Previous Page Next Page 
జీవాత్మ పేజి 13


    
    "ఓరుగల్లుని గణపతిదేవుడు పాలించే సమయంలో ఆయన హయాంలో కొందరు తాంత్రికులు వుండేవారట. రాజసౌధానికీ, రాజ వంశానికి, ఓరుగల్లు నగరానికి ఏ దుష్టశక్తుల పీడలూ, ఆటంకాలూ రాకుండా వుండటానికి ఆ తాంత్రికులు యిచ్చిన సలహా వలన ఈ చిత్రాలు చెక్కించబడ్డాయని అంటారు. అదెంతవరకూ నిజమో ఎవరికీ తెలియదు" అన్నాడతను.
    
    "ఇక చూడటానికి ఇక్కడేమి లేవా?" అని అడిగాడు మహదేవ్.        
    
    "ఇంతే" అన్నాడతను.
    
    అభిరాం అతనికి ఇరవై రూపాయలు ఇవ్వగానే అక్కడినుండి వెళ్ళిపోయాడతను.
    
    "ఇప్పుడు హనుమకొండ వెళ్ళి అక్కడున్న వేయి స్థంభాళ గుడి చూద్దాం" అన్నాడు అభిరాం.
    
    "ఓకే!" అన్నాడు మహదేవ్.
    
                                                           *    *    *    *    *
    
    సరిగ్గా ఇరవై అయిదు నిముషాల్లో చేరుకున్నరక్కడికి అక్కడ చాలామంది టూరిస్టులున్నారు.
    
    నిజంగా కాకతీయ వంశానికి చెందిన రాజులది అద్భుతమైన అభిరుచి.
    
    దానికి నిదర్శనంగా కన్పిస్తుంది అందమైన ఆ ఆలయం. ద్వారాలపై చక్కని శిల్పాలు ఎంతో అందంగా మలచబడి వున్నాయి. ఒక ఎత్తయిన వేదికమీద నిర్మించబడిన నంది విగ్రహం చూస్తున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేలా వుంది.
    
    అభిరాం, మహదేవ్ అబ్బురంగా వాటినన్నింటిని చూస్తూ ముందుకు నడిచారు.
    
    సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన...
    
    మహదేవ్ అపూర్వమైన ఆ దేవాలయాన్నీ, నందినీ మళ్ళీ మళ్ళీ చూస్తూ నడుస్తున్నాడు.
    
    అదే సమయంలో బవిరిగడ్డం, కాషాయం వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాలలు, తైల సంస్కారం లేక రాగి రంగులోకి తిరిగిపోయిన జడలు కట్టిన జుట్టుతో ఉన్న ఓ సాధువు, ఏదో ట్రాన్స్ లో వున్నట్టు అర్ధనిమీలిత నేత్రధారుడై లోలోన మంత్రాలు పఠిస్తూ వస్తున్నాడు. అతని వయస్సు అరవైదాకా వుంటుంది. ఆరడుగులను మించిన ఎత్తున్నాడతను.
    
    మహదేవ్, ఆ సాధువు యిద్దరూ ఎవరి ధ్యాసలో వాళ్ళుండి ఒకరి నొకరు ఢీ కొన్నారు. మహదేవ్ ఉలిక్కిపడి చూశాడు. ఆ సాధువు తపస్సు చెదిరిన మునిలా కళ్ళెత్తి అతనివంక చూశాడు.
    
    "దిక్కులు చూస్తూ నడవరాదు నాయనా మన గమ్యంవైపు సూటిగా సాగిపోవాలి" అని అన్నాడా సాధువు గంభీరంగా.
    
    అతని మాటలకీ, రూపానికీ మహదేవ్ కీ ఒక్కసారిగా అరికాలి మంట నెత్తికెక్కింది.
    
    "నేను దిక్కులు చూస్తున్నాను సరే.... మరి నువ్వెందుకు నన్ను గమనించలేదు" తీవ్రంగా అడిగాడు.
    
    తన వయసులో సగంలేని అతడు తనని ఏకవచనంతో సంబోధించడం ఆ సాధువుకి కోపం తెప్పించింది. అయినా అతనేం మాట్లాడలేదు.
    
    "నీలా సాధువులు, బాబాలమంటూ గారడీ విద్యలు ప్రదర్శించి అమాయకులమయిన ప్రజల్ని మోసగించి పేరు, డబ్బు గడించే వారివల్లే దేశం ఇలా తగలబడిపోతోంది. శరీర కష్టం చేయకుండా బాబాలనే ముసుగు ధరించడం, రాజకీయ నాయకుల ప్రాపకం సంపాదించి గొప్ప  పేరు, కోట్ల కొలదీ ఆస్థులు కైవశం చేసుకోవడం, దేశమంతా ఆశ్రమాలు కట్టి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం.... ఇదే కదా మీ లక్ష్యం...." బాబాలు, స్వాములమీద తనకుండే చీత్కారాన్ని పరుషంగా వెల్లడించాడతను.
    
    అభిరాం గబగబ వచ్చాడు అక్కడికి "ఏమయింది మహదేవ్?" అనడిగాడు.
    
    "ఏమి కాలేదు నాయనా!" అన్నాడా సాధువు.
    
    "మహదేవ్ ఢీ కొన్నప్పుడు ఆ సాధువు కాలికి అతని కాలిగోరు తగిలి సాధువు కాలినుంచి నెత్తురు చిందుతోంది. అది గమనించి అభిరాం- "రక్తమొస్తుంది గుడ్డతో అదిమిపెట్టండి" అన్నాడు సాధువుతో.
    
    "ఫర్వాలేదు" అన్నాడతను.
    
    "మంత్రాలు, తంత్రాలు, సాధువులు బాబాలు.....ఓహ్.....ఇరవై ఒకటవ శతాబ్దంలోకి దూసుకెళుతున్నా, ఈ జాఢ్యం మాత్రం మనదేశానికి వదలటం లేదు" కోపంగా అన్నాడు మహదేవ్.
    
    "అలా అనకు మహదేవ్. స్వామీ పొరపాటు జరిగిపోయింది క్షమించండి" అని అతన్ని వేడుకోలుగా అభ్యర్ధించాడు అభిరాం.
    
    "ఎందుకు క్షమించడం? నాలాగే అతడూ పరధ్యానంలో వుండటంతో ఒకరికొకరం ఢీ కొన్నాం. పద పోదాం" అన్నాడు మహదేవ్ నిర్లక్ష్యంగా.
    
    ఆ క్షణంలో మహదేవ్ వంక ఆ సాధువు చూసిన చూపు తన ఎరని వేటాడబోయే పెద్దపులిలా మారడం అభిరాం గమనించాడు.
    
    "మన్నించండి స్వామి" అని "పద మహదేవ్ పోదాం" అతన్ని తొందర చేస్తూ అన్నాడతను.
    
    "నీ స్నేహితుడు ఆవేశంలో వున్నాడు నాయనా! ఆవేశం అనర్ధాలకి మూలం" గంభీరంగా అన్నాడు సాధువు.
    
    "ఆవేశం కాక.... స్వామీ పొరపాటయి పోయిందంటూ నీ కాలిమీద పడిపోవాలా? నాకే కాని అధికారముంటే నీలాంటి స్వాముల్నీ, బాబాల్ని కుక్కల్ని కాల్చినట్లు కాల్చిపారేస్తాను. మీరు పని చెయ్యరు, చేసేవారినీ చెయ్యనివ్వరు.
    
    ప్రపంచ దేశాల్లో ఇండియా అంటే ముందుగా గుర్తొచ్చేది మీరే.
    
    ఏ పరికరాలూ లేని ప్రాచీన కాలంలోనే శస్త్రచికిత్సలు చేసి మనుష్యుల ప్రాణాల్ని కాపాడిన చరకుడు, 1923లో మానవ ప్రాణాలను హరిస్తున్న స్ప్రూ, రక్తహీనతలకు అద్భుతమైన ఔషధం 'పోలిక్ యాసిడ్', బోదకాలుకి హెట్రాజాన్ అతి శక్తివంతమైన యాంటీబయాటిక్' ఆరోమైసిన్' వంటి దివ్యౌషధాన్ని కనుక్కున్నా యల్లాప్రగడ సుబ్బారావు.
    
    కాంతి పారదర్సక పదార్ధాల గుండా ప్రసరించినప్పుడు దాని ఫ్రీక్వెన్సీలో జరిగే మార్పులు ప్రపంచానికి చాటి ఆ ప్రక్రియనే 'రామన్ ఎఫెక్ట్'గా కొనియాడబడి 1930లో 'నోబెల్ బహుమతి' పొందిన సర్ సి.వి. రామన్, ఆధునిక పారిశ్రామిక భారతావనికి ఆదిపురుషుడైన ఘనశ్యామ్దాస్ బిర్లా, ప్రోటీన్ సింథసిస్ లో జెనిటిక్ కోడ్ ప్రక్రియ విధులను కనుక్కుని రసాయన శాస్త్రంలో 1968లో 'నోబెల్' బహుమతి పొందిన హరగోవింద ఖురానా, మానవ కంప్యూటర్ గా గతికెక్కిన శకుంతల ఇంకా ఎందరో గొప్పవాళ్ళకంటే ముందు విదేశీయులకి మనదేశం పేరెత్తగానే గుర్తొచ్చేది మీరే.

 Previous Page Next Page