బడ్జెట్ అంటే పంపకాలేనా ?
posted on May 21, 2021 @ 2:01PM
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ఒకే ఒక్క రోజులో చాప చుట్టేసింది. రూ. 2 లక్షల 29 వేల పైచిలుకు బడ్జెట్’ను మరో మాట, మరో చర్చ లేకుండా, అసలు సభలో ప్రతిపక్షమే లేకుండా ‘మమ’ అనిపించింది. రాజ్యాంగ అనివార్యత దృష్ట్యానే కావచ్చు, ప్రభుత్వం ఒక్క రోజులోనే బడ్జెట్ క్రతువు మొతాన్ని కానిచ్చింది. ప్రతిపక్ష తెలుగు దేశం సమావేశాలను బహిష్కరించి, మాక్ అసెంబ్లీ నిర్వహించింది. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరోక్షంగా అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసింది. అయితే, నిజంగా నిద్రపోయే వాళ్ళను లేపవచ్చును, కానీ, నిద్ర నటిస్తున్న వారిని, జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరూ లేపలేరు.
ఇలా ఒక్క రోజులో గవర్నర్ అడ్రస్, బడ్జెట్ ప్రవేశ పెట్టడం ... ఆమోదం పొందడం... పనిలో పనిగా ... అధికార పార్టీ అధికార అసభ్య భాషలో పతిపక్షం మీద విమర్శలు గుప్పించడం ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సూక్తులు, సుభాషితాలు... అన్నీ అయిపోయాయి. నిజమే, ప్రస్తుతం రోజుకో 20 వేల పైచిలుకు కొత్త కరోనా కేసులు, వంద పైచిలుకు కొవిడ్ మరణాలు నమోదవుతున్న పరిస్థితుల్లో, స్థిమితంగా ఓ పదిరోజులో పక్షంరోజులు సమావేశాలు నిర్వహించి, బడ్జెట్’ పై సవివరంగా చర్చించే పరిస్థితి లేదు. కానీ, ఒక్క రోజులో రూ. 2,29,779 కోట్ల బడ్జెట్’ను తూతూ మంత్రంగాకానీయడం, అంతగా సమర్ధనీయం కాదు. అలాగే, గవర్నర్ ప్రసంగాన్ని అదేతీరున కానిచ్చడం కూడా ... విమర్శలకు తావిస్తోంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం, తెలుగు దేశం సమావేశాలను బహిష్కరించి నిరశన తెలియచేసింది. మాక్ అసెంబ్లీ నిర్వహించి, ప్రభుత్వాన్ని విమర్శలతో ముంచెత్తింది.
ఇక బడ్జెట్ విషయంలోకి వస్తే, మొత్తం బడ్జెట్’లో ఐదో వంతు మొత్తాన్ని, సంక్షేమం పేరిట, నేరుగా ఓటర్ల జేబులకు చేరే విధంగా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేటాయింపులు చేశారు. గత బడ్జెట్’లో పెద్ద పీట వేసిన విధంగానే, ఈ బడ్జెట్’లోనూ, ఆసరా, చేయూత, భరోసా, అమ్మఒడి, గోరుముద్ద, ఇలా ... నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్ములు జమచేసే పథకాలకే ప్రధాన్యత ఇచ్చారు. మొత్తం బడ్జెట్’లో ఐదో వంతు అంటే, రూ. 48.083.92 కోట్లు నేరుగా జనం జేబుల్లోకి చేరే విధంగా బడ్జెట్ రూపొందించారు. అంటే కాదు, ఓ వంక ఐక్య రాజ్య సమితి నిర్దేశించిన విధంగా సుస్థిర అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అంటూనే, ఆర్థిక మంత్రి బుగ్గన, చివరకు, పిల్లలను కూడా వదల కుండా(బహుశా ‘నేటి బాలరే రేపటి ఓటర్లు’ అనే విశ్వాసంతో కావచ్చు ఈ సారి మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చూపించరు,) ఏ సామాజిక వర్గానికి ఎంత మేలు జరుగుతుందో, ఏ వర్గానికి ఎంత ‘ఉచితం’ అందుతుందో చూపించే ప్రయత్నం చేశారు. మంత్రి గారి మాటల్లోనే చెప్పాలంటే, మొత్తం 22 పథకాల ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి సొమ్ములు జమవుతాయి. ఇందుకోసం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో రూ. 4,141 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. అయితే, ఈ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, అనే దానికి, అప్పు చేద్దాం అనే సమాధానమే వస్తోంది. ఈ 22 పథకాల్లో మిడు ముఖ్యమైన పథకాలు, వైఎసార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి పథకాల అమలుకు అవసరమయ్యే, రూ.16,890 కోట్లు, రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా వివిధ సంస్థల నుంచి రుణాలను సేకరిస్తోంది.
నిజానికి, బడ్జెట్ సమగ్ర స్వరూపాన్ని చూస్తే, పథకాలు, పందేరాల విషయంలో ఉన్న స్పష్టత, ఆదాయం విషయంలో కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఒక విధంగా చూస్తే బుగ్గన బడ్జెట్’లో వాస్తవ దృక్పధం లోపించిందనే అభిప్రాయం వినవస్తోంది. గత సవత్సరంలో మొత్తం రాబడి రూ. 1,61.958.50 కోట్లు ఉంటుంది ప్రభుత్వం ఆశించింది. కానీ, వచ్చింది, రూ. 1,18,063.09 కోట్లు మాత్రమే. ఈ సంవత్సరం, పరిస్థితి గత సంవత్సరం కంటే భిన్నంగా ఉంటుందని, ప్రభుత్వం ఎలా అంచన కొచ్చిందో కానీ, నలుగు కీలక పద్దుల పరిధిలో, రూ.1,77,196.48 కోట్ల ఆదాయమ వస్తుందని అంచనాల లో చూపించింది.
కానీ, ఆర్థిక పరిస్థిటిపై కరోనా ప్రభావం, గత సంవత్సరం కంటే , ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా గత సంవత్సరం గ్రామీణ ప్రాంతాలపై అంతగా ప్రభావంచుపని కరోనా ఈ సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లోనూ అధిక ప్రభావం చూపుతోంది. మరో వంక, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న కరోన కట్టడి, వాక్సిన్’కు కలిపి రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మొత్తం ఏ లెక్కనా కరోనా కట్టడికి సరిపోదు. ముఖ్యంగా, వచ్చే సంత్సరం మార్చిలోగా, అవసరం అయితే గ్లోబల్ టెండర్లకు వెళ్లి అయినా, ప్రజలు అందరికీ టీకాలు వేయించవలసి ఉంటుంది. అయితే, కరోనాకు కేటాయించిన రూ.1000 కొట్లలో కేవలం రు.500 కోట్లు మాత్రమే వాక్సినేషన్’కు కేటాయించారు. ఇది వాక్సినేషన్’కు సరిపోదని అంటున్నారు. నిజానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా విషయంలో మొదటి నుంచి శ్రద్ద చూపడం లేదన్న, విమర్శలున్నాయి.అందుకు తగ్గట్టుగానే, బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మరో వంక రాష్టంలో కరోనా కేసులు, మరణాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి.
అభివృద్ధి కోణంలో చూస్తే, బడ్జెట్ లో మూలా ధన వ్యయం పద్దు కింద చూపించడం అయితే, రూ.31,198.38 కోట్లు చూపించారు. అయితే, గత సంవత్సరం బడ్జెట్’లో చూపిన రూ.29,907.62 కోట్లలో సగం కంటే కాసింత ఎక్కువగా, రూ. 18, 797.39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ లెక్కన ఈ సంవత్సరం అబివృద్ది వ్యయం ఇంకా కిందకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇదిలా ఉంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం పాస్టర్లు, ఇమాంల పట్ల గల ప్రత్యేక ప్రేమను మరో మారు ప్రకటించుకుంది. ఇటీవలనే, వారికి ఇస్తున్న నెలసరి జీతాన్ని రూ. 5000 నుంచి ఏకంగా రూ.10,000లకు పెంచిన ప్రభుత్వం బడ్జెట్ లో ఇందు కోసంగా రూ.120 కోట్లు. అర్చకులకు కూడా అంటే మొత్తాన్ని కేటాయించింది. అయితే,రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవుల జనాభా హిందూ జనాభాలో ఒక వంతు కూడా ఉండదు. అయినా అర్చకులతో సమనంగా పాస్టర్లు, ఇమాంలకు బడ్జెట్ కేటాయింపులు చేయడాన్ని, హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.అదీగాక, అర్చకులకు దేవాలయాల ఆదాయం నుంచి, అర్చకులకు జీతాలు చెల్లిస్తోంది, కానీ, క్రైస్తవ ఫాదర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఇదిలా ఉంటే సహజంగానే ప్రతిపక్షాలు బడ్జెట్ ‘ను తూర్పార పట్టాయి. అధికార పార్టీ నాయకులు ఆకాశానికి ఎత్తేశారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేసే బడ్జెట్ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దివాలకోర్ బడ్జెట్ అంటూ తేల్చేశారు. మరి ప్రజలు ఏమంటారో ..