Previous Page Next Page 
విషవలయం పేజి 35

    "మీరా? ఇంత రాత్రప్పుడు వచ్చారేం?" అన్నాడు చలించిపోతూ.

    "తలుపు తియ్యి బాబూ చెబుతాను" అన్నాడు వెంకట్రామయ్యగారు నీరసంగా.

    గొళ్ళెం తీశాక "ముందు లోపలకు రండి" అన్నాడు సత్యమూర్తి. ఇద్దరూ గబగబా నడిచి క్రింద వసారాలోకి వచ్చారు.

    వెంకట్రామయ్యగారు పంచ, చొక్కా, మనిషి ముద్దగా తడిసిపోయి, వున్నాడు. తల, శరీరం సమస్తం నీళ్ళు కారిపోతోంది. చలికి దేహం గజగజమని వొణికిపోతోంది అలిసిపోయినట్లుగా, అమిత బలహీనంగా వున్నట్లు కాంతిని కోల్పోయివున్న ముఖం, కనిపించే నిస్త్రాణ చాటుతున్నాయి.

    ఆ స్థితిలో ఆయన్ని చూసేసరికి సత్యమూర్తికి ఏడుపొచ్చింది. "ఏమిటిది వెంకట్రామయ్యగారూ?" అని గొణిగాడు అస్పష్టకంఠంతో.

    ఆయన గోడకి తన శరీరాన్ని ఆన్చి నిలబడి రెండు మూడుక్షణాలు విశ్రాంతికోసం అన్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి చొక్కా లోపలినుంచి దళసరి గుడ్డతో చేయబడిన ఓ సంచీని బయటకు తీశాడు. వణికే చేతులతో దాని మూతికున్న తాడువిప్పి అందులోంచి కొన్ని రూపాయల నోట్లను బయటికి తీశాడు. అందులో పదిరూపాయలవీ అయిదు రూపాయలవీ, రెండూ, ఒకటి అన్నీ కలగా పులగంగా వున్నాయి. "ఇదిగో నాయనా మొత్తం రెండువందలు లెక్క చూసుకో.." అన్నాడు అందిస్తూ.

    సత్యమూర్తికి ఏమి చేయటానికీ పాలుపోలేదు. గుండె ఎవరో నలుపుతున్నట్లుగా వుంది. ఏంజరిగిందో తెలీదు. అతని చేతులు యాంత్రికంగా ముందుకు సాగి ఆ నోట్లని అందుకున్నాయి.

    "నాకు పైకం యివ్వటంకోసం అర్ధరాత్రివేళ మీ ఊరినుంచి ఎనిమిదిమైళ్ళ దూరం వర్షంలో నడిచి వచ్చారా?" అన్నాడు దడదడలాడి పోతూ, ఆయనవంక పరీక్షగా చూస్తూ.

    ఆయన కాళ్ళకు చెప్పులు లేవు. మోకాళ్ళదాకా బురద, రొచ్చు అంటుకుని భీభత్సంగా వున్నాయి.

    "ఏం చెయ్యను బాబూ మరి? ఒకప్పుడు నా అవసరంలో నన్నాదుకుని రక్షించావు. ఇప్పుడు నువ్వు ఎలాంటి యిబ్బందిలో వున్నావో, జీవితంలో అన్నిరకాల అనుభవాలూ అనుభవించినవాడ్ని కాబట్టి అవసరమన్నా ఆపద అన్నా నాకు బాగా తెలుసు. ఎప్పుడూ అడగనివాడివి నోరు విడిచి అడిగావు ఇక్కడ్నుంచి వెళ్ళినదగ్గర్నుంచి కాలూ చెయ్యీ ఆడలేదు. ఎలాగయినా నీ ఋణం తీర్చేయాలి. ఈ రాత్రే...!ప్రయత్నించాను. ఎలాగో సాధించగలిగాను" అన్నారాయన తృప్తిగా నిట్టూరుస్తూ.

    ఆ ఉదయం వెళ్ళినాయన అప్పట్నుంచీ యింతవరకూ అదే ప్రయత్నంలో వున్నారన్నమాట. ఎందర్నో కలుసుకుని వుంటాడు. రూపాయి కాయితాల దగ్గర్నుంచీ పోగుచేసి వుంటాడు. ఇంట్లోని మిగిలిన సామానంతా తెగనమ్మివుంటాడు.

    "ఎంతపని జరిగింది!" అని తనలో తాను గొణుక్కున్నాడు. ఇంకేదో చేయాలని, అయిపోవాలని వుంది.

    "ఈ రాత్రికి యిక్కడ పడుకోండి. ఈ వర్షంలో మళ్ళీ వెళ్ళలేరు ప్రయాణం తట్టుకోలేరు" అన్నాడు.

    ఆయన తల అడ్డంగా ఊపాడు. "కాదు నాయనా, వెళ్ళాలి. ఇంట్లో నా కూతురు ఒక్కతే వుంది. అసలే అది కాపురం చెడి యింటికివచ్చింది. ఇప్పుడు జబ్బుతో వుంది. నేను తప్ప ఎవరూ లేరు యింట్లో. వెళతాను బాబూ. అది భయపడిపోతూ వుంటుంది. వస్తాను"

    ఉలికిపడినట్లు, అవతల భీభత్సం జరిగిపోతున్నట్లు తొట్రుపాటుతో ఆయన సత్యమూర్తి ఏమనటానికీ సందివ్వకుండా గబగబ వర్షంలోకి నడిచి, గేటుదాటి చీకట్లో కలిసిపోయాడు.

    ఈ అంధకారంలో, డొంకల మధ్యనుండి, అలిసిపోయిన ముసలి శరీరాన్ని యీడ్చుకుంటూ..మళ్ళీ ఎనిమిది మైళ్ళు.

    అతనికి వళ్ళు గగుర్పొడిచింది. అట్లాగే చూస్తూ నిలబడ్డాడు. హృదయ క్షేత్రంలో వెయ్యి కంఠాలు వెక్కిరిస్తున్నాయి, ఘోషిస్తున్నాయి, ఏడుస్తున్నాయి.

    అతని కళ్ళు, ఆకాశం వర్షిస్తున్నాయి.
   
                                                                                          12

    అనుకోకుండా చెలరేగిన అనేక కలతలవల్ల గృహ వాతావరణం మరీ అల్లకల్లోలితమైపోయింది. నిడమర్రులో ఏడెనిమిది ఎకరాల పొలం వుంది. దాన్ని అంతవరకూ కౌలుకు చేస్తున్న రైతులు తాము ఆ యేడు కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టటమే కాకుండా ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు ఇవ్వటం మానుకున్నారు. దరిమిలాను వాళ్ళంతా బాగా బరితెగించి వున్నారనీ, "అసలా వూళ్ళోకి ఎవరడుగు పెడతారో చూస్తాముగా" అని మీసాలు దువ్వుతున్నారని తెలిసింది. అసలు అక్కడి మనుషులు మొదటి నుంచీ అదే వరస. వాళ్ళతో జరగడానికి దిగి, నెగ్గుకు రాలేక అక్కడి పొలాలు అమ్మేసుకుని చేతులు దులుపుకున్నవాళ్ళు చాలా మంది వున్నారు. బలరామయ్యగారు మొండి ఘటం అవటంవాళ్ళా, అనుభవాలు బాగా తెలిసివుండి జాగ్రత్తగా మసలుకుని వుండటంచేతా చక్రం త్రిప్పుకురాగలిగారు. మళ్ళీ ఇప్పుడు వ్యవహారం మొదటికి వచ్చింది. పైగా అసలుకే ఎసరు

 Previous Page Next Page