"అబ్బే ఎవరూ రారు నేనిక్కడే ఉంటాను" అని భరోసాఇచ్చింది రుక్కు.
అవును మరి, పల్లెటూళ్ళలో యింతకంటే మంచిస్నానాలగదులెక్కాడి నుంచి వస్తాయి : నయమే...... ఏదో ఈ మాత్రం గదంటూ ఉంది లేకపోతే నూతి దగ్గర చీరకట్టుకుని పోసుకోవలసివచ్చేది అనుకుంది. అరుణ, స్నానం చేస్తూరేపొద్దున్న తనూ ఇలాంటి స్నానాలగది తయారు చేసుకోవాలేమో? ఊహు డబ్బు ఖర్చైనా సరే అన్నీ యథావిధిగా అమర్చుకుంటేగాని తను ఉండలేదు. అందులో స్నానానికి సరి అయిన మదుగులేకపోతే ఎలా?
రుక్కుపైన నిలబడి అరుణ స్నానం చేసేసబ్బు సువాసన ఆస్వాదిస్తూంది. ఎంచక్కని వాసన: ఎంతబాగుంది: తాము స్నానంచేసే సబ్బు ఇంత బాగోదేం? అసలు సబ్బులు...... జానకి వదినదగ్గరే గదా ముందుసబ్బు చూసింది? అప్పటినించే గదా ఇంట్లో సబ్బులవాడకం.
అరుణని చూస్తూంటే అంతా వింతగానే ఉంది రుక్కుకి. ఆడవాళ్ళు కూడా ఇంతింత పెద్దచదువులు ఎలా చదువుతారో: చదువుకుంటే ఆ నాజూకూ ఆ మాటతీరూ, ఆ చీర కట్టుకోవడం అదీ వస్తుంది గాబోలు అరుణ ఏం చేస్తున్నా ఆశ్చర్యంగానే చూసింది రుక్కు. జానకి వదినకంటే ఎంతో ఎక్కువ చదువుకున్న ఆవిడ: ఈ వెధవ ఊళ్ళోఉండిపోయి తన చదువుకునేందుకు వీలు కాలేదు. లేకపోతేతనూ చక్కగా ఆవిడలా చదువుకునేది.
"నీవేం చదువుకున్నావమ్మా రుక్కూ?" స్నానం చేసి చీరకట్టుకుని జడవేసుకుంటూ అడిగింది అరుణ. కృష్ణమూర్తి స్నానానికి వెళ్ళాడు. లక్ష్మమ్మ లోపల వంటలోమునిగింది గుమ్మందగ్గిర నిలబడిన రుక్కుని మంచం మీద కూర్చోమంది అరుణ. వచ్చిన కాసేపటిలోనే తనవెంట ఎంతో అభిమానంగా, ఆరాధనగా తిరిగే రుక్కు అమాయకత్వం అరుణని ఆకర్షించింది. పరికిణీ, పల్లెవాటు, వాలుజడ, చెవులకి జూకాలు, జడలో బంతిపూలు చేతులకి గోరింటాకు పల్లెపడుచులు అంటే ఇలాగే ఉంటారు గాబోలు కనుముక్కు తీరయిందే. ఈ అమ్మాయి పట్నంలో ఉంటే ఎలా మారిపోతుందో: ఆలోచించింది అరుణ.
"ఇప్పుడేం చదవడం లేదండీ" రుక్కు జవాబిచ్చింది.
"అదేం, చదువు మానేశావా? ఎంతవరకు చదివావు?" కాస్త ఆశ్చర్యంగా అడిగింది అరుణ.
"మరి మా ఊళ్ళో థర్డుపారంవరకే ఉంది. అది చదివేశాను ఇంక ఏం చేస్తాను?" అమాయకంగా అంది రుక్కు.
అయ్యో అనిపించింది అరుణకి, ఇంతచిన్న వయసులో హాయిగా స్కూలుకి, కాలేజీకి వెళ్ళి సరదాగా స్నేహితులతో ఆడుతూ పాడుతూ చదవవలసిన వయసులో అప్పుడే చదువు మానిపించి ఇంట్లో కూర్చోపెట్టారంటే అరుణకి కష్టం అనిపించింది.
"అదేమిటండీ. మీ చెల్లెలిని చదువు మానిపించారు? కనీసం స్కూల్ ఫైనల్ వరకైనా చదువులేకపోతే ఈ రోజుల్లో ఎలా అండీ" లోపలికి వచ్చిన సుబ్బారావుతో అంది అరుణ.
"ఏం చెయ్యమంటారు? ఇక్కడ మిడిల్ స్కూలే ఉంది. ఇంకో ఊరు పంపించి చదివించాలి. అదంతా ఎలా కుదురుతుంది ఆడపిల్లలకి?" నాన్చాడు సుబ్బారావు.
"అదేమిటి మీరూ అలా అంటారు? ఎంతమంది ఆడపిల్లలు పై ఊళ్ళలో హాస్టల్సులో ఉండి చదవడం లేదు? ఈ రోజుల్లో చదువులేకపోతే ఎలా?"
"ఏమిటో మా అమ్మా నాన్నా కాస్తపాత కాలంవాళ్ళు ఆడ పిల్లలని పై ఊరుపంపరు. చదివి ఏం చెయ్యాలి అంటారు. పెళ్ళి చేసేస్తాం. సంబంధాలు చూస్తున్నాం" అన్నాడు సుబ్బారావునవ్వుతూ.
ఈ థర్డుఫారమ్ చదివిన పిల్లని, పట్టణంలో చదువుకున్న యువకులెవరూ చేసుకోవడానికి సాధారణంగా ఒప్పుకోరు. అంటే మళ్ళీ ఏ పల్లెటూరి వాడికో పొలం గట్రా ఉన్నవాడికి ఇచ్చి చేస్తారన్న మాట: ఈ పదహారేళ్ళు నిండిన పిల్ల ఇన్నాళ్ళూ పల్లెలోనే గడిపి, పెళ్ళయ్యాక అత్తమామలకి చాకిరీ చేసుకుంటూ, ఇల్లలుకుతూ ఓ గృహిణి అయిపోతుందన్న మాట ఆమె జీవితానికి. గానుగెద్దు జీవితానికి తేడా ఉండదు అప్రయత్నంగా నిట్టూర్చింది. రుక్కులాంటి పిల్లలు ఇంకా చాలా మంది ఉండి ఉంటారు. ఇంకా మన దేశం ఎంతో వెనకబడే ఉంది ఏదో పట్టణాలలో తప్ప ఈ పల్లెలలో ఆశించినంత పురోభివృద్ది ఏది? తగినంత విద్యా సౌకర్యాలు లేవు పల్లెలలో వైద్యసహాయం అసలే లేదు ఎప్పటికి మన గ్రామాలు బాగుపడతాయి మనం విదేశీయుల స్థాయికి ఎప్పటికి చేరగలం అసలు చేరగలమా?
"ఏమిటి ఆలోచిస్తున్నారు? మాఊరు చూసి ఇలా ఉందేమిటని అప్పుడే బెంగపడుతున్నారా?" నవ్వుతూ అడిగారు సుబ్బారావు రుక్కు లాంతరు వెలిగించితెచ్చి, చూరునించివేలాడే ఇనప కొక్కానికి తగిలించింది.
"ఊరసలు చూడందే బెంగపడడానికి. నే నా లోచిస్తున్నది అదికాదు. మీ ఊళ్ళో హైస్కూలు కోసం మీరందరూ ప్రయత్నించకూడదా? హైస్కూలుంటేరుక్కులాంటి వాళ్ళు కనీసం మెట్రిక్ వరకు చదువగలదుగదా?"
"అప్పుడే ఈ ఊరికి పరిష్కరించే ఆలోచనలు మొదలు పెట్టావన్నమాట:" స్నానం చేసి వస్తూ చెల్లెలి మాటలు వినిసగం ఎగతాళి, సగం నవ్వుకలిపి అన్నాడు కృష్ణమూర్తి.
"హైస్కూల్ పెడితే ఓ వందమందన్నా ఉండరు చదవడానికి."
"ప్రతిఊరికీ ఓ హైస్కూలు పెట్టాలంటే అయినట్టే:" కృష్ణమూర్తి అన్నాడు." అది సరేగానీ ఈ ఊళ్ళో అద్దెకుఇళ్ళు దొరుకుతాయా? అరుణ ఉండడానికి ఆస్పత్రివగైరా పెట్టుకోడానికి తగినవసతి ఏదన్నా దొరుకుతుందా?" సూటిగా వచ్చినపనికి దిగాడు కృష్ణమూర్తి.
"అదే చూస్తున్నాను. ఈమె ఉత్తరం రాసిందగ్గిరనించి ఈ విషయం గురించే ఆలోచించాను అద్దెకు ఇళ్ళేమీ దొరుకుతాయా? ఎవరన్నా తమ ఇంట్లో ఇచ్చినా ఒక గదో రెండుగదులు ఇస్తారు తప్పవేరే ఇళ్ళు ఉండతగినవి ఏమీ లేవు. అయితే ఒకటుంది, పూర్వం ఎప్పుడో జమీందారురుండేవారు. ఆ భవంతి ఒకటుంది. పాతపడి పోయిందనుకోండి ఇప్పుడు, ఆ భవంతి ముఫ్ఫై ఏళ్లనించి ఖాళీగా ఉంటూంది. పూర్వం జమీందారుండేవారు ఆయన నలభైఏళ్ల క్రితమే ఈ గ్రామం విడిచి పట్టణం వెళ్ళిపోయారు. తరువాత ఆయన తరపున శిస్తులు వగైరా వసూలు చేసుకోడానికి దివానుగారు ఓ భాగంలో ఉండేవారు.
ఆయనపోయాక కొత్త దివాను ఎవరూ లేరు, బంగళా అంతా మూసేసి ఉంచేవారు. జమీందారు గారు.
ఎస్టేటువ్యవహారాలు చూడడానికి, డబ్బు వసూళ్ళకి ఓ మేనేజరుని నియమించారు. అతనూపట్టణంలో ఉండి నెలకోసారి వస్తూండేవాడు. భవనంలో కొంత సామానుండేది మొదట్లో తరవాత అవీ ఒక్కొక్కటీ పట్టుకెళ్ళారుట ఇప్పుడు విరిగిపోయినవి, పాడయిపోయినవి తప్ప ఏమీ లేవు అందులో, భవనం అంతా పాడయిపోయింది సంరక్షణ లేక. దాని కాపలాకి ఓ మాలిమాత్రం ఉంటాడు. దాన్ని కాస్త బాగుచేయించుకుంటే వాసయోగంగానే ఉంటుందని నా ఉద్దేశం. అంత మీ కనవసరం ఓ పక్క భాగం బాగుచేయించుకుంటే మీరుండడానికి, మీ ఆస్పత్రికి దానికి బాగానే ఉంటుంది. అయితే ఆ జమీందారిగారి తాలూకు వారి పర్మిషన్ తీసుకోవాలనుకోండి."
"ఇప్పుడింకా జమీందారుగారున్నారా? ఏ ఊళ్ళో ఉన్నారు కృష్ణమూర్తి అడిగాడు.
"జమీందారుగారు పోయి అప్పుడే అయిదేళ్ళయింది జమీందారు గారు, లేకలేకపుట్టిన ఓ కొడుకు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అంతకు ముందే ఇప్పుడింక జమీందారేమిటి? అన్నీ లాక్కున్నారుగా గవర్నమెంటు? జమీందారిణికి ఏదో సంవత్సరానికి భరణం ఇస్తారు. కొడుకెక్కడో విదేశాలలో చదువుతున్నాడట. అమ్మాయిలకి పెళ్ళిళ్ళయ్యాయిట మనం జమీందారిణిగారి పర్మిషన్ తీసుకుంటే చాలు నేను ఈ విషయం కరణం గారితో మాట్లాడాను. వారిచేత ఉత్తరం రాయించుదాం."
"అడ్రసు తీసుకుంటే మనమేరాస్తే బాగుంటుందేమో?" అరుణ అంది.
"పోనీఅలాగే చేయచ్చు నామక అనుమతికి రాయడమే కాని, వద్దనరు. ఇల్లు పాడుపడకుండా ఇంట్లో దీపం పెట్టేవారుంటేవారు మాత్రం వద్దంటారా? అందులో ఇలాంటి మంచి పనికోసం అంటే అభ్యంతరం చెబుతారనుకోను. అసలు ఆ భవనం ఏదో ధరకు అమ్మేద్దామని చాలా ప్రయత్నించారట. ఈ పల్లెల్లో అంతభవంతి అంతడబ్బుపోసి ఎవరు కొంటారు కాని ఏం చేస్తారు?"
"అంతగాకావాలంటే ఏదో ఒక అద్దెనిర్ణయించు ఈయవచ్చు:" కృష్ణమూర్తి అన్నాడు.
"చూద్దాం. వారికి రాశాక వారి అనుమతివచ్చాక చూద్దాం:" అన్నాడు సుబ్బారావు.
"వాళ్ళు ఒప్పుకుంటే మనకు సమస్య ఉండదు. ఒక ప్రోబ్లమ్ సాల్వ్ అవుతుంది." అరుణ ఆదుర్దాగా అంది.
"రేపేకరణంగారి ఇంటికి వెళ్ళి అడ్రసు తీసుకుందాం. ప్రెసిడెంటు గారింటికి వెడదాం. ఆయన్ని ఓ సారిదర్శించుకుంటే మంచిది. ఇంకా మున్సబుని ఇతరముఖ్యులను చూస్తే మంచిది. అందరి సహకారం ఉంటే మీకు మంచిది. వీళ్ళందరూ పూజారులవంటివాళ్ళు ఈ ఊరికి దేవుడు వరమిచ్చినా, పూజారి వరమియ్యకపోతే లాభం ఉండదు." వ్యంగ్యంగా అన్నాడు సుబ్బారావు.
"ఏమిటో మా అరుణ కిలాంటి బుద్ది పుట్టింది హఠాత్తుగా ఎలానెగ్గుకొస్తుందో ఇక్కడ? నాకేం అర్ధమవడంలేదు."
"మీకెందుకండీ ఆ బెంగా? మేమంతాలేమూ ఆవిడని చూడడానికి?"
"అన్నయ్యా, అమ్మ అన్నాలకి రమ్మంటూంది. వడ్డిస్తూంది" అంటూ రుక్కు వచ్చింది.
"అబ్బ అప్పుడే ఏడున్నర అయిందే మనం మాటల్లో పడి టైము మాటమరిచాం. లేవండి భోజనం చేద్దాం" ఒళ్ళు విరుచుకుని లేచాడు సుబ్బారావు. వంటింటి పక్కన భోజనాల గది ఉంది. పొడుగ్గా సన్నగా ఉంది గది. ఓ వైపు మగవాళ్ళకి, రెండోవైపున ఆడవాళ్ళకి వడ్డిస్తూంది లక్ష్మమ్మ. రుక్కు ఇటు అటు హడావిడిగా తిరుగుతూ మంచినీళ్ళు, ఉప్పు అవి వడ్డిస్తూంది. శాస్తీగారు ముందు పీటమీద కూర్చున్నారు. ఆయన పక్కన కృష్ణమూర్తిని కూర్చోమని సంజ్ఞ చేశారు. పక్కన సుబ్బారావు కూర్చున్నాడు. సుబ్బారావు పక్కన తమ్ముడు కూర్చున్నాడు, అరుణ, రుక్కు పక్కపక్కన కూర్చున్నారు. పీటలువేసి వెండి కంచాలలో వడ్డించారు బంగాళదుంపల వేపుడు, కొబ్బరికాయ పచ్చడి, పప్పుపులుసు....... అన్నీ అతిథులకోసం ప్రత్యేకం చేశారని చెప్పక చెపుతున్నాయి. వెండి గిన్నెలలో పాయసం తెచ్చి పక్కన పెట్టింది లక్ష్మమ్మ.