Previous Page Next Page 
వెలుగుబాట పేజి 21


    ఝాన్సీ నాలుగడుగులైనా నడవకుండానే కామయ్యచౌదరిగారి భార్య అరుగు మీదనుంచి "డాక్టరమ్మా!" అని కేకేసి గబగబ ఝాన్సీ  దగ్గరికి వచ్చేసింది.ఝాన్సీకి ఆగక తప్పలేదు.
    "ఇదేంటి డాక్టరమ్మా! మీ అమ్మని వంటపని చేయిస్తున్నావటగా! తప్పుగదూ! చదువుకునోళ్ళు, నలుగురికి చెప్పాల్సినోళ్ళు మీరే ఇట్టాచేస్తే ఎట్టాగమ్మా! పాపం, ఆ ముసలామెని ఏడిపించబోకు" అని నీతులుచెప్పింది
    ఝాన్సీ నిస్సహాయంగా తాల్ దించుకోవలసి వచ్చింది. మరికొంతదూరం పోగానే, శాస్త్రులుగారి భార్య, ఆ తరువాత రాజ్యం పిన్నిగారూ, క్రమంగా ఇదే నీతిబోధకి పూనుకొన్నారు. ఇంక ముందుకు నడిచే సాహసం లేకపోయింది. గిర్రున వెనక్కు తిరిగి ఇంటికొచ్చింది.
    తల్లి సంచీలో పట్టుబట్టలు పెట్టుకొంటూంది. అక్క  ముక్కు చీదుతోది. ఝాన్సీ ఎక్కడికాని అడగకపోయినా, తల్లి తనే "లాయర్ గారింట్లో వంటకు మనిషి కావాలిటే! కుదుర్చుకుంటాను. అక్క కూడా ఎక్కడైనా కుదురు....."
    ఝాన్సీకి చెప్పలేనంత నీరసం వచ్చేసింది.. గోడకు జార్లగిలబడి, వట్టిక్రింద కూచుని, "అమ్మా! నన్ను యాగీ చెయ్యటమే నీ ఉద్దేశమా?" అంది కోపంగా.
    తల్లి అంతకంటే కోపంగా "యాగీ చేస్తున్నానా? ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావే! వాడి దగ్గరకే కదూ! మరి నిన్న నా కిచ్చినమాట యేమయిపోయింది? అంతే వయసురాగానే తమ సుఖం తప్ప మరేమీ కనిపించదు. నిజంగా తల్లీ, తమ్ముడూ అని ఆలోచించే దానివయితే, ఇలా తెగించి తిరుగుతావా? నేను వంటలుచేస్తే, నీకు నిజంగా కష్టంగా ఉందిటే" కోపం ఏడుపుగా మారుతోంది తల్లికి.
    ఝాన్సీ విసుగ్గా రెండు చేతులూ జోడించి "నేనక్కడికి వెళ్ళనుగాని, ఇంట్లోకి రామ్మా!" అంది.
    ఎలాగో హాస్పిటల్ కి వచ్చినా, మనసు దేనిమీదా లగ్నం చెయ్యలేకపోతోంది ఝాన్సీ. పేషంట్స్ మాట్లాడుతోంటే, వినిపించుకోదు. ఒకదానికి మరొకటిచెప్పసాగింది. ఎన్నో సందర్భాలలో మేరీ ఆమె పొరపాట్లు సర్దవలసి వచ్చింది. చివరకు నిగ్రహించుకో లేక "మేరీ! శాంతమ్మగారూ వాళ్లూ ఎలా ఉన్నారు?" అని అడిగింది.
    మేరీ ఆమెను నిశితంగా చూస్తూ "నాకు తెలియదు" అంది. ఆ చూపులను ఎదుర్కోలేకపోయింది ఝాన్సీ.
    ఝాన్సీ మేరీ సమాధానం చెప్పిన తీరునుబట్టి మరేమీ అడగలేకపోయింది. గడియారం ముళ్ళు తిరిగిపోతున్నాయి. ఏ పని చెయ్యలేని నిస్సత్తువ ఆవహించింది ఆమెకి మేరీ యాంత్రికంగా తనపని తాను చేసుకుపోతోంది. పన్నెండు దాటింది గడుయారం అరగంట కొట్టింది. ఆమెలో దుఃఖం పొంగి వచ్చింది. అది కుమార్ తన దగ్గరకు వచ్చే సమయం.
    "హాలో ఝాన్సీ!" కుమార్ కంఠం. ఎదురుగా కుమార్- చిరునవ్వుతో రేగిన జుట్టుతో "ఝాన్సీ చలమయ్యకి కడుపునొప్పి అన్నాడు. ఆపరేషన్ అవసరం అనుకుంటాను. ఇక్కడికి రమ్మన్నాను. వచ్చాడా! అడుగో! మేరీ, అతడిని ఆపరేషన్ కి సిద్ధం చెయ్యి!"
    ఝాన్సీ ఆపరేషన్ ధియేటర్ లోకిరా! ఈ ఆస్పత్రికి ఇంకా ఆపరేషన్ పరికారాలు చాలా కావాలి ఝాన్సీ! లిస్ట్  రాసి అధికారులకి పంపించావా? త్వరగా తెప్పించాటానికి ప్రయత్నించు. ఇక్కడ మనం చిన్న చిన్న ఆపరేషన్ లు మాత్రమె చెయ్యగలం. ఇది మేజర్ ఆపరేషన్. మనము ఎలాగో మేనేజ్ చెయ్యాలి. అతడికి త్వరగా ఆపరేషన్ చేసితీరాలి."
    కుమార్ రాకతో ఆస్పత్రికీ ఒక్కసారిగా జీవం వచ్చింది. అతడే ఒక నవజీవన చైతన్యస్రవంతి అయినట్లు చుట్టుపక్కల అందరికీ జీవచైతన్యం విరజిమ్మే పౌంటెన్ అయినట్టూ తోచింది.
    ఝాన్సీలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేసింది. కుమార్ కి బాసటగా ఆపరేషన్ కి సిద్ధపడింది. ఏమీ జరగనట్లు తమ మధ్య ఏమీ లేనట్లు ఎంత స్వచ్ఛంగా ఎంత సహజంగా ఉన్నాడు? ఇతని మనసులో బాధ లేదా? ఇతని జీవితంలో ఎన్నెన్ని బాధలు ఎదుర్కొన్నాడో తనకు తెలుసు కాని, ఆ ముఖం వడిలిపోతుంది? బాధలెదురైనపుడు సీసాలలో మధ్యం త్రాగుతూ జీవితంనుంచి పారిపోయే దేవదాసు కాడితడు, తనను తననే ఆ జీవితాన్ని కొమ్ములుపట్టి లొంగదీసుకుంటూ కర్తవ్య పధంలో సాగిపోయే ధీరమానవుడు.
    డ్యూటీ ముగిసాక అందరూ కలిసి కాఫీ తీసుకుంటారు. కుమార్ కాంపౌండర్ ని. నర్స్ ని కూడా పిలుస్తాడు. అది ఎప్పటి నుంచో రాకుండావుంటే బాగుండునని కోరుకుంది. కుమార్ తో ఏకాంతం అత్యంత సులభంగా అభించినంతకాలం దానిని ఏనాడూ ఉపయోగించుకోవాలనుకోలేదు. ఈనాడు  అతనితో కొద్దిపాటి ఏకాంతం దొరికితేచాలని  తపించిపోతోంది. ఆ రోజు ఎప్పటికంటె ఏవో జోక్స్ కట్ చేసి అందర్నీ నవ్వించాడు కుమార్. ఝాన్సీ అన్నీ మారిని నవ్వేసింది.
    వాచీ చూసుకుంటూ "మేరీ! ఇంక వెళ్దామా?" అన్నాడు. ఇదివరలో ఆ ప్రశ్న ఝాన్సీని అడిగేవాడు.
    "ఝాన్సీ! మేం వెళ్తాం!" అని ఆమెతో చెప్పి మేరీతో బయలుదేరాడు. ఇద్దరూ దేనికో నవ్వుకుంటూ నడుస్తున్నారు.
    కుమార్ కుటుంబం ఇప్పుడు మేరీ ఇంటిపక్క ఉంటున్నారు. అంచేత ఇద్దరూ  కలిసి వెళ్తున్నారు.
    అతడు మేరీతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మేరీతోనే కాదు. ఆ స్థానంలో పసిపిల్ల వున్నా. పండు ముసలమ్మవున్నా,  అతడలా నవ్వుతూనే మాట్లాడతాడు. ఈ విషయాలన్చి ఝాన్సీకి తెలుసు అయినా వారిద్దరూ అలా  పక్కపక్కళ నడుస్తూ నవ్వుకొంటూ వెళ్తోంటే, ఝాన్సీ మనసు వల్లింపనలవికాని బాధతో విలవిలలాడింది. ఒంటరిగా ఇంటికి బయలుదేరినడు, జీవితాంతము తను ఒంటరిగా నడవవలసిందేనా, అనే ఆలోచన వచ్చి గుండె గుభేలుమంది.

 

                                                           *    *    *


    బోసుబాబు సరళకు తన చెల్లెలి కొడుకు మాధవరావు నిచ్చి పెళ్ళిచేసి అతడిని ఇల్లరికం తెచ్చుకొన్నాడు. మాధవరావు మెట్రిక్  దాకా చదువుకున్నాడు. మావగారి డబ్బుతో వ్యాపారం  చెయ్యాలని కలలు కంటున్నాడు. ఒకసారి బజారులో సుందరమ్మ మాధవరావును చూసింది. అతడిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. మాధవరావు సంబరంగా వెళ్ళాడు. అప్పటినించీ అతనికి డబ్బుతో అవసరం ఎక్కువై పోయింది. డబ్బు తెమ్మని సరళని పీడించేవాడు. సరళ లేదంటే, చావా బాదేవాడు. కూతుర్ని అలా బాదుతోంటే, చూడలేక బోసుబాబు అడిగినదానిలో కొంతైనా మాధవరావు మొఖాన కొట్టేవాడు. రాను రాను ఈ వ్యవహారం శ్రుతిమించి రాగాన పడింది. మాధవరావు సరళను బాదటం బోసుబాబు డబ్బు గుమ్మరించవలసి రావవటమూ ఎక్కువయి పోయింది. ఇదంతా భరించలేక బోసుబాబు ఒకనాడు సుందరమ్మ ఇంటికి వచ్చాడు. పొంగివచ్చిన అసహ్యంమీద నవ్వు పులుముకుంటూ "రండి! రండి!" అని ఆహ్వానించింది. "మర్యాదలు చాలుకాని, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా?"
    సుందరమ్మ విరగబడి నవ్వుతూ "మీరు..... నాముందు నిలబడి. న్యాయా న్యాయాలగురించి మాట్లాడుతున్నారా?" అంది. ఆమె చూపులు బాకులు రువ్వుతున్నాయి.
    "జరిగిందేదో జరిగిపోయింది. నీ కెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. పసిదాని బ్రతుకు అన్యాయం చెయ్యకు."
    "నాకు డబ్బు నువ్వియ్యక్కర్లేదు బోసుబాబూ! నేనే సంపాదించుకోగలను. డబ్బేకాదు, నాకిప్పుడు బోలెడు బలగం కూడా తయారయింది. నువ్వు నామీదకొస్తే కొన్ని వందల కర్రలు నీ మీదకు  లేస్తాయి. ఇక నీ "పసిదాని" గురించి మాత్రం నాకు దిగులెందుకు? లక్షణంగా అయిన సంబంధం చేసావు. "పరువుగా" కాపురం చేసుకొంటూంది! అదేగా నువ్వు కోరుకున్నది? ఆ "పసిదాని" ఆనందం నువ్వు నిజంగా కోరివుంటే, ఒక "పసివాడు" అన్యాయంగా బలి అయిపోయేవాడు కాదు.
    "ఇంతేనా! నువ్వు చెప్పేది?"
    "ఫో! ఫో! నా ఎదుటినుంచి ఫో. ఏ పరువు కావాలని ఇంత దారుణానికి సిద్ధపడ్డావో, ఆ పరువు చూసుకుని చూసుకుని మురిసిపో! మీ పెద్ద కుటుంబాలలో పరువంతా ఇదేగా? ఫో! ఫో!"
    బోసుబాబు తలదించుకుని బయటకు నడిచాడు ఒకనాడు, సుందరమ్మ నీతిగా తననే నమ్ముకున్ననాడు అమానుషంగా ఆమెను ఊళ్లోంచి గెంటగలిగాడు. ఈ నాడు ఆమెకు ఊళ్లో చాలామంది ప్రియులున్నారు. ఆమె అన్నట్లే తాను ఆమె మీద  ఏదయినా అత్యాచారం తలపెడితే తన ప్రాణాలే పోగలవు.

 Previous Page Next Page