మద్యం తాగొద్దని చెప్పాలి కానీ, బ్రాండ్ల గురించి మాట్లాడతావా? అంబటి రాంబాబు
posted on May 5, 2020 @ 4:40PM
ఇలాంటి ఆపద సమయంలో ధరలు పెంచడం మంచిదా? అని చంద్రబాబు అంటున్నారు. మద్యం ఏమైనా నిత్యావసర వస్తువా? చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ మద్యం తాగొద్దంటూ ఉద్యమం చేయండి. అంతే తప్ప మద్యం ధరలు పెంచారంటూ, బ్రాండ్లు బాగాలేవంటూ ఉద్యమాలు చేయకండంటూ అంబటి ఘాటుగా స్పందించారు. బ్రాండ్ల గురించి మాట్లాడుతూ నీచ సంస్కృతికి దిగజారుతారా? అయినా, చంద్రబాబు బాధ ఏంటో అర్థం కావడంలేదు. ప్రజలకు మద్యం అలవాటు చేసిందే చంద్రబాబు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు" అంటూ విమర్శలు గుప్పించారు.
ప్రజలకు మద్యం అలవాటు చేసిందే చంద్రబాబు అన్న విషయం ఆంధ్రప్రజలందరికీ తెలుసని అంబటి రాంబాబు గుర్తు చేశారు. దక్షిణాదిన ఏ రాష్ట్రం కూడా మద్యం దుకాణాలు తెరవలేదని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు.
ప్రజలు మద్యం తాగొద్దని చెప్పకుండా, బ్రాండ్ల గురించి మాట్లాడడం ఏంటని అంబటి మండిపడ్డారు. కేంద్రమే మద్యం అమ్మకాలపై నిర్ణయం తీసుకుంది. కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు.
తమ ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మద్యం రేట్లు పెంచడం ద్వారా డబ్బున్న వాళ్లు మాత్రమే తాగే పరిస్థితులు తీసుకువస్తామని, క్రమంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు.