డాక్టర్ ను హాజరుపరచండి.. జగన్ సర్కార్కు హైకోర్టు ఆదేశం
posted on May 19, 2020 @ 11:45AM
నర్సీపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ సస్పెన్షన్కు గురైన డాక్టర్ సుధాకర్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు అమానుషంగా వ్యవహరించారని పేర్కొంటూ టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను, దానికి జత చేసిన వీడియోను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
డాక్టర్ సుధాకర్ ను తమ ముందు హాజరు పరచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డాక్టర్ను కలుసుకునేందుకు ఆయన తల్లికి కూడా అవకాశం ఇవ్వలేదంటూ వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ పోలీసులు డాక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ పోలీసు కమిషనర్లను పేర్కొన్నారు.