Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 49

         

                                    24 ఏప్రియల్ 1988
                                         విశాల

   
    "రేపు నేను నా స్నేహితురాళ్ళను కలుసుకోబోతున్నాను" అనుకుంది విశాల. ఈ రోజు కోసం ఆమె చాలా దినాల్నించి వెయిట్ చేస్తోంది.
   
    వాళ్ళకేం చెప్పాలో కూడా ఆలోచించుకుంది.
   
    నిశ్చయంగా వాళ్ళ ముగ్గురి సంసారాలకన్నా తనది ఆనందప్రదమైనది. అందులో సందేహం లేదు. తన భర్త తను గీచిన గీటు దాటడు. తను లేకుండా నిమిషం కూడా బ్రతకలేడు.
   
    తన విషయాలన్నీ చెపుతూంటే వాళ్ళ మొహాలు ఎలా వుంటాయో చూడాలి- అనుకుంది ఒకటికి రెండు కల్పించి చెప్పాలి. వాళ్ళని తనింటికి తీసుకొచ్చి తన భర్తని చూపించాలి..... యివన్నీ వూహించుకుంటూ యిల్లు సర్ధసాగింది. స్నేహితురాళ్లొస్తే ఇల్లు ముందు నీట్ గా కనపడాలి. అదీ ఆమె కోర్కె... ఆమెకు మేఘాలమీద తేలుతున్నట్టుంది.
   
    ముందుగదిలో విశ్వం అల్మ్రైరా సర్దుతుండగా కనపడిందా ఉత్తరం మొదట ఏదోలే అనుకుని పక్కన పడేసింది. కాసేపయ్యాక మళ్ళీ అనుమానం వచ్చి చదివింది.
   
    ఆమె మొహం ఎర్రగా కంది పోయింది. కళ్ళనిండా నీళ్ళు నిండాయి. చేతుల్లో కాగితం వణకసాగింది. ఆ ఉత్తరం తీసుకుని తన భర్త చెల్లెలయిన సునీత ఇంటికి బయల్దేరింది విశాల.
   
                                      24 ఏప్రియల్ 1988
                                      అనూరాధ

   
    భార్గవి గొంతు ఫోన్ లో వినగానే అనూరాధకి కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆఫీసులో పనేమీ చెయ్యబుద్దికాలేదు. తొందరగా ఇంటికొచ్చేసింది. ఆ రాత్రి బాగా నిద్రపోయింది.
   
    ఈ మధ్య ఆమె సంతోషంగానే వుంటోంది. అడగ్గానే డబ్బు పడేస్తే భర్త కూడా యెక్కువ వేధించటం లేదు. భర్తని 'మీరు' అని గౌరవించటం మానేసి 'నువ్వు' అనే స్టేజి కొచ్చేసింది. ఇప్పుడిక దేనికీ 'కేర్' చెయ్యను అని పదేపదే అనుకోవటం అలవాటయింది.
   
    విశ్వం తరచు ఇంటికొస్తున్నాడు. మునుపుటంత "కాన్ ఫ్లిక్ట్" లేదిప్పుడు. అతడు కేర్ టేకర్ ఇంటిలో దొరకని సుఖం అతడికి తనిస్తుంది. కానీ రేపు తన స్నేహితురాళ్ళకి ఏం చెప్పాలి?
   
    తన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో....ఎందుకు తిరిగిందో చెప్తే వాళ్ళు తనని అర్ధం చేసుకుంటారా?
   
    బహుశా భార్గవి చేసుకుంటుందేమో!
   
    ఒకటి మాత్రం నిజం.
   
    వాళ్ళ సానుభూతి తనకి అవసరంలేదు.
   
    అనూరాధ ఈ విధమైన ఆలోచనల్లో వుండగానే తలుపు దగ్గిర చప్పుడైంది. ఊహించని టైమ్ లో ఆ వ్యక్తిని చూసి "నువ్వా" అంది.
   
                                      25 ఏప్రియల్ 1988
                                        వైజయంతి

   
    కాలగతిలో పదిహేనేళ్ళ కాలం అంటే స్వల్పం. కానీ మనిషి జీవితకాలంలో పదిహేనేళ్ళలో ఎన్నో మార్పులు జరగవచ్చు. చాలా మందికి ముప్పయ్యేళ్ళ వయసు ఫీలింగు వుంటుంది. అలాంటి ఆలోచన రాకుండా జీవితపువడి, వేగం తెలియకుండా వుండేది రెండు రకాల వాళ్ళకు. చీకూ చింతా లేకుండా ఎయిర్ కండిషన్డ్ కార్లలో తిరుగుతూ జీవితాన్ని ఒక వినోదంలా గడిపేవాళ్ళు ఒక రకం. ప్రతిక్షణం ఛాలెంజ్ లతో, ఎప్పటికప్పుడు వేర్వేరు గమ్యాలు నిర్దేశించుకుంటూ జీవించేవాళ్ళు రెండో రకం. హైదరాబాద్ సిటీ పోలీసు సూపరింటెండెంట్ వైజయంతి ఆ రెండో కోవలోకి చెందింది. తన పుట్టినరోజెప్పుడో, తన వయసెంతో ఆలోచించే సమయం కూడా వుండదామెకు.
   
    ఆరోజు మధ్యాహ్నం వైజయంతికి కొద్దిగా విరామం దొరికింది. డ్రాయర్ లోంచి డైరీ తీసి బయట పెట్టుకుంది.
   
    ఒక పోలీసు ఆఫీసరు డైరీ అంటే రకరకాల కథల సంపుటి. అందులో అది లేడీ ఆఫీసరయితే ఆ డైరీ నవరసాల సారం. వ్యభిచారం చేస్తున్న స్త్రీలను మొగపోలీసు పట్టుకొస్తే రొటీన్ గా సాగే వ్యవహారం - ఓ స్త్రీ అధికారి దృష్టిలో గుండెల్ని పిండే బ్రతుకు బాధల మిశ్రమం! జీవిత పోరాటంలో ఓడిపోయి, ఏం చెయ్యాలో తెలియక, దొంగతనాలు చేసి పట్టుబడి దారుణమయిన శిక్షననుభవిస్తున్న స్త్రీల హృదయవిదారక కథలు. రాక్షస సమాజ కట్టుబాట్ల లోనై, ఆవేశంలో చేయరాని నేరాలు చేసి పిచ్చాసుపత్రుల్లో గడుపుతున్న అభాగినులు వీళ్ళ కథలతో ఆమె డైరీ నిండిపోయింది. ఆ రోజు డైరీ వ్రాయడం పూర్తిచేసి వైజయంతి ఆలోచనలో పడింది. ఆమె భర్త గుర్తొచ్చాడు. ప్రస్తుతం నాగపూర్ లో పని చేస్తున్నాడతడు. అతడి ప్రవర్తనలో కొంత మార్పు కనిపిస్తోంది. క్షమించమని వేడుకునేవరకు వచ్చింది. అతడు తిరిగివస్తే మురిసిపోవడం, గొడవ పెట్టుకు వెళ్ళిపోతే బాధపడటం స్టేజి దాటిపోయిందిప్పుడు. అతడిలో మార్పు వచ్చిందని నమ్మి రెండేళ్ళు సెలవు పెట్టి ఓ బిడ్డని కనాలనుకుంది. అతడు పొంగి పోయాడు. "నాగపూర్ వెళదాం. సెక్స్ డితర్మినేషన్ టెస్టు చేయించుకోవచ్చు. మనకో అబ్బాయి మాత్రం చాలు" అన్నాడు. అంతే ఆలోచనకు స్వస్తి చెప్పేసింది. స్త్రీల విషయంలో అతడికంత చులకన భావం ఎందుకో ఆమె కిప్పటికీ అర్ధంకాలేదు.
   
    ఒక విషయం మాత్రం ఆమెకి తెలిసింది. ఇరవై ఏళ్ళు కాపురం చేశాక భార్యాభర్తలు సర్దుకుపోతారు. బహుశా పోట్లాడుకోవడానికీ, ఎద్దేవాలు చేసుకోవటానికి ఓపికల్లేకేమో!
   
    డైరీలో పేజీ తిరగవేసి ఆగిపోయింది వైజయంతి. ఏప్రియల్ 25 ముఖ్యమైన సమావేశం అని వ్రాసి అండర్ లైన్ చేసుంది. వైజయంతి పెదవులమీద చిరునవ్వు కదలాడింది. పదిహేనేళ్ళు అప్పుడే అయిపోతున్నాయి. మిగతా వాళ్ళంతా యెలా వున్నారో, ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అనుకుంది. ఢిల్లీ వెళ్ళిన కొత్తలో వచ్చిన ఒకటి రెండు ఉత్తరాలు తప్పించి వాళ్ళ విశేషాలు ఇంతవరకు మరేరకంగానూ తెలియలేదు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఓసారి ఉమెన్స్ కాలేజిలో ఫంక్షన్ కి అటెండవవలసి వచ్చింది. ఆ రోజుల్ని తలచుకుంటూ చెట్లనన్నింటినీ గమనిస్తూంటే ప్రిన్సిపాల్ కారణం అడిగింది. తను ఒకప్పుడు ఆ కాలేజీలో రెండేళ్ళు చదివిందంటే వాళ్ళకు గర్వంగా అనిపించింది.
   
    ఈ స్థాయికి ఎదగడానికి తనెంత కష్టపడిందీ, ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నదీ కూలంకషంగా వివరిస్తూంటే పిన్ డ్రాప్ సైలెన్స్ తో విద్యార్దులంతా విన్నారు. ముగించేసరికి కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.
   
    'తరం మారుతోంది స్త్రీలలో ధైర్యం ప్రబలుతోంది. త్వరలో నవశకానికి నాంది పలుకుతుంది' అనుకుంది. రేపు మరోసారి ఆ కాలేజీకి వెళ్ళబోతుంది. కానీ ఈసారి అధికారంతోకాదు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడానికి! మరోసారి బాల్యంలోకి ప్రయాణించడానికి!
   
    'ఇంత చక్కటి ప్లాన్ వేసినందుకు ముందుగా అనూరాధని అభినందించాలి' అనుకుంది.
   
    అంతలో "మేడమ్" అంటూ సెక్రటరీ లోపలకు వచ్చాడు. టైప్ చేసిన లెటర్ మీద ఆమె సంతకం పెడుతూ, "రేపు ఎలాంటి డ్యూటీకి అటెండ్ కాలేను. అవసరమయితే ఆ మర్నాడు కూడా రాకపోవచ్చు. అప్పాయింట్ మెంట్స్ ఏవీ ఇవ్వొద్దు" అని చెప్పింది.
   
    "అలాగే మేడమ్! హిమాయత్ నగర్ పోలీసు స్టేషనుకి సంబంధించిన సర్కిల్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. ఏదో కేసు విషయమట".
   
    "రమ్మను" అంటూ డైరీ తీసి లోపల పెట్టేసింది. సాధారణంగా సర్కిల్ డైరెక్టుగా కేసు విషయం మాట్లాడడానికి రారు. వరకట్నపు చావుల గురించయితే స్వయంగా వచ్చి రిపోర్టు ఇవ్వాలని ఆదేశం ఇచ్చింది.
   
    సర్కిల్ లోపలకు వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు.

    "ఏమిటి కేసు?" అడిగింది. అతడు ఇబ్బందిగా కదిలాడు.

    "హత్యకేసు మాడమ్! మామూలు హత్యే - కానీ...." ఆగాడు.
   
    "డోన్ట్ హెజిటేట్ చెప్పండి".
   
    "ఈ రోజు ఉదయం ఒక హత్య జరిగింది. దాన్ని యాక్సిడెంటల్ గా చూపించటానికి ప్రయత్నం చేశారు. కానీ అది హత్యే అనటానికి కారణాలున్నాయి". ఎవరైనా అనుమానితులున్నారా?"
   
    "ఆ ఆమె భర్తే".
   
    "మరి నా దగ్గిరకెందుకొచ్చినట్టు?" నొసలు చిట్లిస్తూ అంది.
   
    సర్కిల్ గొణుగుతున్నట్లు "హత్యాస్థలంలో ఓ ఉత్తరం దొరికింది. దాంట్లో మీ ప్రస్తావన వుంది మాడమ్!" అన్నాడు.
   
    వైజయంతి ఆశ్చర్యంగా, "నా గురించా.... హత్యా చేయబడినామె పేరు?" అని అడిగింది కుర్చీలోంచి లేస్తూ-
   
    "అనూరాధ మాడమ్..."
   
                                   24 ఏప్రియల్ 1988
                                       అనూరాధ
   

    ఆమె శరీరం నిద్రపోతున్నట్లుగా పడుకోబెట్టివుంది. నుదుటిమీద గాయాన్నించి స్రవించిన రక్తం ఎండిపోయింది. గదిలో వస్తువులన్నీ నీట్ గా సర్ది వున్నాయి. ఇద్దరు పిల్లలు బిక్కు బిక్కు మంటూ చూస్తున్నారు. పోలీసుల్ని చూస్తూ గట్టిగా ఏడవటానికి భయపడినట్లు కనబడుతున్నారు. వైజయంతి అక్కడకు వెళ్ళేసరికి అదీ పరిస్థితి.

 Previous Page Next Page