15
ఒకరోజు ఉదయం నారాయణ నేలమీద మోకాళ్ళ మీద కూర్చుని అరుగుకి ఆనించి వున్న సైకిలును పాతగుడ్డతో శుభ్రంగా తుడుస్తున్నాడు. ఏళ్ళు ముదిరి కీళ్ళు సడలిన ఆ సైకిలును పై మెరుగుగా వుండేటట్లు చేద్దామనుకుంటున్నాడేమో.
యధాలాపంగా బయటకు వచ్చిన రాధ ఆ దృశ్యాన్ని చూసి నవ్వుతూ "చాలా శ్రమపడుతున్నావే అన్నాయ్ " అంది.
"తప్పుతుందా చెల్లీ! ఎవరి బిడ్డల్ని వారు సాకుకోవద్డా?"
రాధ యింకా నవ్వుతూ "కొంతమంది రాలుగాయి పిల్లలు ఉంటారు సుమా అన్నాయ్. ఎంత బాగుచేద్దామని ప్రయత్నించిన బాగుపడరు" అంది.
అనుభవమున్న పనివాడిలాగా నారాయణ పట్టాకారుతో వదులుగా వున్న నట్లను బిగించివేస్తూ "ఉన్నమాట పలికావు రాధా!" అన్నాడు.
రాధ మాట్లాడకుండా అన్నగారు కష్టపడటం చూస్తూ నిల్చుంది. అతను పూర్తిగా ఎండలో వున్నాడు. పడుతున్న శ్రమ కొంత, ఎండ వేడిమికి కొంత అతని శరీరమంతా చెమట్లు చిమ్ముతోంది. ఒక పావుగంట గడిచేసరికి నారాయణ ఉస్సూరంటూ లేచి చేతులు దులుపుకుంటూ "ఇంకో వారం రోజులదాకా దీని బ్రతుకు ఫర్వాలేదు" అని గ్యారంటీ ఇచ్చాడు.
"దిన దిన గండం నూరేళ్ళ......" అని రాధ మిగిలిన వాక్యం పూర్తిచేయకుండా అన్నగారికి ముఖంకూడా చూపించకుండా చకచకా లోపకు వెళ్ళిపోయింది.
చెల్లెలు మాటలు వింతగా ధ్వనించగా నారాయణ వాటిని గురించి లోలోపలే తర్కించుకుంటూ లోపలికి నడిచాడు.
స్నానం, భోజనం వగైరాలు చేసుకొని నారాయణ పదిగంటలకు సైకిలుమీద బ్యాంకికి వెళ్ళిపోయాడు. కొడుకుతోపాటు భోజనం ముగించిన చిదంబరం పేకాట గదిలో వంటరిగా గోడకు అనుకొని కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచన తీవ్రంగా వున్నదని వ్యక్త పరుస్తున్నట్లుగా చేతిలోని చుట్ట పెట్టుకున్నప్పుడు గుప్ గుప్ మని పొగలు విరజిమ్ముతోంది.
రాధ బయటకు వచ్చి అరుగుమీద నిల్చుని అటూ ఇటూ వున్న ఖాళీ ప్రదేశాలవంక చూస్తూ నిలబడింది. కొద్దిరోజుల క్రితం ఎడమవైపు వున్న స్థలంలో రెండు పూలమొక్కలు నాటింది. అవి ఎండిపోకుండా కళకల్లాడుతూ ఆమెకు నేత్రానందాన్ని ఇస్తున్నాయి.
చాపల్యంకొద్దీ రెండు మూడు పూలమొక్కలు వేసినా ఆమె వాటితో సంతృప్తిపడి పోలేదు. దాన్నంతా శుభ్రంచేసి పళ్ళూ కాయలూ ఇత్యాది అవసరమైనవన్నీ పండించి కనులపడువుగా చేయాలన్నా సంకల్పం ఆమెలో అభివృద్ది అవుతోంది. తను కష్టపడి పనిచేస్తే అవి ఏనాటికైనా పెరిగి పెద్దవి అయితే కొంత కాకపోతే కొంతయినా ఖర్చు తగ్గి తమకు కొంత సహాయం లభిస్తుంది.
ఈ మధ్య ఆమె మనసు దేనిమీదా లగ్నంచేయకుండా నిర్మలంగా వుండేందుకు ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ కనిపించి కష్టంగా తలప్రక్కకి తిప్పుకొంటూన్న ఆనందరావు, అనుకోకుండా వెడితే చిలకా గోరింకల్లా వున్న ప్రమీల, శ్రీపతులు ఆమెను అప్పుడప్పుడూ కల్లోల పరుస్తుండకపోలేదు. కాని చాలా జాగ్రత్తగా వాటినన్నింటినీ నిగ్రహించుకొని సాధ్యమైనంతవరకూ ఇంట్లో సహాయం చేయటానికి ఆమె పాటుపడుతోంది.
ఆమె ఆలోచన్లను భగ్నం చేస్తూ టక్ టక్ మనే హృదయవిదారకమైన శబ్దం వినవచ్చింది. ఉలుక్కుపదిండి. ఈ శబ్దం ఎందుకో ఆమెకు అలవాటు కాలేకుండా వుంది. అంచేత ఎప్పుడ వినిపించినా వణికిపోతూ, సంక్షోభపడటం మట్టుకు ఆమెకు అలవడింది. అంచేత ఎప్పుడూ వాడిని మంచం మీదనుంచి మీదనుంచి కదలకుండా చేయాలని ఆమె సంకల్పం. ఈ కారణం వల్లనే వాడు ఎక్కడ కదలవలసివస్తుందోనని సాధారణంగా ఎప్పుడూ వాడిదగ్గరే కూర్చుని కధలూ, కబుర్లు చెబతూ వుండేది. వాడి సందేహాలను తీరుస్తూండేది.
వాసు మెల్ల మెల్లగా రాధ దగ్గరకు వచ్చి "అక్కయ్యా!" అన్నాడు.
రాధ వాడివంక తిరిగి కొంచెం కోపంగా "నిన్ను యిలా చీటికీ మాటికీ తిరగవద్దని చెప్పానా?" అంది.
వాసు బిక్క మొహం వేసి "ఏం చేయనక్కాయ్! ఎప్పుడూ మంచంమీదనే పడుకుంటున్నాను. నాకేమీ తోచటం లేదు" అని కొంచెం ఆగి విషాదంగా "ఇది కొంతకాలం అయ్యేసరికి అసలు నడవటంకూడా మరచిపోతానేమో" అన్నాడు.
రాధ కడుపు తరుక్కుపోయింది. వాడి భుజంమీద చేయివేసి దగ్గరకు తీసుకొని "నిన్నెప్పుడూ ఆ విషయాలను గురించి ఆలోచించవద్దని చెప్పలేదా?" అంది.
"నేనూ ప్రయత్నిస్తున్నా నక్కాయ్!" కాని నేను చాలా కాలంగా కుంటివాడ్ని అని, అది సహజమైన విషయమేనని అనుకొనేంత స్థితికి నేను రాలేను."
రాధ వాడి మాటలకు వింతపడి, నిట్టూర్పు విడిచి వూరుకుంది.
"రాధక్కాయ్!"
"ఏమిటిరా?"
"ఏమిటాలోచిస్తున్నావో చెప్పానా?"
"ఏమీ లేదురా!"
ఒక నిమిషం ఊరుకొని వాడే మళ్ళీ "నేనో విషయం అడగనా?" అన్నాడు.
"ఏమిటి?"
దీనంగా ముఖంపెట్టి "మరి కుంటివాడ్ని చూసి లోకం అంతా వెక్కిస్తుందెందుకు? కుంటివాళ్ళు వాళ్ళకేమి అపచారం చేశారని?" అన్నాడు.
"ఊఁ. నిన్న వీధిగుమ్మంలో గోడకానుకొని నిల్చున్నాను. మా స్నేహితులు కొందరు అటునుంచి పోతూ నన్నుచూసి నవ్వులు, వేళాకోళాలు ఎటువంటి మాటలు అన్నారనుకొన్నావక్కా?"
రాధ కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. "అంటారు నాయనా! సానుభూతి చూపటం చాతకానివాళ్ళు ఏమయినా చేస్తారు. వాళ్ళు అది ప్రయోజకత్వం అనుకొంటారు. వాళ్ళు మనుషులుకాదు, పశువులు" అంది గాద్గదికంగా.
"కాని, లోకం వాళ్ళని మనుషులకింద జమవేస్తుంది కదా! మాలాంటివాళ్ళు ఎందుకూ పనికిరారు."
వాడి మనోబాధ మరీ ఎక్కువయిపోతుందని కనిపెట్టి "పోయి పడుకో. నేను కూడా వస్తాను" అని వాడిని పట్టుకొని జాగ్రత్తగా మంచం దగ్గరకు తీసుకుపోయి పడుకోబెట్టింది పెదాలు విప్పి ఏదో చెప్పటానికి సిద్ధపడుతుండగా "అయ్యో అయ్యో చచ్చిపోయానేవ్" అని లోపలనుండి పెద్ద గావుకేక ఒకటి వినిపించగా రాధ గాబరాపడుతూ లేచి నిల్చుంది. "ఏమిటి? ఏమిటక్కా?" అని వాసు కంగారుగా అడుగుతున్నా వినిపించుకోకుండా లోపలి పరిగెత్తింది. ఆమె వంటయింది గది దగ్గరకు పోయేసరికి హృదయవిదారకమైన దృశ్యం కనిపించింది. తన నాయనమ్మ క్రింద పడిపోయి మాటామంచీ లేకుండా గుడ్ల నీరు కారుస్తోంది. కదలటానికి కూడా వీలులేని స్థితిలో ఆమె పడిపోయింది. "అయ్యో ఇదేమిటండి, ఇదేమిటండి" అని శారదాంబ ఆమె ప్రక్కనే క్రిందకూర్చుని కదుపుతూ ప్రశ్నించింది. "ఏమిటి నాయనమ్మా?" అని రాధగూడా ఆదుర్దాగా ప్రశ్నించేలోపలే చిదంబరం గూడా హడావుడిగా లోపలకు పరుగెత్తుకు వచ్చాడు. ఎలా అయితేనేం అంతా కలిసి ఆవిడని జాగ్రత్తగా మంచంమీదకు చేర్చారు. వాసుగూడా టక్కు టక్కు మనుకుంటూ వచ్చి చూస్తూ నిల్చున్నాడు. వాళ్ళని ఆ స్థితిలో వదిలేసి చిదంబరం డాక్టర్ని పిల్చుకురావడానికి హడావుడిగా పరుగెత్తుకుపోయాడు.
డాక్టరుగారు వచ్చిచూశారు. "పెరాల్సిస్ స్ట్రోక్ " అని చెప్పాడు. ముసలమ్మగారు ఒక కాలూ చెయ్యి విదిలించలేకుండా వుంది. మాటమట్టుకు వస్తోంది. చిదంబరం డాక్టరుగార్ని చాటుగా "ప్రాణానికేమయినా భయం వుందాండి?" అని అడిగాడు. ఇంకో వారం రోజులు గడిచేదాకా కష్టం అని చెప్పారాయన.
సాయంత్రం నారాయణ వచ్చి చూసేసరికి ఇదీ కనిపించిన దృశ్యం. ఇహ అతని మనస్ను యెలా వుంటుంది? ఆవిడ ఇన్నాళ్ళూ రోగం రోస్టూ లేకుండా బ్రతికింది అలాగే దాటిపోవాలనుకుంది కూడా కాలం ఒకకాలూ, చెయ్యీ పడిపోయి మంచంమీదనే బ్రతకమంది. పుట్టినప్పటినుంచీ ఒకరి చేత చేయించుకొన్ని మనిషికాదు. అయినా చివరిదశలో ఒకరి ఆసరా కావలసి తప్పలేదు.
ఆ రాత్రంతా మూలుగుతూనే వుంది. ఇంట్లో ఎవరికిగూడా సరిగ్గా నిద్రపట్టలేదు. చిదంబరానికి మరీనూ. ఆయనలో మాతృప్రేమ ఉబుకుకొని వచ్చింది. ఎవరూ చూడకుండా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు కూడా. ఆయనకుగూడా ఈ మధ్య మనశ్శాంతి ఉండటంలేదు. గంగాధరంగారు తనమీద అనవసరంగా ఆగ్రహించాడు. ఆయన రాకపోతే ఆటలో సొగసు వుండటం లేదు. కొన్ని రోజుల క్రితం నుంచీ చిన్నకొడుకు స్థితి ఏమిటో అయోమయంలోకి జారిపోతున్నట్లు అనిపించింది ఆయనకు.
మరునాడు ఉదయం కాఫీత్రాగి ఆయన అరుగుమీద కూర్చుని చుట్టకాల్చుకొంటున్నాడు. ఇంతలో లోపల్నుంచి తల్లి బలహీనంగా అరుస్తూన్న అరుపు వినిపించింది. "నాయనా- వొరేయ్ చిదంబరం- వరేయ్ తండ్రీ"
చిదంబరం చప్పున లేచి తాగుతున్న చుట్టను ఆర్పి చూరులో పెట్టేసి "ఏమిటే అమ్మా?" అంటూ లోపలి వచ్చాడు.
ఆవిడ మంచంమీద కూర్చోమని చేత్తో సంజ్ఞ చేసింది. ఆయన మెల్లగా కూర్చొని "ఏమిటమ్మా?" అనడిగాడు.
ఆవిడ పైకి చూపిస్తూ "చూడరా అటు...... అటు...." అంది.
చిదంబరం వింతగా పైకిచూసి "ఏమిటి? నాకేం కనబడం లేదు" అన్నాడు.
మెల్లగా నిట్టూర్చి ఆవిడ "హుఁ నీకేమీ కనబడదు. యములాళ్ళు-యుములాళ్ళు నా కోసం వచ్చారుగా" అంది.
తల్లి భ్రాంతి పడుతూందని చిదంబరం భావించి "నువ్వనవసరంగా భయపడుతున్నావమ్మా. డాక్టరుగారు మళ్ళీ కోలుకుంటావని గట్టిగా చెప్పారు" అన్నాడు.
"చెబుతార్రా నాయనా, వాళ్ళు అలాగే చెబుతారు" అని కొంచెం ఆగి "ఒరేయ్ బాబూ. నేనిలా అశాంతితోనే చచ్చిపోవాలంటావా? కాస్త చెప్పరా" అని అంది.
ఆయన దిగులుగా "అబ్బ! ఆ మాటను అనవద్దని చెప్పానా?" ఇహ అశాంతి విషయం అంటావా? నీకంత అశాంతి ఏ మొచ్చిందో చెప్పు" అన్నాడు.
"పెళ్ళిరా పెళ్ళి"
"ఓహొ, నారాయణదా?"
"ఊఁ" అని మూలిగినట్లుగా అని ఆవిడ మళ్ళీ ఇలాగ అంది.
"నాకు ఇద్దరు కొడుకులన్నమాట ఎప్పుడో మరచిపోయాను. ఈ అవసాన దశలో మళ్ళీ వాణ్ని చూడాలనిపిస్తోంది. ఆ విషయం అలా వుంచి నిన్నే నేను అన్ని విధాల నమ్ముకొన్నాను కదా. నీ పిల్లలు అంతా నా మనుమలు, మనుమరాళ్ళు. ఎలాగోలో పెద్దమనుమరాలి పెళ్ళి చూడగలిగాను. పెద్ద మనుమడు కూడా ఓ పిల్ల మోళ్ళో మూడుముళ్ళూ వేస్తుంటే చూడకుండానే ఎలా చచ్చిపోయేదిరా? ఏదీ నీ చెయ్యి ఏదీ?" అని ఆయాసపడింది.
చిదంబరం తన చేతిని ఆవిడ ఆరోగ్యంగా వున్న కుడి చేతిలో వుంచాడు. ఆవిడ బలహీనంగా నొక్కుతూ "నాయనా, కన్నకొడుకైనా నిన్ను వేడుకుంటున్నాను. ఇవి చేతులు కాదనుకో" అంటూ దుఃఖంతో ఆవిడ గొంతు పూడిపోయింది. మళ్ళీ ఎలాగో పెగల్చుకొని "నేనింకా ఎన్నో రోజులు బ్రతకను, నిన్ను ఇంకేమీ అడగను. ఈ ఒక్క కోరికా తీర్చరా" అని చెబుతుంటే ఆవిడ కళ్ళనుంచి నీరు ధారగా ప్రవహించింది.
ఆ దృశ్యం చూస్తుంటే చిదంబరం కడుపులో కెలికినట్టయింది. తను అంత అసమర్దుడా? ఆ స్థితిలో తల్లి కోరుతున్న కోరిక తీర్చలేడా? "అలాగే అమ్మా?" అని ఇవతలకు వచ్చి శారదాంబ దగ్గరకు పోయాడు. ఆమె వంటింట్లో పనిచేసుకొంటోంది.
"ఒక నిమిషం పని ఆపి, నాతో మాట్లాడేందుకు నీకు తీరికవుందా?"
ఆమె తెల్లబోయి వెనక్కి తిరిగి భర్తను చూసి ఒక పక్కకు తొలుగుతూ "చెప్పండి" అంది.
"చూడసలు. అనకూడదుగాని ఆవిడ రేపోమాపో అనేట్టుగా వుందా? ఈ సమయంలో ఆవిడ కోరిక తీర్చాలంటావా?"
"ఎందుకు కాదు?"