తెలంగాణ పై మళ్ళీ అదే వాదన !

తెలంగాణా "మిగులు ఆదాయా''న్ని (సర్ ప్లస్) తెలుగు సోదరులు మింగారా? మళ్ళీ అదే వాదన !

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

పాడిందే పాడటం కొందరికి వదిలించుకోడానికి వీలుకాని అలవాటు. అలాగే, తెలంగాణా "మిగులు'' ["సర్ ప్లస్'']ను రాష్ట్రంలోని మిగతా రెండు ప్రాంతాలవారూ మింగేసి తెలంగాణాకు తొంటిచెయ్యి చూపుయాన్నారన్న అపవాదును మరోసారి కొందరు తెరపైకి తెస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ఫలితంగానే తెలంగాణాలోని తెలుగుప్రాంతాలూ, ఆంధ్రలోని తెలుగుప్రాంతాలూ కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి తెలుగుజాతంతా సమైక్యం కావడం సాధ్యమయింది. ఇది చారిత్రిక సత్యం. ఈ రెండు తెలుగుప్రాంతాల విలీనీకరణ సందర్భంగా, అప్పటికి మొగలాయిల (ముస్లీం) పరాయిపాలనలో విద్యకు, ఆరోగ్యానికి, సామాజికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికీ మాతృభాషగా తెలుగు వాడకానికి నోచుకోని ఫలితంగా బ్రిటిషాంధ్రటో పోల్చినప్పుడు తెలంగాణా వెనుకబడి ఉన్నందున దానికి రక్షణలు కల్పిస్తూ విశాలాంధ్ర ఏర్పాటుకు ముందు "పెద్దమనుషుల ఒప్పందం'' కుదిరింది. దానికి తగినట్టుగా నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయప్రాంతాల నాయకుల మధ్య "మాట'' ప్రకారం ఆ రక్షణలు క్రమంగా అమలులోకి వచ్చాయి; ఒప్పందం అమలులో క్షేత్రస్థాయిలో కొన్ని ఒడిదుడుకులూ జరిగి ఉండవచ్చు. కాని అవి క్రమంగా తొలగిపోతూ వస్తున్నాయి. అయితే "పెద్దమనుషుల ఒప్పందం'' పైన సంతకాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరుప్రాంతాలకు చెందిన మంత్రులూ, కడచిన 56 ఏళ్ళుగానూ ఉన్నందున, ఒకవేళ "ఒప్పందం' అమలులో ఒడిదుడుకులు జరుగుతున్నప్పుడు, వాటిని పసికట్టి తొలగించవలసిన బాధ్యత ఉభయప్రాంతాల మంత్రులకూ ఉండాలి.

 

దేశానికి స్వాతంత్ర్య (1947 ఆగస్టు) ప్రకటన జరిగిన తరువాత రెండేళ్ళ దాకా [1950 జూన్ వరకు] తెలుగువారి తెలంగాణా ప్రాంతం నిజాం పాలకుల నిరంకుశ రాజ్యంలో భాగంగానే ఉంటూ వచ్చింది. ఎటుతిరిగీ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాల చాటున ప్రవేశించిన యూనియన్ సైన్యాల రాకతో ఈ ప్రాంతానికి పూర్తిగా నిజాం పాలననుంచి రాజకీయ విమోచనం లభించింది. 1952 జనవరిలో దేశపు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా మొదటిసారిగా ఎన్నికల కోలాహలం చెలరేగింది.అందులో కాంగ్రెస్ ఒక పక్షంగాను, జయసూర్య నాయకత్వంలో కమ్యూనిస్టులు "ప్రజాతంత్ర ప్రజాస్వామ్య ఐక్యసంఘటన'' (పి.డి.ఎఫ్.)గా ఏర్పడి సంయుక్త ప్రతిపక్షంగా ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో 1952 మార్చిలో హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వం ఏర్పడింది.


బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 1956 అక్టోబర్ ఆఖరిదాకా కొనసాగింది. కాగా 1955లో ఒకే భాషాసంస్కృతులు గల జాతి ప్రాతిపదికగా ఐక్య రాష్ట్రం ఏర్పడాలని తెలుగుప్రాంతాలన్నిటా ఆందోళన సాగింది. ఫలితంగా కేంద్రం ఈ సమస్యపైన ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఫజల్ ఆలీ కమీషన్ ను ఏర్పరచింది. ఈ కమీషన్ అభిప్రాయ సేకరణ తర్వాత నివేదిక సమర్పిస్తూ "భట్టిప్రోలు పంచాయితీ'' ధోరణిలో రెండు పరిష్కారాలు పరస్పరవిరుద్ధంగా సూచించింది. (1) తెలుగుప్రాంతాలన్నింటి ప్రగతికోసం, భవిష్యత్తులో వాటి భద్రతకోసం అవి విశాలాంధ్రగా ఏర్పడడం అన్నివిధాలా మంచి పరిష్కారమవుతుంది. (2) కాని, తెలంగాణా ప్రాంతంలో కొందరి అభిప్రాయం ప్రకారం "తెలంగాణా ప్రాంతం వెనుకబడినదిగా ఉండుటచే'' [మందుముల నరసింగరావు: "50 సంవత్సరాల హైదరాబా''దు] ప్రత్యేక రాష్ట్రంగా ఉండవచ్చునని కోరుకుంటున్నారు, అని కమీషన్ తెల్పింది. అలా కొందరు నాయకులు [వారిలో ప్రముఖులు బడా భూస్వాములయిన కొండా వెంకటరెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి] వెలిబుచ్చిన కోరిక నెరవేరనప్పుడు 1956లో "తెలంగాణా ప్రత్యేక రక్షణలు'' ఆధారంగా ఏర్పడిందే "ఆంధ్రప్రదేశ్''. నిజానికి అప్పటికి, అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరేళ్ళ నాటికి విశాలాంధ్రలో అంతర్భాగమైన ఒక్క తెలంగాణా ప్రాంతమేగాక యావత్తు దేశంలోనూ అంతవరకూ భూస్వామ్యవ్యవస్థ కారణంగానూ, బ్రిటిష్ వాడి పరాయి పాలనవల్లనూ అనేక వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మన ఇరుగుపొరుగైన మైసూర్, మహారాష్ట్రలు కూడా ఉన్నాయి.



కాని హైదరాబాద్ (స్టేట్) రాష్ట్ర శాసనసభలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు ఐక్య కర్నాటక, సంయుక్త మహారాష్ట్రల ఏర్పాటుకు పూర్తీ మద్ధతు పలుకగా [అప్పటికి ఆ ప్రాంతాలూ బాగా వెనుకబడి ఉన్నవే] తెలుగు మాట్లాడే తెలుగు ప్రజాప్రతినిధులయిన సభ్యులు కొందరిలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ భిన్నాభిప్రాయానికి నాయకత్వం అనేక దశాబ్దాల తరబడిగా తెలంగాణా ప్రజాబాహుళ్యాన్ని పీల్చి పిప్పి చేసిన నిజాం, అతనికి తోడుగా భూస్వామ్య, బడాజాగీర్ధారీ, 'దోర'లకు సంబంధించిన ప్రతినిధులే కావడంవల్ల స్వార్థ ప్రయోజనాల కోసం విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ పరిస్థితి కర్నాటక, సంయుక్త మహారాష్ట్రలకు లేదు. అందుకే, ఈ భూస్వామ్యవర్గ నాయకులే [తెలంగాణా సాయుధ పోరాట అగ్రగాములలో ఒకరైన భీమిరెడ్డి నరసింహారెడ్డి అన్నట్టుగా] "తెలుగుజాతి ఐక్యతకు వ్యతిరేకులుగాని తెలంగాణా ప్రజలు మాత్రం కార''నీ అప్పటికీ, ఇప్పటికీ రుజువవుతున్న సత్యం! అందుకే ఆలోచనాపరుడైన ఆనాటి శాసనసభ్యుడు ఎల్.ఎన్. రెడ్డి ఫజల్ ఆలీ కమీషన్ నివేదికను ప్రస్తావిస్తూ "ఈ కమీషన్ కూడా అటు పూర్తిగా విశాలాంధ్రకు మద్ధతు తెల్పకుండాను, ఇటు ప్రత్యేక తెలంగాణాకు వందశాతం అనుకూలంగా సిఫారసు చేయకపోవటం కూడా పరిస్థితిని క్లిష్టం చేసిందని చెప్పాలి'' అని వ్యాఖ్యానించవలసి వచ్చింది [02-04-1956]


సరిగ్గా ఈ అస్తుబిస్తు పరిస్థితులలోనే, తెలంగాణా గతంలో ఎప్పుడూ 'సర్ ప్లస్'' (మిగులు బడ్జెట్ తో) ప్రాంతం ఉండేదనీ, కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఈ 'సర్ ప్లస్' కాస్తా తెలంగాణాకు దక్కనివ్వకుండా కోస్తాలో ఖర్చుపెట్టారన్న అపవాదును కొందరు సోదర తెలంగాణా మిత్రులు ముందుకు నెడుతూ వచ్చారు. ఇంతకూ ఆ "కొందరు'' మాత్రమే పదేపదే పేర్కొంటున్న "తెలంగాణాకు ఉంటూ వచ్చిన సర్ ప్లస్ ఆదాయం'' ఎలా పేరుకుంది? ఎందుకు పేరుకుంది? అందుకు కారకులెవరు? ఒకవైపున తెలంగాణా ప్రాంతం నిజాంపాలన మూలంగా "దారుణమైన వెనుకబాటు తనా''న్ని అనుభవిస్తూ వచ్చిందని చెబుతున్నవారు, ఆ వెనుకబాటుతనాన్ని తొలగించడానికి నిధులు ఉపయోగించి ఉన్న పక్షంలో "సర్ ప్లస్'' బడ్జెట్ మిగిలేది కాదుగదా! ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి "ఆంధ్రప్రాంతం ఆదాయం తరుగులో'' ఉంది కాబట్టి, తెలంగాణాకి జమకూడుతూ వచ్చిన మిగులు ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దరిమిలా కోస్తావాళ్ళు మింగేశారన్న ఆరోపణ సరైనది కాదు! ఎందుకంటే వెనుకబాటుతనానికి రెండు ముఖాలుంటాయి : (1) ఉన్న మిగులును ఎలాంటి ప్రజాసంక్షేమ పథకాలకు ఖర్చు చేయకుండా ఉన్నందువల్ల, లేదా (2) సంబంధిత ప్రాంతంలో ప్రజాహిత పథకాలను అమలు జరగకుండా స్వార్థప్రయోజనాలను ఆశించే పాలకుల వల్లనూ. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, అంటే, 1956 నుంచి 2008 వరకూ కడచిన గత 56 సంవత్సరాలలోనూ విశాలాంధ్ర ఏర్పడిన తరువాత సోదర తెలంగాణా ప్రాంతంలో దాదాపు అన్నిరంగాలలోనూ [విద్య, వైద్య, పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల, వాహనాల పెరుగుదలలో, పారిశ్రామిక, వ్యవసాయక వగైరా రంగాలలో] సుమారు 130 శాతంనుంచి 300 శాతం దాకా అభివృద్ధి నమోదైనదని సాధికారిక గణాంకాలు నిరూపిస్తున్నాయి! వాటిని కాదని ప్రత్యామ్నాయ వాదనలతో వాస్తవాలతో వేర్పాటువాదులు ఇంతవరకూ ముందుకు రాలేదు. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొందరు వేర్పాటువాదులు "మాకు లెక్కలువద్దు, ప్రత్యేక రాష్ట్రం'' మాత్రమే కావాలన్న మొండివాదనకు గజ్జెకట్టారు! ఏ ప్రజాహితమైన పనులమీదా ఖర్చు చేయనప్పుడు, "రూపాయి ఖర్చుకాకూడదు, బిద్దమాత్రం దుత్తల్లే ఉండాలి'' అన్నట్టుగా "మిగులు బడ్జెట్'' మిగులుగానే ఉండక తప్పదుకదా! స్కూళ్ళు, కాలేజీలు, ఆస్పత్రులు, తదితర ప్రజాహిత పథకాలను నిజాం ప్రభువులు గ్రామసీమల అభివృద్ధికోసం ఖర్చుపెట్టకుండా ఉన్నందుననే ఆ మిగులు తేలింది; కాని తన భోగవిలాసాలకు మాత్రం కొదవలేదు!ఖర్చు చేయనప్పుడు ఒక చోట మిగులు మరొక చోట కొరతకు కారణమవుతుంది!


1956 నుంచి 2008 వరకూ తేలిన "అభివృద్ధి'' గణాంకాల ప్రకారం చూసినప్పుడు, తెలంగాణా "మిగులును'' కోస్తాఆంధ్రలో వాడేసుకున్న మాటే నిజమయితే, సోదర తెలంగాణలో 130 శాతంనుంచి సుమారు 300 శాతం దాకా అభివృద్ధి ఎలా సాధ్యమో "సర్ ప్లస్'' వాదులు వివరించగలగాలి! తెలంగాణా నాయకులలో ఒకరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మందుముల నరసింగరావు హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను రెండవ ప్రపంచయుద్ధానికి ముందూ, ఆ తరువాతా (1939 నుంచి 1948 దాకా) పరిస్థితిని చర్చిస్తూ హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు క్రమంగా ఎలాంటి సంకతంలోకి వెళ్ళాయో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు "తారుమారైపోయిన హైదరాబాద్ స్థితిగతుల''ను తన "50 సంవత్సరాల హైదరాబాదు'' గ్రంథంలో [''ఎమెస్కో'' ప్రచురణ : 2012] యిలా వివరించారు: యుద్ధానికి ముందు "గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ బడ్జెట్ మిగులుగానే ఉండేది. రాష్ట్రప్రభుత్వ ఆదాయపు పద్దులలో అంతవరకూ ఎలాంటి మార్పూ లేదు కూడా. కాని - దిగుమతి, ఎగుమతి వ్యాపారం సన్నగిల్లడం, రాకపోకల సౌకర్యాలు తగ్గటం వలన పరిస్థితులు కూడా చాలా తారుమారైనవి. (తెలంగాణాకు) బర్మానుంచి బియ్యం రావటంలేదు. కొన్ని జిల్లాల్లో క్షామపరిస్థితులు ఏర్పడటం వలన, రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నవి. తిండిగింజలలోటు ఏర్పడింది. ధరలు రోజుకు రోజు పెరుగుచుండెను. వస్తువులు మాయం కావటం ఆరంభమైనవి. దొంగబజారు, నిలవపెట్టడం, అక్రమ లాభాలు సంపాదించడమనే పరిభాష మొదటి పర్యాయం హైదరాబాద్ రాష్ట్రంలో వాడుకలోకి వచ్చేసినది. ఆ పరిభాష అలాగే ఇప్పటివరకూ (యుద్ధానంతరం వరకూ) నిలిచిపోయినది''!

అంతేగాదు, అంతవరకూ హైదరాబాద్ రాష్ట్రంలో "ఆదాయంపైన పన్ను అనే విధానేమే లేద''నీ, బ్రిటిష్ పరిపాలిత సికింద్రాబాద్ భాగంలో మాత్రం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రెసిడెంట్, ఆదాయంపైన పన్ను వేశాడనీ, కాని హైదరాబాదులో మాత్రం ఆ పని చేయడం సులభం కాలేదనీ కూడా మందుముల రాశారు. ఈ సందర్భంలోనే ఆయన మన దేశీయ పాలకులను గురించి ఒక 'చెణుకు' విసిరారు " "మన దేశీయ  పాలకులు 20వ శతాబ్దంలో జీవిస్తూ 18వ శతాబ్దపు పరిభాషలో ఆలోచిస్తూ ఉంటార''ని! అక్షరసత్యం మరోమాటలో చెప్పాలంటే ఆదాయపుపన్ను లేని సమయంలో సమకూడిన "రెవెన్యూ మిగులు''ను చూసారు.


ఇటీవల మరొక గమ్మత్తు రాజకీయాన్ని కొందరు వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు ఆశ్రయించారు! ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద ఆర్ధిక, ప్రణాళికా శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమర్ధుడైన అధికారి బి.పి.ఆర్. విఠల్ కూడా తెలంగాణా "సర్ ప్లస్'' ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఖర్చుచేసిన పధ్ధతి గురించి తప్పుపట్టారని వేర్పాటువాదులు కొందరు ఉదాహరిస్తున్నారు. ఇందుకోసం, రాష్ట్ర సమైక్యతను సమర్థిస్తున్న విఠల్ కుమారుడైన ఆచార్య సంజయ్ బారును విమర్శించడం కోసం తండ్రీ-కొడుకుల వాదనల మధ్య తగాదా పెట్టాలని వేర్పాటువాదులు చూశారు. కాని బి.పి.ఆర్.. విఠల్ ఒకనాటి తెలంగాణా మిగులు (సర్ ప్లస్) ఆదాయం గురించి దఫదఫాలుగా "సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్'' అని ప్రచురించిన ["A state in periodic crisises : Andhra Pradesh''] గ్రంథంలో చర్చించన తీరువేరు, వేర్పాటువాదులు ఆ పేరిట చేస్తున్న వాదన వేరు! తెలంగాణా ప్రాంతంలోని సొంత ఆదాయవనరులకు సంబంధించిన "మిగులు''ను ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించలేదన్న ఫిర్యాదును ప్రస్తావిస్తూ విఠల్ చేసిన వ్యాఖ్య ఇక్కడ పరిశీలిచదగినది: "ఈ మిగులు రెవెన్యూలను అంచనా కట్టె పద్ధతీ, సదరు మిగుళ్ళను ప్రభుత్వం ఉపయోగించిన పద్ధతీ ఈ రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయాలలో దఫదఫాలుగా తలెత్తుతూ వస్తున్న సమస్యలు. అయితే, ఈ ప్రాంతీయ రాజకీయాలను అలావుంచి ఈ మొత్తం రెవెన్యూ మిగులు సమస్యను బడ్జెట్ రూపకల్పనకూ, రాజకీయాలకూ మధ్య ఒక సంబంధిత సమస్యగా అధ్యయనం చేయడానికి తగిన కేస్ స్టడీ'' కాగలదు! ఇంకా స్పష్టం చేయాలంటే - ఆర్ధిక సంబంధితమైన పాలనా వ్యవహారాలపైన శాసనవేదిక (లెజిస్లేచర్) అడుపాజ్ఞాలకు సంబంధించిన సమస్యగా దానిని అధ్యయనం చేయదగిన అంశం'' అని కూడా విఠల్ పేర్కొన్నారు! అంతేగాదు, ప్రాంతీయ రాజకీయాలనుంచి వివాదాలు తలెత్తి ఉండవచ్చు, కాని అంతమాత్రాన ద్రవ్య (ఆర్ధిక) పాలనకు చెందిన సమస్యల ప్రాధాన్యతనుంచి దృష్టి మళ్ళరాదనీ, ఇంతకూ మౌలికమైన సమస్యకు పునాది రాజకీయ ఒప్పందమనీ, ఇది రాజకీయ ఉద్యమం వల్ల మరింత జటిలమవుతుందనీ విఠల్ పేర్కొన్నాడు.


అధికారిగా ఆయన అంతకుమించి రాజకీయ నిరుద్యోగుల మాదిరిగా ముందుకు వెళ్ళలేడు! ఈ సమస్య చిలికి చిలికి గాలివానలాగా కేంద్రానికి, రాష్ట్రానికీ మధ్య సమస్యగా తలెత్తుతుందనీ, చివరికి దీనికి పరిష్కారమల్లా రాజ్యాంగ సవరణ మాత్రమేనానీ విఠల్ చెప్పారు. అందుకే ఒక రాజ్యంగబద్ధ సంస్థగా ఆంధ్రప్రదేశ్ శాసనసభే తెలంగాణా ప్రాంతీయ కమిటీని నాడు సాధికారికంగానే ఏర్పాటు చేసిందనీ, ఈ కమిటీ ఉన్నతకాలం, చట్టరీత్యా తనకు సంక్రమించిన అధికారాల పరిథిలో, ప్రభుత్వం చేసే ఖర్చుపైన చాలా శక్తిమంతంగా అర్థవంతంగా ఆజమాయిషీ చేస్తూ వచ్చిందని కూడా విఠల్ అన్నారు! ఈ కమిటీ ప్రస్తావించే సమస్యల వెనక రాజకీయ పూర్వరంగం ఉన్నప్పటికీ తెలంగాణా ప్రాంతీయ కమిటీ మాత్రం తన విశ్లేషణలో గాని, సమస్యను వివరించడంలో గానీ పక్కా వృత్తి సంస్థగానే వ్యవహరిస్తుందని విఠల్ అన్నారు! ఈ సమస్యను వివరిస్తూ విఠల్ గారు ఆరోపణలు చేసేవారినందరినీ ఒకగాటున కట్టకుండా ఏకీకరణ మూలంగా తెలంగాణా "రెవెన్యూ మిగులు''ను కోస్తాఆంధ్రులు వాడుకుంటారన్న ఆందోళనను "కొంతమంది తెలంగాణా నాయకులు'' వ్యక్తం చేశారని స్పష్టం చేయడం గమనార్హం. ఆ "కొందరు'' నాయకులు "అందరి నాయకుల''నీ కాదు, వారు మొత్తం తెలంగాణా ప్రజాబాహుళ్యం అభిప్రాయాలను ప్రతిబిందిస్తున్నారనీ అర్థం కాదు! ఇంతకూ ఆ 'సర్ ప్లస్'' ఆదాయం ఏది? తెలంగాణలో వసూలయ్యే భావిస్తూ, ఎక్సైజ్ (ఆబ్కారీ) ఆదాయమూ. ఇది ఏడాదికి రూ.5 కోట్లు, ఆనాటికి రాష్ట్రాల పునర్వవస్థీకరణ (ఫజల్ ఆలీ) కమిటీ రాష్ట్రంగా ఏర్పడిన "ఆంధ్రరాష్ట్రం కొంతమేర ఆర్ధిక సమస్యను ఎదుర్కొంటూ వచ్చింద''నీ చెప్పిందేకాని ఆ "కొంత'' ఎంతో స్పష్టం చేయకుండా వదిలేసి కూర్చుంది! అలాగే మద్రాసునుంచి విడిపోయి ఏర్పడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో "తలసరి ఆదాయం తక్కువ''ని చెప్పిందేగాని, ఆ "తక్కువ'' ఎంతో గణాంకంలో తెలపకుండా చల్లగా జారుకుంది! కాని అనుమానాలు మిగిల్చి రెండు ప్రాంతాల మధ్య మనస్సులను చెడగొట్టడానికి ప్రయత్నించింది, ఇక "పెద్దమనుషుల ఒప్పందా''న్ని అమలు జరిపించుకునే బాధ్యతనుంచి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని తెలంగాణా మంత్రులు తప్పుకుని పదవులను మాత్రం అనుభవిస్తూ వచ్చారు!



- [ మరిన్ని వివరాలు వచ్చే వ్యాసంలో]

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.