Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 28


    "నేను ముగించలేదు. విధి ముగించిన కథ అది."

    వాదించే ప్రయత్నం చేయలేదు కౌస్తుభ. అతడిముఖంలోకి నిశ్శబ్దంగా చూడసాగింది.

     "ఏం చూస్తున్నారు నా ముఖంలోకి? పిచ్చి లక్షణాలు ఇంకా ముదిరాయా అనా?"

    "కాదు. మీలో జయసూర్యని చూస్తున్నాను."

    "ఎప్పుడో మట్టిలో కలిసిపోయిన జయసూర్యని నాలో ఎలా చూస్తారు?"

    "మీలో వున్న అతని ఆత్మనీ, వ్యక్తిత్వాన్నీ  చూస్తున్నాను."

    "ఆత్మ అదేగానీ అతడి వ్యక్తిత్వం వచ్చిందనుకోను. జేబులో చేయి పెడితే ఎంతొస్తే అంత దానం చేసేవాడు. బీదవాళ్లకి మందుల ఖర్చు కూడా తనే పెట్టి వైద్యం చేసేవాడు. కల్లాకపటం తెలియని స్వచ్చమైన మనసు. బహుశా అజాత శత్రువైన తండ్రి నుండి  ఆ గుణాలు అతడికి వచ్చి వుండవచ్చు. ఇప్పుడు నాలో రక్తంవేరు. నా తల్లిదండ్రులు వేరు. నేనుపెరిగిన వాతావరణంవేరు. అతడి వ్యక్తిత్వం  నాకెలా  వస్తుంది?"

    "మీరు చెప్పిన కథ నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ నేను మాత్రం నిజమైతే బాగుండునని అనుకుంటున్నాను. జయసూర్య వ్యక్తిత్వం నన్ను చాలా ఆకర్షించింది. అతడంటే  ఒక విధమయిన ఆరాధనా బావం కూడా నాలో కలిగిందేమో!  ఐ లౌ హిమ్. ఇలాగే తేటగా చూసే ఆ కళ్లు, మల్లెవంటి మనస్సుకు వాకిళ్లలాగా! ఇలాగే పొడుగాటి ముక్కు, ముక్కు సూటిగాపోయే  అతడి మనస్తత్వానికి దర్పణంలాగా"

    "బాప్ రే! చూసినట్లు పోలుస్తున్నారే!"

    "అతడి కథ చదువుతుంటే అతడి రూపం నా కళ్లముందు కదిలినట్టయ్యేది. ఇలాగే కర్లింగ్ హెయిర్స్. విశాలమయిన నుదురు.  అతడి పోలికలు మీకు వచ్చాయనిపిస్తుంది."

    "నన్నే జయసూర్య పాత్రలో ఊహించుకుని వుంటారు. "

    "చెప్పాకదా. అతడి వ్యక్తిత్వాన్నిబట్టి అతడిని వూహిస్తున్నానని. కొంతవరకు మీరే చెప్పారు కథలో, అతడిది సమున్నతమైన విగ్రహమని,  చాలా ఆకర్షణీయంగా వుంటాడని!"

    "నాలో లీలగా మెదిలే కొన్ని జ్ఞాపకాలకి కొంత ఊహ జోడించి,  చెప్పిన కథ  అది. అంతా అలాగే  జరిగి వుండకపోవచ్చు. కానీ కొంతయినా  జరిగి  వుంటుందని నా నమ్మకం!"

    "రేపుగానీ ఎల్లుండిగానీ మీకు ఏమయినా పనులున్నాయా?ఖాళీగా వుంటారా?"

    "దేనికి?"

    "మావూరికి ఒకసారి వెళ్లిరావాలి. ఈమధ్య మా నాన్నగారు కాలం చేసారు.  అక్కడ  మేనత్తగారు ఒకామె వున్నారు.  మా నాన్న గారికి వుంటా అదీ చేసిపెట్టి  ఆయన మంచీ చెడ్డ చూసుకునేది. అక్కడ  మాకొక చిన్న ఇల్లు, కొద్దిగా పొలాలు వున్నాయి. ఆ వూరికి ఒకసారి  వెళ్లిపొలం కౌలు విషయం  మాట్లాడేపని వుంది. మామయ్యకి సెలవు  దొరకదట.  నన్నే వెళ్లి ఆ వ్యవహారం చూసి రమ్మన్నారు. నాకు తోడుగా వస్తారేమోనని."

    "ఏమి మహద్బాగ్యం. నాకెంత ఆనందంగా వుందంటే, మేఘాలలో తేలిపోతున్నట్టుగా వుంది."

    "మేఘాలలో  తేలిపోకండి. కరిగిపోయే మేఘాలు క్రింద పడేస్తాయి మిమ్మల్ని."

    "మీమామయ్య పెట్టిన పరీక్షలో నేనుగెలిచినట్టేకదా! ఆయన మాట నిలబెట్టుకుంటారా!లేక......"

    "మాట నిలబెట్టుకుంటాను బాబూ!" అంటూ చేతిలో స్వీట్ పాకెట్ తో వచ్చాడు యోగానందం. పాకెట్ కౌస్తుభ చేతికిచ్చి "నీ చేతితో అతడికి స్వీట్ అందించమ్మా. ఇదే మీ ఎంగేజ్ మెంట్ అనుకో" అన్నాడు 

    "నోటికా? చేతికా?"

    "నోటికందిస్తే ఇంకాస్వీట్ గా వుంటుందికదా!"

    శ్రీచక్ర మాటకి రోజారంగు పులుముకున్న చెక్కిళ్లతో ఆమె ముగ్ద మనోహరంగా నవ్వుతుంటే, ఆమె హృదయాన్ని, చదివినట్లుగా అయింది అతడికి.

     అతడిప్పుడు నిజంగా మేఘాలలో తేలిపోతున్నట్లుగా వున్నాడు.

 
                       *    *    *    *    *

   
    రైతును పిలిపించి పొలం కౌలు గురించి మాట్లాడి, డబ్బు తీసుకుని అతి మేనత్త ఖర్చులకి ఇచ్చివేసింది కౌస్తుభ. మేనత్త వండి పెట్టిన అన్నం తిని, కాస్త విశ్రాంతి తీసుకునేసరికి సాయంత్రం అయింది.    
 
    "మనం ఊరవతలికి షికారుగా వెళదాం రండి. మనకు సిటీలో ఈ పచ్చటి పొలాలు, అందమైన మేఘాలు ఎక్కడ కనిపిస్తాయి. ఆకాశాన్ని కప్పేస్తున్నట్లుగా వున్న అపార్ట్ మెంట్స్ తప్ప" అంటూ శ్రీచక్రని బయల్దేరదీసింది కౌస్తుభ.

    ఆమె నడుస్తుంటే ఎక్కడికని అడగకుండా, ఆమె వెంట నడవసాగాడు శ్రీచక్ర.

     కబుర్లలో పడి ఆమె రామాపురం రేవు దగ్గరికి తీసుకువచ్చిందని తెలియనే లేదతడికి.

     "క్రితంసారి మా నాన్నగారి  అస్తికలు కలపడానికి మా పురోహితుడు ఇక్కడికి తీసుకువచ్చాడు.  ఈ ఏరు, ఈ రేవు,  ఈ పరిసరాలు నాకెంతో నచ్చాయి. మరోసారి వచ్చి ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఆస్వాదించాలనుకున్నాను. నా ఆనందంలో పాలుపంచాలని మిమ్మల్నీ తీసుకువచ్చాను" రేవు మెట్లమీద కూర్చుని కాళ్లకింద చల్లగా తగులుతూన్న నీళ్లలో చిన్నపిల్లలా కాళ్లాడిస్తూ అంది.
    
    ఆ మెట్లు ఆఖరవుతున్నచోట ఒక చిన్న శిధిల భవనం.

     శ్రీచక్ర ముఖం ఉద్విగ్నతతో నిండిపోయింది.

     అతడి ముఖంలో మారుతున్న భావాలను పరీక్షగా చూస్తోంది కౌస్తుభ.

    "ఈ మెట్లు, ఈ ఏరు, ఆ భవనం నాకు చిరపరిచితం అనిపిస్తోంది కౌస్తుభా! ఎన్ని సాయంకాలాలో, ఈ రేవులో మెట్లమీద కూర్చుని నదీ సౌందర్యాన్ని ఆస్వాదించాననిపిస్తోంది. ఆ ....అంతా గుర్తొస్తోంది. ఆ భవనంలో వృద్దుడైన జమిందారుగారు  వుండాలి. ఆయన ఎన్నోసార్లు నా కల్లో కనిపించారు. అంటే జయసూర్య తండ్రిగారన్నమాట."

    "ఒకసారి వెళ్లి ఆ భవనం చూద్దాం రండి."

    "ఇన్నేళ్ల తరువాత ఆయన బ్రతికి వుంటారన్న ఆశలేదు. అదీ పుత్రయోగం ఆయన్ని కృంగదీసి మరణానికి ఎప్పుడో చేరువచేసి వుంటుంది. ఆయన లేని బంగళాలో నేనుకాలుపెట్టలేను. ఆ శూన్యసౌధం నా గుండెల్ని పిండుతుంది" శ్రీచకర గొంతు బరువెక్కింది. అతడి ముఖం విషాదంతో నిండింది.

     "అదింకా శూన్యభవనం కాలేదు. జమిందారుగారు ఇంకా జీవించే వున్నారు. ఆయన తన కొడుక్కోసం కళ్లల్లో వత్తులు వేసుకునిచూస్తున్నారు. తన కొడుకు హత్య చేయబడ్డాడనే విషయమే ఆయనకి తెలియదు.  మీరు జయసూర్య కథ వ్రాసతూ దేశికాచారి అనివ్రాసారే. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్యస్వామి. ఆయన నల్లమల నుండి తిరిగొచ్చి  జయసూర్య విరక్తి చెంది హిమాలయాలకి వెళ్లినట్టు అబద్దం చెప్పాడు. సన్యాసి అయి  హరిద్వార్ లో కనిపించారని,  కాశీలో కనిపించారని ఏవో అభద్దాలు అల్లి చెబుతూ గడుపుకొస్తున్నారు. తను చనిపోయేలోగా తప్పక తిరిగొస్తాడన్న ఆశతో  ఆయన జీవించే వున్నారు. 

    "ఇదంతా నీకెలా తెలుసు కౌస్తుభా?"విబ్రాంతిగా అడిగాడు శ్రీచక్ర.

    "అంతా కాకతాళీయంగా జరిగిపోయింది. పూర్వజన్మ రుణానుబంధమేదో నన్నిక్కడికి తీసుకువచ్చి వుంటుంది" తండ్రిఅస్తికలు కలపడానికి వచ్చి ఆ బంగళాని చూడడం. వెళ్లి ముసలి  జమిందారుని కలవడం ఆ వైనమంతా చెప్పింది.

     నిశ్శబ్దంగా విన్నాడు శ్రీచక్ర.    

    "వెళదామా బంగళాకి?"

    "ఒక జన్మలో ఆయనకి నేను తండ్రిని. మళ్లీ జన్మలో ఆయనకు కొడుకును. ఈ జన్మలో ఏమీకాని నేను ఆయన్ని ఏమని చూడరావాలి? ఆయనని ఏమని పిలవాలి?"

    "శరీర సంబంధం ఆ జన్మకే  అయినా ఆత్మసంబంధం జన్మజన్మలకి వుంటుంది పూర్వజన్మ జ్ఞాపకాలతో సంఘర్షణకు  లోనయ్యే మీరు ఆయన్ని తండ్రిగా భావించడంలో తప్పులేదు. ముందు మీరొకసారి ఆయన్ని చూద్దురురండి. ఆయన్ని మిమ్మల్ని  చూసి ఎలా ఫీలవుతారో?"

    ఇద్దరూ మెట్లెక్కసాగారు.

    ఒంటరిగా, బిక్కు బిక్కు మన్నట్లుగా వుంటుందనుకున్న బంగళా ఊరి జనాలతో నిండిపోయి వుంది. వాళ్ల ముఖాల్లో  నిండిన విషాదం చూస్తుంటే ఏదో జరగరానిది అక్కడ జరుగుతున్నట్లుగా వుంది.    
 
    అర్చీలుగా వున్న వరండాలో  ఒక ప్రక్క అరుగుమీద మరణశయ్యలో వున్నారు భూపాల్ గారు.
 
    మంగ "నారాయణ... నారాయణ" అంటూతులసీతీర్దం పోస్తోంది ఉద్దరిణితో.

     అక్కడ మూగిన జనాల్లో కొంతమంది ఆమె గొంతుతో శృతి కలుపుతున్నారు.

    "నేను రెండు వారాల క్రిందట వచ్చినప్పుడు ఆయన బాగానే వున్నారే? ఇంత హఠాత్తుగా ఏమైంది?" ఖిన్నవదనంతో అడిగింది కౌస్తుభ.    

    "వారం రోజుల క్రితం బాత్రూమ్ లో  కాలుజారిపడ్డారు. నడుము విరిగింది. మంగలి నర్సయ్యను పిలిచి తోమిస్తుండగానే జ్వరం తగిలింది.  పట్టిన జ్వరం విడవకుండా ఆయన్ని ముంచుకుపోతోంది" కళ్లొత్తుకుంటూ చెప్పింది మంగ.

     శ్రీచక్ర భూపాల్ గారిని చూస్తున్నాడు. అతడి మనసునిండా జ్ఞాపకాల సుడులు. కళ్లనిండా నీళ్లు.

     "నాన్నగారూ!" గాద్గదికంగా పిలిచాడు చెవి దగ్గర నోరుపెట్టి. రెండుమూడుసారలు పిలిచాక ఆయన ముఖంలో చిన్న కదలిక వచ్చింది.  కంటిరెప్పలు చిన్నగా కదిలాయి. కానీ తెరవలేని ఆశక్తత. పెదవులు ఏదో చెప్పాలని కదిలాయి. చిన్నగా గుడుగుడు శబ్దం.

    కానీ అంతవరకూ ఆయన్ని కుదిపివేసిన అశాంతి ఆ క్షణంలో మటుమాయమైపోయింది. ఆయన మఖంలో ఇదివరకు లేని ప్రశాంతత ఆవరించింది.

 Previous Page Next Page