బనకచర్ల టెండర్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ప్రభుత్వం సీడబ్లుసీకి లేఖ రాసింది. ఈ లేఖలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్లు, సర్వేను తక్షణమే ఆపాలని కోరింది. ఆ ప్రాజెక్టును ఆమోదించవద్దని, పోలవరం డీపీఆర్‌కు విరుద్దంగా ఉందని లేఖలో వెల్లడించింది. పోలవరం డీపీఆర్‌‌కు విరుద్దంగా ఉందని తెలంగాణ ఆరోపించింది. 

గతంలో  మంత్రి ఉత్తమ్ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.  ‘బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి తెలంగాణ అభ్యంతరాలు తెలిపామని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మేం ఆలమట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై మేం ట్రైబ్యునల్‌ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించాం. ఈ విషయంలో ఎటువంటి రాజీపడమని ఉత్తమ్‌ తెలిపారు

తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీ రేపు శ్రీవారిని దర్మించుకోనుంది. రేణిగుంట విమానశ్రయంలో ఆయనకు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావులకేశవ్ స్వాగతం పలికారు.  సీఎం సతీమణి, అల్లుడు, కూతురు మనుమడిని ఆప్యాయంగా పలుకరించారు.  గాయత్రి గెస్ట్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంత్రులతో  కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని, పద్మావతి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారు. రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకుని, అనంతరం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్

  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేత మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించినందుకు ఎన్నిక రద్దు చేయాలని కోర్టును కోరారు.. తనపై ఉన్న 7 క్రిమినల్ కేసులను నవీన్ యాదవ్ వెల్లడించలేదని పేర్కొన్నాది. ప్రచారంలోనూ నవీన్ యాదవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రి పరిశీలనలో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ..‌ 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ (నవీన్ యాదవ్)కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ (మాగంటి సునీత) 74,259 ఓట్లు, బీజేపీ (దీపక్ రెడ్డి)కు 17,061 ఓట్లు వచ్చాయి.

రాయచోటిలో నిరసన జ్వాలలు...మూకుమ్మడి రాజీనామాలు

  అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడంపై రాయచోటిలో నిరసన జ్వాలలు రగిలాయి. ర్యాలీలతో పాటు పలువురు పదవులకు రాజీనామాలు చేశారు. మూడున్నరెఏళ్ళుగా జిల్లా కేంద్రంగా ఉండి పలు భవనాలకు స్థలాలు, నిధులు సమకూర్చుకొని ,జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పరిపారన సాగుతున్న తరుణంలో ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చడం ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయడమే‌నన్నారు. రాయచోటిపై రాజకీయ కక్ష సాధించవద్దని కోరుతూ  కొందరు పదవులకు రాజీనామా చేస్తూ మాట్లాడారు.  జిల్లా కేంద్రాన్ని మార్పు చేయడం ద్వారా రాయచోటి వాసులకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ప్రజాధనం కూడా వృధా అవుతుందని, ఇప్పటికైనా జిల్లా కేంద్రాన్ని మార్చకుండా  రాయచోటి లోనే కొనసాగించాలని ఆందోళన వ్యక్తం చేశారు. మహా ర్యాలీ రాయచోటి జిల్లా కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ పట్టణంలోని శివాలయం చెక్ పోస్ట్ నుంచి నేతాజీ సర్కిల్, జామియా మసీదు సర్కిల్, గాంధీ బజార్, వైయస్సార్ సర్కిల్ ల మీదుగా బంగ్లా సర్కిల్ వరకు మహా ర్యాలీ చేశారు. మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. *రాజీనామాలు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగింపు నిరసనగా రాయచోటిలో మొదలైన రాజీనామాల పర్వం మొదలైంది. రాయచోటి పట్టణంలో 22వ వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులకు  పోలంరెడ్డి దశరథ రామిరెడ్డి,  అయిదవ వార్డు కౌన్సిలర్ పోలంరెడ్డి విజయమ్మ లు రాజీనామా చేశారు. జిల్లా కేంద్రం రాయచోటిని మార్పుకు నిరసనగా పలువురు కౌన్సిలర్లు రాజీనామా చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని వెనుకబడిన రాయచోటికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరొకసారి తమ నిర్ణయాన్ని పునరాలోచిన చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి కౌన్సిలర్ లు విజ్ఞప్తి చేశారు.  

పిన్నమనేని సాయిబాబు మృతి టీడీపీకి తీరని లోటు : నందమూరి రామకృష్ణ

  సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా, వికలాంగుల సంస్థ మాజీ  చైర్మన్‌  పిన్నమనేని సాయిబాబు  ఆకస్మిక మృతి పట్ల టీడీపీ నేత నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు. నిన్న తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అకస్మాత్తుగా మృతి చెందడం అభిమానులు, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. సాయిబాబు మృతి యావత్ తెలుగుదేశం పార్టీ వీరసైన్య కార్యకర్తలను, ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది.  ఆయన మరణం అటు అభిమానులకు, ఇటు పార్టీ కార్యకర్తలకు తీరని లోటుగా మారింది. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్ల నుంచే పసుపు జెండాను భుజాన మోసిన మొట్టమొదటి వీరసైన్య కార్యకర్తలలో సాయిబాబు ఒకరు. ఎన్నో కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుండి పార్టీని నడిపించారు. ఒక నిబద్ధమైన అభిమానిగా, అంకితభావంతో కూడిన కార్యకర్తగా ఎన్టీఆర్‌కు, తెలుగుదేశం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివి. పిన్నమనేని సాయిబాబుకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున, మా కుటుంబం తరఫున ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. పసుపు కార్యకర్తలు, అభిమానుల హృదయాల్లో సాయిబాబు జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయిని రామకృష్ణ తెలిపారు.  

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

  వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలలో రేపటి నుంచి ప్రారంభం కానున్న  వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. టీటీడీ  సీవీఎస్వో, జిల్లా ఎస్పీ, చీఫ్‌ ఇంజినీర్‌, పలు విభాగాల అధికారులు టీటీడీ ఛైర్మన్ వెంట ఉన్నారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్‌ క్యూలైన్‌ ఎంట్రీ పాయింట్స్ వద్ద క్షేత్రస్థాయిలో సదుపాయాలను వారు పరిశీలించారు.  వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి డిసెంబర్‌ 30, 31, జనవరి 1 తేదీల్లో 1.89 లక్షల టోకెన్లను ఈ-డిప్ ద్వారా టీటీడీ కేటాయించింది. టోకెన్లు ఉన్న భక్తులకే ఆ మూడు రోజుల్లో దర్శనం కల్పించనున్నారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద టోకెన్ స్కానింగ్ ప్రక్రియను ఛైర్మన్‌కు అధికారులు వివరించారు.  క్యూలైన్ ఎంట్రీ వద్ద భక్తులకు కల్పించి సదుపాయాలను ఆయన తనిఖీ చేశారు. టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు

బిక్కి కృష్ణ రాసిన "సాయితత్వం - లీలారహస్యం" పుస్తకావిష్కరణ

  ప్రముఖ కవి, తత్వవేత్త బిక్కి కృష్ణ రాసిన"సాయితత్వం-లీలారహస్యం"అన్న గ్రంథాన్ని విశ్రాంత ఇన్ కం టాక్స్ ఛీప్ కమీషనర్ యం. నరసింహప్ప హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. శ్రీ భం సాయి సేవాట్రస్ ఆధ్వంర్యంలో ప్రముఖ కవి డా. వి. డి. రాజగోపాల్  అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో కవయిత్రులు డా. రాధా కుసుమ,పద్మశ్రీలతలు పుస్తకాన్ని సమీక్షించారు. భారతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశోధించి బిక్కి కృష్ణ సాధికారికంగా సాయితత్వం గ్రంథాన్ని రచించారన్నారు. ఈ సమావేశంలో యలవర్తి ధనలక్ష్మి,మారెళ్ళ రాజరాజేశ్వరి, కోగంటి శాంతిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

మెస్సీని వెనక్కి నెట్టి రొనాల్డో అరుదైన రికార్డు

  ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. సౌదీ ప్రో లీగ్‌లో అల్‌ నస్ర్‌ తరఫున అల్‌ అఖ్‌డౌద్‌తో జరిగిన మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. రెండు గోల్స్‌ సాధించిన రొనాల్డో.. 2025 క్యాలెండర్‌ సంవత్సరంలో 40 గోల్స్‌ పూర్తి చేశాడు. ఈ క్రమంలో లియోనెల్‌ మెస్సీని వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే 14 సార్లు ఏడాదిలో 40కిపైగా గోల్స్‌ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సౌదీ ప్రో లీగ్‌లో  అల్‌ నస్ర్‌ 3-0తో విజయం సాధించింది. సౌదీ ప్రో లీగ్ చరిత్రలోనే వరుసగా పదో మ్యాచులు గెలిచిన మొదటి క్లబ్‌గా అల్ నస్ర్ రికార్డు సృష్టించింది.  రొనాల్డో 31వ నిమిషంలో ఓ గోల్ చేయగా.. ఫస్ట్ హాఫ్ ఆఖరిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. చివరి నిమిషాల్లో జోవో ఫెలిక్స్‌ మరో గోల్‌ జోడించాడు. బాక్స్‌లో చురుకైన కదలికలతో రొనాల్డో మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఈ ఏడాది రొనాల్డో క్లబ్‌ స్థాయిలో 32 గోల్స్‌, పోర్చుగల్‌ జాతీయ జట్టుకు 8 గోల్స్‌ చేశాడు. అదనంగా నాలుగు అసిస్టులు కూడా అందించాడు. మొత్తంగా ఇది అతని కెరీర్‌లో 14 సార్లు ఒకే ఏడాదిలో 40కిపైగా గోల్స్‌ వేశాడు. దీంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సిని అధిగమించాడు. మెస్సి ఈ ఘనతను 13 సార్లు మాత్రమే ఒకే సంవత్సరంలో 40 సార్లు గోల్స్ సాధించగలిగాడు. రొనాల్డో, మెస్సిల తర్వాత రాబర్ట్‌ లెవాండోవ్‌స్కీ (9 సార్లు), ఎంబాపే, హ్యారీ కేన్‌, హాలాండ్‌ (తలో 5 సార్లు) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. నాలుగు సార్లు (2011–14) ఏడాదిలో 60కిపైగా గోల్స్‌ చేసిన ఘనత కూడా రొనాల్డోదే.

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైద్య  నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారు (నేచురాపతి)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. పోచంపల్లి శ్రీధర్‌రావు (మాస్‌ కమ్యూనికేషన్‌)ను సైతం ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.  రెండేళ్ల పాటు వీరు తమ పదవుల్లో కొనసాగనున్నారు.   డాక్టర్ మంతెన సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నరసాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. 

హైదరాబాద్‌లో యువకుడి గొంతు కోసిన చైనా మాంజా

  హైదరాబాద్‌లో చైనా మాంజా వాడకం వల్ల ఏర్పడుతున్న ప్రాణాంతక ప్రమాదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. చైనా మాంజా గొంతుకు చుట్టుకోవడంతో ఒక మైనర్ బాలుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో బాలుడి గొంతు పాక్షికంగా తెగిపోగా, వైద్యులు అత్యవసరంగా 22 కుట్లు వేసి ప్రాణాలను కాపాడారు. తీవ్ర రక్తస్రావం, ప్రాణాంతక పరిస్థితుల్లో చికిత్స పొందిన బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.  అయితే, హెచ్చరికలు మరియు చర్యలు కొనసాగుతు న్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్రమ తయారీ, అమ్మకాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నా బిడ్డ మెడకు ప్రమాదం జరిగింది. రేపు అది మీది కావచ్చు. మీ పిల్లలు కూడా ఇదే నగరంలో, ఇదే రోడ్లపై నడుస్తున్నారు. చైనా మాంజాను కొనుగోలు చేసే వారికీ బాధ్యత ఉందని, అక్రమ వ్యాపారానికి డిమాండ్ పెంచుతున్నది వినియోగదారులేనని వారు స్పష్టం చేశారు.“కేవలం వినోదం కోసం అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మానవ ప్రాణాలకంటే ఆ వినోదం విలువైనదా?” అని బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ వ్యాపారం హరామ్ మరియు చట్టవిరుద్ధమని పేర్కొంటూ, పౌరులు ఎవరూ ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. మీరు నిజంగా బాధ్యతా యుతమైన తల్లిదండ్రుల పిల్లలైతే, చైనీస్ మాంజాను కొనకండి. నగరంలో చైనా మాంజాతో ఎగిరే గాలిపటం పిల్లల ప్రాణాలు తీస్తోంది” అని బాలుడి తల్లిదండ్రులు హెచ్చరించారు.  నగర పరిధిలో చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేసే వారిపై కఠిన శిక్షలు విధించేలా చట్టాలు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డికి తల్లిదండ్రులు వినయ పూర్వకంగా అభ్యర్థించారు. గాలిపటాలు ఎగురవేయ డాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా, కేవలం బహిరంగ ప్రదేశాలకే పరిమితం చేయాలని సూచించారు.  చైనీస్ మాంజాతో జరిగే ప్రాణనష్టాలను అడ్డుకోవాలంటే  సహనం, కఠిన అమలు మరియు ప్రజల బాధ్యత అత్యవస రమని ఈ ఘటన మరోసారి స్పష్టంగా చెబుతోంది. మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలో చైనా మాంజా అమ్ముతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే రూ.5 వేల బహుమతి ఇస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మితే పోలీసులతో కేసులు పెట్టిస్తాని దానం హెచ్చరించారు. దయచేసి ఎవరూ చైనా మాంజా విక్రయించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు  

అమెరికాలో రోడ్డు ప్రమాదం....ఇద్దరు తెలంగాణ యువతులు మృతి

  అమెరికాలో మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వ రరావు కూతురు మేఘన, అలాగే ముల్కనూరుకు చెందిన కడియాల కోటేశ్వరరావు కూతురు భావన ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఉన్నత చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లిన ఈ యువతులు ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మేఘన, భావనతో పాటు మొత్తం ఎనిమిది మంది స్నేహితులు కాలిఫోర్నియాలో టూర్‌కు వెళ్లారు. రెండు కార్లలో ప్రయాణించిన వారు టూర్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కాలిఫోర్నియా లోని అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో మేఘన, భావన అక్కడి కక్కడే మృతి చెందారు. ఇతరులు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఎంఎస్  పూర్తి చేసి మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు తోడుగా నిలవాలన్న ఆశలతో అమెరికాకు వెళ్లిన మేఘన, భావనల జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగియడం అందరినీ కలిచివేస్తోంది.  రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే స్వస్థలాల్లో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన, భావన చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ చూపా రని, ఉన్నత ఆశయాలతో విదేశాలకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికా లో రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో తెలుగు విద్యార్థులు మరణిస్తున్న ఘటనలు పెరుగుతుండడం తో తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చోటుచేసుకున్న ఈ ప్రమాదం మరోసారి తెలుగు సమాజాన్ని కలచివేసింది. మృతుల మృతదేహాలను భారత్‌కు తరలించే ప్రక్రియపై కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు యువతుల అకాల మరణం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.