Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 6

    "మీ ప్రసంగాలు అచ్చువేసిన లక్ష కాపీలు అమ్ముడయిపోయాయి. వచ్చే వారం నుంచీ రెండోముద్రణ మొదలు

పెట్టాలనుకుంటున్నాను."

    "నీ ఇష్టం ఆషా!"
   
    "రోజు రోజుకూ మన ఆశ్రమానికి వచ్చే శిష్యులు ఎక్కువవుతున్నారు. ప్రస్తుతం వున్న నివాస భవనాలూ,

కాటేజీలూ సరిపోవడం లేదు. ఇంకో వంద కాలేజీలు నిర్మించాలనుకుంటున్నాము. ప్రక్కనే వున్న పది ఎకరాల స్థలం కూడా

కొనుగోలుచేస్తే మంచిదని నా ఉద్దేశం."

    "ప్రస్తుతం మన దగ్గర డబ్బెంత వుంది?"

    "పది కోట్ల రూపాయలకు పైగా వుంది?"

    "వెంటనే నీ ఆలోచనలు అమలులోపెట్టు."

    "నే సెలవు తీసుకుంటాను"

    "వెళ్ళిరా" అన్నారు. ఆయన చేతిని కొంచెం పైకి ఎత్తాడు ఆశీర్వదిస్తున్నట్టు.

    ఆషా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది.


                  *              *             *


    ఆ రాత్రి సమయంలో _ వెన్నెల్లో ఆశ్రమ ఆవరణలో ఆవరించివున్న వృక్ష సముదాయాల మధ్య  నుంచి ఆషా,

ఆమెతోపాటు ఓ నడివయస్కుడు నడుస్తున్నారు.

    ఆ నడివయస్కుని పేరు చిత్తరంజన్. నగరంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకడు.

    వాతావరణం నిశ్శబ్దంగా వుంది.

    ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒక చోట ఆగారు. చిత్తరంజన్ ఆమె వైపు అభిముఖంగా తిరిగి దగ్గరకు లాక్కుని

బిగియారా ఆలింగనం చేసుకుని పెదవుల మీద గాఢంగా చుంబించాడు.

    పెదవులూ  పెదవులూ  ఆడుకుంటున్నాయి _ నాలికా  నాలికా నర్తిస్తున్నాయి.

    ఆ చలిలో శరీరాలు వేడిని పోసుకుంటున్నాయి.

    క్రమంగా ఇరువురి శరీరాల మీది దుస్తులూ, నేల  మీదకు జారిపోయాయి.

    నగ్నంగా, పూర్తి నగ్నంగా ఒకరితో ఒకరు పెనవేసుకుపోతూ, నేల మీదకు దొర్లి ఒకరితో ఒకరు

లీనమవుతున్నారు.

    వెన్నెల వేడెక్కి ప్రకృతి ఒడిలో అలిసిపోతోంది.


                                         3


    అక్కయ్యకు అంత్యక్రియలు పూర్తిచేసి మరునాడే కన్నుమూసిన పసిగుడ్డును భూమికి అప్పగించి, అయిదు

రోజుల తర్వాత ప్రజ్ఞ అతి కష్టంమీద రైలు ప్రయాణం పూర్తిచేసి ఇల్లు చేరింది.

    తండ్రి జానకిరామయ్య   ఇటీవల   సుస్థీగా వుండడంచేత సరిగ్గా ఉద్యోగంలో కెళ్ళలేక  పోతున్నాడు.  ఒక ఆటో

మొబైల్ కంపెనీలో ఎకౌంటెంట్ గా పనిచేస్తూ ఆ వచ్చే జీతం చాలక సాయంత్రాలు అయిదారు షాపులకు ఎకౌంట్లు రాసిపెట్టి పైన

ఇంకా మూడు నాలుగొందలు దాకా సంపాదించుకుంటూ వుండేవాడు. ముగ్గురు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు, ప్రజ్ఞ మూడో

కూతురు. ఆమె పైన అరుంధతి. మొదటి కూతురు నాగలక్ష్మి.

    పెద్ద కొడుకు గోపీకృష్ణకు ఇప్పుడే పదిహేడేళ్ళు నిండుతున్నాయి. అతను ప్రజ్ఞ కంటె కొంచెం పెద్ద. పేరుకు

ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు కానీ, ఏ రోజూ కాలేజీకి సరిగ్గా వెళ్ళడు. వయస్సు వస్తున్నా తండ్రి రెక్కలు ముక్కలు

చేసుకుని ఎలా సంపాదిస్తున్నాడోనన్న ఆలోచనాభావం వున్నట్లు కనబడడు. ఎప్పుడూ స్నేహితులతో తిరుగుతుంటాడు. తల్లిని

పీడించి ఎలాగో ఓలా డబ్బులు పిండి షోకులకు కొదవలేకుండా జాగ్రత్తపడుతూ వుంటాడు. ఈ మధ్యనే సిగరెట్లు అలవాటు

చేసుకున్నాడు. రెండు రోజులకో సినిమా చూడడం, అమ్మాయిలను ఏడిపించడం అతని హాబీలు. నదురూ బెదురూ లేకుండా ఏ

ఆడపిల్లతో నైనా మాట్లాడేస్తాడు. ఆడపిల్లల నాకర్షించే లక్షణాలు తనలో చాలా వున్నాయని అతని నమ్మకం.

    ఆఖరివాడు సురేంద్రకు పదమూడేళ్ళుంటాయి.

    ప్రజ్ఞ లోపలికడుగు పెట్టగానే తండ్రి ముందుగదిలో మంచంమీద పడుకుని దగ్గుతూ వుండడం కనిపించింది.

    "నాన్నా!" అంది దగ్గరకు వెళ్ళి.

    జానకిరామయ్య తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు.

    "అమ్మడూ! నిన్ను రొంపిలోకి పంపి, ఆఖరికి కన్నకూతుర్ని ఆఖరి చూపులు చూసుకునేందుకయినా

రాలేకపోయానమ్మా! అంత కష్టాన్ని ఎలా తట్టుకున్నావమ్మా?"

    ఆయన అడిగిందానికి ప్రజ్ఞ జవాబు చెప్పలేదు. "నీ ఒంట్లో ఎలా వుంది నాన్నా?"

    "బాగానే వున్నదమ్మా."

    తండ్రి వంక పరిశీలనగా చూసింది. చూసి రెండు నెలలకు పైగా అయింది. అప్పటికీ ఇప్పటికీ మనిషిలో ఎంతో

వ్యత్యాసం కనిపిస్తోంది. మనిషి సగమైపోయినట్టు చిక్కి _ ఎలాగో వున్నాడు.

    దుఃఖాన్ని లోపలే దిగమ్రింగుకుని చేతిలోని సూట్ కేస్ క్రిందపెట్టి "అమ్మా!" అంటూ లోపలి గదిలోకి వెళ్ళింది. 
                  
 

 Previous Page Next Page