Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 25

  

        పట్టాభిరామయ్య బంధుప్రీతి రోజురోజుకీ పెరుగుతూనే వచ్చింది. బంధువుల్లో గాని, ఊరివాళ్ళలోగాని ఎవరయినా ఆర్ధిక పరిస్థితి బాగాలేక పిల్లలను చదివించ లేకపోతే ఇంటికి రప్పించి తనింటిలోనే వుంచి ఫీజులు కట్టి మరీ చదివించేవాడు. స్వంత సంతానం ఒక్కరే అయినా ఇంటినిండా ఎప్పుడూ పిల్లలు బిలబిలమని తిరుగుతూండేవారు. తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఆయనలోని బలహీనతను క్యాష్ చేసుకునేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందిని చెప్పి డబ్బు కూడా తీసుకునేవారు. అన్నపూర్ణమ్మ ఎప్పుడు చూసినా వంటింటిలోనే కనిపించేది. ఎవరినుండీ ఎలాంటి మాట రాకుండా వుండటానికి శతవిధాల ప్రయత్నం చేయడంతోటే ఆమె జీవితమంతా గడిచిపోయింది.
   
    అనూరాధకు తనకు తోడబుట్టిన వాళ్ళు లేరనే కొరత తీరుతుందనుకున్నాడు పట్టాభిరామయ్య కాని ఆమెకు మాత్రం వాళ్ళంతా వెళ్ళిపోయి యిల్లు ప్రశాంతంగా వుంటే బాగుండుననిపించేది. వీలయినప్పుడల్లా తోటలోనే తిరుగుతూండేది. చెట్లమీద తిరిగే ఉడతలు, తొండలు, బారులుగా పాకే చీమలు, ఎగిరే పక్షులు ఆమెకు నేస్తాలు వాటికే ఉపన్యాసాలు యిచ్చేది, పాఠాలు అప్పగించేది.
   
    ఒకరోజు ఆ కుటుంబంలో అనుకోని సంఘటన జరిగింది.
   
    పట్టాభిరామయ్య చాలా పట్టుదల మనిషి ఆఫీసులో ఒక అధికారితో గొడవపడి ఉద్యోగం రిజైనుచేసి ఇంటికి వచ్చేశాడా రోజు. ఎక్కడోచోట మంచి ఉద్యోగం దొరక్కపోదనే నమ్మకం వుండబట్టి తొందర పడ్డాడు. కాని అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం ప్రతిసారీ సాధ్యపడదు. మరో ఉద్యోగం దొరికేలోపున ఎన్ని అవస్థలు పడాలో ఆయనూహించలేకపోయాడు. కుటుంబం చిన్నదే కాని బాధ్యతలు ఎక్కువ, పొదుపు అసలు లేదు. ఆ సమయంలో ఆసరా ఇవ్వాల్సిన బంధువులు, మొండిచెయ్యి చూపించారు. ఒక బస్తా బియ్యం పంపి ఒక తమ్ముడు, రెండువేలు పంపు మరొక తమ్ముడు అన్న భారం తగ్గించేశామని గొప్పలు చెప్పుకున్నారు. అపకారికి ఉపకారం చేయాలనుకోవడం, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలనే గాంధీతత్వం గల పట్టాభిరామయ్య వాళ్ళమీద కక్ష కట్టలేదు. అది తనకో పరీక్షా సమయం అనుకున్నాడు. దాదాపు సంవత్సరంపాటు ఆయనకు ఉద్యోగం లేకుండా పోయింది. పన్నెండేళ్ళ అనూరాధ అపుడే మొదటిసారి బీదరికాన్ని చవిచూసింది. సంగీతం మాస్టారు రావడం మానేశారు. డానికి ఆమె బాధపడలేదు. తల్లిదండ్రుల ఇబ్బంది ఆమెకు కొద్దిగా అర్ధమవుతోంది. ఆమెకు అర్ధంకానిది ఒక్కటే, అంత కష్టంలోనూ తండ్రి ఎవర్నీ ఇంట్లోంచి పంపేయకపోగా అప్పులు చేసి వాళ్ళను పోషిస్తూ ఫీజులు కట్టడం దేనికో పనిమనిషినిమాన్పించడంతో తల్లి ఒక్కతే ఇంటెడు పనీ చేసుకుంటూ సతమతమవుతుంటే చూడలేక సాయపడడం మొదలుపెట్టింది. అంత చిన్నతనంలోనే ఇంటి పనంతా చేయడం, తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోతే పదిమందికి వంటచేసి భోజనాలు పెట్టడం అలవాటయి పోయాయామెకు. ఇంటిలో వున్న బాబాయిల పిల్లలంతా మగపిల్లలు కాబట్టి ఆమె పనికి వంకలు పెట్టి ఆనందిస్తూండేవారు. వాళ్ళకు దూరంగా వుండడానికి ఆమె తోటనీ, ఒంటరితనాన్నీ  మరింత ఆశ్రయించేది. ఒకరోజు పట్టాభిరామయ్య తమ్ముళ్ళ ద్వారా ఏదయినా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నించడానికి స్వంత ఊరికి వెళ్ళాడు. వస్తానన్న రోజుదాటి నాలుగు రోజులయిపోయింది. ఇంటిలో వస్తువులన్నీ నిండుకున్నాయి. అన్నపూర్ణమ్మ యెప్పుడూ యెవరి దగ్గరా చేయిచాచి అడగలేదు. వాళ్ళింటికి కాస్త దూరంలో తోట అంచున కొన్ని ఇళ్ళున్నాయి. అందులో వుండేవాళ్ళంతా మధ్యతరగతి కుటుంబీకులే వాళ్ళకు అన్నపూర్ణమ్మగారంటే వల్లమాలిన అభిమానం. అవసరానికి ఎప్పుడేది అడిగినా కాదనలేదావిడ. వాళ్ళకు ఇప్పటి పరిస్థితి కొంతవరకు తెలుసు. ఆమె ఇబ్బందిలో వుందని తెలియగానే చేతిలో వున్న డబ్బు తెచ్చి ఇచ్చారు. పదిమందికి మూడు పూటలా భోజనానికి ఎన్నాళ్ళు సరిపోతుందది? పైగా స్కూలు ఫీజులు కట్టాలని గొడవపెడుతున్నారంతా.
   
    "బామ్మగారింటికి వెళ్ళి నాలుగుశేర్ల బియ్యం వున్నాయేమో అడిగి వస్తావా రాధా?" అన్నపూర్ణమ్మ గత్యంతరం లేక రాధను పంపాలని నిశ్చయించుకుంది.
   
    "పోమ్మా, నేనూ వెళ్ళను. మనింటికి వస్తే ఇల్లంతా తన స్వంతంలా తిరుగుతుందిగాని వాళ్ళింటికి వెళితే లోపలకు రాకు వరండాలో నిలబడు' అంటుందావిడ. వాళ్ళ వంటింటిలో కాలుపెడితే మైలపడి పోతుందట. నే వెళ్ళను" అంది రాధ కోపంగా.
   
    "అట్లా అనుకుంటే ఎలాగమ్మా? వాళ్ళ చాదస్తాలు, ఆచారాలు వాళ్ళవి. మనం అలా విమర్శించగూడదు. ఒక్కసారి వెళ్ళిరామ్మా అన్నయ్య వాళ్ళు అప్పుడే తొందరపెడుతున్నారు" బ్రతిమాలింది ఆవిడ.
   
    అనూరాధ చిరాకు పడుతూనే వెళ్ళి బియ్యం తెచ్చింది.
   
    "ఎక్కువ లేవుట, ఇవే ఉన్నాయని ఇచ్చింది. త్వరగా వండుతావా అమ్మా ఆకలేస్తోంది" అంది.
   
    "మా అమ్మగదూ యీ రొట్టె తినేసి వెళ్ళిపో, లేకపోతే ఆలస్యం అయిపోతుంది. సాయంత్రం వచ్చేటప్పటికి వేడి వేడి అన్నం, కూరా వండి ఉంచుతాను" ప్లేటులో ఓ రొట్టెముక్క పచ్చడివేసి అందించిందావిడ.
   
    అనూరాధకు అప్పుడు ఏడుపు రాలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ తోటలోకి వెళ్ళిపోయింది. గున్నమామిడి చెట్టుకింద కూర్చుని తల మోకాళ్ళ మధ్య దాచుకుంది.
   
    'అమ్మలెందుకు కొడతారు? అల్లరిచేస్తే, చెప్పినమాట వినకపోతే కొడతారు. బాగా చదువుకోకపోతే, అదీ యిదీ కావాలని పేచీ పెడితే కొడతారు. చిన్నప్పుడు అన్నం తినకపోతే కొట్టేది అమ్మ కాని ఆకలివేసి అన్నం తిన్నందుకు కొట్టిందిప్పుడు. కడుపునిండా అన్నం తిన్నా ఇదేం న్యాయం? ఆడపిల్లను కాబట్టి దెబ్బలు తిన్నాను. అదే అన్నయ్య వాళ్లనయితే అలాగే కొట్టేదా? సృష్టిలో ఆడపిల్లగా పుట్టడం అంత నేరమా?' అనుకుంటే అప్పుడొచ్చింది ఏడుపు. తలెత్తి చూస్తే తన బాధను అర్ధం చేసుకున్నట్లుగా నేస్తాలన్నీ దగ్గరలోనే తిరుగాడుతున్నాయి. మెడకింద ఎరుపు మచ్చ వున్న తొండ 'ఇంత పెద్దదానివయి ఏడుస్తున్నవా' అన్నట్లు తలకిందకూ పైకీ ఆడిస్తోంది. కొమ్మమీద ఉడుత తన దుఃఖంలో పాలు పంచుకున్నట్లుగా జాలి చూపులు చూస్తోంది. పైకొమ్మ మీద కోయిల 'కూ' అని విషాదగీతం మొదలుపెట్టింది. వాటిని చూడగానే ఆమెలో ఏడుపు ఎగిరిపోయింది. చాలాసేపు వాటినే చూస్తూ కూర్చుండిపోయింది.
   
    ఆరోజు ఉదయం అమ్మమీద పెద్ద అన్నయ్యలంతా సరిగ్గా ఫీజులు కట్టక స్కూల్లో మాటలు అనిపించుకోవలసి వస్తోందని, కడుపు నిండా తిండైనా పెట్టడం లేదని ఎగిరి పడ్డారన్న విషయం ఆమెకు తెలియదు. తమ తల్లిదండ్రులు వూరినించి అన్నీ పంపిస్తున్నా ఆవిడే సరిగ్గా చూడటం లేదన్నట్లు ప్రవర్తించారు. ఆమె జవాబు చెప్పలేక ఏడుస్తూ కూర్చుండిపోయిన విషయం ఆ రాత్రి తండ్రి వచ్చాక తెలిసింది. తల్లి అన్నం తిని అప్పటికే నాలుగు రోజులయ్యిందన్న విషయం కూడా అప్పుడే వింది.
   
    అమ్మ తనను ఎందుకు కొట్టిందో అర్ధమయ్యి 'ఎవరయినా తప్పు చేస్తే ఎందుకు చేశారు?' అన్న ఆలోచన మొదటిగా రావాలి అని గ్రహించుకుంది అనూరాధ జీవితంలో గొప్ప ఫిలాసఫీ అది.
   
    అవతలివారి ప్రవర్తనని ఆ కోణంలోంచి ఆలోచించటం...
   
    కొద్ది నెలల్లో తండ్రికి ఏదో ఉద్యోగం దొరికింది. వాళ్ళ కష్టాలు గట్టెక్కాయి. కానీ ఆనాటి పాతరోజులు ఆమె జీవితాంతం మర్చిపోకుండా మనసులో ముద్రించుకుపోయాయి. బీదరికం ఆమెను మరెప్పుడూ భయపెట్టలేదు. చుట్టుప్రక్కలవాళ్ళ జీవిత రీతులను గమనించడం మొదలు పెట్టిందప్పుడే.
   
    కుడివైపున చివరింట్లో బామ్మగారు ఆమె తమ్ముడు, కొడుకూ, కోడలూ, పెళ్ళికాని కూతురూ వుంటారు. బామ్మగారికి చాలా చాదస్తం. కూతురికి ఎందుకు పెళ్ళికాలేదో తెలియదుగాని ఆమె కొడుకునీ, కోడల్నీ నవ్వుతూ మాట్లాడుకోనిచ్చేది కాదు. అత్తాకోడళ్ళు ఎప్పుడూ కీచులాడు కుంటూనే వుంటారు. అమ్మమాట విని భార్యను తెగ బాదేవాడు ఆ ప్రబుద్దుడు. భార్యది తప్పుకాదని తెలిసినా ఎదురు చెప్పలేక ఆమెమీద చెయ్యి చేసుకునే అతడిని అసహ్యించుకునేది అనూరాధ. "నేనే ఆ పరిస్థితిలో వుంటే రెండు వాయించి పుట్టింటికెళ్ళిపోతాను" అనుకునేది.
   
    రెండో ఇంట్లో వుండే తోటమాలి కుటుంబం చూడముచ్చటగా వుండేది. మాలి భార్య కూడా రోజల్లా కష్టపడేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే వుండేది. ఇద్దరు పిల్లలనూ క్రమం తప్పకుండా బడికి పంపేది. వాళ్ళను చూస్తుంటే డబ్బు లేకపోయినా ఫర్వాలేదు అనిపించేది.
   
    మరోపక్క చిన్న పోర్షన్ లో వుండేది దుర్గమ్మ. ఆమె ఒంటరిగా వుండేది ఆమె గుణం మంచిదికాదని ఎవరొఇఒ ఆమెను ఇంటికి రానిచ్చేవారు కాదు. అనూరాధకు ఆమె అంటే ఇష్టం. అప్పుడప్పుడూ ఎవ్వరూ లేకుండా చూసి వచ్చి తోటలో కూర్చునేది దుర్గమ్మ. "నేనో దురదృష్టవంతురాలిని. మగవాళ్ళ మాటలు నమ్మి జీవితం నాశనం చేసుకున్నాను. చదువు లేక ఇలా అయిపోయాను. నువ్వు బాగా చదువుకోమ్మా మంచి ఉద్యోగం చెయ్యి, మగవాడిమీద ఆధారపడకుండా బ్రతకడం నేర్చుకో" అని చెప్పేది. బామ్మగారిని అందరూ "దుర్గమ్మ - మీ మరదలు" అని ఎందుకు వెక్కిరిస్తుంటారో చాలా రోజులు అర్ధంకాలేదు. ఒకరోజు ఉదయం పూలు కోసుకుంటుంటే బామ్మగారి తమ్ముడు దుర్గమ్మ ఇంట్లోంచి బయటకు రావడం చూసింది. ఆయనకు లేని వ్యసనం అంటూ లేదు పేకాట, గుర్రప్పందాలు, ఇంట్లో ఇద్దరు భార్యలు, అరడజను సంతానం అయినా బామ్మగారు అతడిని ఒక్కమాటయినా అనదు. "ముదనష్టపుది నా తమ్ముడిని వలలో వేసుకుంది" అని దుర్గమ్మను తిడుతుండేది.

 Previous Page Next Page