Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 24

  

       విశాల కూడా తన స్నేహితురాళ్ళను కలవాల్సిన రోజును మర్చిపోలేదు. దానికింకా రెండేళ్ళ టైముంది. ఏ లోపల తన సంసారంలో కలతలుపోయి చక్కబడతాయనీ, తను గర్వంగా స్నేహితుల దగ్గర తన కథ చెప్పుకోవచ్చుననీ ఆశిస్తోంది.
   
    మూడో అమ్మాయి అనూరాధ ఆ ఊళ్ళోనే వుంటుందని తెలిసినా ఆమెను కలవడానికి ప్రయత్నించలేదెప్పుడూ ఆమె తనకంటే మంచి మార్కులతో పాసయి మంచి కాలేజీలో సీటు సంపాదించుకోవడం విశాలలో కొద్దిగా అసూయని రగిల్చింది. అనూరాధ అమ్మా, నాన్నా డబ్బు గుప్పించి ఆమెను ఫస్టుక్లాసులో పాసయ్యేట్లు చేస్తుంటారని విశాల నమ్మకం. తన ఆలోచన ఎప్పుడూ తప్పుకాదు అనే ప్రవృత్తిఆమెది. అందుకే అనూరాధ అంటే కోపంతో కలవడానికి ఇష్టపడలేదు. ఒకటి రెండుసార్లు దారిలో కనిపించినా చూడనట్లుగా వెళ్ళిపోయింది.
   
    అనూరాధ కూడా ఆమెను కలవడానికి ప్రయత్నించలేదు.
   
    విశాలకు తన స్నేహితురాళ్ళలో ఎవరూ తనంత సుఖంగా వుండి వుండరని పెద్ద నమ్మకం. ఒకసారి పేపరు చరువుతూ "ఎవరో వైజయంతిట. ఐ.పి.యస్. ఆఫీసరు. చాలామంది బందిపోట్లను పట్టుకుందట. మీ స్నేహితురాలేనేమో?" అన్నాడు విశ్వం.
   
    "దాని మొహం అదయివుండదు. దానంత పిరికిదాన్ని నేనెక్కడా చూడలేదు. అది పోలీసాఫీసరేమిటి?" అని తేల్చిపారేసింది. తన స్నేహితురాలేనేమో తెలుసుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. వైజయంతి అంత ఉన్నత పదవిలోకి రావడం ఆమె వూహకందని విషయం.
   
    విశ్వానికి కూడా ఇంట్లో సంతోషం లేదిప్పుడు. పదిమంది స్నేహితులను వెంటేసుకెళితే కాఫీ, టీలు అందించలేకపోతోంది విశాల. ఆమె వంటింట్లో తన్నుకుంటుంటే తను వొంటరిగా కూర్చుని సినిమాలు చూడడం గిల్టీగా అనిపిస్తోంది. పిల్లల దగ్గర అతడికి చనువులేదు. వాళ్ళ చదువుల గురించి తెలియదు. ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకోవడం అతడివల్ల కావడంలేదు. అందుకే ఎక్కువ సమయం బయట గడుపుతున్నాడు.
   
    రాధ సునీత ఇంటి ఓనరు. ఆమెకు ఆఫీసులో కొలీగ్ కూడా ఆమెదో విషాద గాధ భర్తవల్ల ఆమె కెలాంటి సుఖంలేదు. అతడిని ఎదిరించి వచ్చేసి ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరు కూతుళ్ళని పోషించుకుంటోందామె. ఆమెకూడా చాలా పుస్తకాలు చదివింది మంచి అభిరుచులు గలది. ఆమె గురించి తెలిశాక విశ్వం సునీతని కలుసుకునే నెపంమీద తరచు వాళ్ళింటికి వెళ్ళడం సాగించాడు. రాధ వ్యక్తిత్వం అతడిని బాగా ఆకర్షించింది. ఆమెతో మాట్లాడుతుంటే గంటలు క్షణాల్లా గడిచిపోయేవి. ఇద్దరూ మంచి స్నేహితులయిపోయారు. ఆ స్నేహం మోతాదు మించిపోయింది కొద్దిరోజుల్లోనే.
   
    విశ్వనాధాన్ని అంతగా ఆకర్షించిన రాధా మరెవరో కాదు. ఆ స్నేహబృందంలో మూడో వ్యక్తి అనూరాధే.
   
                                 అనూరాధ
   
    అదో నందనవనం లాంటి రెండెకరాల స్థలంలో రకరకాల పూలతోట ఫలవృక్షాలతో నిండివుంది. ఒక చివరగా పెద్ద ఇల్లు వుంది.

    ఇంటికెదురుగా ఒకపక్క మల్లెపొదలు బారులు బారులుగా తీర్చివున్నాయి. వాటి మధ్యగా వేసిన ఆర్చీలపై సన్నజాజి, కాశీరత్నం, బఠాణీ పూలతీగెలు పాకించారు. వాటికి వెనక పక్క ఖాళీస్థలంలో అక్కడక్కడా నందివర్ధనం, గులాబీ, అన్ని రంగుల మందారాలు, గన్నేరు పూలతో విరబూసి వున్నాయి. అన్నింటికి మధ్యలో పెద్ద నీళ్ళటాంకుంది. దానిలో కలువలు పూస్తాయి. దానిచుట్టూ వున్నా అరెకరం ఖాళీస్టలంలో కాలానుగుణంగా పూచే బంతులు, చేమంతులు, కనకాంబరాలు వేస్తాడు మాలి.
   
    ఆ యిల్లు ఓ రాజప్రసాదంలా వుంటుంది. ఇంట్లోకి వెళ్ళాలంటే పన్నెండు ఎత్తయిన మెట్లెక్కాలి. మెట్లకి ఇరువైపులా చేసిన సైడ్ స్టెప్స్ మీద రకరకాల మొక్కలు కుండీల్లో పెంచబడుతున్నాయి. మెట్లెక్కగానే పెద్ద వరండా-దాని వెనుక హాలు - అది దాటగానే కుడిపక్కన దేవుడి గది.
   
    ఎండాకాలం కావడంతో అందరూ వరండాలోనే పడుకుంటారు. ఉదయం అయిదున్నర అయుంటుంది. వరండాలో మంచంమీద పడుకున్న పాక కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. పది నిముషాల్లో స్నానం కూడా పూర్తికావించింది.
   
    ఎదురుగా నల్లటి కాన్వాసుపై అరుణ రాగాలు దిద్దుతున్నారెవరో, అరవిరిసిన పూలన్నీ సూరీడు వెచ్చదనం కోరుకుంటున్నాయి. మంచు తడిసిన రేకుల కనుల్ని బలవంతంగా విప్పుతున్నాయి. ఆ దృశ్యం చూసిన వారికి ప్రకృతిలో జీవ రహస్యం బోధపడుతుందేమో!
   
    కదులుతున్న మబ్బుతునకలు, బెదిరిపోయిన వెన్నెల మరకలు క్రమక్ర్తమంగా అదృశ్యమైన లేయెండ సింహాసనం అధిష్టిస్తున్న వేళ రెండు చిన్నారి పాదాలు పచ్చికపై... "పరువు పరువున పోవు నెదతో, పరువులెత్తితి మరచి మేనె, మరచి" అన్నట్లు పరువులెత్తుతున్నాయి.రాత్రంతా వెన్నెల కడిగిన తోట, ఆ లేత కన్నుల్లో నిండిపోయింది. ఓ మూలగా మృదువుగా రాలిన పారిజాతాలు... "తూరుపున సింధూర రాగముదాలు! తొయ్యల తేరి తెచ్చిన పారిజాత ప్రసవమాల తెగి పూలన్నీ చెల్లా చెదురుగా పడ్డట్లు" స్పర్సకే రాలిన ఆ పూల బాలల్ని ఆ లేత చేతులు లలితంగా ఏరాయి. వాటిని జాగ్రత్తగా ఒళ్ళో పోసుకుని యింటిలోకి పరిగెత్తింది.
   
    తన చిన్న చిన్న చేతుల్తో దేవుడి పటాలను తుడిచింది. పూజా సామగ్రి అంతా తీసి శుభ్రంచేసి పెట్టింది. పూలసజ్జలో మిగతా పూలన్నీ వుంచి పారిజాతాల్ని పైన వుంచింది నలిగిపోకుండా గంధం చెక్కతీసి అరగదీసి చిన్న గిన్నెలోకి ఎత్తిపెట్టింది.

    "రాధీ, వచ్చి పాలు తాగు" గుమ్మం దగ్గిర పిలుపు వినిపించింది.
   
    "అయిపోయిందమ్మా వస్తున్నా" లేచి బయటకు నడిచింది.
   
    అనూరాధ వయసప్పుడు పదేళ్ళు ఐదేళ్ళ వయసునుంచి ఆమె ఉదయం కార్యక్రమం అదే జ్ఞానం వచ్చినప్పటినుంచి ఆ యింటిలోనే పెరిగిందామె ఆ తోటలో ఏ మూల ఏ మొక్క మొలకెత్తిందో ఏ మొక్కకు చిగురు తొడిగిందో మాలికన్నా ఆమెకే బాగా తెలుసు.
   
    ఆ మొక్కలే ఆమె స్నేహితురాళ్ళు. ఆ చెట్లే ఆమెకు సహవిద్యార్ధులు మామిడి కొమ్మమీద కూర్చుని "తల్లీ నిన్ను దలంచి" పద్యం నెమరువేసుకుంటుంది. గన్నేరు నీడలో కూర్చుని ఎక్కాలు వల్లించేది. సపోటా చెట్టునీడలో సిమెంటుబెంచీమీద కూర్చుని హోంవర్కు చేసుకునేది.
   
    ఆమెలోని భావుకతకు బీజం వేసింది ఆ తోటే.
   
    భావుకత ఊహాగానాన్ని పెంచి మనిషి మీద పరోక్షంగా ప్రభావాన్ని చూపుతుంది. వాస్తవికత అడుగడుగునా అనుభవమై వెన్నుతట్టి జీవిత సత్యాలను తెలుపుతూంటుంది. అందులో కేవలం ఒకదాన్ని మలచుకోవడం అందరికీ సాధ్యమయ్యేదికాదు.
   
    అనూరాధ యింటి చుట్టూ ప్రకృతి తూరుపుగాలులతో సువాసనలు వెదజల్లుతూ ఉక్కిరి బిక్కిరి చేసి హృదయాన్ని రంజింపచేసి ఆమెను భావనా గగనంలో విహరింపచేస్తే, ఇంటిలో తల్లిదండ్రులు, చుట్టుప్రక్కల వ్యక్తుల జీవితపుటనుభవాలు ఆమెకు వాస్తవికతలోని ప్రభావం ఆమె మీద చాలా పడింది.

    పట్టాభిరామయ్య తల్లిదండ్రుల ఎనిమిదిమంది సంతానంలో జ్యేష్టుడు తరతరాలుగా అంకితమయిపోయిన ఊరు వదిలి పట్నం వెళ్ళి కాలేజీలో చేరి చదువుకున్న వ్యక్తి ఆ కుటుంబంలోనేకాదు- ఆ ఊరు మొత్తంమీద అతడే మొదటివాడు. తన కుటుంబానికీ, ఊరికీ సేవచేయడం ఒక బాధ్యతగా తీసుకున్నాడు. చెల్లెళ్ళందరి పెళ్ళిళ్ళు అయ్యేవరకు పెళ్ళిమాట ఎత్తలేదు. తమ్ముళ్ళకు చదువు అంతగా అబ్బకపోవడంతో వాళ్ళకి పొలాల బాధ్యత అప్పజెప్పాడు. తన పెళ్ళితోపాటు ఇద్దరు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఒకేసారి కానిచ్చాడు. ఎంత సంపాదించినా ఆ సంపాదనలో తన తమ్ముళ్ళకి కూడా వాటా వుందని నమ్మేవాడు. భార్య అన్నపూర్ణ చాలా బీదకుటుంబంలోంచి వచ్చినపిల్ల భార్య అంటే తనతో గుణాన్ని తేవాలిగాని ధనాన్ని కాదని నమ్మిన పట్టాభిరామయ్య తమ్ముళ్ళకు వాళ్ళ యిష్టప్రకారం పెళ్ళిళ్ళు కుదిర్చి తను మాత్రం ఏరికోరి బీదింటి అమ్మాయిని చేసుకున్నాడు. అందుకే ఆయనంటే ఆమెకు భక్తిభావం.
   
    పెళ్ళయిన పదేళ్లకు పుట్టిన కూతురంటే తండ్రికి చాలా అభిమానం తన ఆశయాలను, ఆదర్శాలను చిన్నతనం నుంచీ ఆమెకు నూరిపోసేవాడు.
   
    "సంగీతానికి కులమతాలు వుండవని నిరూపించిందమ్మా ఎమ్మెస్. ఆమెదే కులమో ఎవరికీ గుర్తుండదు. నియమ నిష్టలను సక్రమంగా పాటించే సద్బ్రాహ్మణులు కూడా ఉదయం లేవగానే ఆమె సుప్రభాతం వింటారు. అది వింటూనే తమ పూజా పునస్కారాలు ముగించుకుంటారు" అనేవాడాయన.

    అనూరాధకు చిన్నతనం నుంచీ ప్రకృతికీ, సంగీతానికీ అవినాభావ సంబంధం కనిపించేది. తెల్లవారుజామునే లేచి పక్షుల కలకలారావాలు వింటూ తోటంతా తిరిగేది. ఎవరూ వినడంలేదనిపిస్తే పూలు కోసుకుంటూ "మల్లెనమ్మా మల్లెనే, ఒళ్ళు సందేల జల్లనే" అని కూనిరాగాలు తీసేది.
   
    అయితే ఆమె సంగీత పరిజ్ఞానం స్కూల్లో ఎప్పుడయినా కీర్తనలు, అప్పుడప్పుడు లలితగీతాలు పాడడం వరకే పరిమితం అయిపోయింది కచేరయినా చేయాలనే ఉద్దేశ్యం ఆమెకుగానీ, చేయించాలనే ఉద్దేశ్యం తల్లిదండ్రులకు గాని లేదెప్పుడూ.

 Previous Page Next Page