అంతర్వేది వద్ద సముద్రం వెనక్కి.. సంకేతమేంటి?

కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అనూహ్యంగా 500 మీటర్ల మేర వెనక్కు తగ్గింది. సోమవారం (సెప్టెంబర్ 29)న ఒక్కసారిగా సముద్రం వెనక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిత్యం ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతూ ఉండే అంతర్వేది తీరంలో సముద్రం వెనక్కు తగ్గడం దేనికి సందేశం అన్న చర్చ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.    సముద్రం దాదాపు అరకిలోమిటరు మేర వెనక్కు వెళ్లడం పట్ల   మత్స్యకారులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సునామీ వంటి ప్రకృతి విపత్తు ముందు సముద్రం ఇలా వెనక్కి వెడుతుందని అంటున్నారు.

 సముద్రం గోదావరి కలిసే సంగమ స్థలంగా అంతర్వేది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అంతర్వేదిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మహిమాన్విత దేవుడిగా భక్తులు కొలుస్తుంటారు. అలాగే అంతర్వేది తీరం, సంగమ ప్రాంతం కూడా కావడంతో ఇక్కడికి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అటువంటి అంతర్వేదిలో సముద్రం వెనక్కు వెళ్లి మట్టి మేటలు వేసింది. సాధారణంగా సముద్రం వెనక్కు వెళ్లినప్పుడు ఇసుక మేటలు ఏర్పడతాయనీ, అయితే అసాధారణంగా మట్టిమేటలు ఏర్పడటం భయంగొల్పుతోందనీ స్థానికులు చెబుతున్నారు.  ఆటు సమయంలో సముద్రం వెనక్కు వెళ్లడం సర్వసాధారణమే అయినా ఇంతగా అంటే అరకిలోమీటరకు పైగా వెనక్కు వెళ్లడం అన్నది ఇదే తొలిసారని అంటున్నారు.   

కాగా అంతర్వేది వద్ద సముద్రం వెనక్కు వెళ్లడంపై స్పందించిన అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.  టెక్నాలజీ అప్లికేషన్ ఫర్ వెదర్ మానిటరింగ్)  జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా  బృందాలు ఇక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నాయి.  

తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాలు...కేంద్రం కీలక నిర్ణయం

  తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జల సంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.  కమిటీలో సభ్యులుగా కృష్ణా-గోదావరి బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు స్థానం కల్పించారు. కమిటీలో ఏపీ నుంచి నలుగురికి, తెలంగాణ నుంచి నలుగురికి చోటు కల్పించారు. నదీ జాల వివాదాల పరిష్కరానికి కమీటీని జల్‌శక్తి శాఖ నోటీపై చేసింది.  కాగా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన గత జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు తెలుగు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులను నియమించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదస్పదమైన పోలవరం-బనకచర్ల/నల్లమల్ల సాగర్‌ ప్రాజెక్టుతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది.  

తెలంగాణలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు

  తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు  ఊహించని స్థాయికి చేరాయి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 1,350 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గణాంకాల్లో నమోదైంది. ముఖ్యంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో మాత్రమే ₹750 కోట్ల మేర మద్యం అమ్ముడుపోవడం విశేషం. కేవలం ఆరు రోజుల్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగడంతో అధికారులు ఆశ్చర్య చకితులయ్యారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు జనంతో కిటకిటలాడాయి. ఏ మద్యం షాపు, బార్ల ముందు చూసిన కూడా భారీ క్యూలు, రద్దీ ఉన్న దృశ్యాలే కనిపించాయి.   మద్యం దుకాణాల ద్వారా భారీ విక్రయాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల ద్వారా సుమారు 8.3 లక్షల ఐఎంఎఫ్ఎల్  కేసులు, 7.78 లక్షల బీర్ కేసులు విక్రయమైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీర్ విక్రయాల్లో 107 శాతం పెరుగుదల నమోదు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. నగర యువత, ఐటీ ఉద్యోగులు, న్యూ ఇయర్ పార్టీల కారణంగా బీర్ డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నాయి. ఇక కేవలం డిసెంబర్ నెల మొత్తాన్ని పరిశీలిస్తే, రాష్ట్రంలో మొత్తం మద్యం విక్రయాలు ₹5,102 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే డిసెంబర్ నెలలో ఈ విక్రయాలు ₹3,500 కోట్లుగా మాత్రమే ఉండగా, ఈసారి భారీగా పెరగడం గమనార్హం. ఇది ప్రజల ఖర్చు ధోరణిలో వచ్చిన మార్పును, అలాగే పండుగలు–వేడుకల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి అగ్రస్థానం మద్యం విక్రయాల్లో రెండు జిల్లాలు ఫోటా పోటీగా పోటీ పడ్డాయి.. లిక్కర్ అమ్మకాలలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. కార్పొరేట్ సంస్కృతి, నైట్ లైఫ్, పెద్ద సంఖ్యలో పార్టీలు జరగడం వల్ల ఈ జిల్లాల్లో విక్రయాలు అత్యధికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న మద్యం దుకాణాలకు అర్ధరాత్రి వరకు, బార్లకు రాత్రి 1 గంట వరకు పనిచేసేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయమే విక్రయాలపై కీలక ప్రభావం చూపిందని అధికారులు అంచనా వేస్తున్నారు. సరఫరా పరంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప సమస్యలు తలెత్తినా, సరిపడా నిల్వలు, ప్రత్యేక తనిఖీలు, అదనపు సిబ్బంది ఏర్పాటు చేయడం వల్ల విక్రయాలు సజావుగా జరిగాయని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు వ్యాపారం ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తెలంగాణలో మద్యం విక్రయాలు రూ.34,600 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా అధికం కావడం రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం తీసుకొస్తోంది. మొత్తంగా చూస్తే, న్యూ ఇయర్ వేడుకలు తెలంగాణ మద్యం మార్కెట్‌కు బూస్ట్‌గా మారాయని, రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

వీవీఐపీ, వీఐపీ దర్శనాలకూ టికెట్లు!

విజయవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గుడి ఆదాయానికి గండి కొడుతున్న వీఐపీ, వీవీఐపీ దర్శనాలకూ ఇక నుంచి టికెట్ తప్పని సరి చేశారు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి నిత్యం మూడు వందల మంది వరకూ వీఐపీలు, వీవీఐపీలు వస్తుండటం, వారందరికీ ఉచిత దర్శనాలతో దుర్గ గుడి ఆదాయానికి భారీగా గండిపడుతోందని భావించిన ఆలయ అధికారులు ఇక నుంచి ఈ విధానానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు.   అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు. నిత్యం వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారు. సాధారణ రోజుల్లో  30 వేల మంది,  వారాంతాల్లో  50 వేల వరకు దుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వస్తారు. వీరిలో రోజుకు మూడు వందల మంది వరకూ వీఐపీ, వీవీఐపీలు ఉంటారు. వీరంతా ఉచితంగానే ఎటువంటి టికెట్ తీసుకోకుండా  దుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. ఈ విషయంపై ఆలయ ఈవో స్పందించారు. ఇకపై  ఈ పద్ధతికి అడ్డుకట్ట వేయాలని  భావించి, ఆ మేరకు ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానాన్ని ముందుగా ధర్మకర్తల మండలి సభ్యుల నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. 

యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక మలుపులు

  హిందూ దేవతలను కించపరిచే విధంగా వీడియో కంటెంట్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్‌పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారా లను సేకరించేందుకు పోలీసులు సోషల్ మీడియా సంస్థలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పంజా గుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి అధికారిక లేఖ రాశారు. యూట్యూబర్ అన్వేష్ దేవుళ్లపై చేసిన వివాదాస్పద వీడియోలకు సంబంధించిన కంటెంట్ లింకులు, అన్వేష్‌కు చెందిన యూజర్ ఐడీ, అకౌంట్ వివరాలు, వీడియోలు అప్‌లోడ్ చేసిన తేదీలు, ఐపీ అడ్రస్ సమాచారం వంటి కీలక వివరాలను అందిం చాలని కోరారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ సంస్థ నుంచి స్పందన కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి పూర్తి సమాచారం అందిన వెంటనే అన్వేష్‌పై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచా రణలో అన్వేష్ విదేశాల్లో నివసిస్తూ భారతీయ చట్టా లకు విరుద్ధంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. భారతదేశంలో మత విశ్వా సాలు, ప్రజాభావాలను దెబ్బతీసే విధంగా కంటెం ట్‌ను ప్రసారం చేయడం తీవ్రమైన నేరమని పోలీ సులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే వారికి కఠిన చర్యలు తప్ప వని పోలీసులు హెచ్చరిస్తు న్నారు. అన్వేష్ వీడియోలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హిందూ సంఘాల నాయకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు అందజే శారు. హిందూ దేవతలపై అభ్యంత రకర వ్యాఖ్యలు చేసి మత భావాలను కించపరిచారని ఆరోపిస్తూ అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఈకేసుకు కీలకంగా మారింది. ఆమె ఫిర్యాదులో అన్వేష్ వీడి యోలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, హిందూ సమాజాన్ని అవమా నపరిచేలా ఉన్నాయని కరాటే కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను సహించ బోమని పోలీసులు స్పష్టం చేశారు. దేశంలో ఉన్న చట్టాలు అందరికీ సమానమని, విదేశాల్లో ఉన్నా కూడా చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొ న్నారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి సమాచారం అందిన తరువాత అవసరమైతే లుక్‌ఔట్ నోటీసులు, అంతర్జాతీయ సహకారం దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగు తున్న నేపథ్యంలో ఇంకా సోషల్ మీడియాలో వివాదాస్పద కంటెంట్‌పై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

మావోయిస్టు కీలక నేత బర్సే దేవా లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.   మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పని చేస్తున్న బర్సే దేవా  పోలీసుల ఎదుట లొంగిపోయారు. బర్సే దేవా తెలంగాణ డీజీపీ  శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం (జనవరి 2) లొంగిపోయాడు. మావోయిస్టు అగ్రనేత హెడ్మా  ఎన్ కౌంటర్  తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో  మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే  హైడ్మా,  బర్సే దేవా  ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలోని  ఒకే గ్రామానికి చెందినవారు. ఇరువురూ కూడా దాదాపు ఒకే సమయంలో మావోయిస్టు పార్టీలో చేరారు. ఇరువురూ కూడా పార్టీకి ఆయుధాల సరఫరా, ఆయుధాల వ్యవహారం, గెరిల్లా పోరాట పంథాలో ఆరితేరిన వారే.  కాగా లొంగిపోయిన బార్స దేవా తన వద్ద ఉన్న మౌంటెన్ ఎల్ఎంజి ఆయుధాన్ని పోలీసులకు అప్పగించాడు.  దేవాతో పాటు  మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.  ఇలా ఉండగా బర్స దేవాను శనివారం (జనవరి 3) మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. 

దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు...బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు

  హైదరాబాద్ నగరంలోని కీలక జలాశయమైన దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దుర్గం చెరువు పరిధిలోని సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై **BNS సెక్షన్లు 329(3), 3(5)**తో పాటు PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద అభియోగాలు మోపారు. చెరువు భూమిని మట్టి, రాళ్లతో నింపి సహజ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించేలా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, ఆక్రమిత భూమిని STS ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన బస్సుల పార్కింగ్ స్థలంగా వినియోగిస్తూ అక్రమ ఆదాయం పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దుర్గం చెరువుకు సంబంధించి 2014లోనే హెచ్‌ఎండీఎ ద్వారా ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, దానిని లెక్కచేయకుండా చెరువు పరిధిలోకి చొరబడి భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ అక్రమ చర్యల వల్ల చెరువు విస్తీర్ణం తగ్గడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వరదల నియంత్రణ, భూగర్భ జలాల సంరక్షణలో దుర్గం చెరువు కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి జలాశయాన్ని ఆక్రమించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ, రెవెన్యూ, హెచ్‌ఎండీఎ, మున్సిపల్ శాఖల రికార్డులను సేకరిస్తున్నారు. ఆక్రమణకు సంబంధించిన ఆధారాలు, అక్రమంగా సంపాదించిన ఆదాయంపై కూడా విచారణ సాగుతోంది. అవసరమైతే నిందితులకు నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మరోసారి చర్చ మొదలైంది. జలాశయాల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందన ఈ కేసుపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తనపై కక్షతోనే కేసు పెట్టారని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసినప్పటికీ, తర్వాత అది చెల్లదంటూ టీడీఆర్ ఇచ్చారని తెలిపారు. దుర్గం చెరువు అభివృద్ధి తర్వాత తనకు అక్కడ ఎలాంటి భూమి లేదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు ఉన్నాయని, ప్రైవేట్ బస్సుల పార్కింగ్ ఏర్పాటు చేసినందుకే తనపై అనవసరంగా కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. రోడ్డు పక్కన, చెట్ల కింద వాహనాలు పార్క్ చేసినందుకే కేసు పెట్టారని ఆరోపించారు. ఫిర్యాదులో వ్యక్తిగతంగా ఎవరూ లేరని, హైడ్రా పేరే కనిపిస్తోందని పేర్కొన్నారు. కేసుపై న్యాయపోరాటం చేస్తానని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించిన ప్రాంతాల ముందు ధర్నా చేస్తానని కూడా హెచ్చరించారు.

కోనసీమ జిల్లా కలెక్టర్ కు తృటితో తప్పిన ప్రమాదం

కోనసీమ జిల్లా కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పులిదిండిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పడవ పోటీలు నిర్వహించడానికి చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా  నిర్వహించిన ట్రయల్ రన్ ను కలెక్టర్ ప్రారంభించారు.  ఆ సందర్భంగా ఆయన పొరపాటున కాలువలో పడిపోయారు.  కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే స్పందించి కలెక్టర్‌ను రక్షించారు. ఆయనను సురక్షితంగా వేరే పడవలోకి ఎక్కించారు.   జీపుతో సహా సముద్రంలోకి.. యువకుడి మృతి అదలా ఉంటే కోనసీమ జిల్లాలోనే న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా అపశ్రుతి చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇద్దరు యువకులు మద్యం సేవించి జీపులో  సముద్రంలోకి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఒక యువకుడు చాకచక్యంగా ముందే వాహనం నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. మరో యువకుడు సముద్రంలో  గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి అంతర్వేది బీచ్ కు గురువారం ముగ్గరు యువకులు వచ్చారు. అంతర్వేదిలోని ఓ రిసార్ట్ లో రూమ్ తీసుకుని పార్టీ   చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి పదకొండున్నర గంటల సమయంలో వారిలో ఇద్దరు యువకులు తమ వాహనంలో బీచ్ రోడ్ లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి, అన్నాచెల్లెలు గట్టు వద్ద మలుపును గమనించకుండా సముద్రంలోకి వెళ్లిపోయారు. చివరి నిముషంలో జీపులో ఉన్న ఇద్దరిలో ఒకరు బయటకు దూకేసి సురక్షితంగా బయటపడగా, మరో యువకుడు జీపుతో సహా సముద్రంలో గల్లంతయ్యాడు. తరువాత  అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని శ్రీధర్ గా గుర్తించారు. 

శ్రీశైలంలో చిరుత కలకలం

శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. పాతాళ గంగ మెట్ల మార్గంలోని  ఓ ఇంటి ముందు భాగంగా గురువారం (జనవరి 1) అర్ధరాత్రి చిరుత పులి సంచారం సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యింది. అంతే కాకుండా ఆ ఇంటి యజమాని కూడా చిరుత సంచారాన్ని స్వయంగా చూశారు. విషయం వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు   ఆ ప్రాంతంలో లో ఉండే స్థానికులు,భక్తులను అప్రమత్తం చేశారు.  అలాగే అటవీ అధికారులకు సమాచారం అందించారు. శ్రీశైలం పాతళగంగ మెట్ల మార్గం ద్వరానే వెళ్లిరోజు తెల్లవారుజామున పాతాళ గంగలో స్నాన మాచరిస్తారు.  నిత్యం వేలాది మంది  రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే  స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది.   మైకుల ద్వారా చిరుత పులి సంచారాన్ని తెలియజేస్తు అందరినీ అప్రమత్తం చేసిన ఆలయ అధికారులు.. అటవీ శాఖ సిబ్బంది సాయంతో చిరుతను గుర్తించి బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

అసెంబ్లీలో చర్చ లేకుండానే 5 బిల్లులు ఆమోదం

  తెలంగాణ అసెంబ్లీలో మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, ప్రైవేట్ వర్సిటీలు, మోటార్ వైహిల్ ట్యాక్సేషన్ చట్టాల సవరణలను సంబంధించి 5 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఎలాంటి చర్చ లేకుండా శాసన సభలో ఈ బిల్లులకు ఆమోదముద్ర పడింది. ఇందులో హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన 3 కీలక బిల్లులున్నాయి. సీఎం, ట్రాన్స్‌ఫోర్టు మినిస్టర్ల తరపున ఈ బిల్లులను సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు.  మూజువాణి ఓటుతో సభ వీటికి ఆమోదం తెలిపింది. మరోవైపు సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి గడ్డం ప్రసాద్‌ పక్షపాతి వైఖరికి నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల బహిష్కరించనున్నట్లుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం తమకు సభలో మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. ఆ తర్వాత కాలినడకన ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోకి వెళ్లి స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

చిన్నారులకు సోషల్ మీడియా యాక్సిస్ బంద్.. ఫ్రాన్స్ కీలక నిర్ణయం

స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులను  రక్షించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ యుగంలో చిన్నారులు ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక సవాళ్లను అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశంలో  15 ఏళ్లలోపు వయస్సు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నిర్ణయించారు. నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. పిల్లలను, కౌమార దశలో ఉన్నవారిని సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుంచి కాపాడుకుంటామని ఎనౌన్స్ చేశారు. ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా  పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా కఠిన చట్టాన్ని తీసుకువచ్చిన తొలి దేశంగా నిలిచింది.  ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును  డిజిటల్ మెజారిటీ గా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత చట్టంపై ఈ నెలలోనే ఫ్రాన్స్ పార్లమెంట్‌లో చర్చ జరగనుంది.  2026 సెప్టెంబర్ నాటికి ఈ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు.   గతంలో సోర్బోన్ యూనివర్సిటీలో మేక్రాన్ చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరైనా తమ ఐదేళ్ల లేదా పదేళ్ల పిల్లలను ఒంటరిగా అడవిలోకి పంపిస్తారా? సోషల్ మీడియా కూడా అలాంటిదే. ఇది క్రమబద్ధీకరించబడని అడవి లాంటిది. అక్కడ పిల్లలు సైబర్ బుల్లియింగ్, అశ్లీలత, వేధింపులకు గురవుతున్నారని ఆయన అప్పటి ప్రసంగంలోనే హెచ్చరించారు. తాజా నివేదికల ప్రకారం.. సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల్లో నిద్రలేమి, ఏకాగ్రత తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ప్రైమరీ, మిడిల్ స్కూళ్లలో ఫోన్లపై ఉన్న నిషేధాన్ని హైస్కూళ్లకు కూడా విస్తరించనున్నారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి రాత్రివేళల్లో 'డిజిటల్ కర్ఫ్యూ' విధించే ఆలోచనలో కూడా ఫ్రాన్స్ సర్కార్ యోచిస్తున్నది.   దీనిని ఫ్రాన్స్‌లోని సుమారు 79 శాతం మంది తల్లిదండ్రులు సమర్థిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాకుండా మలేషియా, డెన్మార్క్, స్పెయిన్, రొమేనియా వంటి దేశాలు కూడా సోషల్ మీడియా నియంత్రణలపై సీరియస్‌గా దృష్టి పెట్టాయి. భారత్ లో కూడా అసభ్యకరమైన కంటెంట్ పై ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలు స్మార్ట్‌ఫోన్ల మత్తులో పడి తమ బాల్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి కఠిన చట్టాలు తప్పనిసరి అని  సామాజికవేత్తలు అభిప్రాయపడు తున్నారు. ఫ్రాన్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా దిక్సూచిగా మారే అవకాశం ఉంది.