కేకకి కేకకి మధ్య దూరం తగ్గుతూ, అంతకంతకు ఆ కేక మరింత పెద్దగా వినిస్తూ దగ్గరవుతోంది.
జరగబోతున్న ప్రళయాన్ని పసిగట్ట గలిగాడు నాగ్.
* * *
"కరెక్టుగా నేల క్రితం నాన్నగారి దగ్గరకు అర్థరాత్రి వచ్చిన ఆగంతకుడు ఎవరు? ఇది ముందుగా తెల్సుకోవాల్సిన విషయం. ఆ ఎనిమిదో డైరెక్టర్ భాగ్యరాజ మనిషి అతనెవరు? ఇది కూడా వెంటనే తెల్సుకోవాల్సిన విషయం" స్థిరంగా అంటూ పచార్లు చేస్తున్నాడు దినేష్.
7
భారతదేశపు వ్యాపార ప్రపంచపు నిశీధి చక్రవర్తుల గురించి పేర్లు సంఘటనలతో యాధాతథంగా రాయటం సాహసమే అయినా పాఠక ప్రయోజనం కోసం తెగించాను.
మనం నిత్యం కట్టుకొనే మిల్లు వస్త్రాల తయారీ మార్కెటింగ్ వెనుక నియాన్ ల్లెట్ల కాంతిలో వెలిగే కటిక చీకటి ప్రపంచం ఒకటుంది. అలాగే పత్రివ్యాపారం వెనుకా ఓ భయానక చీకటి ప్రపంచం ఉంటుంది. భారతదేశపు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ చట్టపు లొసుగుల్తో, రాజకీయ నాయలైన ఎందరో ప్రమాదకరమైన వ్యక్తులు ఏమి తెలియని వైట్ కాలర్ జెంటిల్ మెన్స్ లా మన పక్కనే ఎయిర్ బస్సుల్లో , బోయింగ్స్ లోప్రయాణిస్తూ వుంటారు.
వారి కోటు జేబుల్లో డైనమెట్స్ ఉండవు- ఎందుకంటే వారే డైన మెట్స్ కనుక. వాళ్ళ పెట్టుబడి కేవలం కేక్ టిక్స్- మార్జిన్ వీక్ నేస్ ఆఫ్ హ్యుమన్ బీయింగ్ లో వీళ్ళు ప్రొఫెసర్స్.
సగటు మానవుని బలహీనతలతో, ఆశలతో, స్వార్థంతో వీళ్ళు ఆడుకుంటారు.
బాబాల ముసుగులో మనదేశ రక్షణ రహస్యాలను అమ్మే వెధవల ముందు మోకరిల్లుతాం. రుద్రాక్షమాల వెనుక వాడు జరిపే భోగలాలసను సాక్ష్యాలతో చూపించినా మనం నమ్మం. మన దేశాన్ని దోచుకోటానికి వచ్చానని ఒక విదేశీయుడు పబ్లిగ్గా చెప్పినా ఉలిక్కిపడం సరిగదా నాకో లక్ష ఇచ్చి నీ ఇష్టం వచ్చింది చేసుకొమ్మని చెప్పే దేశభక్తులు. అసలు మన ఫిలాసఫీలో నాది, నేను, నాయొక్క, మాది, మేము, మాయొక్క అనే పదాలకు విలువ ఎక్కువ.
నాతల్లి, నాదేశం, మనం, మనదేశం అనే పదాలు ఎప్పుడూ ఉచ్చరించి కూడా వుండం.
రాజకీయ పార్టీలు, యూనియన్ లీడర్సు, మేనేజ్ మెంట్స్ , ఆర్థిక సంస్థలు ఆడుకొనే చదరంగంలో దేశభక్తి అంటే ఏమిటో తెలియని సామాన్యజనం, కార్మికవర్గం జీవం ఉన్నా- వెన్నెముక, వ్యక్తిత్వం లేని పావులు.
ఒక్క జపాన్ దేశస్థుని దేశభక్తి ముందు లక్షలమంది భారతీయులకయినా కనీసం నిలబడ్డానికి కూడా అర్హత లేదు.
ప్రమాదకరమైన ఈ అంశం మీద నవల రాసే ముందు నేను సేకరించిన వివరాలు, ఇంటర్వ్యూలు, ఫోటోలతో ఒక్క పెట్టె నిండిపోయింది. వాటినన్నిటిని రాస్తూ పోవాలంటే ఈ 'ఎర్ర సముద్రం' సీరియల్ కి అంతం ఉండదు.
అందుకే ముఖ్యమయిన విషయాల్నే తీసుకొంటూ వెళ్తున్నాను.
ఏప్రిల్ 1986 రెండవ వారంలో ఓ నవల పరిశోధన నిమిత్తం బొంబాయి వెళ్ళాను. బొంబాయి చర్చ్ గెట్ దగ్గరున్న ఓ చిన్న హొటల్ లో దిగి నా సరంజామా సిద్దం చేసుకొని ఓ ఫేమన్ జాకీని ఇంటర్వ్యూ చేసేందుకు బయచుదేరబోతుండగా పెద్దగొడవ, గందరంగోళం వినిపించింది. ఏమిటబ్బా అని కిటికీ దగ్గరకు నడిచి బయటకు తొంగి చూశాను. హొటల్ కాస్త దూరంలో చిన్న బ్రిడ్జి మీద ఓ పదివేలమంది దాకా కార్మికులు గుమికూడి ఉన్నారు.
ఏం జరగబోతోందని ఆసక్తిగా చూస్తుండగానే ఓ ఫియట్ కారు వచ్చి ఆగింది అక్కడ. ఆ కారుని చూసి భక్తిగా, వినయంగా పక్కకు తప్పుకుని నిలబడ్డారా పదివేలమంది.
ఆ కారులోంచి ఓ వ్యక్తి దిగాడు. అంతే......జిందాబాద్......కార్మిక ఐక్యత.....జిందాబాద్ ముర్దాబాద్ ....డౌన్....డౌన్. మేనేజ్ మెంట్స్ అంటూ అక్కడ గుమికూడినవారు గొంతులు చించుకొని అరుస్తుండగానే మరో పదివేలమంది పోగయిపోయి అదో పెద్ద జనప్రవాహం అయిపోయింది చూస్తుండగానే.
ఆ వ్యక్తి ఓ సారి చెయ్యెత్తాడు__ ఆ మరిక్షణం స్మశాన నిశ్శబ్దం అక్కడ వ్యాపించింది శ్వాసైనా పీల్చుతున్నారా లేదా అన్నంతంగా అలుముకున్న ఆ నిశ్శబ్దంలో ఓసారి గొంతు సవరించుకున్నాడు అతను.
ఆ జన ప్రవాహపు తలలు మొత్తం వినయంగా ముందుకు వంగాయి. వారికళ్ళల్లో ఓ ఏసుక్రీస్తును చూస్తున్న భక్తి పారవశ్యం, ఓ లెనిన్ ని, స్టాలిన్ ని చూస్తున్న సమతాభావం, తమ కష్టాల్ని బాపటానికి వచ్చిన భగవంతుడ్ని చూస్తున్న అలౌకిక ఆనందం పారవశ్యం కనిపిస్తున్నాయి.
అతను ప్రసంగించటం మొదలెట్టాడు. అతనేంమాట్లాడుతున్నాడో విందామన్న ఆసక్తితో కెమెరా తీసుకుని, రూమ్ కి తాళం వేసి హొటల్ బయటకు పరుగెత్తుకు వచ్చేసరికి ఫియట్ కారు సర్రున చర్చ్ గేట్ స్టేషన్ వైపు సాగిపోతూండటం, అంతకుముందు మూగిన జనం తాలూకు ఆనవాలు ఏమీ అక్కడ దొరక్కపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
అక్కడేవున్న ఓ వ్యక్తిని అడిగాను "ఎవరతను? కొద్ది క్షణాల్లో అన్నివేలమందిని పోగుచేయగల శక్తి, గ్లామర్ ఎలా వచ్చాయి? అతనేదైనా సినిమా హీరోనా? బాబానా? రాజకీయ నాయకుడా?" అని. అతనో సారి నవ్వి 'అదేమీ కాదు___ అతని పేరు దత్తా సామంత్__ బొంబాయి కార్మిక సామ్రాజ్యపు చక్రవర్తి. సజీవమయిన ఈ బొంబాయి నగరాన్ని ఒక్క రోజులో ఫ్రీజ్ చేయగల సమర్థుడు-జన సమర్థమైన బొంబాయి మహా నగరపు రహదారుల్ని నిముషంలో నిర్మానుష్యం చేయగల మహాప్రమాదకరమైన వ్యక్తి అతని వెనుక లక్షలకు లక్షల నిప్పుల పిడికిళ్ళున్నాయి . ఆ పిడికిళ్ళలో ఈ నగరాన్ని, రాష్ట్రాన్ని, ఆఖరుకు దేశాన్నే బూడిద చేయగల శక్తి, ఆవేశం ఉన్నాయి. ఆ లక్షల పిడికిళ్ళు ఆ వ్యక్తి గొంతుకకి ట్యూన్ చేయబడ్డాయి-" అన్నాడు మొఖంలో కాస్తంత అసహ్యాన్ని ప్రదర్శిస్తూ-
"ఇప్పుడతడేం చెప్పాడు? ఆ మీటింగ్ అంతలోనే ఎలా పూర్తయింది?" అనడిగానుమరలా. మరోసారి వేదాంతిలా నవ్వి అతనేం చేయబోతున్నాడో అతనొక్కడికే తెలుసు- కాని అతనేం మాట్లాడతాడో ఎవరికీ అర్థంకాదు- అదే అతని ప్రత్యేకత.
అతని మాటల్లో అవతలవార్ని ఆలోచింపజేసే విచక్షణ ఏమాత్రం గోచరించదు పైగా అది అతనికంత మంచిది కూడా కాదు. అతని మాటల్లో ఉండే శక్తి అవతల వార్ని రెచ్చగొడుతుంది- ఆవేశపడేలా చేస్తుంది- వారి పిడికిళ్ళు , వారి కంఠాల హొరు , జోరు, నరాల ఒరిపిడిని ఉధృతం చేస్తుంది.
మీ పేద బతుకులకో న్యాయం చేకూర్చుతాను- మీ కష్టాల్ని కడతేర్చుతాను. అన్న సానుభూతి భావం కూడా అతని కంఠంలో ప్రతిధ్వనిస్తుంది- స్టుపిడ్.....బస్టర్.....అంటూ మరాఠీలో ఓ నిమిషం ఆపకుండా తిట్టి తన తిట్లెవరన్నా విన్నారా అని భయంగా ఓసారి చుట్టు ప్రక్కల చూసి హడావుడిగా వెళ్ళిపోయాడు.
ఆనాడు నేను బొంబాయిలో చూసిన పై సంఘటనే ఈ సీరియల్ కి ఇన్ స్పెరేషన్.
ఈ నవలలో వచ్చే ప్రతి సంఘటనా వాస్తవరూపంలో జరిగినదే_ జరుగుతున్నదే ఈ నవలలో 90 శాతం పాత్రలు కూడా వాస్తవంలో ఇప్పుడు ఉన్న వ్యక్తుల నుంచి పుట్టినవే. ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, కార్మిక ప్రపంచపు కరాళ నృత్యమే ఈ నవల. అర్థంలేని ఆవేశకావేశ, స్వార్థాలలోంచి ప్రవహించిన రక్తపు నదుల సంగమమే ఈ ఎర్రసముద్రం.