదు. కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ నుంచి ఇసుమంతైనా సాయం అందదు. దీంతో వారు జైళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్  కార్యకర్తలను క్రిమినల్ కార్యకలాపాలవైపు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే..  జ‌గ‌న్ త‌న హయాంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో  కార్యకర్తలను పట్టించుకున్న పానాన పోలేదు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కోసం ఇంత చేస్తే తమకు జైళ్లు, కేసులూ బహుమతా అంటూ ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్న పరిస్థితి.