'బాబ్లీ' కథ వెనక రాజకీయ గాథ!

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

 

"రెండు రాష్ట్రాల మధ్య స్థానిక పరిస్థితులనుబట్టి పరస్పరం స్వార్థాలు బలిసి ఉంటాయి కాబట్టి, నదీజల పరివాహక ప్రాంతాల పరిథిలో ఉన్న రాష్ట్రాల హక్కులకు సంబంధించిన చట్టాలు తగాదాల పరిష్కారానికి తోడ్పడవు. హక్కుల్ని సమానతా సూత్రం ఆధారంగా మాత్రమే నీటిపంపిణీకి సంబంధించిన తగాదాలు పరిష్కారం కావాలి. తగాదాలో ఉన్న రాష్ట్రాలు దేనికదే తన రాష్ట్రంలోని రెండు ప్రాంతాలమధ్యనే నీటి తగాదా వస్తే తానేం చేస్తుందో ఆలోచించుకొని, ఆ సూత్రాన్నే రెండు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కూడా వర్తింపచేసుకోవాలి''!

 

   - జస్టీస్ బట్లర్ (1930): అమెరికాలోని మసాచూసెట్స్ X కనేట్ కట్ రాష్ట్రాల మధ్య జలపంపిణీ వివాదంలో యిచ్చిన తీర్పు."నీటి తగాదాలు న్యాయస్థానాల తీర్పులతో సంతృప్తికరంగా పరిష్కారం కాజాలవు''

                    - బర్బర్ (1959): అంతర్జాతీయ జలతగాదాల చరిత్ర''

 

దొంగలుపడిన ఆరునెలలకు 'అవేవో' తెగ మొరగడం మొదలెట్టాయట! నదీజలాల పంపిణీ విషయంలో ఇరుగుపొరుగుతో సమస్యలను పరిష్కరించుకోవటంలో అంతూపొంతూ లేని తాత్సారానికి అలవాటుపడిన ఆంధ్రప్రదేశ్ పాలనావ్యవస్థల తంతు కూడా అలాగే రూపుదిద్దుకుంటూ వచ్చింది. ఎడారిభూముల్ని సహితం సస్యశ్యామలం చేసుకుంటున్న ఈ ఆధునిక కాలంలో కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాలమధ్య నదీజలాల పంపిణీకి సంబంధించిన వివాదాలు పరిష్కారం కాకుండా ఏళ్ళువూళ్ళో గడిచిపోవటానికి ప్రధాన కారణం - పాలకపక్షాల మధ్య, పాలనా యంత్రాంగానికి దూరంగా ఉండే ప్రతిపక్షాల నాయకుల మధ్య పరస్పరం రాజకీయ ఎకవాక్యత కొరవడడమూ, జాతీయ దృక్పథం లేకపోతే మానె, కనీసం రాష్ట్ర రైతాంగ, సేద్యపునీటి అవసరాల పట్ల శ్రద్ధ లేకపోవటమూ! ఈలోగా, అవే కారణాలపైన ప్రాంతీయ తగాదాలు ముదురిపోవటమూ; ఈ తగాదాలకు దోహదం చేస్తున్న కారణాలలో రాష్ట్రాలమధ్య జలవివాదాలు ఒక భాగం కాగా, ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాలమధ్య జలపంపిణీ తాలూకు తగాదాలు ఎంతకూ ఒక కొలిక్కి రాకపోవటం మరో భాగం! ఈ లంపటంలో అంతర్భాగంగా ఇటీవల కాలంలో కొత్తగా తెలెత్తిన వివాదం మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తెలంగాణా ప్రాంతపు భూములకు సేద్యపునీటిని అందించవలసిన గోదావరిపైన మహారాష్ట్ర చడీచప్పుడు కాకుండా నిర్మించుకున్న బాబ్లీ ప్రాజెక్టు. తెలుగు 'సన్నాసులు' ప్రాంతీయ తగాదాల్లో 'మునగానాం-తీలానాం'గా ఉన్న సమయాన్ని కనిపెట్టి తెలివితో తేకువతో మహారాష్ట్ర పాలకులు అక్కడి రాజకీయ పక్షాలూ తెలుగువాడిని ఎక్కడ దెబ్బతీయాలో అక్కడనే తెలుగుజనాలకు జీవనాధారమైన నీటి అవసరాల మీదనే దెబ్బతీశారు! ప్రజాబాహుళ్యపు మౌలిక సమస్యలయిన తిండి, బట్ట, ఉపాథి, వసతి అవసరాలను ఈడేర్చడంపైన కేంద్రీకరించకుండా పనికిమాలిన పక్కదారులలోకి రాజకీయ నిరుద్యోగులు మళ్ళిపోవడంవల్లనే తెలంగాణాకు చెందిన అయిదారు జిల్లాలేగాక [ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు] కోస్తాంధ్రలోని గోదావరిజిల్లాలు కూడా సాగునీటి, మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుంది!


మహారాష్ట్ర నిర్మించిన ఈ బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణస్థలం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లోని శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు ఉన్న బ్యాక్ వాటర్ స్థలంలోనే ఉంది. శ్రీరాంసాగర్ గోదావరి నదిపైన మనం కట్టుకున్న తొలి సాగునీటి ప్రాజెక్టు. శ్రీరాంసాగర్ నిర్మాణ సమయంలో ఈ బ్యాక్ వాటర్ ఉన్న భూమిని మనం డబ్బిచ్చి కొనుకున్నదేగాని ఎవడూ ఉచితంగా దానం చేసిందికాదు! అయినా, "చూస్తూ ఉంటే మేస్తూ పోయిందన్న'' సామెతలా, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాడుకోవలసిన నీటి కేటాయింపు పరిథిని అధిగమించి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని శ్రీరాంసాగర్ పరిథిలోని బ్యాక్ వాటర్ స్థలంలో తలపెట్టింది! అయినా మన రాజకీయ నిరుద్యోగులకూ పాలకులకూ ఇది పట్టలేదు. ఇది రెండు రాష్ట్రాలమధ్య సమస్యకు దారితీసింది. అసలు అటు కృష్ణా జలాల పంపిణీకి చెందిన బచావత్ ట్రిబ్యునల్ గాని, ఇటు గోదావరి జలాల నిర్థారణకు సంబంధించిన ట్రిబ్యునల్ గానీ ఆంధ్రప్రదేశ్-కర్నాటక, ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలమధ్య జలసమస్యలను తమ ఓపాన శక్తికొలదీ పరిష్కరించడానికి ప్రయత్నించాయి. కాని వచ్చిన చిక్కు అంతా అటు పాలకపక్షాలుగానీ, ఇటు ప్రతిపక్షాలుగానీ పరస్పరం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జలసమస్యల్ని పట్టించుకోకుండా చూస్తూ వచ్చాయేగాని రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పరిశీలించకపోవడం వల్లనే వచ్చిపడింది. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లో సాగునీటి ప్రాజెక్టులపై తీసుకున్న పాటి శ్రద్ధను తరువాత వచ్చిన పాలకపక్షాలు [ఒక్క ఎన్టీఆర్, వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాలనలలో మినహాయించి] చూపలేదు! పైగా కృష్ణాజలాల విషయంలో కర్నాటక, గోదావరి జలాల వినియోగం విషయంలో మహారాష్ట్ర పాలకులు తమ రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించుకున్నంతగా మన రాష్ట్రపాలకులూ, ప్రతిపక్షాలూ శ్రద్ధ వహించకుండా ఎంతసేపూ పనికిమాలిన స్పర్థలతోనే కాలక్షేపం చేస్తూ వచ్చారు. 'సందట్లో సడేమియా' అన్నట్టు, కాగల కార్యాన్ని కాస్తా ఆల్మట్టి విషయంలో కర్నాటక, 'బాబ్లీ' విషయంలో మహారాష్ట్ర పాలకులు "గంధర్వులై'' గుట్టుచప్పుడు కాకుండా నెరవేర్చేశారు!

 

ఆంధ్రప్రదేశ్-మహారాస్ష్ట్రలమధ్య కుదిరిన 1955 నాటి ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణాన్ని తలపెట్టినప్పటికీ గోదావరి జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 60 శతకోటి ఘనపుటడుగుల నీటిని తన ప్రాజెక్టులకు వాడుకునే హక్కు మహారాష్ట్రకు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు జలాశాయంలోనే రహస్యంగా మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించడం తీవ్రమైన ఉల్లంఘన. ఈ ఉల్లంఘనకు కేంద్రప్రభుత్వ జలవనరుల సంఘం కూడా అభ్యంతరం చెప్పింది; తీరా చేతులు కాలిన తరువాత ఆంధ్రప్రదేశ్ పాలకులు గుడ్లు అప్పగించి చూస్తుండిపోవటమేగాక, ప్రాంతీయ తగాదాల్లో మునిగిపోయిన రాజకీయ నిరుద్యోగ నాయకులూ ఇటీవల కాలంలోనే ఇందుకు కారకులు.

 


మహారాష్ట్ర పూర్తి చేసుకున్న 12 బాబ్లీగేట్ల నిర్మాణాన్ని, నేను సలహాదారుగా పనిచేసిన ఓకే దినపత్రిక సీనియర్ పాత్రికేయులయిన ఎం.ఎస్.సి.హెచ్. బాబ్జీ రహస్యంగా మారువేషాల్లో వెళ్ళి బాబ్లీ కథ ముగిసిన వైనాన్ని సాధికారికంగా ఫోటోలతోసహా అయిదారు రోజులపాటు వార్తాకథనాన్ని రాష్ట్రప్రజలకు వెల్లడించేదాకా తగాదాల్లో ఉన్న తెలంగాణాప్రాంత నాయకులు ఒక్కరూ నోరెత్తకపోవటం మరో విశేషం! ఈ విషయంలో మిగతా రాష్ట్ర రాజకీయ నాయకులూ "నిమ్మకునోరెత్తినట్టే'' కూర్చున్నారు! అంతకుముందే విషయం తెలిసిన ఆనాటి "తెలుగుదేశం'' ప్రభుత్వం ఏమీ ఎరగనట్టే బయటకు పొక్కనివ్వలేదు. తరువాత విషయాన్ని గ్రహించిన వై.ఎస్.ప్రభుత్వం సుప్రీంకోర్టు జోక్యాన్ని అర్థించింది. ఆ పిమ్మట సుప్రీంకోర్టు తాత్కాలిక 'స్టే'ద్వారా బాబ్లీ నిర్మాణపనుల్ని వివాదం తేలేవరకూ తాత్కాలికంగా ఆపుచేయించింది. కాని ఫిబ్రవరి (2013)లో సుప్రీమ్ ఉభయపక్షాల వాదనలను విన్న తరువాత బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్రకు గోదావరి జలాల్లో నిర్ణయించిన 60 శతకోటి ఘనపుటడుగుల నీటిని ఆ రాష్ట్రం వాడుకోడానికి గల హక్కును గుర్తిస్తూనే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక షరతు విధించి, ఆ షరతు అమలు జరిగేట్టు చూసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సహా ముగ్గురు ఉన్నతస్థాయి సభ్యులతో కూడిన పర్యవేక్షక సంఘానికి అప్పగించింది. దీని ప్రకారం బాబ్లీ బరాజ్ నిర్వహణ తీరును ఈ సాధికార సంఘం పరిశీలిస్తూ 60టి.ఎం.సి. నీటి కేటాయింపులో బరాజ్ వద్ద నీటినిల్వ (కెపాసిటీ) సామర్థ్యాన్ని 2.74 టి.ఎం.సి.కి ఎట్టిపరిస్థితుల్లోనూ మించకుండా చూడాలని సుప్రీమ్ ఆదేశించింది. అయితే, శ్రీరాంసాగర్ జలాశయం భూభాగంలో అక్రమంగా నిర్మించిన బాబ్లీ కట్టడాన్ని తొలగించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినతిని మన్నించకపోవడం విచారకరం. అందుకే రెండు రాష్ట్రాలమధ్య నదీజల పంపిణీ వివాదాలను సామరస్యంతో ఆయా ప్రభుత్వాలను నిర్వహించే పాలకులు పరిష్కరించుకోవాలి గాని కోర్టులు పరిష్కరించజాలవు.

 

ఇందుకు ఉదాహరణలు - ఆల్మట్టి నిర్మాణం విషయంలో (కృష్ణా జలాల పంపిణీ)  బరాజ్ ఎత్తును ఆంధ్రప్రదేశ్ కోరికమేరకు నిర్దిష్టు పరిమితికి మించి పెంచరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని కర్నాటకలోని హెగ్డే, దేవెగౌడ ప్రభుత్వాలు, బాబ్లీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వమూ తుంగలో తొక్కాయి. అసలు ఈ తొక్కిసలాటకంతకూ ప్రధాన కారణం - నదీజలాల వినియోగం విషయంలో పాలకులకు జాతీయ దృక్పధంకన్నా సంకుచితమైన వైఖరీ, ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలమధ్య దామాషాన పంపిణీ కావలసిన ఉమ్మడి జలరాశి విషయంలో ఎవరికీ వారికి ఉమ్మడి రాష్ట్రప్రయోజనాల పట్ల సమగ్రమైన దృక్పధం బొత్తిగా కొరవడటమూ! రాజకీయ నిరుద్యోగులు ప్రజలపేరిట ప్రజలపైన తమ స్వార్థంకొద్దీ ఉద్యమాలవల్ల మొత్తం రాష్ట్రప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. బాబ్లీ విషయంలో దాదాపుగా అందరూ దొంగలే, నంగనాచులే, కొంగజపాలరాయుళ్ళే! మనకు ధర్మరాజులకన్నా శకునులు ఎక్కువైపోయారు! మన రాష్ట్ర చిత్రపటం ఇలా తగలడబట్టే ఏనాడో, దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికే, ఆ తరవాతి దశలో కూడా దశాబ్దాలక్రితం శొంఠి రామమూర్తి యావదాంధ్రుల (తెలుగువారి)కోసం రూపకల్పన చేసిన రామపాదసాగర్ ప్రాజెక్టు ఈ రోజుకీ పోలవరం ప్రాజెక్టుగా పూర్తిగా ప్రాణం పోసుకోలేకపోతుంది!


కొంతమంది తెలివితక్కువ ప్రాంతీయవాదులు పోలవరాన్ని తెలుగుప్రాజెక్టుగా భావించుకోలేక పోతున్నారు; కృష్ణా, గోదావరులు సేద్యపునీరుగా, తాగునీరుగా యావత్తు తెలుగుప్రజల అనుభవంలోకి రావలసిన బృహత్ నిర్మాణాన్ని జలరాశిగా భావించుకొనక పోవడంవల్లనే ఎటా లక్షలాది క్యూసెక్కుల నీరు శిశువుకు దక్కని తల్లిపాలలా సముద్రం పాలవుతున్నా రాజకీయ స్వార్థం బలిసిపోయి కించిత్తు బాధను కూడా వ్యక్తం చేయలేకపోతున్నారు! ఇలా బలిసిపోయిన నిరాసక్త ధోరణి వల్లనే తెలంగాణాలోని రాజోలిబండకు సహితం ఉపయోగపడగల కృష్ణనీటికి గండికొట్టేందుకు కర్నాటక పన్నిన కుట్రలో భాగంగా తుంగభద్ర నోర్డును (ఇది ఆంధ్రప్రదేశ్-కర్ణాటకల సంయుక్త మండలి) కర్నాటక ప్రభుత్వం ఏకపక్షంగా నర్మగర్భంగా రద్దు చేయబోయినప్పుడు కూడా నేటి వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు సహా రాష్ట్రనాయకులెవరూ నోళ్ళు విప్పలేక పోయారు!


అప్పుడు కూడా నేను ఒక ప్రముఖ దినపత్రికకు సంపాదకునిగా ఉన్నప్పుడు విశ్వేశ్వర్రావు (అనంతపురం)లాంటి సీనియర్ పాత్రికేయ మిత్రులద్వారా మొదటిసారిగా పెద్దస్థాయిలో ఆ కుట్రను బహిర్గతం చేస్తూ వార్తా కధలు ప్రచురించాల్సి వచ్చింది' అలాగే ఇటీవల కాలంలోనూ మరొక పత్రికద్వారా పాత్రికేయ మిత్రులను రహస్యంగా బాబ్లీకి పంపించి మొట్టమొదటిసారిగా తిరుగులేని దృశ్యమాలికల ద్వారా "బాబ్లీ కథకు తెరదించిన మాయల మరాఠీ'' అన్న మకుటంతో [19-06-2010 నుంచి 26-07-2010 దాకా] ప్రముఖంగా ఏడు వార్తాకథనాలు ప్రచురించాల్సి వచ్చింది. అంతవరకూ సాగుతున్న తంతును ఆ వార్తలో యిలా నమోదు చేయవలసివచ్చింది:


"రాష్ట్రం తెలంగాణా ఉద్యమ ఆందోళనలు, అల్లర్లతో అట్టుడికిపోతున్న సమయంలో మహారాష్ట్ర గుట్టుచప్పుడు కాకుండా తనపనిని పూర్తీచేసుకుని మనల్ని 'వెవ్వెవ్వ' అంటూ వెక్కిరించింది. మహారాష్ట్ర నిర్వాకంతో ఒక్క తెలంగాణా మాత్రమే కాకుండా అన్నపూర్ణగా పిలుచుకునే ఉభయగోదావరి జిల్లాలు సహా గోదావరిజలాలపైన ఆధారపడిన జనావాసాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని పారిశ్రామిక వాడలూ తీవ్ర సంకటస్థితిని ఎదుర్కోనున్నాయి. మహారాష్ట్రకు దిగువన గోదావరినదిపై ఉన్న నీటిప్రాజెక్టులకు ఇక ఇసుకతిన్నెలే గతి. అక్కడ పూర్తయింది బాబ్లీ ప్రాజెక్టు కాదు, నేలకూలిన తెలుగుప్రజల ఆత్మగౌరవం ... అన్ని రాజకీయపార్టీలూ దీన్ని జలరాజకీయం చేసి ప్రయోజనం పొందాయే తప్ప ఈ దారుణాన్ని ఆపలేకపోయాయి, నిర్మాణాన్ని నిలపలేకపోయాయి''

అంతేగాదు, పాత్రికేయుడు బాబ్జీ ఈ బాబ్లీ గాథను వెలికితీయడానికి పడినశ్రమనూ, ఎదుర్కొన్న కష్టాలను కూడా ఆ నివేదికలోనే ఇలా వెల్లడించం :


"సుప్రీంకోర్టు చెప్పనున్న తీర్పుతో ఇక ఇప్పుడు కొత్తగా ఒరిగేదేమీ కనిపించడం లేదు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన ఈ ప్రత్యేక ప్రతినిధికి కళ్ళు తిరిగే దృశ్యాలు కనిపించాయి. ఇప్పటివరకూ రెండు కిలోమీటర్ల దూరం నుంచే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ వ్యక్తి అయినా ఫోటోలు తీయగలిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క పురుగును కూడా అనుమతించని మరాఠా పోలీసులు ప్రాజెక్టు కాంట్రాక్టర్ గూండాలు, 'బాబ్లీ పరిరక్షణ సమితి' కళ్ళు కప్పి ఎన్నో వ్యయప్రయాసల కోర్చాల్సివచ్చింది. అక్కడకు చేరుకున్న తర్వాత, ప్రారంభోత్సవానికి పెళ్ళికూతురులా ముస్తాబయి కూర్చున్న బాబ్లీ ప్రాజెక్టు దర్శనమిచ్చింది. ఈ ప్రాజెక్టును చేరుకోడానికి అడుగడుగునా సోదాలు, గూండాల నిలవరింతలు, గ్రామస్తుల నిలదీతలు ఈ ప్రత్యేక ప్రతినిధికి లభించాయి. ఒక దశలో ఈ ప్రతినిధి ప్రాణాలకు కూడా తెగించాల్సి వచ్చింది. స్థానికంగా పరిచయమైనా ఇద్దరు మరాఠీ మిత్రులతో కలిసి తెలుగు మాట్లాడకుండా జాగ్రత్తపడుతూ బాబ్లీని చేరుకోవాల్సి వచ్చింది. బోధన నుంచి సాలూర,మహారాష్ట్రలోని బిలాని నుంచి అర్జాపూర్ మీదుగా షేర్ గావ్, కొండల్ వాడికి చేరుకున్నాం. అక్కడినుంచి గ్రామస్తులతో కలసి వారి వేషభాషలతోనే బాబ్లీ ప్రాజెక్టుకు కాలినడకన చేరాల్సివచ్చింది ... 2.70 టి.ఎం.సి.ల నీటి సామర్థ్యాన్ని మించేలా గేట్లు గనుక దించితే మరికొన్ని వందల టి.ఎం.సి.ల నీరు నిల్వ అయ్యేలా వేలాది ఎకరాల భూమిని సిద్ధం చేశారు. ముంపునకు గురి అయ్యే గ్రామాలను తరలించేశారు. నిర్మాణం పూర్తికావడంతో నిర్మాణ సామాగ్రి యంత్రాలు, వాహనాలను తరలించేశారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలమైనా, ప్రతికూలమైనా తమ ప్రయత్నం సఫలమయిందని కోర్టుతీర్పు ఏవిధంగా వచ్చినా ఫర్వాలేదనీ బాబ్లీ పరిరక్షణ సమితి సభ్యుడొకరు చెప్పారు. నిర్మాణం ఆగిపోయిందనే భ్రమలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది తిరుగులేని షాక్. సింగూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు హైదరాబాద్ మంచినీటి సరఫరాకు అంకితమైంది. కాగా బాబ్లీ నిర్మాణంతో శ్రీరాంసాగర్ ఎడారికానుంది. ఇక రాష్ట్రంలో రూ.200 కోట్ల వ్యయంతో అత్యంత ఆర్భాటంతో ఆరంభించిన ఆలీసాగర్ ఎత్తపోతల పథకం నీరు రాక వెక్కిరిస్తోంది. జలయజ్ఞానికే తలమానికంగా భావించిన ఈ ఎత్తిపోతల పధకాన్ని బాబ్లీ పూర్తిగా కబళించివేసింది'' [19 జూన్ 2010]!


ఇలా పాలకపక్షాలలో, ప్రతిపక్షాల్లో ఉన్న స్వార్థపర రాజకీయ నిరుద్యోగుల మూలంగా రాష్ట్ర సేద్యపు నీటి ప్రాజెక్టులు ఎన్నింటినో నిర్మించుకోలేక రైతాంగమూ, సాధారణ ప్రజాబాహుళ్యమూ ఎంతగానో ఇన్నేళ్ళుగా నష్టపోతూ వచ్చారు. నేటి బాబ్లీ విషయంలో మాదిరే మిగతా ప్రాజెక్టుల విషయంలో కూడా పాలక, ప్రతిపక్షాలలోని రాజకీయ నిరుద్యోగుల మధ్య ఎకవాక్యత లేకపోవడంవల్ల పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మరింత చులకనైపోయాం! దానికితోడు కృష్ణ, గోదావరి నదుల్లో పారే జలరాశిలో నిక్కచ్చిగా ఆధారపడదగిన (డిపెండబిలిటీ) మొత్తాన్ని అంచనా వేయడంలో లోపం ఉందని భ్రమకు లోనుకారాదనీ డాక్టర్ కె.ఎల్,రావు లాంటి సుప్రసిద్ధ ఇంజనీర్లు కూడా అభిప్రాయపడుతూ వచ్చారు. అలాగే, ప్రాజెక్టులు తలపెట్టడంలో జాప్యంవల్ల కొన్నాళ్ళు, తలపెట్టిన తర్వాత ప్రారంభంకాక కొన్నాళ్ళు, ప్రారంభించిన తర్వాత సకాలంలో నిర్మాణం పూర్తికానందువల్ల తడిసిమోపెడైన ఖర్చులవాళ్ళ కొన్నాళ్ళు గడిచిపోవడం వల్ల కూడా రాష్ట్రంలో ప్రాంతాల మధ్య తగాదాలు తలెత్తడమూ జరిగింది. అలాగే నదులలో "అదనపు జలరాశి'' అన్నది ఒక మిథ్యగా తయారవడం వల్ల, ఆ ''మిథ్య'' ఆధారంగా ట్రిబ్యునళ్ళు రాష్ట్రాల మధ్య జలపంపిణీని నిర్ణయించడం వల్ల కూడా ఆచరణలో సమస్యలు తలెత్తుతూ వచ్చాయని మరచిపోరాదు.


అలాగే కేంద్ర వాటర్ కమీషన్ చీఫ్ ఇంజనీరు, తుంగభద్ర బోర్డు చైర్మన్ గా పనిచేసిన గాడ్ బోలే అంచనా ప్రకారం "మన దేశంలో దాదాపు ఏ ప్రాజెక్టు కిందా మనం ఇసుకమేటలు సకాలంలో తొలగించిన పాపాన పోలేదు''! అందుకే ఈ రోజుకీ అటు ఉత్తరాంధ్రలోని వంశధార రెండవ దశగానీ, ఇటు తెలంగాణాలోని శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు రెండవదశగానీ పరిపూర్తి కాకపోవడానికి కారణం ప్రాంతాలమధ్య వివక్షవల్ల కాదు, పాలనావ్యవస్థల ముందుచూపులేని విధానాలవాళ్ళ మాత్రమే! అందుకే మూడుప్రాంతాలలోని చిన్నవీ, మధ్యరకం, భారీ నీటిపథకాలు నిర్మాణం కోసం, ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నవీ ఎన్నో ఉన్నాయి. వేర్పాటు ఉద్యమాలే మౌలిక సమస్యలను పరిష్కరించజాలవు. సమస్యల మూలాలలోకి, పెట్టుబడీదారీ విధానాల తీరుతెన్నులలోకి వెళ్ళి పరిశీలించకుండా గావుకేకల వల్ల ప్రయోజనం శూన్యం! ఇది నేటి మాటే కాదు, హెచ్చరికగా రేపటి మాట కూడా. కులాసా కబుర్లనుంచీ, విలాసక్షేత్రాలనుంచీ (ఫామ్ హౌసెస్) నీరు పారదు, కనుకనే పాలనా విధానాల, ఉత్తుత్తి ఉద్యమాల తీరూమారదు!

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.