ఆ గదిలో మనుష్యులూ, గాలీ కూడా స్థంభించిపోయినట్లు కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. భార్గవి తండ్రి కూడా ఆ అనూహ్యమైన సంఘటనకు కొంచెం సేపు పాటు తెప్పరిల్ల లేకపోయాడు.
భార్గవి కోపంతో తమ్ముడిని కొట్టిన దెబ్బలు కావవి.
తను అధికున్ననీ, ఆ యింటికి రాజాధిరాజుననీ అనుకునే ఒక తండ్రి పురుషాహంకారానికి ఇన్ డైరెక్ట్ గా తగిలిన సూటి దెబ్బలు అవి.
తండ్రి రాజైతే తానో యువరాజుననీ, వయసులో పెద్దదయినా 'ఆడది' కాబట్టి అణిగి మణిగి పడుండాలనీ భావించే తమ్ముడి గర్వానికి గొడ్డలి పెట్టులవి.
స్త్రీ ఒద్దికగా వుండాలనీ, పురుషుడి అధీనంలోనే స్త్రీకి రక్షణ అని, తనలాగే తన కూతురు కూడా ఇప్పటినుండీ అలా అలవాటు పడితే భవిష్యత్తులో సుఖపడుతుందనే భావం జీర్ణించుకుపోయిన తల్లి నమ్మకం మీద కొట్టిన దెబ్బలవి.
ముందుగా తేరుకున్నది తండ్రి. ఏమీ చెయ్యలేక 'ఇందులో నీ పాత్ర ఎంతవరకు?' అన్నట్లు కోపంగా భార్యవైపు చూసి లోపలకు వెళ్ళిపోయారు.
అవమానంతో, వస్తూన్న దుఃఖాన్ని పైకి చూపిస్తే ఎక్కడ చులకనయిపోతానో అన్నట్లు తమ్ముడు హాల్లోకి వెళ్ళిపోయాడు గదిలో తల్లీ కూతుళ్లిద్దరూ మిగిలారు.
భార్గవి తలెత్తి తల్లి ముఖంలోకి చూసింది. తల్లి ముఖంలో వ్యధ! భయం!!! "తొందరపడ్డావు భార్గవీ! నాన్నగారి ఎదుట నువ్వలా ప్రవర్తించడం బాగాలేదు. చిన్న చిన్న పనులు చేసుకోవడంలో తప్పులేదు. ఇప్పటినుండీ అలవాటు పడకపోతే భవిష్యత్తులో చాలా బాధపడవలసి వస్తుంది. మీ నాన్నగారి ఉద్దేశ్యమూ అదే" అని కాస్త అనునయంగా, మరికాస్త మందలింపుగా అందావిడ.
"నాన్నగారి ఉద్దేశ్యం ఏమిటో నాకు బాగా తెలుసు. ఆడపిల్లగా పుట్టడం నా తప్పుకాదు. అలా పుట్టినందుకు సిగ్గుపడటంలేదు కూడా కాని చెప్పుడు మాటలు విని నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత వయసు వచ్చిన కూతుర్ని పట్టుకు కొట్టిన ఆ తండ్రికి కూతురుగా పుట్టినందుకు ఇప్పుడు నిజంగా సిగ్గుపడుతున్నాను".
కూతురువైపు భయంగా చూస్తూ, "ఊర్కో భార్గవీ! నాన్నగారు వింటే మళ్ళీ గొడవ" అందావిడ.
"ఎందుకమ్మా ఇంత భయపడుతూ హీనంగా బ్రతకడం? మనం ఇలా భయపడబట్టే వాళ్ళలో అహం పెరుగుతోంది. కష్టపడి సంపాదిస్తూ అన్ని రకాలుగా సగం బాధ్యతను పంచుకుంటున్న నీ పట్లనైనా గౌరవం వుందా నాన్నకు?"
"తప్పదు భార్గవీ! మగవాడి అండలో బ్రతకడంలోనే స్త్రీకి ఆనందం వుంది. రక్షణ వుంది. సంపాదిస్తున్నాననీ అందర్నీ ఎదిరించి వొంటరిగా ఈ సంఘంలో స్త్రీ బ్రతగ్గలదా? అయినా మీ నాన్నగారు మనకేం కొరత చెయ్యడంలేదు. ఆయనేం చేసినా ముందుచూపుతో ఆలోచించి చేస్తారు. భవిష్యత్తులో మనం సుఖంగా వుండాలనే ఆయన తాపత్రయం అంతా".
భార్గవి నవ్వింది. "ఇప్పుడు ఎంతమాత్రం సుఖపడుతున్నామని భవిష్యత్తు గురించి కలలు కనడం? అసలు నీ ఆలోచనలలోనే బలం లేదమ్మా".
"నీకలాగే అనిపించవచ్చుగానీ నాకు మాత్రం మీ నాన్నగారు చేసే ఏ పనిలోనైనా మనకోసం తపనే కనపడుతుంది. అనవసరంగా వాదించి దెబ్బలాడి యిల్లు నరకం చెయ్యకు".
"ఇప్పుడీ యిల్లు నీకు స్వర్గంగా కనిపిస్తోందన్నమాట".
"తప్పకుండా! ఇది నా యిల్లు, మీరంతా నా వాళ్ళు. మీ అందరి మధ్యనే నాకు స్వర్గం. ప్రతి మనిషిలోనూ కొన్ని బలహీనతలుంటాయి. సర్దుకుపోలేకపోతే ఆ యిల్లు నరకమే అవుతుంది. నీకిదే వార్నింగ్ గోరంతలు కొండంతలు చేసి అందరికీ మనశ్శాంతి లేకుండా చెయ్యకు. ఆడదానివి. రేపు మరో యింటికి వెళ్ళాల్సిన దానివి. ఏ యింట్లోనైనా ఇలాంటి పరిస్థితే వుంటుంది. ఆ విషయం మర్చిపోకు" అని ఆవిడ విసురుగా బయటకు వెళ్ళిపోయింది.
తండ్రి దెబ్బ బాధ కలిగించలేదు. కాని భార్గవికి తల్లిలోని ఈ ఆత్మన్యూనతాభావం మాత్రం చాచి చెంపదెబ్బ పెట్టినట్లయింది. చరిత్ర ఈ విధంగా అంచెలంచెలుగా స్త్రీని సెల్ఫ్ డిఫెన్సివ్ గా తయారుచేసింది కాబోలు.
ఒక తరం ముందు స్త్రీ విద్యలేక, ఆర్ధిక స్వాతంత్ర్యం లేక బానిసలా బ్రతికింది. అది తన ఖర్మ అని సరిపెట్టుకుంది. ఈ రెండూ వున్న నేటి తరం స్త్రీ అదే వారసత్వపు బానిస భావంలో మగ్గుతోంది. ఇంకెన్ని తరాల తర్వాత ఈ దేశపు స్త్రీలో అంతరంగికమైన మార్పు వస్తుందో - కాలమే నిర్ణయించాలి.
ఆ క్షణమే మొదటిసారి భార్గవి తనకి కాబోయే భర్త గురించి ఆలోచించింది. బాగా అస్పష్టమైన ఆలోచన్లు అవి.
అందమైన పరిసరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మనసుని ఎంతగా రంజింపచేస్తాయో, ఇంట్లో ఆత్మీయుల అభిమానాలు, ప్రేమ, చిలిపి కజ్జాలు అంతగానూ ఆనందపరుస్తాయని ఆమెకు తెలుసు. తమ్ముడూ తనూ హాస్టల్లో వుండి చదువుకొంటున్నారు. సెలవులొస్తే చాలు ఇంటికి వెళ్ళి తన వాళ్ళమధ్య వాలాలనిపిస్తుంది. వెళ్ళగానే తల్లీ, తండ్రీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటారు. ఆ రోజున పండుగ చేసుకుంటారు. ఉన్నన్ని రోజులూ తల్లి ప్రతిరోజూ రకరకాల పిండివంటలు వండటంలో నిమగ్నమై వుంటుంది. పిల్లలు తింటారని కాదు, ఆప్యాయతను వండి పెట్టటంలో అదో ఆనందం. ఆ పిచ్చిమాలోకానికి సెలవులన్నీ క్షణాల్లో గడిచిపోతాయి. మళ్ళీ హాస్టలుకి వెళ్ళిపోతూంటే కళ్ళనీళ్ళతో దిగులుగా పంపుతారు. స్వీట్లు, హాట్లు, పచ్చళ్ళు, పొడులు వద్దన్నా యిచ్చి పంపుతారు. సరి అయిన తిండి తినమని పదే పదే చెపుతారు. ఉత్తరాలు రాస్తారు. జవాబు రాకపోతే దిగులుపడతారు. అంత దూరంలో వున్నా ప్రతిక్షణం మేమున్నామని గుర్తుండేలా ప్రవర్తిస్తారు. తమ్ముడు హాస్టల్లో వుంటాడు".
"ఒరేయ్ తమ్ముడూ,
నేను హాస్టల్ కి క్షేమంగానే చేరాను. వెంటనే మా స్నేహబృందం చుట్టేశారు. ఒకటే గొడవనుకో అమ్మ ఇచ్చిన ఆవకాయలో వెల్లుల్లి రేకుల కోసం, లడ్డూల్లో జీడిపప్పు కోసంలా మీదపడ్డారు, చివరికి లాటరీవేసి పంచిపెట్టాననుకో.
రోడ్డుమీద వెళ్ళే అబ్బాయిలకి కన్నుకొట్టి, ఈలలు వేసి పిలిచానని చెప్పామా విశాలకి. మొహం మాడిపోయిన పెసరట్టులా అయిపోయింది. దానికిలాంటివన్నీ నచ్చవు. అందుకే మరీ మరీ ఏడిపిస్తుంటా రేపు గుళ్ళోకి చెప్పులతో వెళతానంటే ఎన్నిరకాల పాపాలు చుట్టుకుంటాయో, నరకంలో ఎలాంటి బాధలు పడాలో ఓ గంటసేపు లెక్చరిచ్చింది. అంతా విని 'ఐనా సరే థ్రిల్లింగ్ గా వుంటుంది వెళతానన్నా'. 'నిన్ను దేవుడు కూడా రక్షించలేడు' అని తిట్టుకుంటూ పోయింది. హాస్టల్లో వుంటే యిలాంటి పిచ్చి వేషాలు ఎన్నయినా వేయొచ్చు. బోలెడు అనుభవాలు కదురా! నీ అనుభవాలతో ఉత్తరం రాయి...." అంటూ తమ్ముడికి హోమ్ సిక్ నెస్ లేకుండా సరదాగా ఉత్తరాలు రాస్తుంది.
ఇవన్నీ ఆమె ఊహలే. నిజానికి హాస్టల్ కి ప్రయాణం కడుతుంటే ఆవకాయ కాదుకదా ఓ అప్పడం ముక్కయినా యిచ్చి పంపదు తల్లి. ఎందుకు అక్కడ పదిమందీ చేరి ఒక్కపూటలో పూర్తిచేస్తారు' అంటారు తండ్రి. ఫీజులు తప్ప పైసా ఖర్చు వుండదన్నట్లుగా ఓ పదో పాతికో చేతిలో పెట్టి పంపుతాడు. తమ్ముడికి ఆమె అంటే అసలు లెక్కలేదు. నీ బోడి ఉత్తరాలు నాకెందుకంటాడు వాడు.
ఈ మనస్తాపాన్నంతా ఓ మూలకి నెట్టేసి రెండేళ్ళు హాస్టల్ లో హాయిగా గడిపేసింది. స్నేహబృందం సరదాలతో, నవ్వులతో సమయం తెలియలేదు. అలాగే మూడేళ్ళు గడిచిపోయాయనుకునేంతలోనే తల్లిదండ్రులకు గుంటూరు ట్రాన్స్ ఫర్ అవడం, అక్కడ కాలేజీలోనే చేరాలని రప్పించడం జరిగిపోయాయి.
తమ్ముడిని కొట్టిన ఆనాటి సంఘటన తర్వాత భార్గవిలో చాలా మార్పు వచ్చింది. మనసులో అర్ధంకాని వేదన.
అనాలిసిస్ అన్న వేదన వెలుతుర్ని కూడా చీకటితో నింపేస్తుంది. ఆ చీకటి నిశ్శబ్దం సన్నిహితమవుతుంది. నిశ్శబ్దం నైరాశ్యంలోకి దింపుతుంది. నిరాశ మనిషిని వొంటరివాణ్ణి చేసేస్తుంది. తగిన వైద్యం లేకపోతే ఒంటరితనం క్యాన్సర్ లా వ్యాపిస్తుంది. మనిషిని ఒక్కసారిగా పిచ్చివాణ్ని చేసేస్తుంది. అన్నిటికన్నా భయంకరమైన వ్యాధి ఒంటరితనం.
కానీ భార్గవి అంతవరకూ రానివ్వకుండానే ఆ జబ్బుని అతికష్టంమీద జయించింది. అయితే కొన్ని జబ్బులకు వైద్యం జరిగేటప్పుడు సైడ్ ఎఫెక్టులున్నట్లు ఆమెకు ఈ ఒంటరితనాన్ని జయించే ప్రయత్నంలో మొండిత్నం అనే సైడ్ ఎఫెక్టు అంటుకుంది. 'ఎ గుడ్ ఫైట్ ఈజ్ బెటర్ దేన్ ఎ బేడ్ పీస్' అన్న సిద్దాంతాన్ని బాగా వొంటపట్టించుకుంది. అంతే ఆమె ఇంటిలో నోరెత్తకుండానే పనులు సాధించుకునే గుణం వచ్చింది. 'ఎదిరించలేని బలమైన వాదన మౌనం' అన్నాడో రచయిత. అక్షరాలా నిజం.
స్త్రీ జీవితం రెండు ఫేజుల్లో గడుస్తుంది. వివాహం వరకూ మొదటిది. వివాహానంతరం రెండోది. కొత్తవాతావరణం, కొత్త మనుష్యులు అంతా 'సరిక్రొత్తగా' ఈ రెండో ఫేజు ప్రారంభమవుతుంది. మొదటి భాగంలో అలవాటైన ప్రవర్తనతో ఉత్తరార్ధంలో ఇమడటం కొద్దిగా కష్టమే. అలాంటి స్నేహం భర్త స్నేహాన్ని దగ్గిరతనాన్ని స్త్రీ కోరుకుంటుంది. ఆ సమయంలోనే భర్తనుంచి దొరికిన స్త్రీ అదృష్టవంతురాలు. దొరకని స్త్రీ సివిక్ గానో, గయ్యాళిగానో మారుతుంది. మరి భార్గవి జీవితాన్ని కాలమే నిర్ణయించాలి.
2
మూడేళ్ళు గడిచాయి. డిగ్రీ చేతికి వచ్చింది. ఇంటర్ పాసు మార్కులతో అతికష్టంమీద పాసయిన తమ్ముడికి యాభైవేలు డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ సీటు కొనిపెట్టాడు తండ్రి. పోస్టుగ్రాడ్యుయేషన్ చేస్తానన్న భార్గవి కోరికను వెంటనే తిరస్కరించాడు. ఎంత చదువుకుంటే అంతకంటే ఎక్కువ చదువుకున్న భర్తను తేవాలి. అంటే ఎక్కువ కట్నం పోయాలి. కాబట్టి ఆమె చదువు మానేసి ఏదయినా ఉద్యోగం చేసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయం.