Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 27

    ఆ తర్వాత ఇద్దరూ తాము వెళ్లవలసిన కంపెనీకి ఫోన్ చేశారు అతి కష్టంమీద కనెక్షన్ దొరికింది. అందులోచాలా మంది తెలుగువారున్నారు. వారిలో ఇద్దరు, ముగ్గురితో రాజారావుకు మంచి పరిచయముంది. అందులో డాక్టర్ మోహన్ ఫోన్ దగ్గరకువచ్చి- విషయమంతావిని- "మీరు తిన్నగా లాడ్జికివెళ్ళి గది కాళీచేసేసి- ఆటో ఎక్కి ఇక్కడకు వచ్చేసేయండి. ఆతర్వాత మిగతావన్నీ చూసుకుందం. మీకు గెస్టుహవుస్ లో గది బుక్ చేశాం..." అన్నాడు.   
    పాతికరూపాయలిచ్చినా గదిని అంత త్వరగా కాళీచేయాల్సి వచ్చినందుకు బాధగా వున్నా ఇద్దరికీ తప్పలేదు. ఈశ్వరరావు మాత్రం- "ఈ గది తీసుకుని వుండకపోతే కంపెనీకి బికారి వాటాలతో వెళ్ళి వుండేవాళ్ళం. ఇప్పుడు కాస్త మర్యాదస్తుల్లా కనబడుతున్నాం-" అని సంతృప్తి చెందాడు.   
    ఇద్దరూ ఆటో ఎక్కి మోహన్ చెప్పిన విధంగా చెప్పారు. ఆటో చాలాదూరం ప్రయాణం చేసింది. ఎంత దూరం వెళ్ళినా కంపెనీ రాకపోయేసరికి ఇద్దరికీ భయంకూడా వేసింది. దారిలో ఒకచోట బోలెడు గొట్టాలు పడవేసి వున్నాయి. ఆపైన అడ్డంగా గోడకట్టి వున్నది.       
    ఇక్కడ ఆపేసి- మిగతాదూరం నడిచి వెళ్ళమంటాడో లేదా ఇదే ఆ కంపెనీ అంటాడో-" అని భయపడ్డాడు రాజా రావు. కొత్త ప్రదేశాలలో అందులోనూ భాషకూడా తెలియనిచోట చాలా బెంగగా వుంటుందెవరీకైనా.   
    ఆటో అడ్డుగోడ దగ్గర ఆగిపోలేదు. అక్కణ్ణించి పక్కకు తిరిగికొంతదూరం వెళ్ళి మళ్ళీ కొత్తదారి పట్టింది. ఆటోడ్రైవర్ తమని పక్కదారి పట్టిస్తున్నాడన్న భయం మనసులో వుండడం మూలాన మేకపోతు గాంభీర్యం కాపాడుకోవడంకోసం రాజారావు వచ్చీరాని హిందీలో డ్రైవర్ తో కబుర్లాడం ఆరంభించాడు డ్రైవర్ మాట్లాడే తీరును బట్టి అతను కాలంతకుడిగా రాజారావుకు తోచలేదు.   
    మొత్తంమీద సుమారు పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసి వారు కంపెనీకి చేరుకున్నారు. రాజారావు కలుసుకోవలసిన వ్యక్తి డాక్టర్ సుందరరావు తెలుగువాడే. అయితే డాక్టర్ మోహన్ తో రాజారావుకున్న పరిచయం ఎక్కువ.  
    ఆటో అతను పన్నెండురూపాయలు తీసుకున్నాడు. చవకేనని తోచింది రాజారావుకు.   
    డాక్టర్ మోహన్ వచ్చి ఇద్దర్నీ రిసీవ్ చేసుకున్నాడు. ప్రయాణం బాగా జరిగిందా అంటూ కుశలప్రశ్నలు వేశాడు. ఇద్దరి చేతులలోని బ్యాగులూచూసి చాలా బాగున్నాయని మెచ్చుకున్నాడు. ఇద్దర్నీ లోపలకు తీసుకువెళ్ళాడు. వాళ్ళ ఆఫీసు ఒకటవ అంతస్తులో వుంది.  
    అక్కడే లేబరేటరీ కూడా వుంది. రాజారావు డాక్టర్ సుందరరావిని మీటయ్యాడు. అతను తన ప్రయాణం గురించి క్లుప్తంగా వివరించి మొదట్లో అనుకున్న ప్రకారంకాక ఇరవై రెండోతేదీ ఉదయం వరకూ వుంటున్నామని చెప్పాడు. సుందరరావు చాలా సిన్సియర్ టైపు. అతను వెంటనే గెస్టు హవుస్ కు ఫోన్ చేసి వీళ్ళు మరో మూడురోజులు ఎక్స్ ట్రాగా అక్కడుంటారని చెప్పాడు. ఆ తర్వాత- "మీ ఆఫీసుకి టెలిగ్రాం ఇవ్వాలేమో-టూర్ ఎక్స్ టెన్షన్ గురించి? అది మా కంపెనీద్వారా ఈయవచ్చు-" అన్నాడు సుందరరావు రాజారావుతో.   
    "అప్పుడే వద్దులెండి. మరి ఫ్రీప్లాన్దుగా వుంటుంది. ఈ రోజు సోమవారం కదా - ఏ గురువారంనాడో ఇస్తే - అవసరపడి ఇచ్చామానుకుంటారు. అసలు విషయం మా మాబాస్ కు నేను పర్సనల్ గా వ్రాస్తాన్లెండి-" అన్నాడు రాజారావు.   
    సుందరరావు రాజారావుకి ఆంధ్రాయూనివర్శిటీలో రెండేళ్లు సీనియర్. అప్పుడే ఇద్దరికీ పరప్సరం ముఖపరిచయముంది. మోహన్ రాజారావుకి ఏడాది సీనియర్. ఇద్దరూ ఒక ప్రొఫెసర్ వద్దనే రిసెర్చి చేయడంవల్ల ఒకరికొకరు బాగా తెలుసు. వీళ్ళిద్దరూకాక రాజారావుకు ఏడాది జూనియర్ అయిన డాక్టర్ చంద్రంకూడా అక్కడే తటస్థపడడంతో మనవాళ్ళు చాలామంది వున్నారని రాజారావు సంతోషపడ్డాడు. టైము గడవడం పెద్ద సమస్యకాకపోవచ్చుననుకున్నాడతను.
    ఈశ్వరరావు, రాజారావూ బరోడాలో ఎనిమిదిరోజులు గడిపారు. ఆ ఎనిమిదిరోజులూ వారు పొందిన అనుభవాలు జీవితంలో మరిచిపోలేనివి. కలసి సుఖపడ్డప్పటికీ, కష్టపడ్డప్పటికీ మనుషులమధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ విధంగా వారిద్దరూ ఎంతో సన్నిహితులయ్యారక్కడ. అయితే ఈ రచన ప్రయాణంలోని పదనిసలకు సంబంధించినది కావడం వల్ల- బరోడాలో వారు గడిపిన ఎనిమిదిరోజుల విశేషాలూ ప్రయాణానికి సంబంధించినవిగా ఈ కధను చెప్పే వ్యక్తి భావించడంలేదు. రిజర్వేషన్ లేకుండా జరిగిన ప్రయాణపు విశేషాలను గమనించిన పాఠకులకు రిజర్వేషన్ వుంటే ఏ విశేషాలూ వుండవని అనిపించవచ్చు. ఇటువంటి విషయంలో సందేహాలనవసరం. వీరిద్దరి తిరుగు ప్రయాణాన్నీ గమనిస్తే సరిపోతుంది. అందుకే మనకధ నవంబర్ ఇరవైరెండవ తేదీన వీరిద్దరూ తిరుగుప్రయాణానికి సన్నద్ధులు కావడంలో మొదలవుతుంది.  
                                                      6   
    అలారం గణగణ మ్రోగింది. రాజారావులిక్కిపడి లేచాడు. అలారంమీద అతనికట్టె నమ్మకంలేని కారణంగా రాత్రి తెల్లవార్లూ అతను కలతనిద్రపోయాడు. మధ్యమధ్య లేచి టైము చూసుకుంటూండేవాడు.  
    దేనికయినా నమ్మకం వుండాలి. నమ్మకంలేని ఔరంగజేబు సర్వనాశనానికి అతని అపనమ్మకం కారణమయింది. నమ్మకం వుంటే ఈశ్వరరావులా హాయిగా నిద్రపోవచ్చు ఈశ్వరరావుకు అలారంకంటే రాజారావుమీద ఎక్కువ నమ్మకంలాగుంది. ఈ ఎనిమిదిరోజుల బరోడా అనుభవాలలో అతనికి నమ్మకం పెరిగింది. అందుకే అతను అలారం కొట్టినా లేవలేదు. రాజారావు లేపాకనే లేచాడు. రాజారావు తన కాలకృత్యాలు ముగించుకున్నాకనే ఈశ్వరరావుని లేపాడు.

 Previous Page Next Page