"ఇది రాబరీకిందవస్తుంది, డెకాయిటీ అనటానికి వీల్లేదు."
"సరే, అనం! అయితే యిప్పుడు రాబరీ కిందవచ్చింది కాబట్టి మనకేమయినా లాభం వుందా"
"ఎందుకులేదు? అన్నీ ఒకటిగా లెక్కవేసి - ఆ సంఖ్య చూస్తే గుండెపగిలిపోదూ అందరికీ? అందుకేయిలా విభజించేస్తే చాలా తక్కువగా కనబడతాయ్. చూశారా మా డిపార్ట్ మెంట్ కి ఎంతలాభమో-" అడిగాడు ఇన్స్ పెక్టర్.
"పోనీయింకోపని చేయకూడదా సార్!"
"ఏమిటది?"
"సరదా దొంగతనాలు, అవసరం కొద్దీ దొంగతనాలు, ఆకలి దొంగతనాలు, అలవాటు చొప్పున చేసిన దొంగతనాలు, మానసిక బలహీనతవల్ల చేసే దొంగతనాలు - యిలా బోలెడు భాగాలుగా విభజిస్తే అస్సలు తగ్గిపోతాయిగా! యించుమించుగా ఏమీలేనట్టే స్టేట్ మెంట్లివ్వచ్చు."
అయన అర్జంటుగా జీపెక్కివెళ్ళిపోయాడు.
ఆ సాయంత్రం మళ్ళీ కాలనీ మీటింగ్ జరిగింది.
"నేను ఆరోజే చెప్పాను. పది ఇళ్ళకు కలిపి ఓ వార్నింగ్ బెల్ ఏర్పాటు చేయమని. కానీ ఎవరూ వినిపించుకోలేదు. ఇప్పటికయినా దాని విలువ గుర్తించి ఏర్పాటు చేశారంటే ఆ దొంగల్ని మనమే పట్టుకోవచ్చు" అంది డిటెక్టివ్ రచయిత్రి ఆవేశంగా అప్పటికప్పుడే చందాలు పోగుచేశారు. నలుగురు ఎలక్ట్రీషన్లు ఆరాత్రంతా పనిచేసి మర్నాటికి వార్నింగ్ బెల్స్ ఏర్పాటుజేసేశారు. చాలాసార్లు వాటిని ప్రయోగాత్మకంగా మోగించి సంతృప్తిచెందారు.
స్వయంగా రాజేశ్వరీ రాత్రిళ్ళు రాబరీ డ్రిల్స్ నిర్వహించింది. అంటే రాత్రి రెండింటికి ఏదొక ఇంట్లో నుంచి వార్నింగ్ బెల్ వస్తుందన్నమాట. దాంతో అందరూ బయటకు పరుగెత్తుకురావాలి. ఆ డ్రిల్స్ విజయవంతంగా పూర్తయినాయి. ఆ మర్నాడే సీతాపతి ఇంట్లో దొంగలుపడ్డారు. వాడు ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని వార్నింగ్ బెల్ కొట్టాడు. కాని ఆ చుట్టుప్రక్కల వాళ్ళందరియిళ్ళూ, ముందే బయటనుంచీ గొళ్ళాలు పెట్టారు దొంగలు. బయటి నుంచీ గొళ్ళాలు తీయాల్సివచ్చింది.
మర్నాడే మళ్ళీ కాలనీ మీటింగ్ ఏర్పాటు చేశాడు శాయీరామ్.
"సోదరులారా! మనం చేయగలిగినవన్నీ చేశాం! యిప్పుడు మనకు తెలిసొచ్చిన విషయం ఏమిటంటే మన ఉపాయాలే మీ పనికిరావని! యింకా కొత్త ఉపాయాలేమైనా ఎవరయినా చూచించగలరా?" అడిగాడతను. ఎవ్వరూ మాట్లాడలేదు. చివరకు రంగారెడ్డి లేచి నిలబడ్డాడు.
"ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది." అన్నాడతను.
"ఏమిటది?"
"దొంగలకు మనమే స్వాగతం చెప్పడం!" అందరూ నవ్వారు.
"రంగారెడ్డికి పిచ్చిపట్టింది" అనుకున్నారు కొందరు.
"అయ్యా! నాకేం పిచ్చిపట్టలేదు. ఫాక్ట్స్ చెబుతున్నాను. దొంగలకు మనందరం కలిసి స్వాగతం చెప్దాం. బాబూ మా ఇళ్ళు అలా ఇష్టం వచ్చినట్లు దోచుకోకండి. మీకు నెలనెలా మేమే ఎంతో కొంత ముట్టచెబుతాం అని రిక్వెస్టు చేద్దాం" మళ్ళీ కేకలు చెలరేగినయ్.
కాసేపు కోలాహలం తరువాత శాయీరామ్ లేచాడు.
"మన సోదరుడు రంగారెడ్డి సూచించిన ఉపాయమే బాగున్నట్లుతోస్తోంది" అన్నాడు వెంకట్రావ్.
మరి కాసేపట్లో అందరూ రంగారెడ్డి ఆలోచన బాగానే వుందనే నిర్ణయానికొచ్చారు. వెంటనే రంగారెడ్డి అధ్యక్షుడిగా దొంగల స్వాగతం కమిటీ ఒకటివేశారు. శాయీరామ్, యాదగిరి, గోపాల్రావు, సీతాపతి అందులో సభ్యులు.
"ఇంతకూ దొంగలకు ఆహ్వానం పంపడం ఎలా?" అడిగాడు యాదగిరి.
"దానిదేముందీ? అన్ని న్యూస్ పేపర్లలోనూ ఆహ్వానపత్రాలు పబ్లిష్ చేద్దాం - వాళ్ళెలాగూ న్యూస్ పేపర్లు చదువుతారు కాబట్టి తెలుసుకుని సంప్రదింపులకు వచ్చేస్తారు."
ఆ రోజే టాక్సీలో సిటీ అంతా తిరిగి నాలుగు భాషల్లో ఎనిమిది న్యూస్ పేపర్లలో ఆహ్వానాలు ప్రకటింపజేశారు వాళ్ళు.
"మహారాజశ్రీ దొంగలకు! నిర్భయ్ నగర్ కాలనీవాసుల స్వాగతం! సుస్వాగతం! ఆర్యా! మా కాలనీలో మీకు వచ్చే శనివారం రాత్రి ఘనమయిన స్వాగత సభయేర్పాటు చేయబడుతుంది. కనుక మీరెల్లరు మా స్వాగతాన్ని మన్నించి, సభకు విచ్చేసి మాతో సంప్రదింపులు జరపవలసిందిగా ప్రార్ధిస్తున్నాము. మీరు జరుపుతున్న దొంగతనాల వల్ల రాత్రుళ్ళు మీకు, మాకు నిద్రాభంగము కలుగుచున్నది. అంతేకాదు, తరచుగా మీ కత్తిపోట్లవల్ల మా శరీరాలకు గాయాలు - వాటిని మాన్పించుటకు డాక్టరు బిల్లులు మీ మీద రిపోర్టు ఇచ్చుటకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, దానికి ఆటో, టీ, ఖర్చులు, కొన్ని నగలు బాంకులాకర్లలో దాయడం మూలాన దానికయ్యే లాకర్ చార్జీలూ, సగంలో కొంత బంగారం బాంకువారు కొట్టేయడం- లేదా బాంకులోనే దొంగతనం జరగడం- ఇవన్నీ ఆలోచించి మేమీనిర్ణయానికొచ్చాము. కనుక మీరు తప్పక శనివారం రాత్రిమాచే ఏర్పాటు చేయబడిన ఆహ్వాన సభకు విచ్చేసి మాతో సంప్రదింపులు జరిపి, పరిష్కారపత్రాల మీద సంతకం చేసి, ఆ తరువాత మేమొసంగు చందన, తాంబూలాది సత్కారములు గైకొని మమ్మానందింప చేయవలసిందిగా ప్ర్రార్ధిస్తున్నాము- ఇట్లు ఆహ్వాన సంఘం-"
శనివారం రాత్రి కాలనీ ఆవరణ అంతా పండగ వాతావరణం అలుముకుపోయింది. పెద్దషామ్యానాలు, పెద్దవేదిక, రంగురంగుల దీపాలు, మైకులు, రికార్డులతో హడావుడిగా ఉంది.
"దొంగమహాశయులకు సుస్వాగతం" అన్న బోర్డు దేదీప్యమానంగా వెలుగుతోంది. సరిగ్గా రెండింటికి ఆరుగురు దొంగలు కారుదిగారు.
వెంటనే రంగారెడ్డి, మిగతా కమిటీ సభ్యులు ఎదురువెళ్ళి పూలదండలు వేసి స్వాగతం పలికారు. అందరూ వేదికమీద కూర్చున్నారు. ఆ దొంగల్లోకందరికీ చీఫ్ దొంగను మాట్లాడవలసిందిగా కోరారు. దొంగలేచి మైక్ దగ్గరకొచ్చాడు.
"సోదర సోదరీమణులారా! మేము దొంగలమే. వప్పుకుంటున్నాం. కానీ మేము దొంగలమయింది మాకేం సరదాపుట్టికాదు. అది ఒక వృత్తిగా స్వీకరించాం! అందులో తప్పేమిటో నాకు అర్ధం కావటం లేదు. రాజకీయాలు ఒక వృత్తి, అలాగే గూండాయిజం ఒక వృత్తి, అలాగే మర్డర్లుచేయడం ఒక వృత్తి. ఈ వృత్తులన్నీ కూడా మనం చేసేది కేవలం డబ్బు సంపాదనకేనని అందరికీ తెలుసు. మరి దొంగతనాలు కూడా డబ్బుసంపాదనకే కదా చేసేది! దీన్ని "ఇల్లీగల్" అని ఎందుకంటున్నారో నాకు తెలీటం లేదు. ఇప్పటికయినా మీలో చైతన్యం కలిగి దీనిని చట్టసమ్మతం చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మాక్కావలసిందేమీలేదు. మాకూ, మా భార్యాబిడ్డలకూ మూడుపూటలా తిండీ, ఖరీదయిన బట్టలూ, సొంతిళ్ళూ, కారు మెయింటెనెన్స్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులూ, రోజుకో విస్కీ టీ బాటిలూ- ఇంతే మాక్కావలసింది. వీటి కోసమే మేము దొంగతనం చేస్తున్నాం. మిమ్మల్ని కత్తులతో పొడుస్తున్నాం! మీరు మరి వీటన్నింటికీ సరిపోయే మామూలు నెలనెలా మాకు పడేస్తే మేము ఇంక మీ జోలికెందుకు వస్తాం. ఛస్తేరాము. జైహింద్" అంటూ స్పీచ్ ముగించాడతను.
అందరూ తప్పట్లుకొట్టారు.
మరుక్షణంలో సంప్రదింపులు ప్ర్రారంభమయ్యాయి. చివరకు అందరూ ఓ నిర్ణయానికొచ్చారు. ఒప్పందం మీద సంతకాలయ్యాయి.
కాలనీ రిజిష్టర్ లో దొంగగానమోదయిన వారందరికీ నెలకు అయిదువేలు చొప్పున జీతం (కన్సాలిడేటెడ్) ఇవ్వబడుతుంది. సంవత్సరానికొకసారి దీపావళి పండుగ ముందు వేతనానికి సమానమయిన బోనస్ కూడా ఇవ్వబడుతుంది. దీనికి ప్రతిఫలంగా వారు నిర్భయ్ నగర్ కాలనీలో దొంగతనాలు చేయరు, ఇంకొకరిని చేయనీరు.