ఆక్సిజన్ లేక చనిపోవడం అవమానకరం!
posted on Apr 29, 2021 @ 2:40PM
కొవిడ్ వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరా, రెమ్డెసివివర్ మందుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళికే లేదన్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కేంద్రంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుందని బీజేపీ నేతలకు సూచించారు రాజేందర్.
తెలంగాణలో 4 రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని ఈటల తెలిపారు. కరోనా కట్టడిలో దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ర్టం తెలంగాణ అని స్పష్టం చేశారు. సాయం చేసే స్థితి నుంచి చిన్న దేశాల సాయం పొందే పరిస్థితి భారత్కు వచ్చిందని ఈటల రాజేందర్ అన్నారు. కరోనా రోగులు సరిపడా ఆక్సిజన్ లేక చనిపోవడం దేశానికి అవమానకరం అని మంత్రి ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. అవసరమైన ఆక్సిజన్ను కేంద్రం యుద్ధ ప్రతిపాదికన సరఫరా చేయాలన్నారు. తెలంగాణకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని కోరితే.. కేవలం 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను మాత్రమే కేటాయించిందని చెప్పారు. దగ్గర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ఇవ్వాలని కోరినప్పటికీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ను కేటాయించడం ఏంటని ఈటల ప్రశ్నించారు.
కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని మంత్రి ఈటల డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి యుద్ధ ప్రతిపాదికన పెరగాలన్నారు.వ్యాక్సిన్ లేకపోతే గందరగోళమవుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ర్టంలో 18-44 ఏండ్ల మధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలి. రెండు కంపెనీల ఉత్పత్తి 6 కోట్లే అంటున్నారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలి అని ఈటల డిమాండ్ చేశారు.
రాష్ట్రాలకు తప్పుబడుతున్న కేంద్రం ఏం చేసిందని ఈటల ప్రశ్నించారు. రెమ్డెసివివర్ తక్కువకు తయారు చేసి ఎక్కువకు అమ్ముతున్నా కేంద్రం నియంత్రించడం లేదన్నారు. ఔషధాలు బ్లాక్ మార్కెట్కు పోకుండా చూడాలన్నారు. కరోనా టెస్టింగ్ కిట్ల ధరలు కూడా పెంచారని, కేంద్రానికి అన్నింటిపైనా నియంత్రణ ఉండాలన్నారు. మూడున్నర కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం.. దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అని ఈటల అడిగారు. జాతీయ విపత్తు సమయంలో కేంద్రం అన్నింటినీ నియంత్రణ చేయలేదా? అని మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నల వర్షం కురిపించారు.