'నవరత్నాలు' కోసం భూముల వేలం! రూ.300 కోట్లు రావచ్చని అంచనా!
posted on May 14, 2020 @ 10:04AM
భూములను వేలం వేసే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం షూరూ చేసింది. తొలి విడతలో విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న భూమిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న ఈ ఆక్షన్ ప్రక్రియ ద్వారా వేలం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేలంలో సమకూరే ఆదాయాన్ని నవరత్నాలు, నాడు-నేడు వంటి కార్యక్రమాల అమలుకు వెచ్చించనుంది. ఈ వేలం ప్రక్రియను బిల్డ్ ఏపీ మిషన్ చేపట్టబోతోంది. ఈ సందర్భంగా బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, వేలంపాటలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. ధరావతు కింద పది శాతం చెల్లించాలని తెలిపారు.
వేలం వేసే భూముల వివరాలు ఇలా వున్నాయి. గుంటూరు జిల్లాలో ని నల్లపాడు - 6.07 ఎకరాలు, శ్రీనగర్ కాలనీ - 5.44 ఎకరాలు, మెయిన్ బీటీ రోడ్డు - 1.72 ఎకరాలు.
విశాఖ జిల్లాలో చిన గడ్లీ - 1 ఎకరం, చిన గడ్లీ - 75 సెంట్లు, ఆగనంపూడి - 50 సెంట్లు, ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 35 సెంట్లు,
ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 1.93 ఎకరాలు, ఫకీర్ టకియా ఎసీఈజెడ్ - 1.04 ఎకరాలు.
తొలివిడత కింద విశాఖ, గుంటూరు జిల్లాల్లో కలిపి 9చోట్ల ప్రధాన ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను ఈ-వేలం ద్వారా వేలం వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భూముల ద్వారా రూ.300 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘నవరత్నాలు’, ‘నాడు-నేడు’ వంటి ప్రభుత్వ పథకాల అమలుకు ఈ నిధులు వెచ్చిస్తామని బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు.