మహానాయకుడి అరెస్టు మాటల కందని మహా విషాదం!

నాకు వ్యక్తిగతం లేదు, ప్రజలు, రాష్ట్రమే ముఖ్యం అంటూ నిరంతరం శ్రమిస్తున్న మచ్చ లేని మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చెయ్యడం మాటల కందని మహా విషాదమనే చెప్పాలి.  కక్ష సాధించడం కోసం అన్యాయంగా గొప్ప నాయకుడిని జైలులో పెట్టి సీఎం జగన్‌రెడ్డి తన కళ్ళల్లో నిప్పులు పోసుకొన్నారు. గంద సింధూరం రాజమార్గాన పోతుంటే కుక్కలు ఎన్ని మోరిగితే ఏమవుతుంది అన్న సామెతగా, పస లేని, పనికి మాలిన ఆరోపణలతో చంద్రబాబుకు మసి పూయగలవా జగన్ రెడ్డి? చంద్రబాబు ఒక శిఖరం. ఆ శిఖరాన్ని అందుకోవాలంటే జగన్‌రెడ్డికి  పది జన్మలు ఎత్తినా సాధ్యం కాదు.

చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్మోసకారి మాయోపాయాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ప్రజలు. తెలుగువారే కాదు, అన్నీ దేశాలలో ఆత్మీయంగా అభిమానించే ఆదర్శనాయకుడు చంద్రబాబు. పడగొట్టిన రాష్ట్రాన్ని గొడ్డు చాకిరీ చేసి నిలబెట్టినా ప్రజలు ఓడించారు. అయినా ప్రజల నిర్ణయాన్ని శిరసావహించి ప్రతిపక్షనాయకుడిగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై మాజీ సీయం చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో సిఐడి పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణం. ఆయన హోదా, వయసు, పౌర హక్కులు, చట్ట నియమ నిబంధనలను సిఐడి తుంగలో తొక్కడం జగన్ రెడ్డి ప్రభుత్వ నియంత, కక్ష సాధింపు వైఖరికి నిదర్శనం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటులో రూ.270 కోట్ల ప్రభుత్వ నిధులను డొల్ల కంపెనీలు నెలకొల్పి పథకం ప్రకారం చంద్రబాబు వ్యక్తిగత లబ్ధి పొందారన్నది సిఐడి ఆరోపణ. 

2015-16లో జరిగిందంటున్న అవినీతిపై వైసీపీ వచ్చాక 2021లో కేసు నమోదైంది. సిఐడి కొంత మందిని అరెస్ట్‌ చేసి ఛార్జిషీట్‌ వేసింది. నిందితులు బెయిల్‌పై  విడుదలయ్యారు. హైకోర్టులో విచారణ పూర్తి అయి తీర్పు రిజర్వ్‌ అయింది. మొదట  ఎఫ్‌ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు అనూహ్యంగా ఇప్పుడు ఎలా తెర మీదికి తెచ్చారు? రిమాండ్ రిపోర్టులో  సీఐడి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అన్నీ రాజకీయ కుట్రలో భాగమే. ఒక తప్పుడు కేసు పెట్టి  చంద్రబాబును అన్యాయంగా  ఇరికించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేకుండా, ప్రాధమిక సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిధులు దుర్వినియోగం జరిగిందంటూ 2021 డిసెంబరులో కేసు నమోదు చేశారు. కానీ కేసు ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి చార్జిషీట్‌ వేయకుండా, సాక్ష్యాలు లేకుండా... చంద్రబాబును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాక మరేమిటి?  దాదాపు రెండేళ్ల తర్వాత అది కూడా 36 మంది అధికారులు బయట ఉండగా ఎలాంటి పురోగతి లేని కేసులో ఎలాంటి సాక్ష్యాలు బయటపడని 36 మందిని వదిలేసి 37వ వ్యక్తిపై సాక్ష్యాలు లేకుండానే 37వ నిందితుడిగా చంద్రబాబును అరెస్టు చేయడం ఎంత దారుణం?
                    
చంద్రబాబు వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం, దేశంలో అందరికంటే అనుభజ్ఞుడైన మచ్చలేని  ప్రజానాయకుడు ఆయన. తెలుగు ప్రజలు అందరికంటే ఎక్కువగా ఆదరించి అక్కున చేర్చుకున్న నాయకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఏడు పదులు దాటిన వయస్సు అందులో 45 ఏళ్ళు ప్రజాజీవితమే. రెండు దఫాలు మంత్రిగా, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్ళు ప్రతిపక్షనేతగా, విభజన అనంతరం ఏర్పడ్డ నవ్యాంధ్రకు అయిదేళ్ళు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు నవ్యాంధ్రలో నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. ఇంత సుదీర్ఘ కాలం ప్రజా నాయకుడుగా 1956 నుండి ఇప్పటి వరకు సుదీర్ఘ అనుభవంతో ఆయనతో పోల్చ దగ్గ నాయకుడు లేడు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్దమైన జీవన శైలి ఆయనది. భావితరాల శ్రేయస్సు కోసం, నిరంతర ఆలోచనలతో, విన్నూత్న ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకొన్న కార్యదక్షుడు. తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చి దిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్ధి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు, దేశ, రాష్ట్ర రాజకీయాలలో ఎదగాలనుకొనే వారికి చంద్రబాబు ఒక పుస్తకం అని చెప్పాలి. నాలుగు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొని వాటినే అవకాశాలుగా మలుచుకొని దార్శనికత నేతగా ఎదిగిన చంద్రబాబు వ్యక్తిత్వం, ఆయన ఆదర్శ విధానాలు నేటి యువతకి స్పూర్తి దాయకం. చంద్రబాబు అంటే విజన్, ఆయన విశ్రమించని మిషన్, ఆయనొక  పెర్ఫార్మర్, ఒక రిఫార్మర్. విశ్రాంతి అవసరం లేని, సమయం తెలియని నాయకుడు. కాళ్ళకి చక్రాలు, కాలానికి రెక్కలు తొడిగే అవిశ్రాంత పధికుడు. మోటివేటర్, యువతకు మార్గదర్శకుడు. అనన్య పాలనా దక్షుడు. 

ప్రతినిముషం  ప్రజలకోసం పరితపిస్తున్న నాయకుడు. నిరంతరం జనంలోనే, జనంతోనే, దేశంలోనే మంచి అడ్మినిస్ట్రేషన్‌తో పాలించిన నాయకుడు చంద్రబాబు. హైదరాబాద్ నగర రూపురేఖలు మారడానికి ఆయన దూరదృష్టే కారణం. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్,  మెడికల్ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చెయ్యడంతో ఆర్ధికవ్యవస్థ బలోపేతమైంది. చంద్రబాబునాయుడు అహోరాత్రులు చేసిన కృషి ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. టైమ్ మ్యాగజైన్ చంద్రబాబుని సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చంద్రబాబును ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్‌లో ఉండాల్సిన వ్యక్తిగా ఎంపిక చెయ్యడం గర్వకారణం. ఇండియా టుడే పత్రిక చంద్రబాబును ఐటి ఇండియన్ ఆఫ్ ది మిలీయంగా సత్కరిస్తే, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎకనామిక్ టైమ్స్ గౌరవించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనడానికి ఒక రాష్ట్ర్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం రావడం అనేది చంద్రబాబుతోనే ప్రారంభం అయింది. 

                
హైదరాబాద్‌లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పాలని ఆ మధ్య అహ్లు వాలియా అనడం అంటే ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలినీయంగా ప్రసిద్ధి పొందిన చంద్రబాబు ఖ్యాతి ఎలాంటిదో అర్ధం అవుతుంది. చంద్రబాబు విశేష కృషికి అద్భుత వరం హైటెక్ సిటీ నిర్మాణం. భారీ వేతనాలతో కూడిన లక్షలాది ఉద్యోగాలు, ఏటా వేల కోట్ల రూపాయల ఐటి ఎగుమతులు ఈనాడు సాధ్యమవుతున్నాయి అంటే ఆనాడు చంద్రబాబు కృషే కారణమని చెప్పాలి. బెంగుళూరు, ముంభైతో పోటీ పడి ఐటి రంగాన్ని హైదరాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం. ఆయన ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నే కాక ప్రపంచ ఆర్ధిక నిపుణులను ఆకర్షించాయి. జంట నగరాలకు తోడు సైబరాబాద్‌ను సృష్టించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చారు.   

రాజకీయంగా ఎన్టీఆర్ రాష్ట్రానికి, తెలుగుజాతికి ఎంతటి ప్రాముఖ్యత, ప్రాభవం తెచ్చారో అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అంతే గుర్తింపు తెచ్చారు. వినూత్న ఆలోచనలు, విలువలతో కూడిన రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి, అత్యుత్తమ రాష్ట్రంగా నిలబెట్టడానికి నిరంతరం ఆయన శ్రమించారు. రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు భావి తరాల గురించి ఆలో చిస్తాడు. దేశాభివృద్ది కానీ, రాష్ట్రాభివృద్ది కానీ, స్వార్ధ, సాధారణ నాయకులతో సాధ్యం కాదు. అందుకే జాతి కోసం శ్రమించే వారిని, జాతిని పీల్చి పిప్పి చేస్తున్న వారిని గుర్తించకపోతే ఆ జాతి ఎప్పటికీ పెదగానే మిగిలిపోతుంది. విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు రాజకీయాలలో ఎదగాలనుకొనే వారికి చంద్రబాబు ఒక పుస్తకం. 

అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ఆయనది చెరగని ముద్ర ఆయన పట్టుదల. అంకితభావం. ఆయన కృషి అనన్య సామాన్యం. ఆయన పోరాటం అసిధారా వ్రతం. ఏ సమాజంలో అయితే నీతి తప్పిన వారు విజయం సాధిస్తారో, ఏ సమాజంలో అయితే నేరస్థులు పూజింబడతారో, ఏ సమాజంలో అయితే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఏ సమాజంలో అయితే అవినీతి విలయతాండవం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రజలు తమకు రావాల్సిన వాటాల కోసం అర్రులు చాస్తారో ఆ సమాజం పున:సమీక్షించుకునే సమయం అసన్నమైందని ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్ క్లిట్ గార్డ్ వ్యాఖ్యలు ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌కు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

రాజకీయాల అవసరాలు కన్నా ప్రజలే ముఖ్యమని, ప్రజలే ముందని చెప్పిన, నమ్మిన రాజనీతిజ్ఞుడు చంద్రబాబు. దేశ, రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబుది గొప్ప చరిత్ర, అధికారంలో వున్నా, లేకున్నా, ఏదైనా అధికారిక పనుల్లో విదేశాలకు వెళ్ళినా, ఎప్పుడైనా కుటుంభంతో విదేశాలకు వెళ్ళినా, ఆఖరికి విమాన ప్రయాణంలో వున్నప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాల పైనే దృష్టి పెడతారు. ప్రతి పనిని పవిత్ర యజ్ఞంగా భావిస్తారు. లక్ష్యం నిర్ణయించుకొని దాన్ని చేరుకొనేందుకు నిరంతర శ్రమ, వ్యూహం వుండాలి అంటారు. అందుకే నవతరం రాజకీయ నాయకులకు ఆయనొక పాఠ్యగ్రంధం అని చెప్పాలి.
 
జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారు. నేషనల్ ప్రoట్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ కేంద్ర పెత్తనానికి ఎలా కళ్ళెం వేశారో యునైటెడ్ ప్రంట్ ఏర్పాటు, ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పాటుకు అంకురార్పణ చేసిన వారిలో చంద్రబాబుదే కీలక పాత్ర. ఒకానొక దశలో ఆయన్ని ప్రధాని కావాలని పార్టీలన్నీ కోరినా తాను రాష్ట్రానికే అంకితం అని స్పష్టం చేసిన నాయకుడు. దేశ ప్రధానుల నియామకంలో రెండుసార్లు ముఖ్యపాత్ర వహించారు.  రాష్ట్రపతులుగా శ్రీ కెఆర్ నారాయణయన్,శ్రీ అబ్దుల్ కలాం ఎంపికలోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంద్రను అభివృద్ది చేయడానికి చంద్రబాబు తనను తాను రాష్ట్రానికి సమర్పించుకున్నారు. అమరావతిని అద్భుతంగా నిర్మించి రాష్ట్ర ఆదాయం పెంచాలని, యువతకి ఉపాధి కల్పించాలని చంద్రబాబు తపన పడ్డారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ఐదు కోట్ల ప్రజల ప్రస్థానం మరో మలుపు తిరిగి ఐదు కోట్ల ప్రజల తలరాతలు అపూర్వం అయ్యేవి. చంద్రబాబు పిలుపుకు స్పందించి 29 గ్రామాల నుండి 28 వేల మంది రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం గర్వకారణం. 

ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అతి వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దేశం ముందు నిలిపారు చంద్రబాబు. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా సంక్షేమ పథకాలు అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ని ఆదర్శంగా నిలిపారు. నిరుపేదలు, రైతులు, మహిళలు,  కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చేందుకు బృహత్తర లక్ష్య సాధన కోసం విలక్షణమైన ఎన్నో సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టి బడుగుల బతుకుల్లో భాగ్యోదయం కల్పించేందుకు 100కిపైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించాలన్న దృఢ సంకల్పంతో దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్‌ను సస్య శ్యామలం చేసే భారీ ప్రాజెక్టు పోలవరంను 70 శాతం పూర్తిచేశారు.

పట్టిసీమ పూర్తీ చేసి కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం అనే ఆదర్శాన్ని నిజం చేసి చూపిన ఒక వజ్ర సంకల్పుడు చంద్రబాబు. పారిశ్రామిక ప్రగతి పరుగుల వెనుక చంద్రబాబు కఠోర శ్రమ ఉంది. ఆయన హయాంలో వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే చంద్రబాబు పాలనా దక్షతే దానికి కారణం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను మొదటిస్థానంలో నిలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకొని విన్నూత్న విధానాలతో ఆదాయ వనరులు పెంచారు. ఆర్ధిక క్రమశిక్షణ పాటించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారు. సమ్మిళిత, సుస్థిరత అభివృద్దే లక్ష్యoగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ వృద్దిరేటు 11.2శాతం సాధించారు. చంద్రబాబు దీర్ఘకాలం అదికారంలో కొనసాగి వుంటే హైదారాబాద్ వంటి నగరాన్ని నవ్యాంద్రలోను నిర్మించేవారు.విశాఖపట్నాన్ని ఒక సిలికాన్ వ్యాలీగా, అమరావతిని సకల విద్యలకు కాణాచిగా, తిరుపతి శ్రీ సిటీని ఒక పారిశ్రామిక హబ్‌గా మార్చే వారు. అందుకే జాతికోసం, జగతికోసం, ప్రగతి కోసం 73 ఏళ్ల లోనూ నిరంతరం శ్రమిస్తున్న మహానాయకుడు చంద్రబాబును అరెస్టు చేయడం మాటల కందని మహా విషాదం. అక్రమంగా,అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చెయ్యడంపై దేశవ్యాప్తంగా అన్నీ వర్గాల ప్రజలు ఆయనకు మద్దతుగా బాబు కోసం మేము అంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వారందరికి అభినందనలు. 

 నీరుకొండ ప్రసాద్  
సీనియర్ జర్నలిస్ట్

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? రేపో మాపో రేవంత్ కెబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ హస్తిన పర్యటకు బయలుదేరనున్నారు. శనివారం (డిసెంబర్ 28) హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. ఈ భేటీ ప్రధాన అజెండా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణే అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలూ నాయక్ లూ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కేవలం కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మార్పులు, చేర్పులతో కేబినెట్ ను పున్వ్యవస్థీకరించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

జగన్ విపక్ష నేత కావడం కల్ల.. రఘురామకృష్ణం రాజు

తనపై మూడు కేసులున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనదైన శైలిలో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఆరోపణలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ కేసులకు సంబంధించి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో తన కార్యాలయంలో    మీడియాతో మాట్లాడిన ఆయన తనపై ఆరోపణలు వస్తున్న కేసులో ఎలాంటి ఛార్జిషీటు దాఖలు చేయలేదన్నారు.   తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన..  11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.    తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తుల గురించి తాను మాట్లాడనని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు.   తాను ఏ తప్పూ చేయలేలదన్న ఆయన  తనకు పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం  జరుగుతోందని ఆరోపించారు.  అలాగే ఏపీ మాజీ సీఎం తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.  ఆయన తన తీరు మార్చుకోకుండా ఎప్పటికీ కనీసం ప్రతిపక్ష నేత కూడా కాలేరని అన్నారు.జగన్ తన ప్రవర్తన మార్చుకుంటే.. వచ్చే ఎన్నికలలోనైనా ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో గెలుపొంది ప్రతిపక్ష నాయకుడు అవుతారని తాను భావించాననీ, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ అవకాశం లేదనిపిస్తోందన్నా. 2020 నుంచే జగన్ తనపై బురద జల్లుతున్నారనీ, తనను హత్య చేయాలని కూడా చూశారన్న రఘురామకృష్ణం రాజు అయినా తాను భయపడకుండా పోరాడానన్నారు.   

తన హత్యకు కుట్ర.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ మరో సారి తన మార్క్ రాజకీయ సంచలనం సృష్టించారు.  తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, తనను హత్య చేయడానికి కుట్రపన్నారంటూ శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి  నిమ్మాడ హైవేపై ఆయన  హల్‌చల్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికి దువ్వాడ మాధురి ఓ ఆడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.  తన ఆరోపణలకు ఆధారాలు అన్నట్లుగా   దువ్వాడ వీడియో విడుదలైన కొద్దిసేపటికే.. దివ్వెల మాధురి ఒక ఆడియో క్లిప్పింగ్‌ను బయటపెట్టారు.   ఆ ఆడియో క్లిప్పింగ్ లోని  దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు   కింజారపు అప్పన్న, దివ్వెల మాధురిల సంభాషణ మేరకు.. రామస్వామి అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్రణాళిక రూపొందించాడని కింజారపు అప్పన్న దివ్వెల మాధురితో చెబుతున్నారు.   దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో, దివ్వెల మాధురి బయటపెట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి.  సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ చేస్తున్న ఆరోపణలు వైసీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతమయ్యాయి. ఇంతకీ తనను హత్య చేసేందుకు కుట్రపన్నుతున్నది వైసీపీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తాను చావుకు భయపడనన్న దువ్వాడ.. తనపై దాడి చేయడానికి ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో తాను స్వతంత్రంగానే రాజకీయాలు చేస్తానన్న దువ్వాడ    తనను వైసీపీ నుంచి పూర్తిగా బయటకు పంపిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా ఏంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనపై హత్యకు కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.