Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 18


    టి.యస్., నర్స్ ఒకరి మొహాలొకరు చూసుకొన్నారు.
    ఓడిపోయినట్టూ తలూపి, "సర్వనాశనం చేసేవు కదమ్మా ప్లాన్ ని" అన్నాడు టి.యస్.
                     9
    "నువ్వు నిజంగా ఫూల్ వి. ఇడియట్ వి. నీ కసలు మతిలేదు" అంది జయ.
    రాధ మాట్లాడలేదు.
    "అతడంత కష్టపడి కృష్ణని వలలో పడేస్తే, చివర్లో నువ్వెళ్ళి అంతా నాటకం అని చెప్తావా?"
    దీనికి రాధ మాట్లాడలేదు. జయే మళ్ళీ అంది- "ఆ టి.యస్. మంచివాడు కాబట్టి సరిపోయింది. అతడి కష్టాన్నంతా బూడిదలో పోసినందుకు ఇంకెవరన్నా అయితే మండిపడేవాడు."
    "నాకెందుకో అలా నాటకం ఆడటం ఇష్టం లేకపోయిందే జయా! అలా నాటకమాడి అతన్ని వప్పించి ఏం సుఖపడగలను? కొంతకాలానికి అతడికి నిజం తెలుస్తుంది. అప్పుడు ఇక మా సంసారంలో సుఖం ఉంటుందంటావా? అప్పటికి అతడు మా వివాహం విషయం అందరికీ చెప్తాడు. కాబట్టి ఇక వదిలి పెట్టటానికి వీల్లేదనుకో. టి.యస్. చెప్పింది కూడా అదే. కానీ అతడి భార్యగా సమాజంలో స్థానం కల్పించుకోవటం కాదు నాక్కావలసింది. నాకూ వ్యక్తిత్వం, మనసు వున్నాయి. మనస్పూర్తిగా అతడు ఇష్టపడి, ప్రేమించడం కావాలి. అంతేకానీ అతన్ని ఇరుకున పెట్టేసి, ఆ ఇబ్బందిలో అతన్ని వప్పించటం కాదు.... అందుకే అంతా చెప్పేశాను. నా ఫ్రాంక్ నెస్ అర్ధం చేసుకోలేక అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోనీ-"
    చాలా సేపు గాఢమైన నిశ్శబ్దం వాళ్ళిద్దరి మధ్య నాట్యం చేసింది.
    ఆ మూడ్ లోంచి బైటకి రావటంకోసం రాధ అంది. "నా సంగతి సరే, నీ సంగతేమిటి- పార్థసారథిగారు అంతగా అడుగుతూంటే ఎందుకు తాత్సారం చేస్తున్నావ్ నువ్వు?"
    జయ మాట్లాడలేదు. ఒకసారి తలెత్తి చూసి, ఏదో అనబోయి మళ్ళీ వూరుకొంది.
    "చెప్పు" రెట్టించింది రాధ.
    "ఇక తాత్సారం ప్రసక్తిలేదు రాదా! అంతా ఫైనల్ గా సెటిల్ చేసేశాను."
    "ఏమిటి? చేసుకుంటున్నారా పెళ్ళి."
    "లేదు."
    రాధ విస్మయంగా "ఏం?" అంది.
    జయ మౌనం వహించింది.
    రాధ కొద్ది ఆవేశంతో, "నీ సంగతి అంతా తెలిసేకే కదా ఆయన వప్పుకొంటున్నది! అయినా నువ్వెందుకు కాదంటున్నావో నాకర్ధం కావటంలేదు. అర్ధంలేని సెంటిమెంట్లతో జీవితాన్ని పాడు చేసుకోకు జయా! పెళ్ళనేది ఒక వరం. అది కాళ్ళముందుకు వచ్చి పడుతూంటే కాదనటం అవివేకం."
    "ఇందులో సెంటిమెంటేమీ లేదే రాధా. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అర్ధం కానిదంటూ కూడా ఏమీ లేదు. అతన్ని ఎలా పెళ్ళి చేసుకోను? ఇంత అనుభవంతో కొత్త పెళ్లి కూతుర్లాగా అతడి జీవితంలో ఎలా అడుగుపెట్టను? నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించు. అన్నీ తెలిసిన నేను ఏమీ తెలియని అతడికి అన్నీ నేర్పనా?- రెండు పెదవుల మధ్య సున్నితంగా, అద్భుతంగా ముద్దు పెట్టుకోగల కుర్రవాడు నాకు తెలుసు. కౌగిలించుకున్న మరుక్షణంలోనే మిషన్ కన్నా వేగంగా వివస్త్రను చేయగల అబ్బాయి నాకు పరిచయం. ఇవన్నీ నేను ఒకే వ్యక్తిలో చూసుకోగలనంటావా? కేవలం ప్రేమ పేరు చెప్పి- పవిత్రతని గౌరవించవలసిన కారణంగా- భర్తనే సర్వస్వంగా భావించగల్గటం నాకు సాధ్యపడుతుందా? పుస్తకాల్లో చదవటానికీ- వ్యక్తుల్తో చర్చించటానికీ ఈ ప్రేమలూ, పవిత్రతలూ బావుంటాయే రాధా. కానీ, జీవితం కొనసాగించటం మొదలు పెడితే అందులో ఎన్నో కావాలి. ప్రేమా, స్నేహమూ పరస్పరం పెనవేసుకుని ఇద్దరి మధ్యా సాగాలంటే సెక్సే ముఖ్యమని నేనో కొత్త థియరీ మొదలు పెడితే అందరూ నన్ను వెలివేస్తారు- కానీ అది నిజం. ఎన్నో సంసారాలు నిస్తేజంగా నడవటానికీ, ఎంతోమంది వ్యక్తులు మానసిక వ్యభిచారం చెయ్యటానికీ కారణం, కేవలం ఇంట్లో పార్టనర్ దగ్గర్నుంచి చేయూత సరిగ్గా దొరక్కపోవడమే. అయితే ప్రపంచంలో ఇంతమంది తమ తమ సంసారాల్ని ఇంత పవిత్రంగా - ఆనందంగా ఎలా గడుపుతున్నారని నువ్వు అడగొచ్చు. ఎయిర్ కండిషన్ రూమ్ ఎలా వుంటుందో తెలియని వాడికి వట్టివేళ్ళ తడికే ఎంతో హాయి నిస్తుంది. అన్నీ తెలిసిన వాడికి ఏదీ సుఖమివ్వదు. ఇప్పుడు నా స్థితి అదే.... ఏం చెయ్యను? ఆయన్ని చేసుకోనా? ఎంతో మనస్పూర్తిగా ఆయన నన్ను ప్రేమించటం మొదలు పెడితే, దగ్గరగా వచ్చి లాలనగా చెయ్యివేస్తే - ఆ చెయ్యి ఎన్నో పాత స్నేహితుల చేతులను గుర్తుకు తెస్తే- ఓ భార్యగా, గృహిణిగా, అది ఆయనకు ద్రోహం చెయ్యటం కాదా? ఇంతకన్నా భయంకరమైన నీచమైన పని ఇంకొకటి ఉంటుందా.... ఆలోచించు" అని వెళ్ళిపోయింది.
    రాధ అటే చూస్తూ నిలబడింది. 'ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది' అనుకొంది.
    ఆమెకు తెలీదు- ఈ నిర్ణయం తీసుకోవటానికి ముందు జయ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో....
                                            10
    మాడిజం సంస్థ కార్యాలయంలో ఆ రోజు సమావేశం జరుగుతూంది. పరశురాముడు ఉపన్యాసం యిస్తున్నాడు.
    "కామ్రేడ్స్, ప్రజల్లో మన సిద్ధాంతంపట్ల అభిమానం ఎంతగా పెరిగిపోతూందో, ఇటీవల మన సభ్యత్వం కోసం వచ్చిన అప్లికేషన్లే చెబుతున్నాయి. ఆఫీసు పనివేళలు ఒకప్పుడు పదింటికి వుండేవి. తరువాత ఏడింటికి అయ్యాయి. మళ్ళీ పదిన్నరకయ్యింది. అసలు తెల్లవారుఝామున నాలిగింటి నుంచీ రాత్రి ఎనిమిదింటి వరకూ పెట్టి, గురు, శుక్ర, శని, ఆదివారాలు 4రోజులు శలవులుగా పరిగణించాలని నేను చేసిన సూచనని ప్రభుత్వోద్యోగుల్లో నూటికి తొంభైమంది ఆమోదించారు. ఎప్పుడూ పని చెయ్యని వాళ్ళకి నాలుగు రోజులు శలవులు దొరికితే బయట పన్లన్నా ప్రొడక్టివ్ గా చేసుకొంటారు." 
    సభలో కరతాళ ధ్వనులు.
    "క్రితం సంవత్సరం చెరుకు ధర సరిగా రాక రైతులు పంటని కాల్చేసిన విషయం మీకు బాగా తెలుసు. దాంతో ధర పదిహేను రూపాయలకి పెరిగింది. ఇప్పుడు.... ఈ సంవత్సరం మళ్ళీ చెరుకు బాగా పండింది. దీంతో వర్తకులు పంచదార ధర పడిపోతుందేమోనని భయపడుతున్నారు. అలా పడిపోకుండా వుండటానికీ, వచ్చే సంవత్సరం ధర ఇరవై అవటానికీ, ప్రభుత్వ ఈ వేసవి కాలంలో "ప్రభుత్వ చెరుకు రసాల షాపులు" ప్రతికూడలిలోనూ పెట్టి చెరుకు ఖర్చు అవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తూంది. దీనికి వ్యతిరేకంగా మాడిజం సంస్థ సభ్యులు ప్రచారం చెయ్యాలి."
    "కొన్ని నెలల క్రితం ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఫిరంగిద్వారా పూలు విసిరింది మాడిజం సంస్థే అని తెలిసి చాలామంది హర్షించారు. ఇన్ని తెలివితేటలున్న వాళ్ళు మన సభ్యులుగా వున్నారని తెలిసి వచ్చే సంవత్సరం మనం రాజకీయాల్లో నిలబడితే ఓటు వేస్తామని ప్రజలు పరోక్షంగా నాకు తెలిపారు.... యిక అసలు విషయానికి వస్తాను...." నవ్వేడు పరశురాముడు. నిజానికి ఆ రోజు జరిగిందేమిటో అతనొక్కడికే తెలుసు.
    అతను చెప్పటం ప్రారంభించేడు మళ్లీ.
    "మనం మాడిజం సంస్థకి కొంత అడ్వర్టయిజ్ మెంట్ చెయ్యాలి అని నా ఉద్దేశ్యం. మన ఆశయాలేమిటో మీకు తెలుసు. మన గురువు తుగ్లక్. కనీసం తుగ్లక్ నడిచిన దారిలో నడిచినా మన దేశం ఇంతకన్నా బాగుంటుందని నా ఉద్దేశ్యం. 'ఓరి పిచ్చి ప్రజల్లారా, మీ తరఫున పిచ్చివాళ్ళం మేం నిలబడుతున్నాం' అని చెబితే- కులాల పేర్లు చెప్పగానే ముగ్ధులై ఎలా ఓట్లు వేస్తున్నారో అలానే మనకూ వేస్తారు. వచ్చే ఎన్నికలకి ప్రచారం మనం ఇప్పట్నుంచే మొదలు పెట్టాలి. దీని ప్రారంభోత్సవం కొత్త తరహాగా జరుగుతుంది.
    అందరూ పిచ్చివాళ్ళు కలిసిన సంస్థ- మాడిజం! మీ ఓటు మాకే.
    అన్న నినాదంతో మన ప్రచారం ప్రారంభం అవుతుంది. మన సంస్థ అధికారంలోకి వస్తే మనం చేయబోయే సంస్కరణలూ ఆశయాలు మనం ప్రజలకి చెప్పాలి. ఐతే ప్రచార సాధనాలు ఉపయోగించుకోటానికి మన దగ్గిర డబ్బు లేదు. ఫ్రీగానే చెయ్యాలి ఏం చేసినా. అన్నిటికన్నా మంచి ప్రచార సాధనం ఏది?.... రేడియో"
    ఆ హాలులో సూదిపడితే వినబడేటంత నిశ్శబ్దం ఆవరించింది. ముందుగా తేరుకొన్న యువకుడు లేచి "మీకేమైనా మతిపోయిందా? పిచ్చి వాళ్ళ రాజ్యం గురించి రేడియోలో చెప్తారా?" అన్నాడు. ఇంకెవరో "రేడియో మన తాతగారింట్లో మైకులు కాదు. అవాకులూ చవాకులూ పేలటానికి" అన్నారు. అందరూ నవ్వారు, పరశురాముడు కూడా నవ్వేడు.
    నవ్వి అన్నాడు- "నేను నా మోటారు సైకిల్ మీద రేడియో స్టేషన్ కు వెళ్ళి, దాన్ని స్టాండులో పెట్టి, ఠీవిగా లోపలికి నడిచి, ఓ రికార్డింగ్ రూమ్ లోకి ప్రవేశించి, లైవ్ ఆన్ చేసి 'హల్లో- ఆకాశవాణి శ్రోతల్లారా! నేను మాడిజం సంస్థ అధినేతని పరశురాముణ్ణి మాట్లాడుతున్నాను, అన్నాననుకోండి. కొన్ని లక్షలమంది శ్రోతలకి అది చేరకుండా ఎవరాపగలరు? అన్ని రేడియోల్లోనూ అది వినిపిస్తుంది కదా!" 
    మళ్ళీ నిశ్శబ్దం. అందరూ ఆలోచనల్లో పడ్డారు. కొంచెం సేపటికి ఒకరు లేచి అన్నారు. "అది మాట్లాడుతూవుంటే మిమ్మల్ని పట్టుకుంటారు. తరువాత జైల్లో పెడతారు. మహా మాట్లాడగలిగితే రెండు వాక్యాలు మాట్లాడగలరేమో- అంతే".
    పరశురాముడు నవ్వి, "కనీసం అంతవరకూ బ్రాడ్ కాస్ట్ చెయ్యటానికి వీలవుతుంది అని వప్పుకున్నారు కదా. ఇక మిగతా విషయాలు ఆలోచిద్దాం" అంటూ చేతిలో వున్న బ్లూ ప్రింటు విప్పేడు. తరువాత వివరించటం మొదలుపెట్టాడు.
    "ఇది రేడియో స్టేషన్ ప్లాను. ఇది లోపలికి వెళ్ళటానికి దారి. ఇక్కడ ఎప్పుడూ ముగ్గురు సెంట్రీలు వుంటారు. సాధారణంగా వీళ్ళు ఎవరినీ ఆపరు. ఇది దాటి లోపలికి వెళితే-కుడివైపు డ్యూటీ ఆఫీసర్ రూమ్. దీన్ని దాటితే కారిడార్. చెరోవైపు రికార్డింగ్ రూమ్సు. మనకి కావల్సినవి అంతే....

 Previous Page Next Page