Previous Page Next Page 
విరాజి పేజి 19

   

   ఎందుకో పరాజికి అతనంటే ఆసమయంలో చెప్పలేని .... క్రాఫింగ్ తో ఆడుకుంటూ "గౌతమ్" అంది.

    "ఊ...."

    చెప్పాలనుకున్న మాట వివేకం వెన్నుతట్టగా గొంతులోనే నొక్కిపట్టేసింది.

    "నీ నవల చదువుతున్నాను" అంది.

    "ఇప్పుడెలా అనిపిస్తోంది"

    "అప్పుడు ఊహించిదానికన్నా బాగా వచ్చినట్లనిపిస్తోంది."

    "విరాజీ!" అన్నాడు కొంచం భయంగా. "నువ్వు నవ్వకేం నాకు సన్మానం చేస్తానని వాళ్ళు వచ్చారు."

    "నువ్వు ఒప్పుకున్నావా?"

    "నువ్వు కోప్పడతానని నాకుతెలుసు. కాని కాదనలేక ఒప్పుకున్నాను."

    అతని ముఖంలోని నిర్మలత్వం, అమాయకత్వం , పసితనం చూసి ఆమె కిలకిల మని నవ్వింది.

                                                           *    *    *   

    ఉత్తమ సాహతీవారు నిర్వహించిన సన్మానోత్సవం ఘనంగానే జరిగింది.

    గౌతమ్ కు అప్పటికి రచయితగా అంత పేరు ప్రఖ్యాతలు రాలేదు. "ఆక్రందన" కొంతమంది సాహతీ పిపాసువుల్ని ఆకట్టుకున్నమాటనిజమే. కాని సామాన్య పాఠకుల్నంతగా ఆకర్షించలేదు.  ముఖ్యంగా టీన్ ఏజ్ రీడర్స్ ఎక్కువగా చదవడంలేదు. కావలసిన ప్రణయం, ట్వీస్ట్ లూ, థ్రిల్స్ ఆ మసాలా అందులో ఏమీలేదు. కాని సభకు జనం బాగానే వచ్చారు.

    చీఫ్ జస్టీస్ అనంతమూర్తిగారు అధ్యక్షత వహించారు.

    అయన గోప్ప సాహితీ జిజ్ఞాసువుల్లా గోచరించారు.

    తన ఉపన్యాసంలో పడిపోతూన్న సాహిత్య ప్రమాణాలను గురించి తన వేదన వ్యక్తంచేసి సాహిత్య కాశంలో తళుక్కుమన్న నక్షత్రంలా అక్రందనను అభివర్ణించారు. ఎన్నో ఒడు దుడుకులతో ఆకర్షణలతో సాగే యీ ప్రమాణంలో ఎలాంటి ప్రలోభాలకు గురుకాకుండా ముందుకు సాగిపోవాలని గౌతమ్ ను ఆశీర్వదించారు.

    తర్వాత సన్మానం జరిగింది. ఉత్తమ సాహితీ కార్యదర్శి సన్మాపత్రంచదివాడు. తరువాత శాలువాతో సత్కరించి మేముంటో బహుకరించారు ఆ తర్వాత దండలు వేసే కార్యక్రమం , రకరకాల ఏసోసియెషన్లు వారు వచ్చి పూలమాలలతో ముంచెత్తారు.

    విరాజి ఎక్కడుంది? గౌతమ్ యీసందడిలో మునిగి తెల్తూనే ఆమె కోసం చూపులతో గాలించాడు. ముందు వరసల్లో ఎక్కడా కనబడలేదు. అతని చూపులు అలా వెతుకుతూ వెనక్కీ సాగుతున్నాయి.

    వెనక వరసల్లో ఎక్కడో జనం మధ్యలో విరాజి కూర్చుని వుంది, అతని చూపులామేను తాకాయి. ఆమె చిరునవ్వు నవ్వి అభినందిస్తున్నట్లు చెయ్యి ఊపింది.

    "బాబుగారూ?"

    గౌతమ్ ఉలికిపడి యిటుకేసి చూశాడు. వేదికమీద తనకెదురుగా చేతిలో పూలమాలతో వరదారాజు.

    గౌతమ్ ముందుకు వంగి తలవంచాడు. వరదరాజు అతని మెళ్ళో పూలమాలవేసి ఆలింగనం చేసుకున్నాడు.

    సన్మానం పూర్తయ్యాక నలుగురయుదుగురు వక్తలు ప్రసంగించారు. వారంతా గౌతమ్ ని ప్రసంశిస్తూ మాట్లాడినా మనస్పూర్తిగా మాట్లాడలేదని, వాళ్ళ మాటల్లో యీగో తొంగిచూస్తోందనీ గౌతమ్ గ్రహించాడు.

    చివర్న గౌతమ్ జవాబు.

    అతను లేచి నిలబడి మైక్ దగ్గరకు వెళ్ళాడు. కాళ్ళు కొద్దిగా వోణికి నట్లయ్యాయి. అతనికి వేదికమీద ఉపన్యాసాలివ్వటం అలవాటులేదు. ఒక రకంగా స్టేజిఫీయర్ వున్నట్టేలెక్క
    "అందరకూ నమస్కారం" అంటూ ప్రారంభించాడు గొంతులో చిన్న వొణుకు.

    కళ్ళు విరాజిని వేదికాయి. ఆమె పెదవులమీది చిరునవ్వు అతనికి కొంత ధైర్యాన్నిచ్చింది.

    "ప్రతి రచయితకూ రాయటం ఓ హాబీగానే మొదలవుంతుంది. కానీ ముందుకు జరిగిన కొద్ది, ఎదిగిన కొద్ది జీవితంలో ఒక భాగమై కూర్చుంటుంది.

    "మొదట ఈ రాయటమన్నది ఎంత తేలిగ్గా, మధురమైన అనుభవంగా వుంటుందో __ తర్వాత తర్వాత బరువుగా, అడుగడుక్కి అనుమానాల మయంగా సమస్యల సంఘర్షణలో _ ఆత్మ విశ్వాసానికి , ఓ పరీక్షగా మిగిలి పోతూ వుంటుంది.

    ఆ సంఘర్షణతో నిలద్రోక్కుకున్నవాడు ఉత్తమ రచయిత అవుతాడు.

    నా జీవితంలో  యీ సన్మానం గొప్ప సంఘటన అనుకోవడం లేదు. నేను 'ఆక్రందన' రాయడం గొప్ప సంఘటనగా భావిస్తున్నాను.

    శ్రోతలనుంచి కరతాళధ్వనులు

    "ఒక రచయిత తాను అనుకున్నది అనుకున్నట్లు రాయగలుగుతూ మనస్సుని బలహీనపరిచే ప్రలోభాలకు లొంగిపోకుండా రాయగలిగితే అది ఉత్తమ రచన అవుతుంది.

    అలాగే రచయిత సాహిత్య జీవితంలోకి యీదురు గాలులకు లొంగిపోకుండా తాను అనుకున్న పద్దతిలో నడక సాగించ గలిగితే అతను ఉఉతమ రచయిత అవుతాడు.

    "అలా యీదురు గాలులకు కొట్టుకుపోకుండా వుండాలనీ నా యిష్టం ప్రకారం నేనుమనుగడ సాగించగలగాలనీ ఆశిస్తూ _ సెలవుతీసుకుంటున్నాను."

                                                          *    *    *    *   

    ఉండీ వుండీ ఒక్కొక్క చినుకుపడుతోంది. రాత్రి పదిదాటి పోయి వుంటుంది అప్పటికి సన్మాన సభ పూర్తయి అరగంట పూర్తయి వుంటుంది. చీఫ్ జస్టిస్ ను, ప్రధాన వ్యక్తుల్ని దింపటానికి వెళ్ళిన కారింకా రాలేదు.

    గౌతమ్ . అతనితోపాటు విరాజి నిర్వాహకులతోపాటు వుండిపోయారు.

    "మేము ఏ ఆటోలో నయినా వెడతాంలేం" అన్నాడు గౌతమ్ మొహమాటంగా.

    "కారిప్పుడే వొచ్చేస్తుందండీ. వెళ్ళి పోదురు గాని" అన్నారే గాని అదెంతకూ రావటంలేదు.

    మీటింగు ప్రారంభించటానికి ముందు నిర్వాహకులలో వుండే వుత్సాహం వాళ్ళు చూపించే మర్యాద _ మీటింగు పూర్తయాక వుండవు ఈ అతిథుల్ని ఎలా వదిలించుకుందామా అన్న ధోరణి కన్పిస్తోంది వారిలో _ విరాజి వాళ్ళ ముఖ కవళికలని గమనిస్తోంది, అలసట , అసహనం ఆమె అర్ధం చేసుకుంది.

    "గౌతమ్ మనం వెడదాం " అన్నది.

    ఆమె ముఖంలోకి చూసి అందులోని భావాన్ని అర్ధం చేసుకున్నాడు.

    "మేము వెడతామండీ. చాలా రాత్రయింది." అన్నాడు గౌతమ్ . అన్నారేగానీ ఆ దరిదాపుల్లో ఎక్కడా లేని అటువంటి వాహనం కోసము ఎవరూ కదలటంలేదు.

    వాళ్ళ ధోరణి చూసి విరాజికి అరికాలి మంట  నెత్తికెక్కింది. "కొంచెం ముందుకు పొతే దొరుకుతాయి. లెండి. రా! గౌతమ్ పోదాం" అంటూ అతని చెయ్యి పట్టుకులాగింది.

    "వస్తానండీ" అంటూ ఆమెతో బాటూ అతనూ కదిలాడు.

    "దండలూ అవీ __ తర్వాత యింటికి పంపిస్తాంలెండి _" అంటున్నారు వాళ్ళు.

    విరాజి వినిపించుకోలేదు. శాలువా మాత్రం అతని చేతిలో ఉంది. కొంతదూరం పోయాక ఓ రిక్షా వస్తూ కనిపించింది. "గౌతమ్ అందులో వెళదామా?" అంది విరాజి.

    గౌతమ్ జేబులు తడుముకున్నాడు. ఒక్క రూపాయి నాణెం మాత్రం తగిలింది.

    " నా దగ్గర ...."

    "డబ్బుల్లేవు" అది విరాజి నవ్వుతూ.

    "ఒక్క రూపాయి మాత్రం వుంది"

    "నా దగ్గర అదికూడా లేదు."

    "అయితే మామూలే" అంటూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని నడక సాగించారు."

    "గౌతమ్"

    "ఊ?"

    "మనమిద్దరం అలాంటి సమయాల్లో కలసి వున్నప్పుడు జరిగేది దావురించింది."

    "ఏమిటది ?"

    "ఆ ...."

    గౌతంకు అర్ధమయ్యింది _ అతను కూడ అవస్థలో వున్నాడు పైగా ప్రొద్దుట కూడా ఏమీ తినలేదు.

    "రూపాయి పేట్టి ఏమయినా కొందాం"
   
    కొంతదూరం నడిచాక రోడ్డుప్రక్కన చిన్న పళ్ళెం పట్టుకుని వేరు శెనగ పప్పు అమ్ముకునే ముసలమ్మా తన మూట ముల్లె సర్దుకుని లేవబోవటం కనిపించింది.

 Previous Page Next Page