కిరణ్ తో ఆటల్లో మునిగిపోయిన రత్నమ్మ ఏదీ గమనించలేదు.
రత్నమ్మ సరళకు దగ్గిర అవుతోన్నకొద్దీ సరళ అలవాట్లు చాలా నేర్చుకుంది.
రోజూ స్నానం చెయ్యటం, శుచి. శుభ్రత అలవాటయ్యాయి. సరళ వంటలు కూడా చాలా నేర్చుకుంది.
రత్నమ్మ మనసు నొచ్చుకోకుండా నెమ్మదిగా నచ్చజెపుతూ రత్నమ్మ ఉచ్చారణలో యాసనికూడా చాలా వరకు పోగొట్టగలిగింది సరళ.....
ఆమె కాలేజీ చదువులు చదవకపోయినా, రామాయణ భారత భాగవతాలు చదవటం వచ్చు.
అప్పుడప్పుడు ఆమె భాస్కర రామాయణం చదివి వినిపిస్తే ఆ కథలమీది ఆసక్తితో శ్రద్ధగా వినేది రత్నమ్మ.
కాలచక్రంలో అయిదేళ్ళు గిర్రున తిరిగాయి-
సుధీర్ రైల్వేలో పెద్ద ఉద్యోగస్థుడయ్యాడు. అయినా జైహింద్ బాబుని మరిచిపోలేదు.
అతనికెంతమంది స్నేహితులున్నా జైహింద్ బాబు దగ్గిర లభించే ఆత్మీయత లభించలేదు మరెక్కడా.....
జైహింద్ బాబు నలుగురిలో తనను చదువు ఉన్నట్లుగా పలకరిస్తే తన పదవికీ, హోదాకూ భంగమనే భయం కొద్దిగా కలగకపోలేదు. కానీ, జైహింద్ బాబు తనంత తనుగా ఎన్నడూ పలకరించటానికి కాని, సన్నిహుతుడవటానికి కాని ప్రయత్నించక పోవడంతో ఆ భయం పోయింది.
తను అంత పదవిలో వున్నా, జైహింద్ బాబు ఏనాడూ చెయ్యిజాపి ఏదీ అడగకపోవటంతో అతనిమీద గౌరవం మరింత హెచ్చింది.
వారానికో, పది రోజులకో వొకసారి వచ్చి, రహస్యంగా జైహింద్ బాబుతో ఏ తూము గట్టుమీదో కూచుని కబుర్లు చెప్పకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది, సుధీర్ కి.
వెంకడు తోటపనుల్లో ఆరితేరిపోయాడు. రాజయ్య లేకుండానే అన్ని పనులూ నిర్వహించుకురాగలుగుతున్నాడు.
రాజయ్యకు చాలా సుఖంగా ఉంది.
తోటపనులు చేస్తున్నా వెంకడు తన మూలికల వైద్యం మానలేదు.
గుడిసెల్లో వాళ్ళకి చాలామందికి అతడు చిన్న చిన్న రోగాలూ, పెద్ద పెద్ద రోగాలూచాలా నయం చేశాడు.
గుడిసెల్లో జనానికి అతడికి మంత్రాలు వచ్చనీ, అందుకే అతడి మూలికలు పనిచేస్తాయనీ నమ్మకం బలపడిపోయింది.
చంద్రికి నాగమ్మ పెళ్ళి సంబంధాలు చూస్తూనే ఉంది.
ఈసారి చంద్రి నిర్మొహమాటంగా ఏ సంబంధం వచ్చినా నాకు నచ్చలేదని చెప్పేస్తోంది. చంద్రి మనసులో ఏముందో అర్థం చేసుకోలేనంత వెర్రిదికాదు నాగమ్మ.
కోపంతో మండిపడి "ఏయ్ చంద్రీ! నీ ఎత్తులు నా దగ్గర సాగవు - నేను సచ్చినా కట్టుతప్పను" అనేది నాగమ్మ.
చంద్రి ఏ సమాధానమూ చెప్పేదికాదు.
ఎంతకోపం తెచ్చుకొని, ఎంతగా మండిపడి, ఎలా అరిచినా - చంద్రికిష్టంలేని పెళ్ళి చెయ్యటానికి మాత్రం సాహసించేది కాదు నాగమ్మ కోపంలో ఎన్ని తిట్టినా, చంద్రి కళ్లనీళ్ళు పెట్టుకుంటే మాత్రం చూడలేకపోయేది.....
ఆ కారణంచేత నాగమ్మ భగీరథ ప్రయత్నం చేస్తున్నా చంద్రి పెళ్ళి కాకుండానే ఉండిపోయింది.
సారధి శ్రద్ధగా చదివి బి.ఏ. పాసయ్యాడు - ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. దొరకలేదు.
అతనిది వెనుకబడిన కులాలకు చెందిన జాతికాదు. అంచేత ఉద్యోగం దొరకటం చాలా కష్టమైపోయింది.
ఆరునెలలు అన్ని ఆఫీసులూ తిరిగాడు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. ఏదీ ఫలించలేదు-
అతనికి రికమెండేషన్ లేదు. లంచం పెట్టగలిగే శక్తి లేదు.
కనీసం వెనుకబడిన కులమనే అర్హతయినా లేదు.
కేవలం బి.ఏ. డిగ్రీతో ఉద్యోగమెలా వస్తుంది?
"జయన్నా! నువ్వు చదువు మానేసినందుకు ఎంతో బాధపడ్డాను. కానీ చదువుకున్న మా సారధికంటె చదువుకోని నువ్వే హాయిగా సంపాదించుకొంటున్నావయ్యా!" అంది సరళ జైహింద్ బాబుతో.
సారధి అవస్థ జైహింద్ బాబుకు కూడా తెలుసు.
"అలా అనకు సరళమ్మా! డిగ్రీ ఏమయిపోతుంది? ఉద్యోగం ఇవాళ కాకపోతే రేపొస్తుంది" అన్నాడు.
"ఏమో! మా కష్టాలు కడతేరేదెన్నటికో?" అంది సరళ నిస్పృహతో.
జైహింద్ బాబుకి అన్నింటికీ వ్యాసమూర్తే దిక్కు. అతనితో సారధి విషయం ఏదైనా వుద్యోగం చూసిపెట్టమన్నాడు, వుద్యోగం దొరకటం మాటలా?
సరళ పరిస్థితి సానుభూతితో వ్యాసమూర్తి గట్టిగా ప్రయత్నించగా ఒక ప్రవేట్ కంపెనీలో మేనేజర్ కి పి.ఏ గా నెలకి రెండువందల యాభైరూపాయల జీతంలో వుద్యోగం దొరికింది సారధికి.
బి.ఏ. పాసయిన వ్యక్తికి ఇంత జీతంతో ఇలాంటి ఉద్యోగం చాలా చిన్నదే కాని, మంచిది దొరికేవరకూ ఇది చెయ్యి - నెమ్మదిగా ప్రయత్నిద్దాం?" అన్నాడు వ్యాసమూర్తి.
వ్యాసమూర్తికి కృతజ్ఞతతో, వినయంతో నమస్కారాలు చేశాడు సారధి.
సరళ ఒకప్పుడు గుమ్మం కదిలి బయటకు వచ్చేది కాదు - వీధి ముఖం చూడటానికే భయపడిపోయేది. పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తాయి. ఇప్పుడు ఇంటికి కావలసిన సామానులన్నీ సరళ బజారుకెళ్ళి తెచ్చుకుంటోంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా సరళకు జంకు కలగటంలేదు. తాను చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్తోంది. చెయ్యాలనుకున్నది నిస్సంకోచంగా చేస్తోంది.
బజారులో ఇంటికి కావలసిన వస్తువులు కొంటున్న సరళ "సరళా!" అనే పిలుపు వినిపించి వెనక్కు తిరిగి చూసింది. పరుగు పరుగున వస్తున్నాడు నాదముని. మనిషి బాగా చిక్కిపోయాడు. చెక్కిళ్ళు లోతుకుపోయి, కళ్ళు గుంటలు పడ్డాయి. గెడ్డం విపరీతంగా పెరిగింది. తల దుబ్బుకట్టింది..... అతణ్ణి చూడగానే గత స్మృతులన్నీ ఒక్కసారి గుర్తుకువచ్చి బాధ, జాలి, దుఃఖం, కోపం, కసి, అన్నీ ఒక్కసారిగా కలిశాయి సరళకి.