"అందులో తప్పేముంది. మొన్న పార్థసారథి వాళ్ళ అమ్మాయిని చూడటానికి మనమే వెళ్ళాంగా?"
"వాళ్ళకీ, వీళ్ళకీ సాంపత్యమా?" అంది పార్వతి. "అయితే వ్యవహారం చాలావరకూ వెళ్ళిందన్నమాట. వేలకు వేలు డబ్బు పెట్టి ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారంటే ఏమో అనుకున్నాను. ఇదంతా నీ అండ చూసుకునేనన్నమాట. చెప్పరా ఎన్ని వేలిచ్చావు ఇప్పటికి?"
అవినాష్ తెల్లబోయాడు. తల్లి అంతదూరం ఆలోచిస్తుందని అతడు కల్లోకూడా ఊహించలేదు. "నేనేమీ ఇవ్వలేదు మమ్మీ. అసలు అంకుల్ కీ, ఆంటీకి అంత జబ్బు చేసిందని నాకు ఇవ్వాళే తెలిసింది. డాక్టర్ గారు సినిమాహాల్లో చెప్పారు. ఒకవేళ నేనిస్తానన్నా వాళ్ళు తీసుకోరు. వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది".
"ఓహొ! వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా తెలుసుకునేటంతగా ఎదిగిపోయవన్నమాట. మాకు ఏ మాత్రం అనుమానం రాకుండా వ్యవహారాన్ని చాలా బాగా నడిపావురా. అసలు నిన్ను కన్నందుకు నేను చచ్చిపోయినా బావుండేది" అంటూ పెద్దగా అరుస్తూ వెనక్కి విరుచుకుని పడిపోయింది.
తల్లి స్పృహ తప్పిపోయేసరికి అవినాష్ కేం చేయాలో తోచలేదు. శంకరం అప్పటికప్పుడు ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ ఇచ్చిన కాంపోజ్ ఇంజెక్షన్ తో పార్వతి ఆ రాత్రి బాగా నిద్రపోయింది. కానీ ఉదయం లేవగానే మళ్ళీ పరిస్థితి మామూలే. పెద్దగా ఏడుపులు, అరుపులు హిస్టీరిక్ గా మొదలుపెట్టింది. బి.పి. బాగా ఎక్కువగావుందని నర్శింగ్ హొమ్ లో అడ్మిట్ చేయించారు.
వారం రోజులైనా ఆవిడ పరిస్థితిలో మార్పులేదు. "ఎంత కష్టపడి నిన్ను మోసి, కాని పెంచి పోషించాను అవినాష్! ఏం తక్కువ చేశానని మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తున్నావు? ఎవ్వరికీ లేని వస్తువులని నీకు కొనిపెట్టానే? లక్షలకి లక్షలు ఖర్చుపెట్టి నిన్ను చదివించామే? మన కాలనీలో ఎవ్వరికీ లేనంత పెద్ద హొదా నీకుంది. కారు కూడా కొనిచ్చాం. ఇంత చేస్తే ఇదేనా నువ్వు మాకు చేసే ప్రత్యుపకారం. ఇలాంటి శిక్ష పగవాళ్ళకు కూడా వద్దు" అంటూ రోజు ఏడవటం సామాన్యమైపోయింది. మరో ప్రక్కనుంచి తండ్రి "ఎందుకురా? ఆవిడనంత బాధపెడతావు ఆమె చెప్పినట్టే వింటానని ఒకసారి అనరాదూ. మామూలు మనీషావుతుంది" అని నూరిపోయాసాగాడు.
అవినాష్ మాట్లాడలేకపోయాడు. నిఖితతో పెళ్ళికి వాళ్ళకెందుకు అభ్యంతరమో అతడి ఊహకి అందటంలేదు. అందంగా వుంటుంది. చదువుకుంది. ఉద్యోగం వుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అనామెని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమని తన తల్లిదండ్రులు ఎందుకు గౌరవించరు? వాళ్ళకి తనపట్ల నమ్మకం ఎందుకు లేదు? వాళ్ళు సంతోషంగా వుండటం తన కిష్టమే. తను సంతోషంగా వుండటం కూడా వాళ్ళకిష్టమై వుండాలిగా? ఎందుకిలా తనకి అడ్డు చెబుతున్నారు?
ప్రతి రాత్రీ, పగలూ అతను తల్లి ఆరోగ్యం చూసి సమతమయ్యే వాడు. కాస్త కరిగింది ముందుగా శంకరమే. భార్యదగ్గర చేరి "ప్రస్తుతం అలాగే అని చెప్పి వాడ్ని బాంబే పంపించేద్దాం పార్వతీ. తర్వాతేదో ఉపాయం ఆలోచించవచ్చు" అన్నాడు మధ్య మార్గంగా.
"నేను చచ్చినా ఒప్పుకోను. వాడు ఆ పెళ్ళి చేసుకుంటానంటే ఆత్మహత్య చేసుకుని చస్తాను" అందామె ఆవేశంగా.
"అదికాదు పార్వతీ. వీడ్ని ముందు ఇక్కడ్నించి పంపించేస్తే ఆ తర్వాత ఇటునుంచి కాకపోతే అటునుంచి నరుక్కొద్దాం. వాళ్ళంతట వాళ్ళే వీణ్ని కాదనేట్టు చేస్తే సరిపోతుంది కదూ?"
"వాళ్ళూ ఇంత అవకాశాన్ని వదులుకోరు. అందులో ఆ నిఖిత పెద్ద జాణ. అదేం లాభంలేదు కాని వీణ్ణే బెదిరించండి. అమ్మ ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పండి".
శంకరం సాలోచనగా అన్నాడు. "కానీ అవినాష్ కూడా చిన్నప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం చేసినవాడే. వాడిలో ఆ మెంటాలిటీ ఇంకా వుండే వుంటుంది. మనం గట్టిగా కాదంటే ఈసారి మళ్ళీ వాడా ప్రయత్నం చేసే అవకాశముంది. ఆలోచించు"
పార్వతి ఆలోచనలో పడింది. "అవును. అదీ నిజమే. మీరేదో ఒకటి చెయ్యండి. ముందు నిఖిత హాస్పిటల్ నుంచి ఇంటికిరాను" అంది మొండిగా.
శంకరానికి భార్య పట్టుదల తెలుసు. ఆ రాత్రి బాగా ఆలోచించుకొని మరుసటిరోజు పొద్దున్నే దశరధ్ ఇంటికి వెళ్ళాడు.
* * *
ఒకే కాలనీలో వుంటూ కూడా ఎప్పుడూ రాని శంకరం మొట్టమొదటసారి తమ ఇంటికొచ్చేసరికి దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే సర్దుకుని అతడ్ని లోపలి ఆహ్వానించారు.
విషయం ఏమాత్రం పొడిగించటం యిష్టంలేనట్టు శంకరం కూర్చుంటూనే అసలు టాపిక్ లోకి వచ్చాడు. మా అవినాష్, మీ నిఖిత ప్రేమ వ్యవహారం గురించి మీ కెంతవరకు తెలుసు?" అని అడిగాడు.
దశరధ్, కౌసల్యలు ఒకరి మొహం ఒకరు చుసుకున్నారు. దశరధ్ శంకరంతో "ప్రేమ వ్యవహారమంటూ ఏమీ లేదు. ఉంటే మా నిఖిత మా దగ్గర ఏదీ దాచదు. ఎలాంటి విషయమైనా మాకు చెప్తుంది" అన్నాడు నమ్మకంగా.
"మీకు చెప్పిందో, లేదో నాకు తెలీదు. కానీ మావాడు మాత్రం మాకు చెప్పాడు. అది విన్నప్పటినుంచీ పార్వతి హాస్పిటల్ లోనే వుంది".
కౌసల్య బాధపడింది. తన కూతురు గురించి అవినాష్ అంత పట్టుబట్టటం, ఆ విషయం తెలిసి అతడి తల్లి హాస్పిటల్లో చేరటం ఇదంతా ఆమె ఊహించలేదు. కానీ భర్త ఆలోచన మరో విధంగా వుంది. కౌసల్య మాట్లాడబోయే లోపులోనే అతను అన్నాడు. "చూడండి శంకరం గారూ! నిఖిత అవినాష్ ని చేసుకుంటానని మాకింతవరకూ చెప్పలేదు. ఆమె ఆ నిర్ణయం తీసుకుని వుంటే మేం డానికి అభ్యంతరం చెప్పం. ఎందుకంటే వాళ్ళిద్దరూ మేజర్లు. స్వయం నిర్ణయాలు తీసుకునే వయసు, వివేకం కలిగినవాళ్ళు" అన్నాడు.
ఈ మాటలన్నీ అన్యాపదేశంగా, తనకి బుద్ధి చెప్పటానికే ఉపయోగించ బడ్డాయన్నట్టు తోచింది శంకరానికి. "అంటే మీరు మీ పిల్లల్ని అదుపులో బడ్డాయన్నట్టు తోచింది శంకరానికి. "అంటే మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకుండా ఫ్రీగా వదిలేసి, అవతలివాళ్ళ కొంపలు కూలుతున్నా సంతోషిస్తూనే వుంటారన్నమాట" అన్నాడు కసిగా.
దశరధ్ కోపాన్ని అణచుకున్నాడు. "ఈ విషయంలో మాటలూ, వాదనలూ అనవసరం. మీరు, మీ అబ్బాయి మాట్లాడుకోండి. ఈ సమస్య మీది. మీ ఇంటిది. దాన్ని మీరక్కడే పరిష్కరించుకుంటే మంచిది".
శంకరం వెటకారంగా "అవును, సమస్య మాదే. నా భార్య చనిపోతే అదికూడా మీకేం నష్టం లేదుగా. మీ స్వార్థం మీది. డబ్బు, హొదా వున్న కుర్రవాడు మీ అల్లుడవుతాడు. మిమ్మల్ని సుఖపెడతాడు. అంతేగా మీకు కావలసింది" అంటూ లేచి నిలబడ్డాడు.
దశరధ్ ఏదో అనబోతూంటే కౌసల్య వారించింది. ఎక్కువ మాట్లాడేకొద్దీ శంకరం రెచ్చిపోతాడని ఆమె అభిప్రాయం.
శంకరం కుర్చీలోంచి లేచి ఒక్కటే మాట అన్నాడు. "మా వాడు ఇప్పటివరకూ మీకెంత డబ్బిచ్చాడో నాకు తెలీదు. మీ కూతుర్ని చూపించి మీరు ఎంత తీసుకున్నారో కూడా నాకు తెలీదు. ఇదే పెళ్ళి అని ఎరగాపెట్టకుండా, కూతురు శరీరాన్ని ఎరపెట్టి ఆ డబ్బు తీసుకొని వుండివుంటే నేనింకా ఎక్కువ సంతోషించి వుండేవాణ్ని".
దశరధ్ కళ్ళల్లోకి రక్తం చిమ్మింది. ఎంతో నిబ్బరంగా వుండే కౌసల్య కూడా అతడి మాటలకి వణికిపోయింది. వాళ్ళు ఆవేశంలోంచి తేరుకునే లోపుగానే శంకరం అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
8
"మేడమ్, మీ కోసం ఎవరో వచ్చారు. విజిటర్స్ రూంలో కూర్చో బెట్టాను" అని ప్యూన్ వచ్చి చెప్పాడు, నిఖిత విజిటర్స్ రూంలోకి వెళ్ళింది. అక్కడ శంకరం కూర్చుని వున్నాడు.
ఆమె నమస్కారం పెట్టి ఎదురుగా కూర్చుంది. అతడు ప్రతి నమస్కారం చెయ్యలేదు. "నీకూ, మా అవినాష్ కి ఏమిటి సంబంధం?" సూటిగా, ఉపోద్ఘాతం ఏమీ లేకుండా అడిగాడు.
అతనలా ప్రశ్నించేసరికి ఆమె బిత్తరపోయింది. కానీ అది రెప్పపాటు కాలమే అరక్షణంలో సర్దుకొని, నవ్వుతూ "నేను మిమ్మల్ని అంకుల్ అని చిన్నప్పటినుంచి పిలుస్తున్నాను ఏ సంబంధంతో అంకుల్!" అంది.
శంకరం మొహం ఎర్రబారింది. "అంటే నా కొడుకుని పెళ్ళి చేసుకోవాలనే వుద్దేశ్యం నీకు చిన్నప్పటినుంచీ వుందన్నమాట. అందుకేనా అంకుల్ అని పిలిచావ్" అన్నాడు వెటకారంగా.
నిఖిత అదే చిరునవ్వుతో "మీ అబ్బాయి కూడా మా నాన్నగారిని అలాగే పిలిచేవాడంకుల్" అంది.
"షటప్!" అన్నాడు శంకరం. తరువాత తనని తాను తమాయించుకుంటూ "చూడు నిఖితా, అవినాష్ మీద మేం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అతడ్ని మేం చిన్నప్పటినుండీ కష్టపడి పెంచి పెద్దచేశాం. ఇప్పుడు నువ్వు గద్దలా వచ్చి తన్నుకుపోవటం భావ్యంకాదు" అన్నాడు.
నిఖిత కూడా అంతే సౌమ్యమైన గొంతుతో "మీరు మాత్రమే కాదంకుల్, తల్లిదండ్రులు ప్రతివాళ్ళూ పిల్లల్ని కష్టపడే పెంచి పెద్ద చేస్తారు. అది వాళ్ళ బాధ్యత. కేవలం పెంచీ పెద్ద చేసినంత మాత్రాన పిల్లలమీద సర్వాధికారాలూ, హక్కులూ వుంటాయనుకోవటం పొరపాటు. అంతవరకూ ఎందుకు.......మీ తల్లిదండ్రుళ పట్ల మీరెంత బాధ్యతగా ప్రవర్తించారో ఒకసారి ఆలోచించండి".
శంకరం పల్లెటూళ్ళో వుండే తల్లిదండ్రుల్ని సంవత్సరానికొకసారి వెళ్ళి చూసొస్తుంటాడు. వాళ్ళిక్కడకు వస్తే కోడలితో బాధలు పడలేక నాలుగైదురోజుల్లో తిరిగి పోతుంటారు. ఈ విషయం కాలనీలో అందరికీ తెలుసు.
శంకరం కోపంగా "నువ్వు నాకేమీ నీతులు చెప్పనక్కరలేదు. అవినాష్ ఈ రోజిలా ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం నువ్వు. వాడిని వల్లో వేసుకుందంటే అతనిలో ఏదో బలహీనత వుందన్నమాట. ఆ విషయం మీరే అతనికి నచ్చచెప్పుకోండి".
"నీకు చాలా పొగరు అని పార్వతి చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు తెలుస్తోంది".
"పోగరుకి, ఆత్మాభిమానానికి తేడా చాలా చిన్నదంకుల్".
ఆమెతో వాదించలేనని తెలుసుకున్నాడు శంకరం. కంఠం మరింత మృదువుగా మార్చాడు. "చూడమ్మా నిఖితా, అక్కడ నా భార్య చావుబ్రతుకుల్లో వుంది. ఇప్పుడు ఆవిడకేదన్నా అయితే ఆ పాపం జీవితాంతం మీ ఇద్దర్నీ వెంటాడుతుంది. వాడైతే పూర్తిగా నీ మత్తులో వున్నాడు. నువ్వే ఎలాగో ఒకలాగా ఈ సంకటం పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలి".
"ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి నిఖితకి బాగా కోపం వచ్చింది. అక్కడినుంచి లేచి లోపలి వెళ్ళిపోదామనుకుంది. కానీ, సంస్కారం అడ్డొచ్చింది.
"చూడంకుల్. మీ అబ్బాయి కానీ, నేను కానీ ఏదైనా కానిపని చేస్తున్నాం అని మీరనకుంటే పొరపాటు. మీ నుంచి మీ అబ్బాయిని దూరం చెయ్యాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు. మా వివాహం అంటూ జరిగితే నేను మీ కుటుంబంలోకి వస్తానే తప్ప మేం ఇద్దరం కలిసి ఎక్కడికీ వెళ్ళిపోం".
"కానీ నీ బదులు ఇంకొక అమ్మాయి వస్తే ఆమెతోపాటు వాడికి డబ్బు' హొదా' సంఘంలో అంతస్థు అన్నీ వస్తాయి నిఖితా".