భారత్ లో 18 కోట్ల మందికి కరోనా సోకింది.. ప్రముఖ సంస్థ షాకింగ్ రిపోర్ట్
posted on Jul 22, 2020 @ 4:05PM
మనదేశం లో కరోనా ఉధృతి తీవ్రంగానే ఉంది. ప్రతి నిత్యం రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 12 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు గా తెలుస్తోంది. ఐతే 12 లక్షలు కాదు.. ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు 18 కోట్ల మందికి కరోనా సోకి ఉండవచ్చని థైరో కేర్ ల్యాబ్స్ అనే ప్రయివేట్ డయాగ్నస్టిక్స్ సంస్థ సంచలన రిపోర్టును బయటపెట్టింది. మన దేశంలో ఇప్పటికే 15 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని తమ అధ్యయనం ద్వారా తేలిందని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ వేలుమణి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రఖ్యాత డయాగ్నస్టిక్స్ సంస్థ అయిన థైరో కేర్ ల్యాబ్స్ దేశవ్యాప్తంగా 600 పిన్కోడ్స్లో సుమారు 60వేల మంది పై యాంటి బాడీ పరీక్షలు చేసింది. ఇందులో యావరేజ్ గా 15 శాతం మంది ప్రజల లో యాంటీ బాడీలు కనిపించాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. మన శరీరంలో కరోనా వైరస్ ప్రవేశిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారవుతాయి. దీని ఆధారంగా టెస్టులో యాంటీబాడీలు కనిపించాయంటే వారికి కరోనా సోకినట్లేనని నిపుణులు చెబుతున్నారు. మన దేశం మొత్తంగా 15 శాతం అంటే దాదాపు 18 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుందని థైరో కేర్ సర్వే తెలిపింది. ఐతే దీనికి 3 శాతం అటూ ఇటూగా వాస్తవ పరిస్థితులు ఉండవచ్చని ఆ సర్వే వెల్లడించింది.
ఇదే సర్వేలో హైదరాబాద్లోని వివిధ పిన్ కోడ్లలో పరిస్థితి ఈ విధంగా ఉంది. 500002,500060,500036,500026 పిన్కోడ్ కలిగిన ప్రాంతాల్లో వరుసగా 37.3 శాతం, 30.6శాతం, 23.5శాతం, 23.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయని ఆ సంస్థ సర్వే రిపోర్టులో పేర్కొన్నారు.