"కాలేడు" అన్నారాయన. "కొన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. కొన్ని అంశాలలో పరిపక్వతను సాధించవచ్చు. కాని అలాంటివ్యక్తిని గొప్పవాడు అంటారుగాని, ఉదాత్తుడు అనరు. గొప్పతనం వేరు, ఉదాత్తత వేరు."
"పాపం చెయ్యకుండా బ్రతకటం కష్టమా?"
"కష్టమే. కాని అసాధ్యం కాకపోవచ్చు."
"చేసిన పాపం చెరిగిపోతుందా?"
"మన హిందూమత సూత్రంలోని మూలం యిదే. చేసిన పాపం ఎప్పుడూ చెరగదు. కాని పాపం చేసిన వ్యక్తికూడా నిండుహృదయంతో పశ్చాత్తాప హృదయుడైతే భగవంతుడు అతడ్ని ఆదరించి ఓదారుస్తాడు. అతడికి శాంతి కలిగిస్తాడు. కాని చేసిన పాపానికి శిక్ష ఏదోరూపంలో అనుభవించటం జరుగుతుంది. విదేశ మతాలలో దేవుడు పాపాన్ని కడిగివేస్తాడని ప్రజలు నమ్ముతారు. నా దృష్టిలో అది అసంభవం."
"మీరెవరు?"
"నేనింక ఆధ్యాత్మిక సాధనలో ప్రాధమిక దశలోనే వున్న ఓ విద్యార్థిని."
"కొంతమంది ప్రచారకులు మేమే జగతికి స్వరూపులమని చెప్పుకుంటారు. మీరు భగవత్ స్వరూపులు కారా?"
"ఎంతమాత్రంకాను. అంతేకాదు. అతి సామాన్యమైన అలజడులనూ, మానసిక ఉద్రేకాలనూ నేనింకా అతిక్రమించలేదని, యీరోజే తెలుసుకున్నాను."
"ఎప్పుడు?"
"మరో సందర్భంలో చెబుతాను."
"పాపం చెయ్యకుండా వుండటానికి ఏం చెయ్యాలి?"
"ప్రయత్నం చెయ్యాలి. దాన్నే సాధన అంటారు."
"సాధన ఎలా చెయ్యాలి?"
"దాన్నిగురించి చాలా చెప్పాలి. వింటావా?"
"చెప్పండి."
ఆయన యిక చాలా విషయాలు బోధించారు. కర్మేంద్రియాలగురించీ, జ్ఞానేంద్రియాలగురించీ, మనస్సు గురించీ, అనుమాన ప్రమాణంగురించీ, జీవన భ్రాంతులగురించీ అనేక సత్యాలు చెప్పారు. అంతా నేను అర్ధం చేసుకొనలేకపోయాను. ఆయన వాజ్మామాధురికి మంత్ర ముగ్ధలాగా వింటూ కూర్చున్నాను.
చివరకు "సూర్య నమస్కారాలు ఎప్పుడన్నా చేశావా?" అనడిగారు.
"లే"దన్నాను.
"నీకిచ్చిన పుస్తకాలలో దానికి సంబంధించిన గ్రంథంకూడా ఒకటివుంది. నీ దిన కార్యక్రమాన్ని సూర్యభగవానుని స్తుతితో ప్రారంభించు. అది నీకు ఎంతో శక్తినీ, ఆత్మబలాన్ని ప్రసాదిస్తుంది. ఇహ వెళ్ళు" అన్నారు.
"నేను ఆయనకు పాదాభివందనం చేయాలన్న కోరికను అణుచుకోలేకపోయాను. ఒదిగి ఎంతో భక్తిశ్రద్ధలతో ఆయన పాదాలను తాకాను. కాని, నిలబడి, ముఖం ఎత్తి ఆయనవంక చూసేసరికి వళ్లు ఝల్లుమంది. కళ్ళలో అదే కంపన. ముఖంలో ద్యోతకమవుతూన్న అవే బాధాచిహ్నాలు. శరీరమంతా మంటలు వ్యాపించినట్లు ఒకటే వేదన. నాకు కాళ్ళూ, చేతులూ ఆడలేదు. ఇంతసేపూ ఎంతో ప్రశాంత చిత్తంతో మాట్లాడిన మనిషి యీయనేనా? తృటిలో యింత మార్పు యెలా సాధ్యం?
"ఇహ వెళ్ళు. ఇహ వెళ్ళు" అని గొణుక్కుంటూ గబగబ లోపలకు వెళ్ళిపోయారు.
నిర్ఘాంతపడి ఎలాగో తేరుకుని యింటికి వచ్చి చేరాను.
ఓ కొత్తబెంగ ఆవహించింది. నా అభిజాత్యం నశించినట్లయింది. ఏముంది ఆ స్పర్శలో? ఎవరికీ తలవంచనిదాన్ని, ఎందుకలా ఆయన పాదాలమీద పడి శరణు వేడాను? ఏం జరిగింది నాకు? ఏమిటీ కొత్త భావాలు?
నాకు కొంత అర్ధం కావటంలేదు. ఎందుకు కలవరపడుతున్నాడాయన? ఎన్నడూలేని కలత ఆయననెందుకు ఆక్రమిస్తోంది? రోజూ కొన్నివందలమంది స్పృశిస్తూ వుంటారు. అప్పుడు లేనిది, నా స్పర్శ తగలగానే ఎందుకు ఉలికిపడుతున్నారు.
నేను పరాజితురాల్ని అయిపోయాను. ఆయన పాదాక్రాంతను అయాను. అయినా నాకు ఆనందంగా వుంది. నా జీవితంలో కొత్తదారి తెరుచుకుంది. భరించలేనంత వెలుగు మీద పడుతోంది. ఇప్పుడు నాకెవర్నీ సాధిద్దామని లేదు. నాకు నిశ్చలత కావాలి. నేను ప్రశాంతంగా జీవించగలగాలి. నా జ్ఞాననేత్రం తెరుచుకోవాలి.
"నేనాయన్ని ఆరాధించటం మొదలుపెట్టాను. నిజమే. కాని, యిది తేజోమయమైన ఆరాధన. ఇందులో కల్మషంలేదు. ఇది స్వచ్చమైన తెలుపు.
"భగవాన్! నిన్ను మొదటిసారిగా ఎలుగెత్తి పిలుస్తున్నాను. నాకు స్వచ్చమైన జీవితం ప్రసాదించు."
మృత్యుంజయరావుకు అంతా కలలావుంది. తను ఆమెతో కలసి యీ గదిలో వుంటున్నాడు. ఆమె ప్రవర్తనలో, బాహ్యాలంకారంలో మార్పుల్ని గమనిస్తున్నాడు తప్ప తనతో ఒక్కనాడూ యీ విషయాలు ప్రస్తావించలేదు. రహస్యాలంటే ఆమెకు అసహ్యం. తనతో ఈ సంగతులు చెప్పడం అనవసరమనుకుంటుందేమో! తనకు తెలియకుండా ఎన్ని విశేషాలు జరిగిపోతున్నాయి!
తర్వాత యింకా కొన్ని పేజీలు రాసింది. కాని చదవటానికి అతనికి భయంగా వుంది. తర్వాత చదువవచ్చులే అని సరిపెట్టుకున్నాడు. పుస్తకం మూసివసి బట్టలమధ్య పెట్టేశాడు.
ఈ బట్టలు తను కొనిపెట్టినవే. ఆమె చీరలు లేక ఇబ్బంది పడుతూండటం చూసి ఒకసారి బట్టలు తీసుకొస్తానని బజారుకు బయలుదేరాడు. "నువ్వూ రా కొందాం" అన్నాడు.
ఆమె బజారుకు రావడానికి తిరస్కరించింది. "నాకు రావాలని లేదు. కాని, నువ్వే ఎన్నికచేసి పట్రా. నాకు నేతచీరలంటే యిష్టం. లేత ఆకుపచ్చరంగు అంటే పడిచస్తాను" అంది.
ఆమె కోరికననుసరించి, తను వక్త్యానుసారం కాసిని చీరెలు, రవికల గుడ్డలు పట్టుకువచ్చాడు.
మృత్యుంజయరావు నిట్టూర్పు విడిచి, గది తలుపులు తెరిచి, అక్క వస్తుందేమో చూద్దామని గేటుదగ్గరకు వచ్చాడు. ఆమెను త్వరగా చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది ఈరోజు.
శ్రీకంఠంగారూ, ఆయన సతీమణి చిలకమ్మగారూ వారిభాగంలో హాల్లో కూర్చుని కబుర్లాడుకుంటున్నారు.
శ్రీకంఠం తెల్లవారుఝామున నాలుగుగంటలకే నిద్రలేస్తారు. ఓ అరగంటకి చిలకమ్మగారు లేచి కాఫీ పెడుతుంది. అయిదింటికి మంగలాడువచ్చి గడ్డం గీకి పోతాడు. ఆరుగంటలకల్లా స్నానం, పూజా పారిసమాప్తి చెందుతాయి. ఎనిమిది గంటలవరకూ కబుర్లో, పుస్తకమేమన్నా చూడటమో, యింటికెవరైనా వస్తే మాట్లాడటమో చేస్తాడు. ఎనిమిది గంటలకు భోజనం. తర్వాత పదివరకూ టైము ఎలాగో ఓలా గడిచిపోయేలా చూడటం, అనంతరం నిద్ర. పన్నెండు గంటలకు నిద్రలేచి కాఫీ, పేపరు చదవటం, హార్టుపేషెంట్ కాబట్టి రాత్రుళ్ళు భోంచెయ్యడు గనుక నాలుగుగంటలకు ఫలహారం. అక్కడ్నుంచి ఎనిమిది గంటలదాకా బాతాఖానీ, ఇహ తర్వాత నిద్ర. వాళ్ళింట్లో తద్దినాలు పెట్టటం కూడా తెల్లవారుఝాము నాలుగుగంటలకు ప్రారంభం కావటం మృత్యుంజయరావుకు ఆశ్చర్యం గొలిపింది. వినాయకచవితి పూజకూడా నాలిగింటికి చేస్తారు.
'ఏవిటో వాళ్ళ జీవితం' అనుకున్నాడు గేటుదగ్గర నిలబడ్డ మృత్యుంజయరావు. అదేసమయానికి 'ఏమిటో యీ నిర్భాగ్యుడి జీవితం' అనుకుంటున్నారు ఆ దంపతులు.
10
ఈమధ్య మాలతిని తరుచు కలుసుకోవటం సంభవిస్తోంది మృత్యుంజయరావుకు. చాలాసార్లు మధ్యాహ్నం విరామ సమయంలో కాఫీకి ఆహ్వానిస్తోంది. కొన్నిసార్లు ఆమె ఇంటికి వెళ్లటం తటస్థించింది.
పశుపతిగారూ, ఆయన భార్యా, మిగతా కూతుళ్ళుకూడా యెంతో చొరవగా మాట్లాడతారు. మాలతికి ఇద్దరు చెల్లెళ్ళు. పెద్దచెల్లెలు స్కూల్ ఫైనల్ చదువుతోంది. చిన్నచెల్లెలు థర్డుఫారం చదువుతున్నది. అక్కాచెల్లెళ్ళు చాలా ఆప్యాయంగా, ఒకరిమీద ఒకరు విసుర్లు విసురుకుతూ ఉల్లాసంగా కాలం గడుపుతారు.
"మీ ఆఫీసువాళ్ళంతా కలసి మా అమ్మాయికి ఉపకారం చేశారా, అపకారం చేశారా చెప్పండి" అనడిగారు ఒకసారి పశుపతిగారు, కళ్ళజోడు సవరించుకుంటూ.
ఉరుములాంటి యీ ప్రశ్న విని మృత్యుంజయరావు చకితుడై చూశాడు.
"మీరంతా కలసి మాయింటిమీద దండయాత్ర చేసి మా అమ్మాయిని నాటకంలో వెయ్యటానికి ఒప్పించారు. అది నటించింది. దానికా పెళ్ళీడు వచ్చింది. కూతురి పెళ్లిచెయ్యాల్సిన బాధ్యతతో పెద్దవాళ్ళం నానాయాతనా పడుతున్నాం. ఈమధ్య ఒక పెళ్ళి సంబంధం చూశాం. కుర్రాడు యింజనీరింగ్ ప్యాసయ్యాడు. వేషం చూసి అభిరుచులు కలవాడనుకున్నాం. తీరా పెళ్ళి చూపుల్లో ఏమని అడిగాడో తెలుసా? "మీ అమ్మాయి నాటకాల్లో వేషాలు వేస్తుందిట కదండీ?" అన్నాడు. "దానిది కళాహృదయం" అన్నాను. "నాది కాదులెండి" అన్నాడు. మళ్ళీ ఐపు లేడు" అన్నారు పశుపతిగారు.
అసలు మృత్యుంజయరావుకు మాలతి నటించడం యిష్టంలేదు. కారణం అతనికే తెలియదు. కాని ఆమెను శాసించే అధికారం అతనికేముంది? ఆ విషయమే ఆయనకు చెబుదామనుకున్నాడు. కాని చెబితే, 'అయితే ఎందుకు మీరంతా కలసి మా అమ్మాయిని రచ్చకెక్కించారు?' అని ఆయన కోపంగా అరుస్తాడనుకుని మెదలకుండా వూరుకున్నాడు.
అట్లా అని ఆయన మాటమీద మళ్ళీ ఆయనే నిలబడివుండలేదు. ఆడపిల్లలు సోషల్ గా వుండవలసిన అవసరం గురించీ, తమ పెంపకంలో యిచ్చిన స్వేచ్చను గురించీ మళ్ళీ లెక్చర్లు దంచుతారు.
కాని మాలతి పెళ్ళివిషయం తల్లిదండ్రుల్ని విశేషంగా కలవరపరుస్తున్నట్టే వుంది. ఒకసారి మాలతి తల్లి సత్యవతమ్మగారు, "అమ్మాయికి ఎక్కడన్నా సంబంధాలుంటే చెప్పు నాయనా! అయన చూస్తే అదో వరస. ఒకరోజు పట్టించుకున్నట్లు కనిపిస్తారు. మళ్ళీ నెలల తరబడి ఆ ప్రమేయమే ఎత్తరు. నాకు వంట్లో ఎప్పుడూ ఆరోగ్యంగా వుండదు. మన కులంవాడయితే చాలు. శాఖ ఏదైనా ఫరవాలేదు. దానికి పెళ్ళికాదేమోనన్న దిగులుతో చచ్చిపోతున్నాను" అని మొరపెట్టుకుంది. ఆవిడకి ఇంచుమించు కళ్ళనీళ్ళపర్యంతమయింది.
'చెట్టంత బ్రహ్మచారిని ఎదురుగా నేనుంటే... యీవిడకి కళ్ళు కనబడటం లేదా?' అనుకున్నాడు మృత్యుంజయరావు. కాని మరుక్షణంలో తన ఆలోచనకు అతడే లజ్జితుడయాడు. 'కాకిముక్కుకు దొండపండులా నేనేమిటి మాలతికి?' అనుకున్నాడు.