చిన్నప్పటినుంచీ ఈ సమస్యే తనని ఎదుర్కొంటోంది. స్కూల్లో వున్నప్పుడు ఇటువంటి సందర్భాలేమయినా వస్తే ఆ పిక్నిక్ లూ, ఎక్స్ కర్షన్ లూ చచ్చులేకుండా ఎగగొట్టేవాడు. ఇంతవరకూ కాపాడుకుంటూ వచ్చిన పటుత్వం, అది నిన్న రామారావుగారి ముందు చిన్నపిల్లాడిలా ప్రవర్తించేసరికి పటాపంచలై వూరుకుంది.
ప్రయివేటు నేర్చుకునే కుర్రాళ్ళు ఇంతకుముందే వచ్చి వెళ్ళారు. వాళ్ళకి యీపూట ఎలాగో పాఠాలు చెప్పి పంపేశాడు. ఇప్పుడు కాలేజీకి పోవాలి మనస్థిమితం లేకపోవటంవల్ల ఏమిటో విసుగ్గా వుంది.
హఠాత్తుగా నిన్న జరిగిన విషయాలన్నీ గుర్తువచ్చాయి. శకుంతల చేసిన ప్రవర్తకి అంత కఠినంగా యెలా ప్రవర్తించాడు? అంత కటువుగా యెందుకు ప్రవర్తించాడు?
నిజానికి యీనాడు- - - నిన్న శకుంతల చేసిన పనివల్ల- - - ఇప్పుడు కూర్చుని ఆలోచించుకుంటే ఇన్నాళ్ళుగా తమ ఇద్దరిమధ్యా జరుగుతున్న తతంగమంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. చాలా రోజులగా ఆమెను మోసంచేయ ప్రయత్నించాడు. తమకు ఏదో వున్నదని ఆమెకు భ్రమ కలిగిద్దామని అనుకోకపోయినా, తను ఏమీ బాధపడటంలేదనీ, తనకి ఎవరి సహాయమూ అక్కరలేదనీ ఆమెకు తెలిసేటట్టు చేద్దామనుకున్నాడు. అందుకే ఆమె ముందు తనని తాను ఎప్పుడూ బయటపెట్టుకోలేదు. కాని నిన్న సాయంత్రం తను ఇంటికి వచ్చేసరికి ఎదురు చూడని దృశ్యాలు దృగ్గోచరమయ్యాయి. అనుకొని విషయాలు జరిగాయి. శకుంతల తనని పసిగట్టింది. తనను ఆమె అవమానపరిచిందన్న కోపం కన్నా - తన సర్వస్వం ఆమె గ్రహించగలిగిందనే భావం అతన్ని ఉద్రిక్తపరిచింది. ఆమె యెలా తొందరపడిందో, తనూ తొందరపడ్డాడు, అంతే.
ఆ సమయానికి శకుంతల లోపలికి అడుగుపెడుతూ "పంతులుగారూ" అని పిలిచింది.
ప్రకాశరావు తృళ్ళిపడి, ఆమె వంక చూశాడు.
"అంత బాధ పడుతున్నారు దేనికి?"
"కారణం ఏమీలేదు."
"ఉంది. నాకు తెలుసు."
"అలాగా? అయితే చెప్పండి వింటాను" అన్నాడు ప్రకాశరావు ఆశ్చర్యంగా.
"మీకు వ్రాతభంగం అయిందనేనా?"
నవ్వుతూ చెప్పినా శకుంతల నిజం చెప్పింది. ప్రకాశరావు ముఖం పాలిపోయినట్లు అయిపోగా, సాధ్యమైనంతవరకూ మామూలుగా వుందామని ప్రయత్నిస్తూ "ఛా ఛా కాదు" అని తల ప్రక్క తిప్పుకున్నాడు.
"ఏమి ఛా ఛా? ఏదీ? నా వంక తిరిగి చెప్పండి. చెప్పరూ?"
ఈ కంఠం చాలా కొత్తగా వినబడేసరికి ప్రకాశరావు వులిక్కిపడి ఆమెను చూశాడు. తన మనోభావాన్ని గ్రహించేందుకా అన్నట్లు ఆమె కళ్ళు తనని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
"ఏమిటి చెప్పమంటారు?" అని అస్పష్టంగా గొణిగాడు.
"నా వల్ల మీకు ఏమీ కష్టం కలగలేదని నామీద ఒట్లువేసి చెప్పండి. లేకపోతే ఏను నమ్మను" అంది కష్టంగా ఆమె.
ప్రకాశరావు ఆమె మాటకు అడ్డువస్తూ "వస్తూనే మీరీ ప్రస్తావన యెందుకు తెస్తున్నారో అర్థం కావటంలేదు. పోనీయండి" అన్నాడు.
ఆశ్చర్యంగా అయిదు నిముషాలదాకా యెవరూ మాట్లాడుకోలేదు. ఈ మౌనం ఎందుకా అని అతను వింతపడి, ఆమెవైపు చూసి అదిరిపడ్డాడు. అశ్రుపూరితాలై వున్న ఆమె నేత్రాలు, పాలిపోయి తెల్లగావున్న ఆమె వదనం అతన్ని సంక్షోభపరిచాయి.
"ఇదేమిటి!" అని ప్రశ్న అతని నోటినుండి వెలువడింది.
ఆమె సమాధానం చెబుతుందని అతను ఊహించలేదు. కాని ఆమె చెప్పింది.
"మేము మీ మనసుని హాలా గాయపరిచాం. నాన్నగారిదంతా అదో తంతు, మిమ్మల్ని చాలా బలవంతపెట్టి ఇరకాటంలో పడేసి మనసుకి శాంతి లేకుండా చేశారు మా నాన్నగారి తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను క్షమించండి మమ్మల్ని" దీనంగా , పేలవంగా, వణుకుతున్న పెదాలతో అంది.
ఈ మాటలవల్ల కలిగిన ఆశ్చర్యంలోంచి ప్రకాశరావు చాలాసేపటిదాకా తేరుకోలేదు. అతనికి నోరు విప్పటం కూడా కష్టమైన పనయిపోయింది. శకుంతల తనతో ఇంత హృదయ విదారకమైన పరిస్థితిలో తన ముందు చేతులు జోడించి నిల్చుంటుందని అతను అనుకోలేదు. తెలివి తెచ్చుకుని ఆమెను నఖశిఖపర్యంతరం చూశాడు. అందంగా, సుకుమారంగా, కోమలంగా వున్న శకుంతల, కొంటె నవ్వులు నవ్వే శకుంతల, సూటిపోటీ మాటలతో తనని ఏడిపించే శకుంతల - తన ముందు ఇప్పుడు దీనవదనంతో మోకరిల్లి వుంది. తనని ప్రార్థిస్తోంది. క్షమాపణ అడుగుతోంది. హృదయ విదారకముగా కనిపించే పరిస్థితులలో ఇద్దరూ ఇప్పుడు చిక్కుకున్నారు. శకుంతల ఆ సమయంలో అతనికి దేవతలా కనిపించింది. ఆ సున్నితమైన తెల్లని పాదాలమీద అలా వాలిపోతే మనస్తాపం తీరిపోతుందేమో నన్నంత ఉద్రేకం కలిగింది.
"ఛా ఏమిటి? మిమ్మల్నిక్షమించే అర్హత వుందా నాకు?" అని బలహీనంగా అన్నాడు.
ఆమె దీనికి పెదాలు కదిలిస్తూ ఏదో చెప్పబోయింది. ఇంతలోబయట నుంచి ఎవరో పిలిచారు. గబగబా లేచి నిలబడి ఆమె బయటకు వెళ్ళి పోయింది.
ప్రకాశరావు దిగ్ర్భాంతుడై ఇంకా అక్కడే కూర్చుని వున్నాడు. ఈ విపరీతపు సంఘటనతో అతనిలో వున్న కాస్త యుక్తాయుక్త విచక్షణాజ్ఞానాలు అంతరించిపోయాయి.
ఎక్కువసేపు గడవకముందే శకుంతల తిరిగివస్తూ "మీకు......ఏదో ఉత్తరం వచ్చింది. అని హీనస్వరంతో చెప్పి అతనికో కవరు అందించింది.
కవరు చింపాడు ప్రకాశరావు. చదివాడు. ముందు వాక్యాలు చదవగానే అదిరిపడి చుట్టూవున్న సమస్తాన్నీ మరచిపోయి వణికిపోతూ మిగిలిందంతా చదవటం పూర్తిచేశాడు. చూస్తూ చూస్తూ ఉండగానే అతని ముఖం వికృతంగా మారిపోయింది. కనుకొలకుల్లోంచి నీరు సన్నధారగా ప్రవహించసాగింది. "వాసూ" అంటూ ఉత్తరాన్ని క్రిందకు వొదిలేసి, రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని గోడమీదకు వాలిపోయాడు.
ఇందాకటినుంచీ శకుంతల అక్కడే నిల్చుంది. ప్రకాశరావు ఈ వింత ప్రవర్తన ఆమెకు అర్థంకాలేదు. అతని ఈ దుఃఖం ఆమెను భయాశ్చర్యాలలో ముంచి లేవనెత్తింది. దారీతీరు తెలియకుండా అగాధమైన సముద్రంలోపడి కొట్టుకుపోతున్నట్టుగా ఆమె భావించింది. ఉత్కంఠగావున్నా సాహసించి క్రిందపడివున్న ఉత్తరాన్ని వెనువెంటనే తీసి చదవలేకపోయింది. కాని ఎంత అదుపులో పెట్టుకుందామన్నా ఆదుర్దా ఆగక వొంగి తీసి చదివింది.
మెల్లగా ఉత్తరాన్ని అక్కడున్న కిటికీలోని పుస్తకాలమీద వుంచింది. ఒక విధమైన ఆందోళనతో ఆమె మనసంతా నిండిపోయింది. ఆ స్థితుల్లో చంటిపిల్లాడిలా చేతుల్లో తలదాచుకుని ఏడుస్తూన్న ప్రకాషరావుని చూస్తే ఆమె కడుపు తరుక్కుపోయింది.
దుష్టంగా ప్రవర్తించినప్పుడు ఒక హద్దూ పద్దూ లేకుండా మనుషులు ఎలా సంచరిస్తారో, మంచితనంలోకూడా ఒక్కో సందర్భంలో ఒళ్ళు మరచి ప్రవర్తిస్తారు.
కట్టలు తెగి ప్రవాహంగా వస్తున్న దుఃఖాన్ని గాని, ఆడదానిలా విలపిస్తున్న ఆ మొగవాడి దురవస్థని చూసినప్పుడు కలిగిన హృదయావేదన గాని, అటువంటి వార్త విన్నప్పుడు మానవుడి హృదయం యెల్లా తల్లడిల్లుతుందో గ్రహించగలిగినప్పుడు కలిగిన సంతాపాన్నిగాని ఆమె అణచిపెట్టుకోలేక ఉదుటున అతని దగ్గరికి వెళ్ళింది. ప్రేమగా ఒకచేయి అతని భుజంమీద వేసి, రెండోచేత్తో వందరగా ఉన్న అతని జుట్టు నిమురుతూ "పంతులుగారూ" అంది.
ఒక్క శరీరానికేమిటి, శరీరంలోనిప్రతి అణువుకూ చల్లగా ఏదో స్పర్శ తగిలేసరికి అతను మెల్లగా తలయెత్తి పైకి చూచాడు. నిండుగా, చీకటి చాయలు ఆవరించి వున్నట్లుగా వున్న శకుంతల వదనం అతనికి గోచరించింది.
"ఊరుకోండి అపాయం దాటిపోయింది కదా!"
ప్రకాశరావు మళ్ళీ దిగులుపడిపోయాడు. "ఊహుఁ మీకు తెలియదు, మీకు తెలియదు" అంటూ దాహంతో వున్న మనిషిలా, కుతిగా ఆమె మృదువైన చేతులతో తన ముఖాన్ని కప్పుకొని మళ్ళీ బావురుమన్నాడు.
12
వాసు కళ్ళు తెరిచి చూచాడు. కొంతసేపటివరకూ కళ్ళకేమీ సరిగా కనపడలేదు. తరువాత మసకమసకగా బయట ప్రపంచం కనిపించసాగింది. తను ఈ స్థితికి ఎలా వచ్చాడో గుర్తు తెచ్చుకుంటూ ఆ సమయంలో ఎక్కడున్నాడో తెలుసుకునేందుకుకూడా అదే క్షణంలో ప్రయత్నించాడు. చూపు వెల్తుర్ని బాగా పసిగట్టగలిగాక క్రమక్రమంగా తన చుట్టూ నిలబడివున్న మనుష్యుల్ని గుర్తుపట్టగలిగాడు.
"ఇదేమిటి నాయనా?" అని శారదాంబ గొల్లుమంది. ఒక్క విసురున కొడుకుదగ్గరకు పోబోతూంటూ రాధా, నారాయణ బలవంతంగా ఆమెను పట్టుకుని ఆపారు. వాసు అప్పుడు హాస్పిటల్ లో ఒక బెడ్ మీద పడుకోపెట్టబడి వున్నాడు.
అతనికి బాగా గాయాలు తగిలాయి. తెలివి వచ్చేందుకే ఎంతోసేపు పట్టింది. చిదంబరంకూడా ఇదంతా చూసి భయపడిపోయాడు. కాలుకాలిన పిల్లిలాగా అటూఇటూ తిరగసాగాడు. శారదాంబగారూ, రాధ కలిసి ఒక్కటే ఏడుపు, ముసలమ్మగారు ఒక మూల కళ్ళు వొత్తుకుంటూ శోకాలు పెడుతూ కూర్చుంది. "ఈ జీవితంలో ఇంకా యెన్ని చూడమని విధించావురా? త్వరగా ణా కల్లయినా మూయించవేమిటిరా?" అని భగవంతుని తిట్టటం, వేడుకోవటం రెండూ చేస్తూ ఆవిడ ఖేదపడసాగింది.
వాసు మెల్లగా మూలిగి "అమ్మా" అన్నాడు బాధతో.
శారదాంబ ఉద్వేగం ఆపుకోలేక ఒక్క ఉదుటున కొడుకు దగ్గరకు పోయింది. కట్టుకట్టివున్న వాడి ముఖాన్న నిమురుతూ "ఎంత గతి పట్టిందిరా నీకు?" అని గోలపెట్టి ఏడిచింది. వాసు గుడ్లు మిటకరించి చూస్తూ వూరుకున్నాడు. నర్సు సంజ్ఞ చేయగా రాధవచ్చి బలవంతంగా తల్లిని దూరముగా తీసుకుపోయింది.
నారాయణ అక్కడ్నుంచి బయటకువచ్చి, గోడకు అనుకొని నిలబడి దీర్ఘంగా ఆలోచించసాగాడు. ఎంతలో ఎంత జరిగింది? కారు ప్రమాదాలు, నీటి ప్రమాదాలు ఎవరయినాసరే ఎవరికో జరిగినట్లు విన్నప్పుడు ఒక నిట్టూర్పు విడిచి "అయ్యో పాపం" అని సానుభూతిని వ్యక్తం చేయటం సహజం. కాని అది తమ ఆప్తుడికే తమ ఇంటిలోని వాడికే, స్వంత తమ్ముడికే జరిగినప్పుడు? వళ్ళు ఝల్లుమంది. ఊహించటానికి కూడా అతీతమైన అవస్థ. భరించరాని ఆవేదన. కాని ఈ విషయమే లోకులు చెప్పుకునేటప్పుడు కొంచెం ముఖం విచారంగా పెట్టి "అయ్యో పాపం!" అని కాస్త సానుభూతిని వ్యక్తంచేసి వూరుకుంటారు కాబోలు.
నారాయణతో డాక్టరు చెప్పారు : "కేసు చాలా సీరియస్ గా వుంది. బ్రతకటం కష్టం" అని. రక్తం చలాపోయిందట. రాత్రంతా అతను నిద్రపోలేదు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదుగాని, తనలో తనే అట్టేపెట్టుకుని హృదయమనే పదార్థనికి చిల్లులుగా పొడుచుకుంటున్నాడు.
సూర్యోదయం అయింది. గోడకు ఆనుకొని నిలబడ్డ నారాయణ చేతిమీదుగా సూర్యకిరణాలు కొంచెం దూరంలో కిటికీ అద్దంమీద పడుతున్నాయి. ప్రపంచంలోని హడావుడి అంతా హాస్పిటల్ లోనే వున్నట్లు కనబడుతోంది.
ఎండాకాలపు తొలిరోజులు వచ్చాయి. ఇదివరకటి చలి తగ్గిపోయింది. సూర్యకాంతిలో నిలబడివున్న నారాయణ ఆలోచనలు వేడిగా కాకుండా మంచులా చల్లగా వున్నాయి.
ఒకవేళ డాక్టరు చెప్పినట్లే జరిగితే ఎలాగా అని అదిరిపడ్డాడు నారాయణ.
తల ఎత్తి చూచేసరికి గేటుముందు కారాగివుంది. డాక్టరుగారు లోపలి వస్తున్నారు. నారాయణ ఆయనకు నమస్కరించి ఒక మూల ఒదిగి నిలబడ్డాడు. "ఎలా వుంది?" అనడిగాడాయన - నమస్కారం అందకుని మెట్లు యెక్కుతూ.
"అలాగే" అని నారాయణ అస్పష్టంగా గొణిగాడు. తరువాత ఆయనతోబాటు లోపలకు వెళ్ళి పరీక్షిస్తుంటే నిశితంగా చూస్తూ నిలబడ్డాడు.
వాసు అమ్మా, నాన్నా అని మూలుగుతుంటే శారదాంబ పొంగి పొర్లువస్తూన్న దుఃఖాన్ని అణచుకోలేక గట్టిగా ఏడవబోతూంటే, పరిస్థితి గమనించి రాధ తల్లిని "నీ కేమయినా మతివుందా అమ్మా? పెద్దదానివి నీవే అలా చేస్తూంటే మేమంతా ఏమయిపోవాలి?" అని మందలించింది. ఆవిడ జవాబు చెప్పకుండా చీరచెంగు నోట్టో కక్కుకొని ముఖం కూతురికి కనబడకుండా గోడకు ఆనుకుంది.