తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్?
posted on Aug 22, 2025 @ 5:02PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పోరేట్ హాస్పిటల్స్లో ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ సేవల పరిధిని ఐదు లక్షల నుంచి పదిలక్షల రూపాయలకు పెంచింది. అయితే ఆరోగ్యశ్రీ బకాయలు పేరుకుపోవడంతో ఈ పథకం కింద సేవలను ఈనెల 31 నుంచి బంద్ చేయాలని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు నిర్ణయించాయి.
ఈ మేరకు ఆరోగ్య శ్రీ సీఈవోకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్ హెచ్ ఏ) లేఖ రాసింది. ఆ లేఖలో ఆరోగ్య శ్రీ సేవలతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సేవలను కూడా నిలిపివేయనున్నట్లు పేర్కొంది. ఏడాది కాలంగా ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, ఆయా సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బకాయిలను చెల్లించకుండా పెండింగ్ లో ఉంచిందనీ, దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్ హెచ్ ఏ ఆ లేఖలో పేర్కొంది.