ఏపీలో మరో ఘోరం... ఆక్సిజన్ అందక 11 మంది మృతి
posted on May 11, 2021 @ 9:45AM
ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మహా విషాదం చోటు చేసుకుంది.ఆక్సిజన్ అందక...11 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 11 మంది చనిపోయారని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. కాని మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చునని, కనీసం పాతిక మంది చనిపోయి ఉంటారని వివిధ వర్గాలు చెబుతున్నాయి.
తిరుపతిలోని రుయా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ప్రభుత్వం జిల్లాస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఆవరణలోనే 11వేలలీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. దీని నుంచే రుయా ఆస్పత్రిలోని వెంటిలేటర్, ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లకు ప్రాణవాయువు సరఫరా అవుతుంది. సోమవారం సాయంత్రం 6 - 7 గంటల సమయానికి ట్యాంకులో ఆక్సిజన్ నిల్వలు అయిపోయే అవకాశముందని సిబ్బంది ముందుగానే అధికారులకు చెప్పారు. దానికనుగుణంగా తమకు ఆక్సిజన్ సరఫరా చేసే చెన్నైకి చెందిన లిండేన్ కంపెనీకి సమాచారం అందించారు. చెన్నైలో సాయంత్రం 4 గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్ బయల్దేరింది. నిబంధనల ప్రకారం ఆక్సిజన్ ట్యాంకర్ గంటకు 40 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణించవద్దు. దీంతో... అది తిరుపతికి చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
రాత్రి 7 గంటలకు ట్యాంకులో ఆక్సిజన్ నిల్వలు 3 కేఎల్కు పడిపోయాయి. దీంతో సరఫరాకు సరిపడా పీడనం అందలేదు. ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా గ్రౌండ్ ఫ్లోర్లోని సాధారణ ఆక్సిజన్ బెడ్లు, మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో ఉన్న వెంటిలేటర్ బెడ్లపై చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో 51మంది చికిత్స పొందుతున్నారు. వీరిలోనే ఎక్కువమంది చనిపోయారు.
ఆ అరగంటలోనే...: సోమవారం రాత్రి 7 గంటలకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా... నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి అధికారులు, సిబ్బంది సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. 7.45 గంటలకు చెన్నై నుంచి వచ్చిన ట్యాంకర్తో ఆస్పత్రిలోని ట్యాంకును నింపి.. సరఫరాను యథాతథ స్థితికి తీసుకొచ్చారు. కానీ... ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగిన 15-30 నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది.
తమ వారు కళ్ళెదుటే ఆక్సిజన్ అందక గిలాగిలా కొట్టుకుంటూ విగత జీవులుగా మారడంతో బాధితుల బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులను, సిబ్బందిని, ప్రభుత్వాన్ని నిందిస్తూ... వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. భయంతో వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.రుయాస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల 11మంది చనిపోయారని కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించారు. రాత్రి 10.45కు ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో 700 మందికి ఆక్సిజన్ పడకలపై చికిత్స అందిస్తున్నారని, ఐదు నిమిషాలు ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల కొంతమంది చనిపోయారన్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు రావడంతో చాలా ప్రాణాలను రక్షించగలిగామన్నారు.