కేంద్ర నిధులతో కోవిడ్ కిట్లను కొనండి!
posted on Apr 22, 2020 @ 11:52AM
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్ నెల వాటాగా, అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 వేల కోట్ల నిధులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేయటం పట్ల ఎం.పి. తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
దీనిలో తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిన రూ.982 కోట్ల నిధులను ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన సమస్యగా ఉన్న కోవిడ్19 నివారణ చర్యలకు, వినియోగించాల్సిందిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు.
ముఖ్యంగా వైరస్ వ్యాప్తి నివారణలో ముందుండి పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, పోలీసులకు కావల్సిన వ్యక్తిగత రక్షణ కిట్లను సమకూర్చడం, ఇంకా ఎక్కువ మందికి కోవిడ్ పరీక్షలు చేసే కిట్లను ఏర్పాటు చేసుకోవటం ప్రథమ అంశంగా భావించాలి.
అలాగే ప్రస్తుత రబీ సీజన్ లో రైతుల పంటలకు కనీస మద్దతు ధర తో కొనుగోలు చేసి, వారికి సత్వరమే డబ్బులు చెల్లించడానికి, ఇంకా ఇటీవలి అకాల వర్షాలకు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న రైతుల పంటలకు నష్ట పరిహారం చెల్లించడంలో, ఈ డబ్బులు ఉపయోగించాలని ఆయన కోరారు.