ఈ ప్రపంచంలో తనెంత ఒంటరో ఆమెకి ఆ క్షణం అర్ధమైంది. తనమీద పడి తింటున్న వాళ్ళంతా తమ నిజస్వరూపాల్తో రాబందుల్లా కనిపించసాగేరు.
"నాక్కొంచెం ప్రేమ కావాలి. ఎంత కొంచెమైనా చాలు. కొందెం ఆప్యాయతా....." ఆమె జాలిగా అర్దిస్తోంది.
కొంచెం సేపటికి ఆమె తేరుకొంది. అదే అనిర్వచనీయమైన స్థితిలో ఆమె చేయి ముందుకు జరిపితే తలదిండు క్రింద ఒక ఫోటో తగిలింది. ఆమె అప్రయత్నంగా బైటికి తీసింది.
స్త్రీ జీవితంలోకి ఎప్పుడో ఒక్కసారి, ఒక పురుషుడు మాత్రమే దగ్గరికి వస్తాడు..... ఒకే ఒకసారి నిశ్చయంగా ఆ పురుషుడు తండ్రిగానీ, అన్నగానీ, తమ్ముడుగానీ అవడు. ఆ ఒకరి కోసమే స్త్రీ కలలు కంటుంది.
అయితే శైలజలాంటి దురదృష్టవంతురాలు చాలా మూగగా తమ బంధాల్ని పెనవేసుకొంటారు. ప్రపంచపు చివరి నాలుగు రోజుల్లో కూడా శైలజలాంటివాళ్ళు తమ సంస్కారపు పరిధినుంచి బయటకొచ్చి, తమ మనసు వెల్లడించలేరు. అతడు వప్పుకొంతాడా లేదా అన్నది వేరే ప్రశ్న. ఆమె చెప్పలేదంతే.
ప్రేమ ఎందుకు ఎప్పుడు ఎలా ఎవరిమీద కల్గుతుందో చెప్పటం కష్టం. అది జామెట్రీ కాదు, ఆల్జీబ్రా కహ్డు.
ఆమె తన ఒంటరితనాన్ని ఇన్నాళ్ళూ మనసులో ఎలా దాచుకొన్నదో, తన ప్రేమను కూడా అలాగే ఈ నాలుగు రోజులూ దాచుకొంటూంది.
ఆమె కంటినుంచి ఓ నీటిచుక్క జారిపడి ఫోటోని తడిపింది.
అతడిని యింకో అమ్మాయి ప్రేమిస్తోందని తెలుసు. తన కన్నా అతడి వయసు తక్కువనీ తెలుసు. అయినా ప్రేమ ప్రేమే.
ఆమె రమణ ఫోటోని వెనక్కి తిపింది. ఎండిన జిగురు అతుక్కొని వుంది అక్కడక్కడా. 'చాలా అందంగా వున్నాడు కదూ'....అన్న మాటలు.....'A' అన్న అక్షరం చేర్చి అతడికి తాను ఉద్యోగం ఇప్పించిన విదానం.....అన్నీ గుర్తొచ్చాయి.
అప్లికేషన్ ఫారమ్ నుంచి చింపిన ఫోటో అది. దాన్ని ముద్దు పెట్టుకుంది.
ఇక శైలజ గురించి రాయటానికేమీ లేదు.
నాల్గురోజుల తర్వాత ఆమె సమాధి అయిపోవచ్చుగాక. కలల్లో సమాధి ఎప్పుడో అయిపోయింది.
* * *
"భవతీ భిక్షాందేహి మాతా అన్నపూర్ణేస్వరి....." చేతులమధ్య భిక్షపాత్రతో ఎలుగెత్తి అరిచేడు వృద్దుడు.
జానకి బయటకొచ్చింది.
ప్రొద్దుట ఎనిమిదయింది.
అయినా చీకటిగానే వుంది. సూర్యుడి కద్దుగా ఒక నల్లటి గోళం. నక్షత్రాలు కనబడుతున్నాయి.
కొన్ని కోట్ల సంవత్సరాల్నుంచి వస్తున్న ఒక నిర్ణీతమైన పగలూ, రాత్రీ మరిక లేవు. అంతా రాత్రే. అంతా చీకటే.
"భవతీ భిక్షాందేహి....."
అంత వ్యధలోనూ జానకికి నవ్వొచ్చింది. "ప్రపంచం ఆఖరయిపోతూంటే ఇంకా బిచ్చమెత్తుకోవటం ఎందుకు తాతా.... ఎవర్ని అడిగితే ఎవరు కాదనరు? అయినా అసలు అడగటం ఎందుకు? కావల్సింది దొరికేచోట ఎవర్నీ అడక్కుండానే తీసుకోవచ్చుగా?"
"నా ఊహ తెలిసినప్పట్నుంచీ మధుకర వృత్తేనమ్మా! ఈ రోజు మనుగడకే ప్రమాదమొచ్చిందని మానుకోమంటావా తల్లీ....."
ఆమె స్థాణువైంది.
ఆ చిమ్మచీకటిలో.... ఆ స్థబ్ధపు వాతావరణంలో తన ఇంటిముందు నిలబడివున్న ఆ బిచ్చగాడి నిజాయితీ చూసి ఆమెకి కంటనీరు వచ్చింది..... అదే నిజాయితీ ప్రతిమనిషిలోనూ వుంటే.... మనిషి చావుని ఎంత హుందాగా ఆహ్వానించగలిగి వుండేవాడు!
తన ఆలోచనని నొక్కిపెట్టి లోపలికెళ్ళి హరికేన్ లాంతరు సాయంతో రాత్రి తాలూకు అన్నం కొద్దిగా వుంటే పట్టుకొచ్చింది.
"బాగా చీకటిగా వుంది తాతా! ఎలా వెళతావు?"
"వెలుగెలా వుంటుందో మాకు తెలీదమ్మా! నేను పుట్టుగుడ్డిని" అన్నాడు వృద్దుడు. అతడి గాజుకళ్ళు హరికేన్ లాంతరు వెల్తుర్లో నిస్తేజంగా వున్నాయి. అతడి మొహం దీప్తితో వెలుగుతోంది.
ఆమె అతడి పాత్రలో అన్నం వేసింది.
అతడు చెయ్యెత్తి "దీర్ఘ సుమంగళీ భవ" అన్నాడు. నెమ్మదిగా చీకట్లో కల్సిపోయేడు.
ఆమె అటే చూస్తూ నిలబడింది.
ఇంతలో లోపల్నుంచి రమణ వచ్చేడు.
"ఎవర్ని వదినా చూస్తున్నావ్".
"మనిషిని".
అతడికి అర్ధంకాలేదు. అయినా దానిగురించి ప్రశ్నించకుండా......"అన్నయ్యేడి?" అన్నాడు.
"తెలీదు బాబూ! ప్రొద్దున్నే ప్రక్కమీద లేరు" అంది.....ఆందోళన నిండిన కంఠంతో.
"ప్రొద్దున్నే ఎక్కడికి వెళ్ళేడు? అంతలోనూ ఇంత చీకట్లో?"
కిటికీల్లోంచి జనం బయటకు చూస్తున్నారు. అందరి మొహాల్లోనూ భయం పేరుకుపోయింది. పగలు ఎనిమిదయినా చీకటి..... వళ్ళు గగుర్పొడుస్తూంది. ఆక్రోశించటానిక్కూడా శక్తి లేదు. అంతా స్థబ్దత.
"ఎక్కడికి వెళుతున్నావ్?"
"అన్నయ్య ఎక్కడున్నాడో చూస్తాను..... ముందోసారి ప్రొఫెసర్ గారింటికి వెళ్తాను. ఆయనను చూసి చాలా రోజులయింది" అంటూ కదిలేడు రమణ.
* * *
బల్లకీ కుర్చీకీ మధ్యగా పడివున్నాడు ప్రొఫెసర్ ఆనందమార్గం. నాల్గురోజుల్నుంచీ తిండీ నీరూ లేకపోవటంతో శోషవల్ల సొమ్మసిల్లి పడిపోయేడు. ఈ క్షణమో మరుక్షణమో ఆఖరిశ్వాస పీల్చుకోవటానికి సిద్దంగా వుంది ఆ వృద్దుడి శరీరం. తన ప్రాణం పోయినా ఫర్లేదు. తను కనుక్కున్నది ప్రపంచానికి తెలిస్తే చాలు. కనీసం సగం మందన్నా బ్రతుకుతారు. భూమ్మీద మనుష్యజాతి అంతరించదు.
ఈ విషయాన్నెలా బయటకు తెలియపరచటం?
అతడు చేతులు మీద లేవటానికి ప్రయత్నించాడు..... అసలే వృద్దుడు. అందులోనూ నాలుగు రోజుల్నుంచీ ఏమీ తినలేదు. నీరసం ఒక్కసారిగా ఆవరించింది. కుప్పలా కూలిపోయేడు, మళ్ళీ లేవటానికి ప్రయత్నిస్తాడు.
అప్పుడు విన్నాడు బయట అలికిడి.
రమణ కంఠం.
"లేడా ఈయన?"
ఎవరో కుర్రవాడు సమాధానం ఇస్తున్నాడు, "లేడు, నాలుగు రోజుల క్రితం తాళం వేసుకొని వెళ్ళిపోయాడు."
"ఎక్కడికి?"
"తెలీదు."
ప్రొఫెసరు గట్టిగా కేక వేయాలనుకొన్నాడు. చిన్న మూలుగు మతఃరం బయటకొచ్చింది.
"నే వెళుతున్నాను. ఆయనొస్తే వచ్చి వెళ్ళేనని చెప్పు."
లోపల ప్రొఫెసరు గిజగిజలాడిపోతున్నాడు. టేబిల్ మీద గట్టిగా కొట్టటానికి ప్రయత్నించేడు. కుర్చీని బలంగా క్రిందికి తోసెయ్యాలని చూసేడు. సర్వశక్తులూ కూడగట్టుకున్నాడు. అయినా బలం చాల్లేదు. నిస్సత్తువ శరీరాన్ని తూలిపడేటట్టు చేసింది, లోపలనుంచి ఏడుపు తన్నుకొస్తూంది. నిస్సహాయంగా పడివున్నాడు.
బయట అడుగుల చప్పుడు నెమ్మదిగా దూరమయింది.
కొంచెం సేపు గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో పేరుకొంది. చావుకి ముందొచ్చే కళలాంటిది అతనిలో ప్రవేశించింది. నెమ్మదిగా చెయ్యిసాచి కలం అందుకొన్నాడు. 'నన్ను రక్షిస్తే నేను ప్రపంచాన్ని రక్షించగలను' కాగితం తీసుకొన్నాడు.
వణుకుతున్న వ్రేళ్ళమధ్య బలం అంతా పొందుపర్చి వ్రాయటానికి ఉపక్రమించేడు. ఒక్కొక్క అక్షరమే, ఒక్కొక్క అక్షరమే "నన్ను రక్షిస్తే....."
అంతే! అతడి చెయ్యి జారిపోయింది. కనురెప్పలు అచేతనమయ్యాయి. ప్రాణం శరీరాన్ని వదిలిపోతోంది. ఆఖరి శ్వాస ఊపిరితిత్తుల నుంచి బయటికి వస్తూంది. దాంతోపాటూ ప్రాణం కూడా, ఆత్మజ్యోతి ఆరిపోతున్న ఆఖరిక్షణం అతడి కళ్ళముందో దృశ్యం మెదిలింది.