దళితుల చదువుకు అడ్డుపడటం ఫ్యాక్షనిస్టుల దుష్ట సంస్కృతి
posted on Aug 12, 2020 @ 12:52PM
ఏపీలో కొద్దిరోజులుగా దళితులపై దాడులు జరుగుతున్న ఘటనలు, కుల వివక్ష ఎదుర్కొంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, ఆంధ్రా యూనివర్సిటీ లో ఆరేటి మహేష్ అనే దళిత పరిశోధక విద్యార్ధి.. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగడం సంచలనంగా మారింది. తన పరిశోధన గ్రంధంపై ఉద్దేశపూర్వకంగా వీసీ సంతకం చేయలేదని ఆరోపిస్తూ దీక్షకు దిగారు. ఒక దళిత ప్రొఫెసర్ కి అన్యాయం జరిగితే.. తాను బలపర్చానని కక్షకట్టారని ఆరోపించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీని ప్రభుత్వం వెంటనే భర్తరఫ్ చేయాలని ఆరేటి మహేష్ డిమాండ్ చేశారు.
ఆరేటి మహేష్ చేస్తున్న దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. మహేష్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఏపిలో కాలరాస్తున్నారు అని మండిపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ దళిత విద్యార్ధి, రిసెర్చ్ స్కాలర్ ఆరేటి మహేష్ ఉన్నత చదువులకు ఆటంకాలు కల్పించడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ఈ విధమైన కక్షసాధింపు గర్హనీయం అన్నారు.
దళితుల చదువుకు అడ్డుపడటం ఫ్యాక్షనిస్టుల దుష్ట సంస్కృతి అని విమర్శించారు. దళిత వైద్యులపై అమానుషాలు, దళిత జడ్జిపై రాళ్లదాడి, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల భూములు బలవంతంగా లాక్కోవడం.. వంటి ఈ పాలకులగతి తప్పిన, మతిమాలిన చర్యలను దళిత సమాజమే నిగ్గదీయాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిరాహార దీక్ష చేస్తున్న మహేష్కి తక్షణమే న్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.