రామ్ దేవ్ బాబా కరోనా ముందుకు బ్రేకులు..మమ్మల్ని అవమానించడం సరికాదు
posted on Jun 24, 2020 @ 11:55AM
యోగా గురు రామ్ దేవ్ బాబా కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ కరోనా వైరస్ కు మెడిసిన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయుర్వేద ఉత్పత్తులతో తాము కరోనాకు ఔషధాన్ని తయారు చేశామని, ఇది వారం రోజుల్లోనే శరీరంలోని వైరస్ ను పారద్రోలుతుందని చెబుతూ పతంజలి సంస్థ విడుదల చేసిన 'కరోనిల్ మరియు శ్వాసరి' లను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అడ్డుకుంది. తక్షణం దీనికి సంబంధించిన ప్రచారం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పతంజలి సంస్థ తయారు చేసిన మెడిసిన్ లో ఎలాంటి ఔషాదాన్ని వాడారో.. ఎంత మొత్తంలో వాడారో చెప్పాలంటూ ఆయుష్ శాఖ ఆదేశించింది. ప్రోటోకాల్, నమూనా పరిమాణం, ఇనిస్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్ , క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ వివరాలు, మెడిసిన్ రీసెర్చ్ డేటాను పరిశీలించే వరకు దీనికి సంబంధించి ప్రచారాల్ని నిలిపివేయాలని ఆదేశించింది.
ఆయుష్ మంత్రిత్వశాఖ ఆదేశాలపై యోగా గురువు రామ్ దేవ్ బాబా స్పందించారు. కరోనాకు మందు తయారుచేసే ముందు అన్ని అనుమతులు తీసుకున్నామని స్పష్టంచేశారు. మెడిసిన్కు సంబంధించి అన్ని వివరాలు ఇప్పటికే ఆయుష్ మంత్రిత్వశాఖకు అందజేశామని.. అవి త్వరలోనే వారికి చేరుకుంటాయని తెలిపారు. తాము చట్టాన్ని ఎక్కడా అతిక్రమించలేదని స్పష్టంచేశారు. కరోనిల్, శ్వాసరి మందులు కరోనా రోగులపై వందశాతం పనిచేశాయని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, 100 శాతం రోగులు కోలుకున్నాకే ప్రజలు చెబుతున్నామని తెలిపారు. పతంజలి చేసిన పరిశోధన, మందు కనుగొనడంతో ప్రభుత్వం తమను అభినందించాల్సింది పోయి.. అవమానించడం సరికాదన్నారు. దీనిపై ఇప్పటికే ఆయుష్ అధికారులతో మాట్లాడామని.. మెడిసిన్ కు సంబంధించి సమాచారం లేదని చెప్పడంతో, పరిశోధనలకు సంబంధించిన వివరాలను పంపించామని రామ్ దేవ్ పేర్కొన్నారు.