40 దేశాలకు హైదరాబాద్ వ్యాక్సిన్! కొవాగ్జిన్ కు భారీగా డిమాండ్
posted on Mar 5, 2021 9:28AM
దేశీయంగా తయారైన కోవిడ్ వ్యాక్సిన్ కు భారీగా డిమాండ్ వస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ కోసం ప్రపంచ దేశాలన్ని ఎగబడుతున్నాయి. కోవాగ్జిన్ టీకా కోసం దాదాపు 40 దేశాలు తమను సంప్రదిస్తున్నాయని భారత్ బయోటెక్ ప్రకటించింది. నెలకు 4 కోట్ల డోస్ లను తయారు చేసేలా సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం మూడవ ప్లాంటును కూడా భారత్ బయోటెక్ సంస్థ నిర్మిస్తోంది.
కొవాగ్జిన్ ను తమకు సరఫరా చేయాలని కోరుతున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బ్రెజిల్- భారత్ బయోటెక్ మధ్య డీల్ కుదరగా, తాజాగా ఫ్రాన్స్ కూడా ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న ఫ్రాన్స్ లో నివాసులందరికీ టీకాను ఇవ్వాలని ఇప్పటికే ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తక్కువ ధరలో లభిస్తూ, సత్ఫలితాలను ఇస్తున్న కొవాగ్జిన్ అయితే ఉత్తమమని భావిస్తోంది.ఇండియాలో ఫ్రాన్స్ రాయబారిగా పనిచేస్తున్న ఎమ్మాన్యుయేల్ లేనేయిన్ ఇటీవలే హైదరాబాద్ కు వచ్చి భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లను కలిసి చర్చించారు కూడా. అయితే ఫ్రాన్స్ ప్రస్తుతం ఈయూ (యూరోపియన్ యూనియన్)లో భాగస్వామిగా ఉండటంతో.. ఏ దేశానికి టీకా రావాలన్నా యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ అనుమతి తప్పనిసరి. దీంతో ఈఎంయూ అనుమతి కోసం ఫ్రాన్స్ వేచిచూస్తోంది.
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 81 శాతం సామర్థ్యాన్ని కలిగివుందని మూడవ దశ క్లినికల్ పరీక్షల తరువాత వెల్లడైంది. ఇప్పటికే అత్యవసర వినియోగానికి ఈ టీకాకు అనుమతులు లభించగా, త్వరలోనే పూర్తి స్థాయి అనుమతులు కూడా వస్తాయని సమాచారం. అనుమతులు లభిస్తే ఇండియాలో భారీ ఎత్తున సరఫరా చేయడంతో పాటు.. టీకాను విదేశాలకు ఎగుమతి చేయాలని కూడా భారత్ బయోటెక్ భావిస్తోంది. మార్చి 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్నారు.