Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 41


    రుస రుసలాడుతూ వెళ్ళిపోయింది. వదిన మాటలు మనసును శూలాల్లా పొడవటం-కుమార్ తన మాటను లక్ష్యపెట్టలేదన్న బాధ_ వీటన్నిటితో ఏదో నిస్త్రాణ ఆవరించి వంట కూడా చెయ్యలేక మంజుని వంట చెయ్యమని మంచంమీద పడుకుంది సుమతి.... చంద్రశేఖర్ లైబ్రరరీకి వెళ్ళి అక్కడినుంచి ఏదో సాహిత్య సమావేశానికి వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చి "కుమార్ ఇంకా ఇంటికి రాలేదా?" అన్నాడు ఆశ్చర్యంగా, అప్పటికే తొమ్మిదిన్నర అయింది.
    "ఏమో! ఎక్కడ తిరుగుతున్నాడో నాకేం తెలుసు?" అని కసురుకుంది సుమతి. కుమార్ అప్పటికింకా ఇంటికి రానందుకు ఆందోళన పడవలసింది పోయి అలా కసురుకున్నందుకు తెల్లబోయాడు చంద్రశేఖర్. వంటింట్లోంచి మంజు అత్త వచ్చినట్లు గొడవ జరిగినట్లూ సైగలతో సూచించింది. చంద్రశేఖర్ పరిస్థితి అర్ధం చేసుకుని భార్యను ఇంకేమీ పలకరించకుండా, మంజు వడ్డించగా తిని తన పక్కమీద పడుకున్నాడు. రాత్రి పదకొండు దాటాక వచ్చాడు కుమార్. నిలువెల్లా నీళ్ళువోడుతూ తలారా స్నానంచేసి గడగడ వణుకుతూ వచ్చాడు. అలా కుమార్ ని చూడగానే సుమతి పట్టరాని కోపంతో అంత ఎదిగిన కుమార్ చెంపలు ఛెళ్ళు ఛెళ్ళున వాయించి "ఏరా! ఇప్పటికైనా ఇల్లు గుర్తు కొచ్చిందా? ఈ అవతారం ఏమిటి? జలక్రీడలాడి వచ్చావా? నువ్వేమిటో, నీ అంతస్తేమిటో తెలుసుకుని మసలుకోక లేనిపోని దురాశలు నీకెందుకు? ఆ సరోజమీద ఆశ పెట్టుకోవద్దనీ, దానితో కలసి తిరగవద్దనీ నీకెన్నిసార్లు చెప్పాలి?" అంది.
    తనకు తగిలిన దెబ్బకూడా మరచిపోయి తల్లిని నిర్ఘాంతపోయి చూశాడు కుమార్.
    "నేనెవరో, నా అంతస్తేమిటో తెలుసుకునే మసలుకుంటున్నానమ్మా! ఇప్పుడిప్పుడే మా అమ్మమ్మని దహనంచేసి అలా ఇక్కడికి రాకూడదని తలారా స్నానంచేసి వస్తున్నాను."
    ఆ మాటలు వినగానే దబ్బున కూలబడిపోయింది సుమతి, పడుకున్నవాడు దిగ్గున లేచివచ్చాడు చంద్రశేఖర్. మంజు కుమార్ దగ్గిరగా వచ్చి అతడి చెయ్యి పట్టుకుని "అన్నయ్యా! అరె! వళ్ళు వేడిగా ఉంది. ముందు బట్టలు మార్చుకో! తల తుడుచుకో!" అని బలవంతాన అతడు బట్టలు మార్చుకునేలా చేసి తనే తల తుడుస్తూ "వళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా?" అంది.
    సుమతి కూచున్న చోటునుంచి కదలకుండా పిచ్చిదానిలా కుమార్ కేసి చూడసాగింది. ఎంత మాట అనేసింది తను! ఎక్కణ్ణుంచి ఎలా వచ్చాయి, అలాంటి మాటలు!
    మంజు కాఫీ కలిపి పట్టుకొచ్చి అన్నచేత బలవంతాన తాగించింది.
    "మీ అమ్మమ్మ చచ్చిపోయిందా? బాగా పెద్దది-ఎంత పెద్దయినా అయినవాళ్ళు పోవటం బాధేననుకో!" అని సానుభూతిగా ఓదార్చాడు చంద్రశేఖర్.
    "ఆవిడ వృద్ధాప్యంవల్ల పోలేదు నాన్నగారూ! వృద్ధాప్యంవల్ల పోయినా, రోగంతో పోయినా నేనింత బాధపడేవాణ్ణి కాదు. బ్రతికి మాత్రం ఏం సుఖపడుతోందని సరిపెట్టుకునేవాణ్ణి. కానీ, ఆవిడ ఒక్క అయిదు రూపాయలకి తనని తను బలిపెట్టుకుంది."
    "అదేమిటి?"
    "అకాల వర్షాలతో ఇళ్ళూ వాకిళ్ళూ సరిగ్గాలేక గుడిసెల్లో అందరికీ జ్వరాలు పట్టుకున్నాయి. మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి ఇంజక్షన్లు చెయ్యబోయినా వాళ్ళెవరూ తీసుకోలేదు. పోలేరమ్మకి పూజలు చేశారు. వాళ్ళలో ఎవరికో పోలేరమ్మ పూనింది. నరబలి కావాలంది. వాళ్ళందరికీ పోలేరమ్మమీద ఎంత భక్తి ఉందో పోలీసులంటే అంత భయం ఉంది. నరబలిలో ఎంత విశ్వాస ముందో, తర్వాతపడే ఉరిశిక్షలోనూ అంత నిశ్చయం ఉంది. అంచేత ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పోలేరమ్మ ముందు నరకటానికి సాహసించక పోయినా ఒక ఉపాయం ఆలోచించారు. ఆ గుడి ముందే చిన్న చెరువు లాంటి ఒక గుంట ఉంది. వాన నీళ్ళతో అది నిండిపోయి ఉంది. అది ఊబిగుంట అని అందరికీ తెలుసు. ఎవరూ అందులో దిగరు సాధారణంగా. పోలేరమ్మ భక్తులు ఒక అయిదుగురు చేరి ఆ గుంటలో స్నానంచేసి అమ్మవారి దగ్గిరకు వస్తే గొప్ప పుణ్యం వస్తుందన్నారు. అలా స్నానం చేసిన వాళ్ళకి అయిదు రూపాయలిస్తామని ఆశ పెట్టారు. మా అమ్మమ్మ పుణ్యంకోసం ఆశపడిందో లేదోకాని, అయిదు రూపాయలకోసం మాత్రం తప్పకుండా ఆశ పడింది, ముందే అయిదు రూపాయలు అడిగి తీసుకుని ప్లాస్టిక్ కాగితంలో చుట్టి అది నడుముకు గట్టిగా బిగించుకుని చెరువులాంటి ఆ ఊబిగుంటలోకి దిగింది. దిగుతూనే లోపలకు కూరుకుపోయి ప్రాణభయంతో గట్టిగా కేకలు వేసింది. అందరూ చోద్యం చూస్తూ నిలబడ్డారుకాని ఒక్కరూ సహాయపడలేక పోయారు. సహాయం చెయ్యలేని క్లిష్టపరిస్థితికంటే పోలేరమ్మ భయమే ఎక్కువ. పోలేరమ్మ నైవేధ్యాన్ని ఎవరు ముట్టుకుంటే ఎవరికి ఏ హానికలుగుతుందో అని. అలా మా అమ్మమ్మ అందరి కళ్ళముందూ బలి అయిపోయాక పోలీసులు మూడురోజుల తర్వాత ప్రయాసమీద శవాన్ని బయటికి తీశారు. అప్పటికి నాకు కబురు తెలిసింది. వెంటనే వెళ్ళాను. బాగా ఉబ్బిపోయింది శవం. ఆ శవం వంటిమీద ప్లాస్టిక్ పేపర్లో చుట్టిన అయిదు రూపాయల కాగితం మాత్రం అలాగే ఉంది శవాన్ని అంటిపెట్టుకుని."

 Previous Page Next Page